పూడూరు: హైదరాబాద్ నగరవాసులు గ్రామీణ ప్రాంతాలల్లో స్వచ్ఛమైన వాతవరణం ఉంటుందని భూములు కొనుగోలు చేసి ఫాంహౌజ్ నిర్మించుకుంటున్నారు. ఆదివారం లేదా ఇతర సెలవు దినాలు వస్తే చాలు కుటుంబ సభ్యులతో కలిసి ఫాంహౌజ్లకు వచ్చి రోజాంత సరదగా గడుపుతారు. గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోనే ఫాంహౌజ్లు అధికంగా కనిపించేవి. ప్రస్తుతం నగర శివారు ప్రాంతాల్లో భూములకు అధిక ధరలు పలుకడంతో కొందరు అక్కడి భూములను విక్రయిస్తున్నారు. హైదరాబాద్-బీజూపూర్ హైవే రోడ్డు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం నగరానికి 60 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.
దీంతో మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో నగరవాసులు భూములు కొనుగోలు చేసి ఫాంహౌజ్లు నిర్మించి పలు రకాల పండ్ల తోటలను పెంచుతున్నారు. రోజు రోజుకు నగరవాసులు ఈ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయడంతో హైవే రోడ్డు ప్రాంతంలో రెండు నుంచి ఎకరం భూమి రెండున్నర కోట్లకు విక్రయాలు జరుగగా, హైదరాబాద్ హైవే రోడ్డు నుంచి సబ్ రోడ్డుకు కిలో మీటర్ మేరకు ఉన్న భూములకు కోటి రూపాయల వరకు క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాలల్లో భూములకు అధిక ధరలు పలకడంతో కొందరు రైతులు భూమిలు విక్రయించి పలు వ్యాపారాలు చేస్తున్నారు. ప్రస్తుతం పూడూరు మండల పరిధిలో అంగడి చిట్టంపల్లి, చన్గోముల్, కడ్మూర్, కుత్బులాపూర్, మేడిపల్లి కలాన్, కంకల్, సోమన్గుర్తి, పెద్ద ఉమ్మెంతాల్, రాకంచర్ల, పూడూరు, కొత్తపల్లి, బాకాపూర్, మీర్జాపూర్, గొంగుపల్లి,ఎన్కెపల్లి కండ్లపల్లి తదితర గ్రామాలల్లో కలిసి మండల పరిధిలో సుమారుగా150 ఫాంహౌజ్ల వరకు ఉంటాయి. నగరంకు చెందిన కొందరు రియల్ వ్యాపారులు ఈ ప్రాంతాలకు రావడంతో గ్రామీణ ప్రాంత యువకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూములు చూయించడంతో స్వయం ఉపాధి పొందుతున్నారు.
ఆదివారం రోజుల్లో అనంతగిరి దేవాలయం, కోట్పల్లి ప్రాజెక్టు, దామగుండం అటవీ ప్రాంతాలను చూసేందకు అధిక సంఖ్యల్లో సందర్శకులు రావడం వల్ల రోడ్డు మార్గంలో స్థానిక యువకులు స్వయం కృషితో తినుబండారాలు, ఇతర వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. కొందరు యువకులు ఫాంహౌజ్ల్లో పలు పనులు చేస్తు ఉపాధి పొందుతున్నారు. హైదరాబాద్ నుంచి వికారాబాద్ జిల్లాకు రావాలంటే పూడూరు మండల పరిదిలో నుండే రావల్సి ఉంటుంది. దీంతో పూడూరు మండలంలోని పలు గ్రామాలల్లో హైదరాబాద్కు సమీపంలో ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంచనాలకు మించి రోజు రోజు అభివృద్ధి చెందుతుంది.