తెలంగాణ రాష్ట్రం పరిశ్రమలకు స్థాపనకు అనుకూలమైనది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఇంకా అనుకూలమైనది. తుఫాన్లు, భూకంపాల ప్రభావం లేని దక్కన్ పీఠభూమిలో హైదరాబాద్ భాగం. సమశీతోష్ణ వాతావరణం హైదరాబాద్ ప్రత్యేకత. పరిశ్రమల్లో యంత్రాలు ఎక్కువ కాలం మన్నికగా ఉండడానికి ఇక్కడి వాతావరణం ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నగరం మినీ ఇండియాలాగా ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారే కాకుండా, విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ ఎంతో సౌకర్యంగా, ప్రశాంతంగా జీవనం గడుపుతారు. అందుకే వివిధ రంగాల్లో నిపుణులు హైదరాబాదులో ఉద్యోగం, వ్యాపారం చేయడానికి, ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు.
ఇలాంటి సహజ సిద్ధమైన అనుకూలతలతో పాటు ప్రభుత్వ పరంగా కూడా పెట్టుబడి దారులకు అనుకూలమైన సులభతర వాణిజ్య, పారిశ్రామిక విధానం ఉంటే అది అంతిమంగా రాష్ట్ర ప్రగతికి దోహదపడుతుందని తెలంగాణ ప్రభుత్వం భావించింది. దీనికోసమే టిఎస్ ఐపాస్ అనే చట్టం చేసి, సులభతర అనుమతుల విధానం ప్రవేశ పెట్టింది. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు హైదరాబాద్కు, తెలంగాణకు పరుగులు పెట్టడానికి ఈ విధానం ఎంతగానో దోహదపడింది. పరిశ్రమలకు అనుమతులిచ్చేందుకు పూర్తి పారదర్శక, సరళమైన, అవినీతి రహితమైన విధానాలను ప్రభుత్వం అనుసరిస్తుంది. ఇక్కడి వనరులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడి వనరులను సద్వినియోగం చేసుకునే దిశగా 14 రంగాలను ప్రాధాన్యంగా ఎంచుకొని పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది. ఒకసారి పెట్టుబడులు పెట్టిన కంపెనీలు తెలంగాణలో అనుసరిస్తున్న విధానాలకు ఆకర్షితులై తదుపరి ప్రాజెక్టులు, ప్రతిపాదనలకు కూడా రాష్ట్రాన్ని ఎంచుకుంటున్నాయి. టీఎస్ ఐపాస్, రాష్ట్రంలోని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు తీసుకున్న చర్యలు కంపెనీలను ఆకర్షిస్తున్నాయి.
పరిశ్రమలు
తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ & సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (TS-IPASS ) బిల్లును 27 నవంబర్ 2014న అసెంబ్లీ ఆమోదించి, చట్టం చేసింది. నూతన పారిశ్రామిక విధానం టిఎస్ ఐపాస్ 2015 జూన్ 12న ఆవిష్కృతమైంది. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఏర్పాటు చేసిన టిఎస్ ఐపాస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి 2,500 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. పారిశ్రామిక రంగంలో ప్రోత్సహకాలు ఇవ్వడానికి, మౌలిక సదుపాయాల కల్పనకు 2016-17 బడ్జెట్లో రూ.973.73 కోట్లు, 2017-18లో రూ.985 కోట్లు కేటాయించారు. 2018-19 లో రూ.1285.72 కోట్లు, 2019-20 బడ్జెట్లో రూ.510 కోట్లు, 2020-21 లో రూ.1998 కోట్లు కేటాయించారు.
టీఎస్ ఐపాస్ ద్వారా ఒక రోజులోనే కంపెనీ రిజిస్ట్రేషన్
టిఎస్ఐపాస్ లో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. ఒకరోజులోనే కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా కొత్తగా వాణిజ్యపన్నులశాఖలో వృత్తిపన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చే కంపెనీని ఒకరోజులో రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశాన్ని కల్పించారు. కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకొనే ప్రక్రియ కాలపరిమితిని తగ్గిస్తూ 7 ఫిబ్రవరి, 2019న ఉత్తర్వులు జారీచేశారు.
ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్ సైట్ ప్రారంభం
రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్శించే లక్ష్యంతో ప్రభుత్వం ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్ సైట్ ను రూపొందించింది. ఈ సైట్ ను 17 జూలై 2020న మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. పరిశ్రమల శాఖ, ఐటీశాఖ, ఇన్వెస్ట్ మెంట్ తెలంగాణ విభాగం కలిపి ఈ వెబ్ సైట్ రూపొందించాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా అగ్రస్థానంలో నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి అవసరమైన పూర్తి సమాచారాన్ని ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.
రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు
నూతన పారిశ్రామిక పాలసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అక్టోబర్ 2020 నాటికి మొత్తం 13,803 పరిశ్రమలు వస్తే ఇందులో అత్యధికంగా ఇంజినీరింగ్ విభాగంలో 2,721 ఉన్నాయి. ఆ తరువాత ఫుడ్ప్రాసెసింగ్ రంగంలో 2,152 పరిశ్రమలు, ఆగ్రోబేస్డ్ ఇండస్ట్రీ, కోల్డ్ స్టోరేజ్ పరిశ్రమలు ఎక్కువగా వచ్చాయి. వీటి ద్వారా రూ. 2,04,121కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ సంస్థల ద్వారా 14,48,858 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.
కరోనా సమయంలో 1,658 పరిశ్రమలు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందివున్నది. కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలు కుదేలయ్యాయి. బహుళజాతి సంస్థలు సైతం తమ వ్యాపార విస్తరణ ప్రణాళికలను రద్దు చేసుకున్నాయి. అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. కానీ తెలంగాణలో మాత్రం భిన్నమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. కరోనా సంక్షోభంలో కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తరలివచ్చాయి. 2020 ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ నాటికి తెలంగాణకు 1,658 పరిశ్రమలు రాగా వీటి ద్వారా రూ.6,060 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 55,169 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కరోనా సమయంలో రాష్ట్రానికి వచ్చిన ప్రముఖ పరిశ్రమల్లో ఏస్టర్ ఫిల్మ్టెక్ లిమిటెడ్ సంస్థ రూ. 1,350కోట్లు, సాయి లైఫ్సైన్సెస్ రూ.400కోట్లు, నేషనల్ పేమెం ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ.500కోట్లు, మేధా రైల్కోచ్ ఫ్యాక్టరీ రూ. 1,100కోట్లు, మెడ్ట్రానిక్స్ రూ.1,200కోట్లు పెట్టుబడులను పెట్టాయి. అమెజాన్ సంస్థ రూ.20,761కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది.
టీఎస్ఐపాస్ ద్వారా రాష్ట్రానికి రంగాల వారీగా ఇప్పటివరకు వచ్చిన పరిశ్రమల వివరాలు (అమెజాన్ మినహాయింపు) | |||
పరిశ్రమ రంగం | కంపెనీలు | పెట్టుబడి (రూ.కోట్లలో) | ఉపాధి అవకాశాలు |
ఇంజనీరింగ్ | 2721 | 3894.67 | 49942 |
ఫుడ్ ప్రాసెసింగ్ | 2152 | 4875.18 | 54327 |
కోల్డ్ స్టోరేజ్, ఆగ్రోబెస్ట్ ఇండస్ట్రీ | 1636 | 1908.93 | 25437 |
సిమెంట్, ప్లయాష్ బ్రిక్స్ | 1266 | 2933.71 | 16910 |
గ్రానైట్, స్టోన్ క్రషింగ్ | 1113 | 3923.28 | 21574 |
ప్లాస్టిక్, రబ్బర్ | 950 | 3472.20 | 24595 |
ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్ | 872 | 12028.22 | 68682 |
టెక్స్ టైల్స్ | 534 | 3915.55 | 201131 |
పేపర్ ప్రింటింగ్ | 471 | 3410.97 | 11571 |
బేవరేజస్ | 412 | 1939.64 | 8143 |
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ | 300 | 1984.76 | 18498 |
ఆర్ అండ్ డీ | 245 | 4239.12 | 28383 |
వుడ్ అండర్ లెదర్ | 228 | 116.40 | 3296 |
సోలార్, రెన్యువబుల్ ఎనర్జీ | 201 | 17944.50 | 6697 |
రియల్ ఎస్టేట్, ఐటీ పార్కులు | 172 | 56900.81 | 834054 |
ఫర్టిలైజర్స్ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్స్ పెస్టిసైడ్స్ | 113 | 8727.90 | 4522 |
ఇతరములు | 195 | 68399.15 | 46113 |
మొత్తం | 13803 | 204121.00 | 1448858 |
పరిశ్రమల స్థాపనకు తెలంగాణలో వెచ్చించిన ఫిక్స్ డ్ క్యాపిటల్ 14.4 శాతం ఉండగా, జాతీయ సగటు 13.5 శాతంగా ఉన్నది. రాష్ట్ర పారిశ్రామిక రంగం జాతీయ సగటు కంటే గణమైన వృద్ధి రేటు కలిగివుంది. 2014-17 వరకు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు 6 శాతం ఉండగా, జాతీయ సగటు 3.6 శాతం మాత్రమే నమోదైంది.
