బొంరాస్పేట, ఆగస్టు: గ్రామ పంచాయతీలకు కేసీఆర్ సర్కారు ప్రతినెలా అందిస్తున్ననిధులతో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని వైస్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ నిధులు రూ.2.50 లక్షలతో నిర్మించే భూగర్భ మురుగు కాల్వ పనులను సర్పంచ్ దోమ వెంకటమ్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీలకు ప్రతినెలా నిధులను మంజూరు చేస్తున్నారని అన్నారు.
ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టి మౌలిక వసతులను కల్పిస్తున్నామని అన్నారు. ఇవేకాకుండా పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామ పంచాయతీలకు లక్షల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తుందని, ఈ నిధులతో గ్రామాల్లో స్మశాన వాటికలు, కంపోస్టు షెడ్లు, డంపింగ్ యార్డులు, చెత్త సేకరణకు ట్రాక్టర్ కొనుగోలు చేస్తున్నారని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా మారాయని నారాయణరెడ్డి అన్నారు. సర్పంచ్ దోమ వెంకటమ్మ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నిధులతో గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజి నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యాదగిరి, టీఆర్ఎస్ నాయకుడు అంజిలయ్య పాల్గొన్నారు.