నిజాంసాగర్/సదాశివనగర్, జూలై27: పలు గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించారు. నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి, ఆరెపల్లి, అచ్చంపేట, వెల్గనూర్ గ్రామాల్లో సాగుచేస్తున్న వరి పంటలను మండల వ్యవసాయశాఖ అధికారి అమర్ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. అధిక వర్షాలతో వరి పంటను తాటాకు తెగులు ఆశిస్తుందని తెలిపారు. ఈ తెగులు సోకకుండా ఎకరాకు 400 మిల్లీలీటర్ల ప్రొపినోఫాస్ మందును పిచికారీ చేయాలని తెలిపారు. ఆయన వెంట ఏఈవో స్వర్ణలత, బ్రాహ్మణపల్లి సర్పంచ్ బాలయ్య, ఉప సర్పంచులు వెంకటేశం, హన్మంత్రెడ్డి నాయకుడు ఆనంద్కుమార్ ఉన్నారు.
వరినారులో రోగాలు రాకుండా చూసుకోవాలి
సదాశివనగర్ మండలంలోని మోడెగామ గ్రామంలో మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి క్షేత్రస్థాయికి వెళ్లి వరినారులో వచ్చే రోగాలపై రైతులకు అవగాహన కల్పించారు. నారుమడిలో వ్యాధులు సోకిన మొక్కలను రైతులకు చూపించారు. అధికారుల సూచన మేరకు మందులు పిచికారీ చేయాలన్నారు. ఆయన వెంట ఏఈవో స్నేహలత, పద్మాజివాడి విండో వైస్ చైర్మన్ కుంట శ్రీనివాస్రెడ్డి, రైతులు ఉన్నారు.
ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి
వాననీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచేందుకు పంట పొలాల్లో ఇంకుడు గుంతలను తవ్వుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు. మండలంలోని పర్మళ్ల, పోల్కంపేట, ముంబాజీపేట, మోతె, లింగంపేట గ్రామాల రైతులకు జలశక్తి అభియాన్లో భాగంగా భూగర్భ జలాల పెంపుపై అవగాహన కల్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఈవోలు ప్రశాంత్, సంతోష్కుమార్, నవ్య, రమ్య, శ్రీకాంత్, రైతుబంధు సమితి సభ్యులు పాల్గొన్నారు.