రాష్ట్రం ఏర్పడిన నాలున్నరేండ్లలో దాదాపు రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాధనలు వచ్చాయి. ఇందులో ఇప్పటికే 60 శాతం కార్యరూం దాల్చాయి. సాధారణంగా ప్రతిపాదనల్లో 60-70 శాతం మాత్రమే కార్యరూపంలోకి వస్తాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల భవిష్యత్తులో ప్రతిపాదనల్లో 95-98 శాతం కార్యరూపంలోకి రానున్నాయి.
ఫుడ్ ప్రాసెసింగ్, రిటైల్ ట్రేడ్ పాలసీ, ఎలక్ట్రికల్ వెహికిల్ పాలసీలపై ప్రభుత్వం సంబంధిత శాఖల అభిప్రాయాలను తీసుకుంటున్నది. అనుమతులు ఇచ్చాక ఆరునెలల్లోగా ప్రారంభం కాని యూనిట్ల విషయంలో కారణాలపై విశ్లేషణ చేస్తున్నారు. పరిశ్రమలకు అనుమతులతో పాటు, వివిధ శాఖలు తమశాఖ పరిధిలోఅంశాల అమలుకు నిర్ణీత సమయాన్ని ఖరారు చేశారు. సులభ వాణిజ్య విధానానికి సంబంధించి 372 సంస్కరణలు ఉండగా 362 ఆమోదం పొందాయి. నాలుగు అంశాలు రాష్ర్టానికి వర్తించనివి ఉండగా, మరో ఆరు వివిధశాఖల్లో పెండింగ్లో ఉన్నాయి. ఈవోడీబీ అమలుకు ఒక చట్టాన్నిసవరించారు. 17 జీవోలు విడుదల చేయగా, 42 సర్క్యులర్లు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టీ-ఐడియా పథకం ద్వారా 10,195 యూనిట్లకు రూ.1,658 కోట్లు, ఎస్సీపీ ద్వారా 8,994 యూనిట్లకు రూ. 542 కోట్లు, టీఎస్పీ ద్వారా రూ7,976 యూనిట్లకు రూ.363 కోట్ల ప్రోత్సాహకాలు అందించారు.
తరలి వస్తున్న పరిశ్రమలు
రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త పరిశ్రమల్లో ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఫార్మా, పవర్, ప్లాస్టిక్, ఇంజనీరింగ్, ఆగ్రోబేస్డ్, గ్రానైట్ స్టోన్ క్రషింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పేపర్, ప్రింటింగ్, టెక్స్టైల్, సిమెంట్, ఏరోస్పేస్, సోలార్, ఆటోమొబైల్ రంగాలకు చెందినవి ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన వాటిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అధికంగా ఉన్నాయి. ఇప్పటివరకు 361 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. 169 ఫార్మా, కెమికల్స్, 87 పవర్, 165 ప్లాస్టిక్, రబ్బర్, 280 ఇంజనీరింగ్, 195 ఆగ్రో బేస్డ్, 46 ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, 166 గ్రానైట్ స్టోన్ క్రషింగ్, 69 పేపర్ ప్రింటింగ్, 63 టెక్స్ టైల్, 117 సిమెంట్, 12 ఏరోస్పేస్, డిఫెన్స్, 820 ఇతర పరిశ్రమలు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం అంతర్జాతీయంగా పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తున్నది. చాలా మల్టీ నేషనల్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. దాదాపు రూ.600 కోట్ల పెట్టుబడితో ఐకియా సంస్థ ఫర్నిచర్, టెక్స్ టైల్ యూనిట్ ప్రారంభించింది. కోకోకోలా కంపెనీ రూ. 1000 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ పెట్టడానికి ముందుకు వచ్చింది. చైనాకు చెందిన డాంగ్ఫాంగ్ ఎలక్ట్రిక్ కార్పొరెషన్ 1000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ పెట్టనుంది. ప్రాక్టర్ అండ్ గాంబుల్ రూ.900 కోట్లతొ, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ రూ. 400 కోట్లతో పరిశ్రమలు ప్రారంభిస్తోంది. గజ్వేల్ నియోజకవర్గంలోని ముప్పిరెడ్డిపల్లిలో తయారుచేసే ‘ఇన్సుమన్ ప్రాజెక్టు’ రూ.500 కోట్లతో ఏర్పాటు కానుంది. ఫ్రెంచ్ ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్జానంతో ఇన్సులిన్ ను ఇక్కడ తయారు చేయనున్నారు. ఆటోమొబైల్ రంగంలో పేరెన్నికగల హ్యుందయ్ మొబిస్ కంపెనీ హైదరాబాద్లోని కొల్లూరు ఐటీ క్లస్టర్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.
గ్రామీణ జిల్లాల్లోనూ పరిశ్రమల స్థాపన
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, టీఎస్ఐపాస్ ద్వారా పరిశ్రమలు హైదరాబాద్, దానిచుట్టూనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏర్పాటయ్యాయి. గ్రామీణ జిల్లాల్లోనూ పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నది. గ్రామీణ జిల్లాల్లో అవసరమైన విధంగా మిషన్ భగీరథ ద్వారా నీరు, టీఎస్ఐఐసీ ద్వారా భూముల్లో మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. రవాణా సదుపాయాలు మెరుగుకావడం, శాంతిభద్రతల సమస్యలు లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు గ్రామీణ జిల్లాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఒకప్పుడు పరిశ్రమలు అంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలనే ఎంచుకునేవారు. ఇప్పుడు ఇతర జిల్లాలవైపు చూస్తున్నారు. గ్రామీణ జిల్లాల్లో పరిశ్రమల స్థాపన వల్ల స్థానిక గ్రామాల్లోని నిరుద్యోగ యువకులకు ఉపాధి లభిస్తున్నది.
చందన్ వెల్లి గ్రామానికి పరిశ్రమల క్యూ
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్వెల్లి గ్రామానికి పరిశ్రమలు క్యూకడుతున్నాయి. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో 1,384 ఎకరాల సువిశాల స్థలంలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయగా.. ఇప్పటికే ఏడు భారీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. మరో 15 కంపెనీలు త్వరలోనే తమ ఉత్పత్తులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. చందన్వెల్లిలో ఇప్పటికే వెల్స్పన్ ఫ్లోరింగ్ (275 ఎకరాలు), వెల్స్పన్ అడ్వాన్స్ మెటీరియల్ (100 ఎకరాలు), వెల్ స్పన్ క్రాప్ (50 ఎకరాలు), కుందన్ టెక్నో (36ఎకరాలు), కటారియా ప్రీక్యాబ్ (25ఎకరాలు), అమెజాన్ (39 ఎకరాలు), ఎస్టర్ ఫిల్మ్టెక్ సంస్థకు (50ఎకరాలు) భూములను కేటాయించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు టీఎస్ఐఐసీ మౌలిక సదుపాయాలనూ కల్పిస్తున్నది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటం, సమీపంలోనే ఎయిర్పోర్టు తదితర కారణాలతో చందన్వెల్లిలో పరిశ్రమలకు స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ఈ పారిశ్రామిక పార్క్ను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ) రూ.110 కోట్లు వెచ్చిస్తున్నది. ఇందులో ఇప్పటికే రూ. 85 కోట్ల పనులు పూర్తయ్యాయి. మరో రూ.25 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. పరిశ్రమల విద్యుత్ అవసరాలను తీర్చడానికి గాను 220కేవీ సబ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. నీటి అవసరాల కోసం పైప్లైన్ వేశారు. తాజాగా రూ. 25 కోట్లతో బీటీ, సీసీ రోడ్లను వేయడానికి టెండర్లను పిలిచారు. నగర్గూడ నుంచి చందన్వెల్లి వరకు దాదాపుగా ఐదు కిలోమీటర్ల రోడ్డును 120 అడుగులతో వెడల్పు చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో కొరియా ప్రత్యేక పారిశ్రామిక పార్కు (11 నవంబర్ 2020)
తెలంగాణలో పెట్టుబడులు పెట్టే కొరియా సంస్థల కోసం హైదరాబాద్ లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ప్రత్యేక పారిశ్రామిక పార్కును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది.
పెరిగిన వృద్ధి రేటు
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. దేశ, విదేశాల పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోని అన్ని రాష్ర్టాలకన్నా ముందుంది. ఇతర రాష్ర్టాలు తెలంగాణ రాష్ట్రం దరిదాపుల్లో కూడా లేవు. తెలంగాణ ఏర్పాటుకు ముందు పెట్టుబడుల ఆకర్షణలో దేశవ్యాప్త సగటు వృద్ధిరేటు 20.8%గా ఉంటే.. తెలంగాణ ఏకంగా 79 శాతం వృద్ధి సాధించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోకి వచ్చిన మొత్తం పెట్టుబడులు రూ 5.9 లక్షల కోట్లకు పెరిగాయి. పెట్టుబడుల ఆకర్షణలో మాత్రమే కాదు, ఆయా ప్రాజెక్టుల అమలు విషయంలోను తెలంగాణ ముందంజలో ఉంది. అసోచామ్ (అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్,ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా) అధ్యయన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2017 సెప్టెంబర్ 14న హైదరాబాద్లో జరిగిన సమావేశంలో ఈ నివేదికను విడుదల చేశారు.
