సకల కళల ఖజానా – తెలంగాణ !
సర్వ సంస్కృతుల నజరానా – తెలంగాణ!
వేలాది సంవత్సరాల చరిత్ర, గొప్ప సంస్కృతి ఉన్న నేల – తెలంగాణ!
మహాత్మా గాంధీ అంతటి మహనీయుడు “గంగా జమున తెహ్ జీబ్” గా అభివర్ణించిన నేల – తెలంగాణ!!
సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో భారతదేశంలోనే ప్రముఖమైనది – తెలంగాణ!!
ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశాల కు సంధాన వారధి మన తెలంగాణ.
భారతదేశం ఎలా అయితే మొత్తం ఉప ఖండ లక్షణాలను కలిగి ఉందో, మన దేశంలో తెలంగాణ కూడా అంతే వైవిధ్యతను, విశిష్టతను కలిగి ఉంది.
ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర ఆనవాళ్ల తో పాటు ఆధునికంగా కూడా ఎంతో ప్రత్యేకతను సాధించింది.
తెలంగాణలో కుతుబ్ షా రాజుల కాలం నుంచి కూడా అన్ని జాతుల, సంస్కృతుల ప్రజలు శాంతియుతంగా సహజీవనం చేస్తున్నారు! నిజాంల కాలంలో కూడా ఇతర రాష్ట్రాలు ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ నగరంలో ఎంతో కలిసి మెలసి జీవిస్తున్నారు ఇదంతా తెలంగాణ ప్రజలలో నరనరానా జీర్ణించుకున్న “అతిధి దేవోభవ” అన్న భావన వల్లనే సాధ్యమైంది.
ఇంత గొప్ప చారిత్రక వైభవం, పోరాట స్ఫూర్తి ఉన్న తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని అన్యాయాలకు గురైనదో మనకు తెలుసు. నిధులు, నీళ్ళు, నియామకాల పరంగానే కాకుండా మన అస్తిత్వం, మన ఆత్మగౌరవం, మన పండుగలు, ఉత్సవాలు, మన వేడుకలు అన్ని నిర్లక్ష్యం చేయబడ్డాయి. మన భాష, మన యాస ఎంతో అపహాస్యం చేశారు. కళలు సంస్కృతి , సినిమాలలో మన తెలంగాణ భాష ఎంతగానో అవహేళన కు గురి అయింది. ఈ వివక్ష నుంచే తెలంగాణ ప్రజలు పోరాటం చేశారు
నిజానికి తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం తెలంగాణ సాంస్కృతిక పోరాటమే!
60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎదురుకున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పెద్ద ప్రజా ఉద్యమం మొదలైంది. 14 ఏళ్ల పాటు సకల జనుల ను కలుపుకొని, మన ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా ఉద్యమాన్ని నడిపించి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను సాధించి చూపించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారిదే!
• తెలంగాణ ప్రాంతం సాంస్కృతికంగా, సాహిత్య పరంగా, కళల పరంగా ఎంతో ఘనమైన చరిత్ర కలిగి ఉంది.
• తెలుగు సాహిత్యంలో ఎన్నో కొత్త ప్రక్రియలు, సంప్రదాయాలు మన తెలంగాణ కవుల నుంచే మొదలయ్యాయి. పంపన, పాల్కురికి సోమన, బమ్మెర పోతన, బండారు అచ్చమాంబ వంటి తెలంగాణ సాహితీ మూర్తులు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.
• తెలంగాణ రాష్ట్రంలో సకల కళలు ఉన్నాయి! శాస్త్రీయ సంగీతం హిందుస్థానీ, కర్ణాటక సంగీతం… కూచిపూడి, భరతనాట్యం, కథక్, పేరిణి వంటి శాస్త్రీయ నృత్యాలు… ఒగ్గుడోలు, చిందు యక్షగానం, డప్పులు వంటి ఎన్నో జానపద కళారూపాలు… ముషాయిరా, సూఫీ సంగీత్, గజల్ వంటి హైదరాబాదీ దక్కని కళా రూపాలు ఎన్నో మన తెలంగాణకు మొత్తం దేశంలోనే ప్రత్యేకతను సాధించి పెడుతున్నాయి… గుస్సాడీ, లంబాడి , కొమ్ము కోయ వంటి గిరిజన కళారూపాలు, చిత్రకళ, ఫోటోగ్రఫీ, మిమిక్రీ, మైమ్, మ్యాజిక్ వంటి ఎన్నో ప్రాచీన, ఆధునిక, నవీన కళారూపాలకు, కళాకారులకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణా ఉంది
• ఇంత గొప్ప తనం తెలంగాణలో ఉన్నప్పటికీ, గత ప్రభుత్వాలు మన సంస్కృతిని, మన పాటను, మన భాషను అణిచివేశారు.. వివక్ష చూపించారు.. నిర్లక్ష్యం చేశారు.
