పూడూరు: గోసేవే గోవిందుని సేవ, మానవ సేవయే మాధవ సేవ, వృక్షో రక్షతి రక్షితః అనే నినాదంతో గోవుల, వృక్షాల సంరక్షణ కోసం రైతులకు డబ్బులు అందజేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. వయస్సు పైబడిన గోవులను, ఎన్నో ఏండ్లుగా ఉంటున్న వృక్షాలను కాపాడేందుకు పెన్షన్ పథకం ద్వారా సంరక్షకులకు డబ్బులు అందజేసేందుకు ఓ స్వచ్చంధ సంస్థ శ్రీకారం చుట్టుంది.
హైదరాబాద్లోని లింగంపల్లి ప్రాంతంలో ఉండే, ఓం అమృతంగమయ ఎన్వీరాన్ మెంటల్ చారిటబుల్ ట్రస్టు ముందుకొచ్చింది. వినూత్న ఆలోచన చేసి ఒక్కొక్క గోమాత రక్షకులకు ప్రతి నెల రూ. 500లు, వృక్షాలను కాపాడేవారికి (ఒక్కొక్క పురాతనమైన చెట్టుకు) నెలకు రూ.100ల చొప్పున ప్రతి సంవత్సరం రూ.1200లు పెన్షన్ పథకం ద్వారా సంరక్షకులకు అందజేసేందుకు ఓం అమృతంగమయ ఎన్వీరాన్ మెంటల్ చారిటబుల్ ట్రస్టు సభ్యులు ముందుకొచ్చారు.
రైతులు వయస్సు పై బడిన గోవులను గొవధకు విక్రయించకుండా, వాటిని మరణించేవరకు సంరక్షించి మృతి చెందిన అనంతరం అంత్యక్రియలు చేస్తే ఆ రైతుకు ట్రస్టు ద్వారా రూ.35వేలు అందజేయనున్నట్లు ప్రకటించారు. మొదటగా పూడూరు మండల కేంద్ర సమీపంలోని దామగుండం రామలింగేశ్వరస్వామి దేవాలయ అటవీ ప్రాంతంలో వృక్షాల సంరక్షణతో పాటుగా, పూడూరుగ్రామంలోని గోపాలకులకు గోమాత పెన్షన్తో పాటు ఇన్సూరెన్స్ పథకాన్ని ట్రస్టు సభ్యుల ఆధ్వర్యంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్రెడ్డిల చేతుల మీదుగా ప్రారంభించారు. జీవరాశి మనుగడకు మూలమైన పర్యావరణ సమతుల్యతకు కారణమైన వృక్షాలను నరికివేయకుండా కాపాడేందుకు ఓం అమృతంగమయ ఎన్వీరాన్ మెంటల్ చారిటబుల్ ట్రస్టు వారు కృషి చేస్తున్నారు.
ఈ ప్రాంతంలో సుమారుగా 2,900 ఎకరాల భూమిలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేవి రాడర్ కేంద్రంతో రెడియేషన్ ద్వారా ప్రాణపాయం ఉంటుందని, ఆ పనులను ప్రారంభించొద్దని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దామగుండం అటవీ ప్రాంతంలో ఉన్న ఆయుర్వేద ఔషధ మొక్కలతో పాటుగా ఔషధ మొక్కల ఉద్యానవనం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. దామగుండం అటవీ ప్రాంతంలో జంతువులకు, పక్షులకు ఆహారం అందించే పలు రకాల పండ్ల, ఆయుర్వేద మొక్కలను నాటించారు. వృక్ష, గోమాత సంరక్షణ కోసం ట్రస్టు చైర్మన్ సత్యనందస్వామి చేస్తున్న కృషిని స్థానిక నాయకులు, రైతులు, యువకులు అభినందిస్తున్నారు.
గోవులు,వృక్షాల సంరక్షణకు పెన్షన్ పథకం అభినందనీయం:పి.నవ్యనర్సింహ్మరెడ్డి, సర్పంచ్ పూడూరు గ్రామం…
దేశంలోనే ఎక్కడా లేని విధంగా గోవులు, వృక్షాల సంరక్షణకు ముందుకు రావడం సంతోషకరమైన విషయం. దామగుండం అటవీలో ఎన్నో యేండ్ల నాటి వృక్షాలు ఉన్నాయి. ఓం అమృతంగమయ ఎన్వీరాన్ మెంటల్ చారిటబుల్ ట్రస్టు వారు ముందుకొచ్చి గోవులు, వృక్షాలకోసం పెన్షన్ పథకం ప్రవేశపెట్టి సంరక్షకులకు ఇవ్వడంతో రైతుల్లో నూతన ఉత్తేజం నెలకొంది. దామగుండం రామలింగేశ్వరస్వామి దేవాలయం ఎంతో పూరతనమైయింది. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివృద్ధి చేయాలి.
గోమాతను గోవధకు తరలించొద్దు: సత్యనందస్వామి ట్రస్ట్ చైర్మన్, దామగుండ దేవాలయం పూడూరు గ్రామం…
రైతులు గోమాతలను గోవధకు తరలించకుండా రక్షించేందుకోసం మా ట్రస్టు ద్వారా కృషి చేస్తున్నాము. దామగుండం అటవీ ప్రాంతంలో అనేక ఆయుర్వేదిక ఔషద మూలికలు ఉన్నాయి. గోవులను పోషించిన వ్యక్తులకు ట్రస్టు ద్వారా నెలకు రూ.500లు అందజేస్తున్నాము. గోమాత మృతి చెందిన తర్వాత రైతు అంత్యక్రియలు చేస్తే రూ.35వేలు అందజేస్తాము. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో నేవీ రాడర్ కేంద్రం ఏర్పాటుతో 12వేల చెట్లను తొలగించనున్నారు. దీంతో ఆరోగ్యానికి పనికి వచ్చే చెట్లు నరికివేతకు గురవుతాయి.