పారిశ్రామికరంగ వృద్ధి రేటు : 2013-14 ఆర్థిక సంవత్సరంలో 0.4 శాతం వృద్ధిరేటుతో ఉన్న పారిశ్రామిక రంగంలో కూడా అదనంగా 5.4 శాతం అదనపు వృద్ధి సాధించి, 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 5.8 శాతం వృద్ధిని తెలంగాణ రాష్ట్రం నమోదు చేసింది.
స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు
తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే నూతన విధానానికి 5 ఆగస్టు 2020న జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం టిఎస్ ఐపాస్ చట్టం ద్వారా కొత్త పారిశ్రామిక అనుమతుల విధానం తెచ్చింది. దీని వల్ల పెద్ద ఎత్తున పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. అయితే ఇలా వస్తున్న పరిశ్రమల్లో తెలంగాణ యువకులకు ఎక్కువ అవకాశాలు దక్కేలా విధానం రూపొందించాలని ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశ్రమల శాఖను ఆదేశించారు.
దీనిపై మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో కసరత్తు చేసిన పరిశ్రమలశాఖ ముసాయిదా తయారు చేసింది. దీనిపై కేబినెట్ సమావేశం విస్తృతంగా చర్చించింది. తెలంగాణలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ అవకాశాలు రావాలని కేబినెట్ అభిప్రాయపడింది. స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది.
ఈవోడీబీ ర్యాంకుల్లో తెలంగాణకు మూడో స్థానం
పెట్టుబడులను ఆకర్షించడంలో పలు పెద్ద పారిశ్రామిక రాష్ర్టాలతో పోటీపడి తెలంగాణ రాష్ట్రం సులభతర వాణిజ్య విధానం (ఈవోడీబీ) ఓవరాల్ పర్ఫార్మెన్స్లో మూడో స్థానాన్ని సాధించింది. ఈవోడీబీలో 187 సంస్కరణలకుగాను 184 అమలుచేసింది. పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా జాతీయస్థాయిలో గర్తింపు పొందింది. ఢిల్లీలో 05 సెప్టెంబర్, 2020న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ రాష్ట్ర వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక-2019 ర్యాంకులను ప్రకటించారు. ఈ సారి కేవలం పేపర్ వర్క్ ద్వారానే కాకుండా ఈవోడీబీ ద్వారా లబ్ధిపొందిన పారిశ్రామికవేత్తలు, వినియోగదారుల నుంచి అభిప్రాయాలను సేకరించి ర్యాంకులను ప్రకటించారు. నిర్మాణరంగ అనుమతులు, కార్మిక నియంత్రణ, పర్యావరణ అనుమతులు, సమాచార సదుపాయం, భూమి లభ్యత వంటి అంశాల ప్రామాణికంగా ర్యాంకులిచ్చారు. ఏపీ మొదటిస్థానంలో ఉండగా, రెండోస్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచాయి.
తెలంగాణ ఏర్పడిన ఆరేండ్లలో రాష్ట్రం ఈవోడీబీ ర్యాంకుల్లో వరుసగా మూడు సార్లు టాప్-3లో నిలవటం విశేషం. ఈవోడీబీలో తెలంగాణ 2016లో మొదటి స్థానంలో, ఆ తరువాత 2017లో రెండో స్థానంలో, 2019లో మూడో స్థానంలో నిలిచింది. 2018లో ర్యాంకులు ప్రకటించలేదు.
దేశంలోనే ఐటీ రంగానికి కీలక స్థానంగా ఉన్న హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సదస్సు (ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు) 2017 నవంబర్ 28న అట్టహాసంగా మొదలైంది. విశ్వ ప్రతినిధులకు వేదికగా హైదరాబాద్ నిలిచింది. భారత, అమెరికా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో జి.ఇ.ఎస్. సదస్సు మూడు రోజుల పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్రమోడితో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు, ఆయనకు సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్ హజరయ్యారు. మిత్ర అనే రోబో తెరపై భారత్, అమెరికా జాతీయ పతాకాలను తమ వేళ్లతో తాకడం ద్వారా వీరిద్దరూ ఈ సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు చెందిన 1500 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలతోపాటు 3000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సుకు వచ్చిన అమెరికా బృందానికి ఇవాంకా నాయకత్వం వహించగా, భారత దేశం తరఫున ప్రధాని నరేంద్ర మోడీ ఈ బాధ్యతను తీసుకున్నారు. ఈ సదస్సులో టెక్నాలజీ దిగ్గజ సంస్థ సిస్కో చైర్మన్ జాన్ చాంబర్స్, ట్యాక్సీ సేవల సంస్థ ఓలా సహ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎం.డీ. చందా కొచర్ తదితరులు పాల్గొన్నారు. అమెరికాతోపాటు వివిధ దేశాల ఇన్వెస్టర్లు, పారిశ్రామిక వేత్తలతో పాటు స్టార్టప్ సంస్థలూ సదస్సులో పాలు పంచుకున్నాయి.
ప్రధానంగా ఇంధనం– మౌలిక రంగం, హెల్త్ కేర్ – లైఫ్సైన్సెస్, ఫిన్టెక్ – డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, మీడియా–వినోద రంగాలపై ఫోకస్ పెట్టారు. ఈ సదస్సును అమెరికా ప్రభుత్వం, నీతి ఆయోగ్ సంయుక్తంగా నిర్వహించాయి. కాగా ‘అందరికీ పురోగతి; మహిళలే ముందు’ అనే థీమ్తో ఈ సదస్సు జరిగింది. ముఖ్యఅతిధిగా హాజరైన ఇవాంకాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం తరుపున నవంబర్ 28న ఫలక్ నుమా ప్యాలెస్ లో విందు ఇచ్చారు. అలాగే, గోల్కొండ కోటలో నవంబర్ 29న రాష్ట్ర ప్రభుత్వం తరపున విందు ఏర్పాటు చేశారు.
మొదటి రోజు.. సదస్సు ప్రారంభం తర్వాత జరిగిన చర్చాగోష్ఠిలో ఇవాంకతోపాటు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు.
రెండో రోజు.. పారిశ్రామిక రంగంలో మహిళ భాగస్వామ్యం పెంపుపై జరిగిన చర్చలో ఇవాంకతోపాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ, ఐసీఐసీఐ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్పాల్గొన్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మోడరేటర్గా వ్యవహరించిన ఈకార్యక్రమంలో.. ఇవాంక, చెర్రీ బ్లెయిర్, చందా కొచ్చర్… భారత్లోఉద్యోగ, ఉపాధి రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరగాల్సిన అంశాన్ని ప్రధానంగాప్రస్తావించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు, ప్రభుత్వాలు ముందుకు రాకపోవడంపై ఆందోళన వ్యక్తమైంది. మహిళలకు అన్ని రంగాల్లో సమానావకాశాలు అన్న అంశంపైవిస్తృతంగా చర్చించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు ఇవాంకా ట్రంప్ మహిళా సాధికారతకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. క్రీడల్లో మహిళల భాగస్వామ్యం అన్న అంశంపై జరిగినచర్చలో టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, మహిళా క్రికెట్ జట్టుకెప్టెన్ మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, క్రికెట్వ్యాఖ్యాత హర్ష్ బోగ్లే పాల్గొన్నారు. క్రీడల్లో మహిళలకు తగినంతగా ప్రోత్సాహం లేదని సానియా మీర్జా, మిథాలీ రాజ్ ఆవేదన చెందారు. సదస్సులో పాల్గొన్న తెలుగు ప్రతినిధులు స్టార్టప్స్ ను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.