• తెలంగాణ అవతరణ జరిగిన తర్వాత ఈ ఏడేళ్లలో 60 ఏళ్ల లోటును భర్తీ చేసే విధంగా సాంస్కృతిక, కళా, సాహిత్య రంగాలలో దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా గొప్ప అనిపించేంతగా వికాసాన్ని మనం సాధించాం.
• తెలంగాణా అవతరణకు పూర్వం పేద వృద్ధ కళాకారులకు కేవలం 500 రూపాయలుగా ఉన్న పింఛను మొత్తాన్ని 2020 అక్టోబర్ నుండి తెలంగాణ ప్రభుత్వం 1500లకు పెంచింది. మళ్లీ తిరిగి 2021 రాష్ట్ర అవతరణ వేడుకల కానుకగా ఈ మొత్తాన్ని రూ. 3016/- కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
• ఇవేగాక అరుదైన కళాకారులకు ప్రత్యేక పింఛనును 10 వేల చొప్పున అందజేస్తున్నాము.
• తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక, హిందుస్థానీ, శాస్త్రీయ సంగీతాలను, కూచిపూడి, భరతనాట్యం, పేరిణి, కథక్ వంటి శాస్త్రీయ నృత్యాల వికాసం కోసం 6 ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలను నిర్వహిస్తున్నాము.
• తెలుగు సాహిత్యంలో తెలంగాణ ప్రాంత కవులు, సాహితీవేత్తలు చేసిన కృషిని చాటి చెప్పడానికి, కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచ తెలుగు మహాసభలు 2017లో నిర్వహించాం. స్వయంగా సీఎం కేసీఆర్ ఈ సభలను ముందుండి నడిపించి తెలంగాణ సాహితీ, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు!
• ఉమ్మడి పాలనలో రద్దు చేసిన అకాడేమీలను తెలంగాణా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసింది. తెలంగాణలో సాహిత్య పరమైన అంశాల అభివృద్ధి కోసం తెలంగాణ సాహిత్య అకాడమీని, అలాగే సంగీతం, నాటకం, నృత్యాల వికాసం కోసం తెలంగాణ సంగీత నాటక అకాడమీని ఏర్పాటుచేసింది.
• తెలంగాణ ఉద్యమంలో పాటలు ఎంతగా ప్రజలను ప్రభావితం చేసాయో మనందరికీ తెలుసు! అలాంటి పాటకు పట్టాభిషేకం చెయ్యడానికి, అలాంటి ఉద్యమ కళాకారులకు తగిన గౌరవం ఇవ్వడానికి “తెలంగాణ సాంస్కృతిక సారథి” అనే వినూత్నమైన వ్యవస్థను ఏర్పాటు చేశాము. గౌరవ హైకోర్టు ఆదేశాలను అనుసరించి తెలంగాణ సాంస్కృతిక సారథికి కొత్తగా నోటిఫికేషన్ జారీచేసి, ప్రత్యేక నిపుణుల కమిటీ ద్వారా అర్హులైన కళాకారులలో 550 మందిని ఎంపిక చేసింది.
• తెలంగాణలో సాంస్కృతిక వికాసం కోసం మహతి ఆడిటోరియంను గజ్వేల్ లో, విపంచి ఆడిటోరియంను సిద్దిపేటలో నిర్మించడమే కాక, వరంగల్లులో కాళోజీ కళాకేంద్రం ను అత్యంత అధునాతనమైన రీతులలో నిర్మిస్తున్నాం. అత్యంత ఖరీదైన ప్రాంతమైన బంజారాహిల్స్ లో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి గారి పేరు మీద ” సినారె సారస్వత సదనం” నిర్మించే చర్యలు చేపట్టాం!
• తెలంగాణ ముద్దుబిడ్డ, దేశ పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను నిర్వహిస్తూ, ఆ మహనీయునికి చక్కని నివాళిని అందిస్తున్నాం. ఆయన జన్మస్థలమైన వంగరను పర్యాటక సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాం.
• ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించ వలసిందిగా శాసన సభ లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ “పివి. నరసింహారావు మార్గ్” గా నామకరణం చేయడం జరిగింది.
గతంలో మన జాతి రత్నాల గురించిన జయంతి గాని, వేడుకలు గాని జరగలేదు. కానీ ఇప్పుడు తెలంగాణ తేజోమూర్తులు అందరి జయంతులు, వర్ధంతులు అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్నాం. భక్త రామదాసు, సర్దార్ సర్వాయి పాపన్న, చిట్యాల ఐలమ్మ, ఈశ్వరీబాయి, భాగ్యరెడ్డివర్మ, పైడిమర్రి వెంకట సుబ్బారావు, దేవులపల్లి రామానుజరావు, పైడి జయరాజ్, వట్టికోట ఆళ్వారుస్వామి వంటి మహనీయులను నిరంతరం స్మరించుకుంటూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నాము.
