వికారాబాద్, నవంబర్ 14 : అత్యంత మహిమగల అనంతపద్మనాభస్వామి పెద్ద జాతర వేడుకలు ఆదివారంతో ప్రారంభమయ్యాయి. ఆలయ అధికారులు, అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భక్తులకు పలు రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. జాతరకు వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సమీపంలో ఉన్న ఉసిరిచెట్టు వద్ద మహిళలు దీపాలు వెలిగించారు. స్వామివారిని దర్శించుకొని ఆలయ ఆవరణలో సేదతీరారు. అటవీ ప్రాంతంలో సరదాగా గడుపుతూ సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం నంది ఘాట్ వద్దకు చేరుకున్న పర్యాటకులు ట్రెక్కింగ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించారు. చిన్నారులు, పెద్దలు, మహిళలు సైతం ఆనందంగా గడిపారు. సాయంత్రం 4 గంటలకు ధ్వజారోహణం, పుణ్యాహవాచనం కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. ఆలయ ఆవరణలో వెలసిన తినుబండారాలను భక్తులు కొనుగోలు చేశారు.