‘బయోఏషియా టుడే ఫర్ టుమారో’ అనే నినాదంతో హైదరాబాద్ హైటెక్స్ వేదికగా మూడురోజులపాటు (2020 ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు) బయోఏషియా- 2020 సదస్సు జరిగింది. ఈ సదస్సు నిర్వహణలో స్విట్జర్లాండ్ భాగస్వామ్య దేశంగా ఉంటుంది. లైఫ్సైన్సెస్ రంగాలకు ఉన్న అవకాశాలు, ప్రాధాన్యం దృష్ట్యా 2004లో బయోఏషియా సదస్సును ప్రారంభించారు. అప్పటినుంచి ఏటా ఫిబ్రవరిలో సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 37 దేశాల నుంచి దాదాపు 2,100 మంది ప్రతినిధులు, ప్రముఖ కంపెనీల సీఈవోలు, దేశ, విదేశాల నుంచి దాదాపు వందమంది ప్రపంచ ప్రఖ్యాత వైద్యనిపుణులు బయోఏషియా -2020 సదస్సులో పాల్గొన్నారు. వీరు వైద్యరంగంలో వస్తున్న మార్పులపై నిర్దిష్టమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. దాదాపు 78 కంపెనీలు తమ ఉత్పత్తులు, పరిశోధనలను ప్రదర్శించాయి. మూడురోజులలో దాదాపు రెండువేల భాగస్వామ్య సమావేశాలు జరిగాయి. పలు స్టార్టప్ కంపెనీలు నూతన ఆవిష్కరణలను పరిచయం చేశాయి. తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ బయోఏషియా సదస్సులో అన్నీతానై వ్యవహరించారు.సదస్సును విజయవంతంగా నిర్వహించిన బయోఏషియా సీఈవో శక్తినాగప్పన్తోపాటు ఆయన బృందాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ సదస్సు వైద్యరంగంలో వినూత్నమైన పరిశోధనలకు, శాస్త్రసాంకేతికపరంగా వస్తున్న విప్లవాత్మక మార్పులకు వేదికగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా దూసుకువస్తున్న ‘సూపర్ ఫ్లూడ్ మార్కెట్’కు అనుగుణంగా లైఫ్సైన్సెస్ కంపెనీలు ఏ విధంగా తమ ఉత్పత్తి విధానాలను మార్చుకోవాలనే విషయంపై ఒక దిశను సూచించగలిగింది. ప్రాణాంతకమైన క్యాన్సర్ నుంచి సాధారణ వ్యాధిగా మారిన మధుమేహం, బీపీ వ్యాధుల వరకు నివారణ, నియంత్రణకు నూతన చికిత్సావిధానాలు, పరిశోధనల్లో కనుక్కొన్న కొత్త పరికరాలు, ఔషధాలను పరిచయం చేసింది. యువ శాస్త్రవేత్తలు, వైద్యనిపుణులు కనుగొన్న కొత్త ఆవిష్కరణలను ఎగ్జెబిషన్ ఏర్పాటుచేసి అందులో ప్రదర్శించారు. బయోటెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలతో మార్కెట్లోకి రానున్న స్టార్టప్ కంపెనీలకు సదస్సు ఉత్సాహాన్నిచ్చిం ది. బయోఏషియా- 2020 సదస్సుకు 350 స్టార్టప్లు దరఖాస్తు చేసుకోగా.. 75 స్టార్టప్లను మాత్రమే ఎంపికచేశారు. ఈ స్టార్టప్లు తమ ఆవిష్కరణలను ప్రదర్శించి, వాటి ఉపయోగాలను వివరించాయి. వినూత్నమైన, ఉపయోగకరమైన ఆవిష్కరణలను తయారుచేసిన 5 ఉత్తమ స్టార్టప్లకు అవార్డులతోపాటు నగదు బహుమతులను అందజేశారు. ఉత్తమ స్టార్టప్లుగా ఎంపికైనవాటిలో లైకాన్ త్రీడీ, కాల్జీ, ఒంకోసిమిస్ బయోటెక్, హీమాక్ హెల్త్కేర్, ఫెక్సిమోటివ్ టెక్నాలజీస్ ఉన్నాయి.ఈ సదస్సు ద్వారా తెలంగాణలో పెట్టుబడులకు పూర్తిగా అనుకూల వాతావరణం ఉన్నదనే విశ్వాసం కలిగించారు.
మెడికల్ డివైజెస్ పార్క్ : దేశంలోనే అతి పెద్దదైన సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ లో ఇప్పటికే 20 కంపెనీలకు భూకేటాయింపులు జరిపారు. వచ్చే జూలై 2020 నుంచి ఆరు కంపెనీలు తమ వాణిజ్యకార్యకలాపాలను ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకున్నాయి. సుల్తాన్పూర్లోని మెడికల్ డివైజెస్ పార్క్లో ఐదు కంపెనీలకు భూ కేటాయింపులు చేశారు. భూ కేటాయింపుకు సంబంధించిన పత్రాలను మంత్రి వారికి అందించారు.
స్టెంట్ల యూనిట్ : ఆసియాలో అతిపెద్ద స్టెంట్ల యూనిట్ అయిన సహజానంద్ టెక్నాలజీ.. డిసెంబర్ 2020 నాటికి వాణిజ్యకార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్దమైంది. పార్కుకు కేటాయించిన 276 ఎకరాల్లో భూ కేటాయింపులు దాదాపుగా పూర్తయ్యాయని.. దీంతో పార్క్ కు మరికొంత స్థలాన్ని కేటాయించనున్నట్లు చెప్పారు.
ఇంటెల్ సంస్థ ఏర్పాటు చేయనున్న హబ్ : ఇంటెల్ ఆధ్వర్యంలో ఇంటెల్ సంస్థ ఏర్పాటుచేయనున్న ‘ఐప్లెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసెర్చ్ సెంటర్ ఫర్ మొబిలిటీ అండ్ హెల్త్ కేర్’ హబ్ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ శ్రీకారంచుట్టారు. ఈ సంస్థను ఇంటెల్ సంస్థ ఏర్పాటు చేయనుండగా, కేంద్ర ప్రభుత్వం, రిచ్, ఇతర సంస్థలు భాగస్వామ్యం కానున్నాయి.
మెడ్టెక్ ప్రాజెక్టు : బయోఏషియాలో మెడ్టెక్ ప్రాజెక్టు కోసం సైయెంట్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వ సంస్థ రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్(రిచ్)తో ఎంవోయూ కుదుర్చుకున్నది. సైయెంట్ సంస్థ చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి, రిచ్ డైరెక్టర్ జనరల్ అజిత్ మంగ్నేకర్ ఒప్పందాలపై సంతకాలుచేశారు.
గతంలో 14వ బయో ఏషియా అంతర్జాతీయ సదస్సును 2018 ఫిబ్రవరి 6 నుంచి 8వ తేదీ వరకు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్ ప్రారంభించగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, 51 దేశాల నుంచి వచ్చిన 1,480 మంది అంతర్జాతీయ ఫార్మా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు 1200 వరకు వాణిజ్య, భాగస్వామ్య, ఇతర చర్చలు జరిగాయి. ఈ సదస్సులోనే జీనోమ్ వ్యాలీ అవార్డును గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్.. ప్రొఫెసర్ కర్ట్ వోర్దీచ్, పాల్ స్టాఫెల్స్కు అందజేశారు. అటు బయోలాజికల్ ఈ-పార్క్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన ఆరు కంపెనీలకు భూ కేటాయింపు పత్రాలను అందజేశారు. పరిశ్రమలశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్.. సెరిస్ట్రా కంపెనీతో ఎంవోయూ పత్రాలను మార్చుకున్నారు. దీంతో బయోటెక్ పరిశ్రమలో మౌలిక వసతుల కల్పనకు వెయ్యికోట్ల నిధి ఏర్పడనుంది. అంతర్జాతీయ సదస్సు వేదికగా తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ డివైజ్ పార్క్, ఫార్మా సిటీ నిర్మాణం కోసం చేపట్టిన ప్రణాళికలను అంతర్జాతీయ కంపెనీలకు మంత్రి కేటీఆర్ వివరించారు. మూడోరోజు సదస్సులో ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణమూర్తి, ఫార్మాస్యూటికల్స్ వైస్ ప్రెసిడెంట్, జర్మన్ జీఎస్కే సంస్థ ప్రెసిడెంట్ పాట్రిక్ వాల్లెన్స్ కీలకోపన్యాసాలు చేశారు. సదస్సులో మంత్రి కేటీఆర్ వివిధ అంతర్జాతీయ కంపెనీలతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. మౌలిక సదుపాయల కల్పన, ప్రభుత్వ ప్రోత్సాహం పట్ల జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆకర్షితులయ్యాయి. హైదరాబాద్లో తమ సంస్థలను విస్తరించేందుకు ముందుకొచ్చాయి.
బయో టెక్నాలజీ, బయో ఫార్మా రంగాల్లో పరిశోధనలు చేయడానికి, ఆవిష్కరణలు చేయడానికి, తయారీ రంగాల్లో ప్రవేశించే పరిశ్రమలను ప్రోత్సహించేందుకు హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో బీ–హబ్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.60 కోట్ల వ్యయంతో ప్రైవేటు- పబ్లిక్ భాగస్వామ్య పద్ధతి (పీపీపీ)లో హబ్ను ఏర్పాటు చేయనున్నారు. బయో ఫార్మారంగ పరిశోధనలకు ఊతమిచ్చేందుకు ఈ బీ-హబ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం దేశంలోనే ఇది తొలిసారి.
లైఫ్సైన్సెస్ రంగంలో 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
లైఫ్సైన్సెస్ రంగంలో వచ్చే దశాబ్దంలో మరో నాలుగు లక్షల ఉద్యోగాలు లభించేలా దాదాపు 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ.7.5 లక్షల కోట్లు) పెట్టుబడులు సాధించడం లక్ష్యంగా కృషి చేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర లైఫ్ సైన్సెస్ అడ్వయిజరీ కమిటీని పునర్వ్యవస్థీకరించారు. కొత్త కమిటీ తొలి సమావేశాన్ని సందర్భంగా మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనాతో లైఫ్ సైన్సెస్ రంగానికి మరింత ప్రాధాన్యం పెరిగిందన్నారు. హైదరాబాద్లో లైఫ్సైన్సెస్ రంగానికి ఎన్నో మంచి అవకాశాలు ఉన్నాయని, ప్రపంచానికి అవసరమయ్యే వ్యాక్సిన్లలో మూడో వంతు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తున్నామని గుర్తుచేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫార్మా క్లస్టర్ ప్రపంచంలోనే అతి పెద్దదిగా అవుతుందన్నారు. దేశంలోనే అతి పెద్ద మెడికల్ డివైసెస్ పార్క్ను ఏర్పాటుచేశామని, ఇప్పటికే 21 కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయని కేటీఆర్ తెలిపారు.