తెలంగాణ వైతాళికుడు, మహా పరిశోధకుడు, గోల్కొండ పత్రిక సంపాదకుడు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి 125వ జయంతి ఉత్సవాలను ఈ సంవత్సరం నిర్వహించాం.
గిరిజన ప్రజల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి, వీరశైవ ప్రజల దైవం మహాత్మా బసవేశ్వర జయంతి ని, గిరిజన పోరాట యోధుడు కొమరం భీమ్ జయంతి ని, తెలంగాణ ఉద్యమకర్త కొత్తపల్లి జయశంకర్ సార్ వంటి వారి జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తున్నాం.
వారితో పాటు మహాత్మ జ్యోతిబా పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, సావిత్రిబాయి పూలే వంటి సంఘ సంస్కర్తల జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం.
• ప్రముఖ సాహితీవేత్త, ప్రజాకవి కాళోజీ నారాయణరావు, మహాకవి దాశరథి గారి జయంతి వేడుకలు తో పాటు వారి పేరిట ప్రతి సంవత్సరం సాహితీ పురస్కారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది.
• రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి విశిష్ట పురస్కారాలు అందిస్తున్నాం.
• అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ విభాగాలలో అత్యున్నత స్థానాన్ని సాధించిన ఆడబిడ్డలకు ప్రతి సంవత్సరం విశిష్ట పురస్కారాలను అందిస్తూ ఆడబిడ్డలను గౌరవిస్తున్నాము.
• తెలంగాణ అంటేనే ఉత్సవాల నేల! ఉమ్మడి పాలనలో ఒకప్పుడు ఎంతో వివక్షకు గురైన మన ఆత్మగౌరవ పండుగలు… బతుకమ్మ, బోనాలు! రాష్ట్రం వచ్చిన తర్వాత వీటిని అధికారిక పండుగలుగా ప్రకటించి ప్రతి ఏటా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూన్నాము.
• ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర – సమ్మక్క సారలమ్మ జాతరను ప్రభుత్వమే ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నది! ఇవేకాక కేస్లాపూర్ నాగోబా జాతర, ఏడుపాయల జాతరను ఇంకా ఎన్నో గ్రామీణ గిరిజన జాతర పండుగలను నిర్వహిస్తున్నాం.
• భారతదేశ చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టం– భారత స్వాతంత్ర్య ఉద్యమం! దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా, 75 వారాల పాటు స్వతంత్ర భారత అమృతోత్సవాలను రాష్ట్ర లోని 33 జిల్లాలలో ఘనంగా నిర్వహించడానికి గౌరవ సీఎం కేసీఆర్ గారి ఆదేశాలతో సన్నాహాలు చేశాము. నేటి తరానికి స్వాతంత్య్ర స్ఫూర్తిని, దేశభక్తిని , జాతీయ భావనను అందించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించాం.
• గౌరవ సీఎం కేసీఆర్ గారు హైదరాబాదులో, తెలంగాణలో నివసిస్తున్న ఇతర రాష్ట్ర సంస్కృతులు, ప్రజలను మన రాష్ట్ర “అభివృద్ధి భాగస్వాములు”గా వర్ణించారు. అందుకే మన రాష్ట్రంలో నివసిస్తున్న తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, కశ్మీరీ, ఒడియా ప్రజల పండుగలను మన ప్రభుత్వం ప్రతి ఏటా ప్రభుత్వ పక్షాన నిర్వహిస్తూ వారందరితో ఒక ఆత్మీయ బంధాన్ని ఏర్పరచుకొన్నాం.
• ప్రస్తుతం కరోన ప్రబలిన నేపథ్యంలో సాంస్కృతిక, సాహిత్య కళాకార్యక్రమాలను ఆన్లైన్ ద్వారా డిజిటల్ మాధ్యమంలో నిర్వహిస్తూ కళాకారులలో ఉత్సాహాన్ని నింపుతున్నాము. సాంస్కృతిక సారథి కళాకారుల ద్వారా కరోనా మీద ఎన్నెన్నో అవగాహనా గీతాలను, చైతన్య గీతాలను రాయించి ప్రజలలో బాధ్యతను పెంచే ప్రయత్నం చేస్తున్నాము. పేదరికం దిగువన ఉన్న కళాకారులకు ఆర్థిక సహకారాన్ని, ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులను అందిస్తూ కష్టకాలంలో ఆదుకుంటున్నాం.