వికారాబాద్, జూలై 19, (నమస్తే తెలంగాణ): దళితుల జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపేందుకు తీసుకొచ్చిన పథకం దళిత బంధు. దళిత సాధికారతకు జిల్లాప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ‘దళిత బంధు’ పథకాన్ని ప్రవేశ పెట్టిన సీఎం కేసీఆర్ దేవుడయ్యారని, తమ అభ్యున్నతికి పాటుపడుతున్న ప్రభుత్వానికి దళిత జాతి అభినందనలు తెలుపుతున్నది. దళిత సాధికారత పథకంపై జిల్లావ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది. వారు ఆర్థికంగా ఎదుగాలన్న సంకల్పంతో అడుగులు పడుతున్నాయి.
నియోజకవర్గం ఒక యూనిట్గా..
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం ఒక యూనిట్గా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఐఏఎస్ అధికారులతో సర్వే నిర్వహించి దళిత కుటుంబాల వివరాలు సేకరించనున్నారు. ఎంపికైన వారికి ఈ పథకం కింద సాయం చేయనున్నారు. లబ్ధిదారుల గుర్తింపునకు ప్రతి గ్రామానికి ఐఏఎస్, మండలాల పర్యవేక్షణకు ప్రిన్సిపల్ సెక్రటరీలు పర్యవేక్షణ చేయనున్నారు. రూ.1500 -2000 కోట్లతో ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టారు.
సంక్షేమ శాఖకు ఆదేశాలు జారీ
వికారాబాద్ జిల్లావ్యాప్తంగా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 19 మండలాలు, నాలుగు మున్సిపాలిటీలు, 566 పంచాయతీలు ఉన్నాయి. దళితుల ఆర్థిక, సామాజిక సమస్యలను విడదీసి గుర్తించాలి. వాటికి పరిష్కార మార్గాలు చూడాలి. గ్రామీణ, పట్టణ స్థాయిలో ప్రవేశపెట్టాల్సిన పథకాలు వివరాలతో గైడ్లైన్స్ తయారు చేసి లబ్ధిదారులకు అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో డెయిరీ వంటి స్వయం ఉపాధి అవకాశాల్లో గైడెన్స్ ఇచ్చే మెకానిజం ఏర్పాటు చేయాలి. లబ్ధిదారులకు అందిన ఆర్థిక సాయంతో ప్రారంభించిన పథకాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. దీనికోసం మండల స్థాయిలో ఒక అధికారి ఉండాలి. ఆధునిక సాంకేతిక విధానాలను అవలంభించి, ప్రతి లబ్ధిదారుడికి ఒక కార్డు అందించాలి. బార్ కోడ్ను కేటాయించి వారి పూర్తి వివరాలు కంప్యూటర్లో నిక్షిప్తం చేసి ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. ఎస్సీ కుటుంబాల ప్రొఫైల్ తయారు చేయనున్నారు. ‘దళిత బంధు’ పరిధిలోనే దళిత రైతుబంధు లబ్ధిదారుల వివరాలు సేకరించాలి. పెండింగ్లో ఉన్న దళిత ఉద్యోగుల ప్రమోషన్లను 10 నుంచి 15 రోజుల్లో పూర్తి చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటున్న దళిత రైతులకు రైతు బంధుతో పాటు అర్హత కలిగిన వారికి దళిత సాధికారత పథకం కూడా వర్తింపు చేయనున్నారు. భూమి ఉన్న దళిత రైతులకే కాకుండా, భూమి లేని నిరుపేద కుటుంబాలకు కూడా బీమా సౌకర్యం కల్పించనున్నారు.
రంగారెడ్డి జిల్లాలో..
దళిత కుటుంబాలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు, వారి సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం నేరుగా ఆర్థిక సాయం చేయనున్నది. దళితుల ఆర్థిక సాధికారత, స్వావలంబన కోసం సీఎం కేసీఆర్ నిధులు కేటాయించనున్నారు.
జిల్లాలో 36లక్షల మంది దళితులు
జిల్లాలోని 21 మండలాలతో పాటు 12 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్ల పరిధిలో దళిత జనాభా ఉన్నారు. మొదటగా నియోజకవర్గాల వారీగా వంద కుటుంబాలను ఒక యూనిట్గా ఎంపిక చేసి, ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.
సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగానే..
తెలంగాణ దళిత బంధు పథకాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలుచేసేందుకు ప్రభుత్వ చర్యలు చేపట్టనున్నది. దళిత కుటుంబాల ప్రొఫైల్ను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి జీవన స్థితిగతులను పొందుపర్చాలని, దళిత సమస్యలు అన్నిచోట్లా ఒకే రీతిలో ఉండవని, గ్రామీణ, సెమి అర్బన్, అర్బన్ అనే విభాగాలుగా వారి సమస్యలను విభజించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
పకడ్బందీగా పథకం అమలు
తెలంగాణ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి దళిత బంధు పథకాన్ని పటిష్టంగా అమలు చేయనున్నది. ఇందు లో మూడు ముఖ్యాంశాలు ఉన్నాయి. మొదటిది పథకం అమలు చేసి పర్యవేక్షించడం, రెండోది ఫలితాలను అంచనా వేయడం, మూడోది లబ్ధిదారులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో రక్షణనిధిని ఏర్పాటు చేయడం. ఈ పథకం ద్వారా అం దించే రూ.10లక్షల నగదుతో పాటు లబ్ధిదారుడు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణనిధిని ఏర్పాటుచేస్తారు. లబ్ధిదారుల కు టుంబాల్లో ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ నిధి నుంచి వారికి సాయం అందుతుంది. ఈ పథకంతో ఉన్నత స్థితికి చేరిన దళిత కుటుంబం, ఏదైనా పరిస్థితుల్లో ఆపద కు గురైనప్పుడు వారికి రక్షణనిధి కవచంగా నిలుస్తుంది.
చరిత్రలో నిలిచిపోతుంది
దేశ చరిత్రలో దళత బంధు పథకం నిలిచిపోతుంది. తెలంగాణలో దళితుల జీవితాల్లో వెలుగు నింపిన నేతగా సీఎం కేసీఆర్ గుర్తుండిపోతారు. రాష్ట్రంలో రూ.1200 కోట్లతో దళిత బంధు పథకం ప్రారంభం కానుందనీ, మొదటి దశలో ప్రతి నియోజకవర్గం నుంచి 100 దళిత కుటుంబాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 11,900 కుంటుంబలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో చెప్పారు. సీఎంకు దళితులంతా రుణపడి ఉంటారు.
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు అనేక పథకాలు అమలుచేసి దేశానికే ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం గొప్ప మనుస్సుతో దళితులను ఆదుకోవాలనే లక్ష్యంతో దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం. నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా ఎంపిక చేసి సాయం అందించనున్నారు. అర్హులైన దళితులందరికీ ప్రభుత్వ సాయం అందేలా కృషి చేస్తాం.
దళితులను ధనవంతులుగా మార్చే పథకం
దళితులను ధనవంతులగా మార్చలన్న దే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. తెలంగాణలో ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలనేది కేసీఆర్ లక్ష్యం. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అన్ని విధాలుగా రాణించాలని దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టారు. దళితులను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యావాదాలు. దళితుల కోసం ప్రత్యేకంగా దళిత బంధు పథకాన్ని అమలుచేస్తున్నందుకు సీఎం సార్కు రుణపడిఉంటాం.