నూతన కమిటీ
తెలంగాణ రాష్ట్ర లైఫ్ సైన్సెస్ అడ్వయిజరీ కమిటీకి చైర్మన్గా రెడ్డీస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ సతీశ్రెడ్డి, వైస్చైర్మన్గా బయోలాజికల్-ఈ ఎండీ మహిమ దాట్లను ఎన్నుకున్నారు. కమిటీకి కన్వీనర్గా ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ వ్యవహరిస్తారు. ఈ కమిటీలో పరిశ్రమలశాఖ అధికారులు, ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ, మెడికల్ డివైసెస్, డిజిటల్ హెల్త్ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు సభ్యులుగా ఉం టారు. ఈ కమిటీ పదవీకాలం రెండేండ్లు. ఈ కమిటీ ప్రధానంగా ప్రభుత్వం, లైఫ్ సైన్సెస్ పరిశ్రమ, విద్యాసంస్థల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ పరిశ్రమ వృద్ధి, బయో ఏషియా సదస్సు నిర్వహణపై సలహాలు, సూచనలు చేయనున్నది. సులభ వాణి జ్యానికి అనుసరించాల్సిన విధానాలను సూచిస్తుంది. ఈ కమిటీ మొదటిసారిగా 2016లో ఏర్పడగా ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ బాలసుబ్రమణ్యం చైర్మన్గా వ్యవహరించారు.
జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి- నిమ్జ్ ప్రాజెక్టును తెలంగాణలో నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రంగారెడ్డి – మహబూబ్నగర్ జిల్లాల మధ్య రాష్ట్ర ప్రభుత్వం నిర్మించదలచిన అంతర్జాతీయ ఔషధనగరికి కూడా నిమ్జ్ హోదా ఇచ్చేందుకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఢిల్లీలో కేంద్ర పారిశ్రామిక విధాన, ప్రోత్సాహకశాఖ ఉన్నతస్థాయి సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. భూ సేకరణ కోసం ప్రభుత్వం మరో రూ.1.25 కోట్లను విడుదల చేసింది. ఈమేరకు 2016 జనవరి 7న ఉత్తర్వులు జారీచేశారు. వీటితో భూసేకరణ చేపట్టాలంటూ ‘తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ)’ను ప్రభుత్వం ఆదేశించింది. మెదక్ జిల్లా నిమ్జ్ను 12,635 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఇందుకోసం 3,500 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. మరో 9,135 ఎకరాలు సేకరించాల్సి ఉంది. 2017-18 బడ్జెట్లో నిమ్జ్ భూసేకరణకు రూ.200 కోట్లు కేటాయించారు.
జహీరాబాద్ నిమ్జ్ లో మరో భారీ పరిశ్రమ
తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల యంత్ర పరికరాల తయారీ పార్కు (ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరింగ్ పార్కు) ఏర్పాటు చేయనున్నారు. 2017 డిసెంబర్ 13న మంత్రి కేటీఆర్ బెంగళూరులో మౌలిక వసతుల యంత్ర పరికరాల తయారీదారులతో సమావేశమయ్యారు. భవన నిర్మాణాలు, ప్రాజెక్టులు, మైనింగ్వంటి మౌలికవసతుల పనుల్లో ఉపయోగించే యంత్రాల తయారీకి ప్రత్యేకంగా దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో ప్రత్యేకంగా పార్కును ఏర్పాటు చేయనున్నారు. పేరెన్నికగల సంస్థ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మేకర్స్ ఈ పార్కులో యూనిట్లను ఏర్పాటు చేయనుంది.ఇందుకోసం శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఎంఓయూను 2017 డిసెంబర్ 13న కుదుర్చుకున్నారు. జహీరాబాద్ నిమ్జ్ లో 500 ఎకరాల్లో యంత్ర పరికరాల తయారీ యూనిట్ల కోసం పార్కు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పార్కులో పెట్టుబడిదారులు, కార్మికులు, కస్టమర్లకు అవసరమైన వర్క్ టు ప్లే పద్ధతిలో అన్ని సౌకర్యాలుంటాయి.
జహీరాబాద్ ప్లాంట్ లో కే2 సిరీస్ ట్రాక్టర్లు
పరిశ్రమల స్థాపన, నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రోత్సాహకాలు అందిస్తుండటంతో.. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ జహీరాబాద్ ప్లాంటులో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కే2 సిరీస్ ట్రాక్టర్లను 37 మోడళ్లలో తయారు చేయనున్నది. వీటిని దేశీయ మార్కెట్ తో పాటు అమెరికా, జపాన్, ఆగ్నేయ ఆసియాలాంటి అంతర్జాతీయ మార్కెట్లలోనూ విక్రయించనున్నది. 1500 మందికి పైగా పనిచేసే ఈ ప్లాంటులో సంస్థ రూ.1,087 కోట్ల పెట్టుబడులు పెట్టింది. మరో 100 కోట్ల రూపాయలను కూడా అదనపు పెట్టుబడిగా పెడుతున్నది. 2024 నాటికి ఈ ప్లాంటులో ఉద్యోగాలను రెట్టింపు కానున్నాయని సంస్థ ప్రకటించింది.
హైదరాబాద్ లో రూ.100 కోట్లతో ఊర్జా ప్లాంట్
హైదరాబాద్ ఫ్యాబ్ సిటీ దగ్గరలో రూ.100 కోట్ల పెట్టుబడితో ఊర్జా క్లీన్ టెక్ కంపెనీ కొత్త ప్లాంటును నెలకొల్పుతున్నది. విద్యుత్ బిల్లులను గణనీయంగా తగ్గించుకునే పరికరాలను ఈ కంపెనీ తయారు చేస్తుంది.
తైవాన్ దేశానికి చెందిన తయువాన్ రాష్ట్రంతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సందర్భంగా మూడో రోజైన 2018 ఫిబ్రవరి 21న ఈ రెండు రాష్ర్టాల మధ్య సిస్టర్ స్టేట్ ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఐటీ,పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్,తయువాన్ సిటీ బోర్డ్ డైరెక్టర్ రాబర్ట్ హ్యువాంగ్ ఒప్పంద పత్రాలను పరస్పరం అందించుకొన్నారు. ఇంటర్నెట్ ఓవర్థింగ్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అంశాల్లో తయువాన్ వేగంగా వృద్ధి చెందుతున్నది. ఈ ఒప్పందం ద్వారా రెండు రాష్ర్టాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మేలు జరుగుతుంది. వారు ఎక్కడ తమ వ్యాపారాలను ప్రారంభించాలన్నా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు విధానపరమైన మద్దతును అందించి, ప్రత్యేక సౌలభ్యాలను కల్పిస్తాయి. స్టార్టప్లు,ఉత్పత్తిదారులతో తయారైన వాటిని తెలంగాణలో పరీక్షించేందుకు అవకాశం దక్కుతుంది. టీ-హబ్, టీ-ఫైబర్, టీ-వర్క్స్, టీ-బ్రిడ్జిల ద్వారా తయువాన్ రాష్ర్టానికి తెలంగాణ ఐటీ శాఖ సహకారాన్ని అందిస్తుంది. పరిశోధనల్లో.. తెలంగాణలోని విద్యాసంస్థలతో తయువాన్ కలిసి ముందుకు సాగుతుంది.
తెలంగాణకు మరో పెద్ద ప్రాజెక్టు రానున్నది. ప్రఖ్యాత విప్రో సంస్థ తన ఉత్పత్తి యూనిట్ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నది. మూడురోజులపాటు ఘనంగా జరిగిన వరల్డ్ ఐటీ కాంగ్రెస్ చివరి రోజైన 2018 ఫిబ్రవరి 21న తెలంగాణ ప్రభుత్వం విప్రో సౌందర్య ఉత్పత్తుల తయారీ యూనిట్ ఏర్పాటు ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. విప్రో సంస్థ ముఖ్య ప్రణాళికాధికారి (సీఎస్వో) రిషద్ ప్రేమ్జీతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి తారక రామారావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాము తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఒక తయారీ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు మంత్రికి రిషద్ ప్రేమ్జీ తెలిపారు. ఇందుకోసం విప్రో సంస్థ రూ. 220 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. 40 ఎకరాల్లో నిర్మించనున్న ఈ తయారీ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా 200 మందికి ఉపాధి కల్పించనున్నారు. ఇతర విభాగాల్లో తెలంగాణలో పెద్దఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న విప్రో సంస్థ నూతనంగా ఈ తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో.. హైదరాబాద్లో డిజిటల్ ప్రొడక్ట్ కంప్లియెన్స్ ల్యాబ్ను ప్రారంభించింది. 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్న ఈ ల్యాబ్ను వినియోగదారుల నమ్మకం, భద్రత, ఆటోమొబైల్, రక్షణ, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, వైమానిక రంగం, టెలికం, మెడికల్, ఇంధన, తయారీ రంగాల్లో సేవలు అందించేందుకు ఏర్పాటు చేశారు. ఇప్పటికే విప్రో తరంగ్ పేరుతో నిర్వహిస్తున్న క్వాలిఫికేషన్, కంప్లియెన్సన్ ల్యాబ్కు అనుబంధంగా ఈ ల్యాబ్ పనిచేయనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు భద్రత, కంప్లయెన్స్, సర్టిఫికేషన్కు మెరుగైన సేవలందించడానికి ఈ ల్యాబ్ కీలకం కానున్నది. రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న విప్రో.. ఇంజినీరింగ్, ఇండస్ట్రీస్లో నూతన టెక్నాలజీ, బ్లాక్చెయిన్, క్లౌడ్, డీ ప్రింటింగ్ సేవలకు శ్రీకారం చుట్టింది.
