పెద్దేముల్, జూలై 25 : మండల కేంద్రంలోని ఓ ఇంట్లో పేలుడు సంభవించి ఇల్లు పాక్షికంగా ధ్వంసమై, ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం మండల కేంద్రంలోని మెథడిస్టు వెనుకభాగంలో జరిగింది. పోలీసులు, స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్లోని మెథడిస్టు చర్చి వెనుకభాగంలో ఉన్న బ్యాగరి యాదప్పకు చెందిన ఇంట్లో యాదప్ప, ఆయన కుమారుడు వెంకటేశ్ నివాసం ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. యాదప్ప కూలీ పనులు చేస్తూ, వెంకటేశ్ మేకల కాపరిగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆదివారం యాదప్ప ఏదో పనివిషయమై బయటకు వెళ్లగా, ఇంట్లో వెంకటేశ్ ఒక్కడే ఉన్నాడు. ఉదయం 10 గంటల ప్రాంతంలో అనుమానిత పేలుడు పదార్థాలను చేతుల్లోకి తీసుకొని ఏదో చేయాలని ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో వెంకటేశ్ ముఖానికి, మిగతా శరీరానికి తీవ్రగాయాలు కాగా, అతని కుడి చేయి, రెండు చేతుల వేళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పేలుడుతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు.
ఇదిలా ఉండగా వెంకటేశ్కు వరుసకు బాబాయైన ఎల్లప్ప యాదప్పకు సమాచారం అందించాడు. యాదప్ప వచ్చి వెంకటేశ్ను స్థానికుల సహాయంతో ఆటోలో తాండూరు జిల్లా దవాఖానకు తరలించారు.సంఘటన విషయమై స్థానికులు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించగా తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ జలంధర్రెడ్డి, ఎస్ఐ గఫార్ ఇతర సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని జరిగిన సంఘటనపై స్థానికులను ఆరా తీశారు. అనంతరం జిల్లా ఎస్పీ నారాయణ, బాంబు స్కాడ్, క్లూస్టీం సంఘటనా స్థలానికి చేరుకొని యాదప్ప ఇంటి లోపల, బయట, ఇతర పరిసరాలను పరిశీలిస్తుండగా యాదప్ప ఇంట్లో కొన్ని అనుమానిత పేలుడు పదార్థాలు, పంట పొలాలకు వేసే ఎరువులు, క్రిమిసంహారక మందులు, ఇతర పదార్థాలు కొన్ని లభ్యమయ్యాయి. ఎస్పీ నారాయణ వాటిని స్వాధీనం చేసుకోవాలని, వెంటనే వాటిని (ఎఫ్ఎస్ఎల్) ల్యాబ్కు పంపి వివరాలు సేకరించాలని పోలీసులను ఆదేశించారు.
వెంకటేశ్ అనుమానిత పేలుడు పదార్థాలతో ఏదైనా తయారు చేయాలని ప్రయత్నించి విఫలమైనట్లు అనుమానిస్తున్నాయని ఎస్పీ తెలిపారు. లభ్యమైన పదార్థాలను ల్యాబొరేటరీకి పంపించి పూర్తిస్థాయిలో పరిశీలన చేయిస్తాం.అసలు పేలుడు ఏలా జరిగింది ? ఎందుకు అంతలా పేలుడు సంభవించింది అనే విషయాలపై పూర్తిస్థాయిలో అన్ని కోణాల్లో విచారణను ముందుకు సాగిస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం బ్యాగరి ఎల్లప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు 9(బి)(1)(బి) ఆఫ్ ఎక్స్ప్లోజివ్ యాక్టు 1884, 338, 286 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతామని పోలీసులు తెలిపారు.కార్యక్రమంలో పీఎస్ఐలు సరిత, కృష్ణకాంత్, పెద్దేముల్ సొసైటీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, జడ్పీటీసీ ధారాసింగ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి, మండల అధ్యక్షుడు మాజీ నర్సింహులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
తగిన వైద్యం అందించాలి : ఎంపీ రంజిత్రెడ్డి
పేలుడు సంఘటనపై చేవెళ్ల ఎంపీ డా.రంజిత్రెడ్డి స్పందించారు. బ్యాగరి యాదప్ప ఇంట్లో అకస్మాత్తుగా పేలుడు సంభవించి ఆయన ఏకైక కుమారుడు వెంకటేశ్(19) తీవ్రంగా గాయపడడం తనను కలచి వేసిందని, పేలుడు సంఘటన జరుగడం చాలా బాధాకరమన్నారు. వెంకటేశ్కు తగిన వైద్యం అందించేలా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఎంపీ అధికారులను ఆదేశించారు.