పరిగి: తెలంగాణ రైతులు భరోసాతో ఉన్నారని, సీఎం కేసీఆర్ తమ వెంట ఉన్నారనే ధైర్యం రైతుల్లో ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర వస్తుందనే నమ్మకం వారిలో కనిపిస్తుందని చెప్పారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా పలు పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. శనివారం పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా అంతిగారి సురేందర్, పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది.
సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రైతుబంధు కింద ఎకరాకు రెండు పంటలకు రూ.10వేలు అందించడం ద్వారా ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.35వేల కోట్లు ఈ పథకం కింద ఇవ్వడం జరిగిందని చెప్పారు. రైతుబీమా కింద ఈసారి రూ.1,450కోట్ల ప్రీమియం ఎల్ఐసీకి ప్రభుత్వం చెల్లించిందన్నారు. సంవత్సరానికి రూ.10,500కోట్లు ఖర్చు చేసి 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ వ్యవసాయానికి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.
ఈసారి వ్యవసాయానికి బడ్జెట్లో రూ.25వేల కోట్లు కేటాయించడం జరిగిందని, సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న కార్యక్రమాలతో రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తి పెరిగిందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా అంతిగారి సురేందర్, వైస్ చైర్మన్గా ఎం.డి.సమీర్, డైరెక్టర్లుగా ఆకారపు మాణిక్యం, ఎం.బాబు, జీ.నాగన్న, పి.ప్రభులింగం, సేవ్యానాయక్, డప్పు చంద్రశేఖర్, యు.వెంకటయ్య, ఎస్.బుచ్చిలింగంలచే మార్కెట్ కమిటీ కార్యదర్శి సుదర్శన్రావు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మార్కెట్ చైర్మన్ సురేందర్, పాలకవర్గ సభ్యులను పలువురు ఘనంగా సన్మానించారు.