మలేషియా దేశంలోని సిలోంగర్ రాష్ట్రం-తెలంగాణ రాష్ట్రం బయోటెక్నాలజీ రంగంలో పరస్పర సహకారం అందించుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. సిలోంగర్ రాష్ట్రానికి చెందిన సెంట్రల్ స్పెక్ట్రమ్ సీఈవో డాటో మహమూద్ అబ్బాస్-టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి సంతకాలు చేసి ఈ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ వద్ద ప్రతిష్టాత్మక జాతీయ ఫార్మా కోపియా కమిషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఫార్మారంగాన్ని అభివృద్ధి చేసేందుకుగాను రాష్ట్రంలో జాతీయస్థాయి సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయగా, స్పందించిన కేంద్రం.. జాతీయ డ్రగ్స్ కంట్రోల్ అకాడమీ, జాతీయ ఫార్మాకోపియా కమిషన్ రెండో కార్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకుగాను రెండింటికీ రూ.200 కోట్లు వెచ్చించనున్నట్టు తెలిపింది. వెంటనే భూములను కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. జాతీయ డ్రగ్స్ కంట్రోల్ అకాడమీ మందుల నియంత్రణ విధానాలు, ప్రమాణాలు, సంస్కరణలపై అధ్యయనం, బోధనలను పర్యవేక్షిస్తుంది. దేశంలోనే ఇది మొదటిది. ఇందులో కోర్సుల నిర్వహణతోపాటు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. కాగా, రాష్ట్రంలో సుమారు 200 మందుల కంపెనీల నుంచి ఏటా రూ.32 వేల కోట్ల మందులు ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి అవుతున్నట్టు అంచనా.
ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ కోసం తెలంగాణణలో ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నది. 2025 నాటికి కొత్తగా ఉత్పత్తి అయ్యే ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో 80శాతం వాహనాలను ఎలక్ర్టిక్ వెహికల్స్ గా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్లాంట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం అవసరమైన భూమిని ఇస్తూ, భారీగా ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తున్నది.అలాగే, ఈవీ కొనుగోలుదారుల కోసం పన్ను మినహాయింపులు కూడా ఇస్తున్నది. దీంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ప్రకటించారు.
టెక్నాలజీ దిగ్గజం ఇంటెల్ హైదరాబాద్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం, ఐఐటీ హైదరాబాద్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో దీన్ని నెలకొల్పనున్నది.
ఆదిభట్ల ఏరోస్పేస్ సెజ్లో బోయింగ్-టాటా అడ్వాన్డ్స్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) భాగస్వామ్య సంస్థ టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్) తయారీ యూనిట్ను 2018 మార్చి 1న ప్రారంభించారు. ఆదిభట్లలోని వైమానిక సెజ్లో టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్కు 2016 జూన్ 18న శంకుస్థాపన చేశారు. అపాచీ యుద్ధ విమానాల ప్రధాన భాగాలు ఇక్కడ తయారుచేస్తున్నారు. 13 ఎకరాల్లో 14 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 18 నెలల కాలంలోనే నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఈ సంస్థ నిర్దేశిత లక్ష్యంలోపే తన కార్యకలాపాలు ప్రారంభించి.. గడువులోపే ఉత్పత్తులను అందించింది.
లాక్హీడ్ మార్టిన్కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాల రెక్కలు హైదరాబాద్లో తయారుకానున్నాయి. అమెరికాలోని భద్రత, ఏరోస్పేస్ దిగ్గజ సంస్థ లాక్హీడ్ మార్టిన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో హైదరాబాద్లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్)లో తయారీకి మరింత ఊతం లభించినట్లయింది. యుద్ధ విమానాల రెక్కల తయారీకి టీఏఎస్ఎల్, లాక్హీడ్ మార్టిన్ మధ్య ఒప్పందం కుదిరింది.
హైదరాబాద్ మరో అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. ఇప్పటికే ఫార్మా, ఐటీ హబ్గా కొనసాగుతున్న భాగ్యనగరం.. ఇక రక్షణ రంగ పరికరాల తయారీ కేంద్రంగా మారబోతున్నది. తెలంగాణలో టాటా ఏరోస్పేస్ ఇక్కడి నుంచి హెలీకాప్టర్ల క్యాబిన్లను తయారు చేస్తుండగా, దేశంలో రెండో అతిపెద్ద సంస్థ అయిన అదానీ గ్రూపు ఇక్కడే ఏరోస్పేస్ పార్క్ ను ఏర్పాటు చేసింది. ఇజ్రాయిల్కు చెందిన ఎల్బిట్ సిస్టమ్స్తో కలిసి ఏర్పాటు చేసిన ఈ పార్క్ ను రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ 14 డిసెంబర్, 2018న ప్రారంభించారు. 20 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో మానవ రహిత విమానాలైన హెర్మేస్ 900, హెర్మేస్ 450లకు సంబంధించిన ప్రధాన విడిభాగాలు ఇక్కడే తయారవుతున్నాయి. ఇందుకోసం రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ప్రస్తుతం ఈ యూనిట్ 4 విమానాల విడిభాగాల తయారీ సామర్థ్యం కలిగివుండగా, 2020 నాటికి దీనిని 18కి పెంచుకోనున్నది. అంతర్జాతీయ మార్కెట్లను దృష్టిలో పెట్టుకొని వీటిని తయారు చేస్తున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్లు వస్తే వీటికోసం ఇక్కడే మానవ రహిత విమానాలను తయారుచేసే అవకాశాన్ని పరిశీలిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు.
లీప్ టర్బో ఫ్యాన్ ఇంజిన్ విడిభాగాలను తయారుచేసే పరిశ్రమను రూ.288 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో ప్రారంభించనున్నట్లు సఫ్రాన్ సంస్థ ప్రతినిధి పెటిట్కోలిన్ 19 ఫిబ్రవరి, 2019న ప్రకటించారు. 13వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో పరిశ్రమను నెలకొల్పుతుండగా, అందులో 8 వేల చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని వర్క్ షాపులకు కేటాయించాలని నిర్ణయించారు. 2019 జూన్లో పరిశ్రమ నిర్మాణం ప్రారంభించి, 2020 నాటికి ఇంజిన్ విడిభాగాల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నారు.
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎమ్మార్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్కులో స్పైస్జెట్ తమ వేర్హౌస్ను, వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నది. ఈ మేరకు జీఎమ్మార్ హైదరాబాద్ ఏవియేషన్ సెజ్ లిమిటెడ్ (జీహెచ్ఏఎస్ఎల్)తో 13 మార్చి, 2020 న ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. తొలుత 33 వేల చదరపు అడుగల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నారు. ఆ తర్వాత డిమాండ్ను బట్టి దీన్ని లక్ష చదరపు అడుగులకు విస్తరిస్తామని స్పైస్జెట్ సంస్థ వెల్లడించింది. వేర్హౌస్, వాణిజ్యకేంద్రం ఏర్పాటుతో కార్గో పరిశ్రమ మరింత అభివృద్ధి చెందడంతోపాటు తెలంగాణలోని ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఏరోస్పేస్, రక్షణ, ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఎగుమతులు, దిగుమతులకు మరింత ఊతం లభించనుంది.
రాష్ట్రంలో హిందూస్థాన్ శానిటరీ వేర్ ప్లాంట్ (28.10.2020)
దేశంలోనే అతి పెద్ద గ్లాస్, ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ దిగ్గజం హిందూస్థాన్ శానిటరీవేర్, ఇండస్ట్రీస్ తెలంగాణ రాష్ట్రంలో రూ.320 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ నిధులతో భువనగిరి వద్ద నూతన గ్రీన్ ఫీల్డ్ స్పెషాలిటీ గ్లాస్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. 2022 చివరినాటికి ఇది ఉత్పత్తి ప్రారంభించనుంది. ఈ సంస్థ సనత్ నగర్, భువనగిరిలో ఏఐజీ గ్లాస్ ప్యాక్ కు ఒక్కో ఉత్పాదక కేంద్రం ఉన్నది. రోజుకు 1,600 టన్నుల కంటైనర్ గ్లాస్ తయారవుతున్నది. సంగారెడ్డిలో పైపులు, ఫిట్టింగ్స్ తయారీ ప్లాంట్ ఉండగా దాన్ని విస్తరించనున్నారు.
