బషీరాబాద్, ఆగస్టు 14 : మండల పరిధిలోని మైల్వార్ గ్రామానికి చెందిన రైతు ఘణపూరం కుర్వ శ్యామప్ప తనకున్న ఏడెకరాల్లో పెసర పంటను సాగు చేశాడు. సాగు చేసిన ఏడెకరాల్లో పంట మంచిగా రావడంతో రూ. 25 వేలు పెట్టి కూలీలతో కలుపు తీయించాడు. పంట ఏపుగా పెరగడంతో పూత, కాత కోసం అవసరమైన మందులు పిచికారి చేశాడు. అయితే కోత సమయం వచ్చినప్పటికి పంటకు పూత, కాత రాకపోయేసరికి నష్ట పోయినట్లు గుర్తించి ఆందోళన చెందాడు.
దీంతో తోటి రైతులు బాధితుని ఆందోళన గుర్తించి విలేకర్లకు సమాచారం ఇచ్చారు. విలేకర్లు రైతు పొలం వద్దకు వెళ్లి రైతు సాగు చేసిన పెసర పంటను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం, సేడం తాలుకా నుంచి 30 కిలోల పెసర విత్తనాలు తెచ్చి ఏడున్నర ఎకరాల్లో సాగు చేసినట్లు తెలిపారు. మొదట పంట బాగా వచ్చినప్పటికీ పూత, కాత రాలేదన్నారు. పంటకు పూత, కాత వచ్చి పంట పండితే 30 క్విటాళ్ల పెసలు అయ్యేవని, తనను విత్తనాల పేరుతో మోసగించారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.