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్) అనుబంధ కంపెనీ నోవా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ (ఎన్ఐఎస్ఎల్) హైదరాబాద్లో డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తోంది. నాదర్గూల్ గ్రామం సమీపంలోని టీఎస్ఐఐసీ-పారిశ్రామిక పార్కులో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ యూనిట్ ను 12 మార్చి, 2020న మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 600 మందికి ఉపాధి కలుగుతుంది.
ఇజ్రాయెల్కు చెందిన రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ హైదరాబాద్ను కేంద్రస్థానంగా చేసుకుంటున్నది. ఇప్పటికే కల్యాణి గ్రూపుతో కలిసి హైదరాబాద్లో తయారీ కార్యకలాపాలను చేపట్టిన ఈ సంస్థ, ఇప్పుడు స్థానిక డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయిన ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రోడక్ట్స్ తో కలిసి మరో సంయుక్త సంస్థను నెలకొల్పింది. దీని పేరు ఆస్ట్రా రఫేల్ కామ్సిస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ యూనిట్లో అత్యాధునిక మిలటరీ గ్రేడ్ ఎస్డీఆర్ (సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియో) తయారీ సదుపాయాన్ని రఫేల్, ఆస్ట్రా మైక్రోవేవ్ నెలకొల్పాయి. దీనివల్ల నూతన తరం ఆయుధ సామగ్రి ఉపకరణాల తయారీ/ అసెంబ్లింగ్ చేయవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవతో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని చందనవెళ్లి-హైతాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో వెల్స్పన్ అడ్వాన్స్డ్ మెటిరీయల్స్(ఇండియా) లిమిటెడ్ పరిశ్రమ నిర్మాణానికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ 25 జూలై 2020న భూమి పూజ చేశారు. ఈ ప్రాంతంలో 1128 ఎకరాల భూమిని ప్రభుత్వం రైతుల నుంచి సేకరించగా, ఇందులో టీఎస్ఐఐసీ 700 ఎకరాలను కొనుగోలు చేసి పలు సంస్థలకు కేటాయించింది. పలు విభాగాల్లో ఉత్పత్తులు చేయనున్న వెల్స్పన్ పరిశ్రమతో రెండువేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశమున్నది. ఈ ప్రాంతంలో ఎనిమిది వేల కోట్లతో ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో 10వేల మందికి ఉపాధి లభించనున్నది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు నియోజకవర్గంలోని కమలాపూర్లో బల్లార్పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (బిల్ట్) 2014 ఏప్రిల్లో మూతపడింది. కాగితం తయారీలో ఉపయోగించే గుజ్జును ఉత్పత్తి చేసే బిల్ట్ పరిశ్రమను 1975లో స్థాపించారు. ఈ పరిశ్రమ పునరుద్ధరణకు అవసరమైన ప్రోత్సాహకాలివ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు 5 సెప్టెంబర్, 2018న వెలుబడ్డాయి. ముడిసరుకు, విద్యుత్, బొగ్గు, పెట్టుబడి వ్యయం, వాణిజ్య పన్నులు, విద్యుత్ బకాయిలు, అటవీ అభివృద్ధి సంస్థ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లభించనున్నాయి. ఈ కంపెనీని నడిపించడానికి ప్రభుత్వం రూ.192 కోట్ల మేర రాయితీలు, సబ్సిడీలను ఇవ్వనుంది.
నిజాం కాలంలో 1938లో స్థాపించబడిన సిర్పూర్ పేపర్ ఫాక్టరీ 2014 నాటికి తీవ్రమైన నష్టాలకు గురైంది. కాగజ్ నగర్ లోని ఈ కాగితపు పరిశ్రమ 2014 సెప్టెంబర్ లో మూసివేశారు. ఈ పరిశ్రమ మూతపడడంతో దాదాపు 3,200 మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. వందలాది మంది పరోక్షంగా ఉపాధి కోల్పోయారు. ఈ పరిశ్రమను ఎలాగైనా పునరుద్దరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఈ ఫాక్టరీపై ప్రత్యేక దృష్టి సారించారు అధికారులు. మిల్లును టేకోవర్ చేసే కంపెనీలకు రాయితీలు ఇస్తామని 2016 సెప్టెంబర్లో ప్రభుత్వం ప్రకటించింది. వివిధ కంపెనీలతో సంప్రదింపులు జరిపిన ప్రభుత్వం 7 ఫిబ్రవరి, 2019న ఈ పేపర్ ఫ్యాక్టరీని ప్రారంభించింది.
సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని మందపల్లి పారిశ్రామిక క్లస్టర్లో రూ.175 కోట్లతో మలేషియాకు చెందిన డీఎక్స్ఎన్ సమీకృత వ్యవసాయాధారిత పరిశ్రమ ఏర్పాటు కానున్నది. ఈ పరిశ్రమ నిర్మాణానికి 4 సెప్టెంబర్, 2018న శంకుస్థాపన చేశారు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి పరిశ్రమను డీఎక్స్ఎన్ కంపెనీ సిద్దిపేటలో ఏర్పాటు చేస్తున్నది. 47 ఎకరాల్లో నిర్మించనున్న ఈ పరిశ్రమ ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,000 మంది రైతులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 2020కల్లా డీఎక్స్ఎన్ తన ఉత్పత్తి కార్యక్రమాలను ప్రారంభిస్తుంది. ఆహార పానీయాలు, కాస్మోటిక్స్ ఈ పరిశ్రమలో ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రాంత రైతులతో ఒప్పందం కుదుర్చుకొని వారికి విత్తనాలు, పెట్టుబడి అందజేసి తిరిగి వారి ఉత్పత్తులను మార్కెట్ రేటుకు కొనుగోలు చేస్తారు.
టీఎస్ఐఐసీ (తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) దాదాపు 14 రంగాలకు ప్రాధాన్యమిస్తున్నది. ఐటీ, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, విద్యుత్, ప్లాస్టిక్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, సిమెంట్, ఏరోస్పేస్, ఆటోమొబైల్స్, సౌరశక్తి, నిర్మాణ రంగాలను ప్రోత్సహిస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తరువాత దాదాపు 11 వేల పరిశ్రమలు రాష్ర్టానికి వచ్చాయి. వీటిలో 8,500కుపైగా యూనిట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. టీఎస్ఐఐసీ 39,989 ఎకరాల్లో ఏర్పాటుచేసిన పారిశ్రామిక పార్కుల్లో ఈ యూనిట్లు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా సుమారు 1.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు అంచనా. ఈ సంస్థల్లో ప్రత్యక్షంగా 12 లక్షలు, పరోక్షంగా 20 లక్షల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. మరో 49 వేల ఎకరాల్లో కొత్తగా 36 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ముచ్చర్లలో 12 వేల ఎకరాల్లో ప్రభుత్వం ఫార్మాసెజ్ను ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నది.
ఈ పారిశ్రామిక పార్కులో మౌలిక సదుపాయాల కోసం టీఎస్ఐఐసీ దాదాపు రూ.100 కోట్ల నిధులు వెచ్చించింది. మరో 200 ఎకరాల్లో ఇతర రంగాల పరిశ్రమలకు పార్కును ఏర్పాటు చేస్తున్నారు. తూప్రాన్లో ఫుడ్పార్క్, రాకంచర్ల, బూచినేల్లి, సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివనగర్లో ఎల్ఈడీ పార్కును ఏర్పాటు చేయనున్నారు. పాశమైలారం సమీపంలోని ఇంద్రకరణ్లో మరో పార్కు ఏర్పాటు చేస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేక పారిశ్రామిక పార్కులను నెలకొల్పుతున్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్కు సుల్తాన్పూర్లో 50 ఎకరాలు కేటాయించారు. నందిగామలో ఎలిప్కు పార్కు ఏర్పాటు చేశారు. ఇలా ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడంతో ఆయారంగాల్లో పరిశ్రమలు పెట్టడానికి పెద్దఎత్తున ముందుకొస్తున్నారు. మహేశ్వరం మండలంలో ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో జాతీయ పెట్టుబడి జోన్, ఖమ్మం జిల్లా బుగ్గపాడు వద్ద మెగాఫుడ్పార్కు, యాదాద్రి భువనగిరి జిల్లా దండుమల్కాపూర్లో ఎంఎస్ఈ పారిశ్రామికపార్కు వంటి మెగాపార్కులు వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూరులో స్పైసెస్ పార్క్, సిద్దిపేట జిల్లా బండమైలారంలో విత్తనపార్కు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, పెద్దపల్లి జిల్లా కుందనపల్లి, రామగుండంలలో కొత్త పార్కులు రాబోతున్నాయి.
పారిశ్రామిక పార్కులకు 3 టిఎంసిల నీళ్లు
రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఐఐసీ ద్వారా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసింది. ఇంకా పెద్ద ఎత్తున కొత్త పారిశ్రామిక పార్కుల పనులను ప్రారంభించింది. 80 దాకా కొత్త పారిశ్రామిక పార్కులు ప్రతిపాదన దశలో ఉన్నాయి. వీటిని కేటగిరీల వారీగా విభజించి వాటికి అవసరమైన నీటిని అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పార్కులకు అన్నింటికీ కలిపి సంవత్సరానికి 3 టిఎంసిల నీరు అవసరముంటుందని ప్రభుత్వం అంచనాకొచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఏర్పాటయ్యే పారిశ్రామిక పార్కులకు హైదరాబాద్ మెట్రో వాటర్ వార్క్స్ నీటిని అందించనున్నది. ఔటర్ రింగ్ రోడ్ అవతల ఏర్పాటయ్యే పారిశ్రామిక పార్కులకు మిషన్ భగీరథ ద్వారా పార్కు స్థలం వరకు నీటిని అందిస్తారు. పార్కులో అంతర్గతంగా నీటిసరఫరా చేసే బాధ్యతలను టీఎస్ఐఐసీ తీసుకోవాల్సి ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక పార్కులకు కూడా..
టీఎస్ఐఐసీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కూడా అనేక పారిశ్రామిక పార్కులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో కొన్ని మౌలిక సదుపాయాలు పనులు ప్రారంభమై నీటి అవసరాల కోసం ఎదురుచూస్తున్నాయి. వీటికి మొదటి ప్రాధాన్యంగా నీటి సరఫరా పనులు చేయాలని నిర్ణయించారు. ఫార్మా సిటీ, జహీరాబాద్ నిమ్జ్, వరంగల్ రూరల్ జిల్లాలో మెగా టెక్స్టైల్ పార్కు, సూల్తాన్పూర్లో మెడికల్ డివైజెస్ పార్కు, ఫిక్కి లేడీస్ పార్కు, ఎం.ఎస్.ఎంఈ గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కు, చందన్ వ్యాలీ ఇండస్ట్రియల్ పార్కు, ఎల్ఈడీ పార్కు, సీడ్ పార్కు, ప్లాస్టిక్ పార్కు, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ) ఇలా అనేక పార్కులకు నీటిని సరఫరాచేసేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నారు.
కొత్తగా 8 ఎస్ఎంఈ పార్కులు (11 నవంబర్ 2020)
రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏడాదిలోగా కొత్తగా 8 ఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయడంతోపాటు, మరో 12 ఎస్ఎంఈలను అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురంలో 400 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసింది. అదే తరహాలో ఒక్కోటి 50 నుంచి 60 ఎకరాల చొప్పున కొత్తగా 8 చిన్న, మధ్యతరహా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఉన్న 12 ఎస్ఎంఈ పార్కులను రూ.120 కోట్లతో అప్ గ్రేడ్ చేయనున్నారు.
ఫార్మా బల్క్డ్రగ్కు కేంద్రంగా తెలంగాణ
• ప్రపంచ అవసరాల్లో దాదాపు మూడో వంతు ఇక్కడే ఉత్పత్తి
• 19 వేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటవుతున్న ఫార్మాసిటీ
• తెలంగాణలో ఇప్పటికే రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లు. మరో ఈఎంసీ ఏర్పాటుకు అవకాశం
• మెడ్టెక్ సుల్తాన్పూర్పార్క్లో భారీగా వైద్య పరికరాల తయారీ సంస్థలు
• వరంగల్లో వస్తున్న 1,200 ఎకరాల మెగా టెక్స్టైల్ పార్క్
• ఏరోస్పేస్ కోసం ప్రభుత్వ స్థలాలుసిద్ధంప్లగ్ అండ్ ప్లే విధానంలో పరిశ్రమల స్థాపనకు ఏర్పాట్లు
• లైఫ్సైన్సెస్ రంగం మరింత అభివృద్ధికి జీనోమ్ వ్యాలీలో ఏర్పాట్లు
తెలంగాణ యువతకు ఉపాధే లక్ష్యంగా.. దేశంలోనే తొలి స్మాల్ స్కేల్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్) ద్వారా ఏర్పాటు చేస్తున్న ఈ పార్కుకు ప్రభుత్వం 377 ఎకరాలకు భూమిని కేటాయించింది. ఇక్కడ మొత్తం 400 పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిద్వారా రూ. 1,200 కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పార్కులో 15 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆయా పరిశ్రమలకు స్థలాల కేటాయింపు, రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్ పనులు యుద్ధ్దప్రాతిపదికన పూర్తి చేశారు. 1 నవంబర్ 2019న ఈ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇందులోని పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. ఎగుమతిచేసే స్థాయి ప్రమాణాలున్న వస్తు ఉత్పత్తుల పరిశ్రమలతోపాటు రక్షణ, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్, ప్యాకేజింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలను ఇక్కడ స్థాపిస్తారు. డ్రిల్లింగ్ యంత్రసామగ్రి, వాటర్ డ్రిల్లింగ్, గనుల డ్రిల్లింగ్లో ఉపయోగించే యంత్రాలు, పరికరాలను ఇక్కడ తయారు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లోని 250 ఎకరాల విస్తీర్ణంలో టీఎస్ ఐఐసీ ఆధ్వర్యంలో మెడికల్ డివైజెస్ పార్కును అభివృద్ధి చేయ తలపెట్టింది. ఈ పార్కుకు 2017 జూన్ 17న మంత్రి కె.టి.రామారావు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం దేశంలోని ఫార్మా ఎగుమతుల్లో 35శాతానికి పైగా తెలంగాణ నుంచే జరుగుతున్నాయి. ఈ మెడికల్ డివైజెస్ పార్కు వల్ల దేశీయ వైద్యపరికరాల అవసరాలు తీరి, పేదలకు వైద్య ఖర్చులు తగ్గుతాయి. అలాగే, 20 వేల మందికి ఉపాధి కూడా లభిస్తుంది. ఉత్పత్తితోపాటు ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ రంగాలకు ఒకేచోట వేదిక కల్పిస్తూ మెడికల్ డివైజ్ పార్కు ఏర్పాటు చేయడం దేశంలోనే ఇది తొలిసారి. ఈ పార్కులో పెట్టుబడులకు దేశీయ కంపెనీలతోపాటు పలు అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వచ్చాయి. మెడికల్ డివైజెస్ పార్క్ ద్వారా 21 కంపెనీలు.. రూ.420 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చాయి. శంకుస్థాపన చేసినరోజునే 14 కంపెనీలు, ఆ తర్వాత మరో ఏడు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి సమ్మతించాయి. మెడికల్ డివైజెస్ పార్కులో భూముల కేటాయింపు తర్వాత భవన నిర్మాణాల పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇప్పటికే మూడు కంపెనీల భవనాల నిర్మాణ పనులు తుదిదశకు చేరాయి. త్వరలోనే వీటిలో ఉత్పత్తి ప్రారంభంకానున్నది. మిగిలిన సంస్థలు వాటి నిర్మాణాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. వైద్య పరికరాల ఉత్పత్తిలో ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో పరస్పర సహకారానికి చైనా మెడికల్ సిటీ, కొరియా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.
మెడికల్ డివైజెస్ పార్కులో వైద్య పరికరాల తయారీ
మెడికల్ డివైజెస్ పార్కులో బ్లడ్శాంపిల్స్ సేకరించే కిట్లు, హాస్పిటల్ బెడ్లు, క్యాథటెర్లు, ఆఫ్థాల్మిక్ పరికరాలు, టెలీ ఈసీజీ, యూరాలజీ, ఐవీఎఫ్, ఐసీసీయూలో ఉపయోగించే పరికరాలు, పల్స్ ఓక్సో మీటర్లు, ఎక్స్రే పరికరాలు, అల్ట్రా సౌండ్ స్కానర్లు, నెఫ్రాలజీ, డయాలసిస్ ఇంప్లాంట్స్, మాలిక్యులర్, డయాగ్నోస్టిక్స్ కిట్స్ తయారుచేస్తారు.
మెడికల్ డివైజెస్ పార్కులోని కంపెనీల్లో ఉత్పత్తులు ప్రారంభం
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మేడ్ ఇన్ తెలంగాణ లక్షంగా ప్రభుత్వం పలు పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలో ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం సుల్తాన్ పూర్ ఔటర్ రింగ్ రోడ్ ను ఆనుకొని 276 ఎకరాల్లో 2017 జూన్ 17న మెడికల్ డివైజెస్ పారిశ్రామిక పార్కును ఏర్పాటుచేసింది. వైద్య పరికరాలు తయారు చేసే ఈ పార్కులో టీఎస్ ఐఐసీ రూ.100 కోట్లు ఖర్చు చేసి, మౌలిక సదుపాయాలను కల్పించింది. 2020 నవంబర్ వరకు 32 కంపెనీలకు స్థలం కేటాయించగా, రూ.908 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ పార్కులో 4వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
కంపెనీల్లో తయారయ్యే పరికరాలు..
ఈ మెడికల్ డివైజెస్ పార్కులోని అకృతి అక్యూలో ప్లాస్టి లాజిస్టిక్స్, ఎల్కికాన్ ఇండియా, ప్రోమా థెరాపిటిక్స్ తదితర కంపెనీలు ఉత్పత్తులను ప్రారంభించాయి. బ్లడ్ శాంపిల్ కిట్స్, టెలి ఈసీజీ, అఫ్తాల్మిక్ పరికరాలు, హీట్ ఎక్సేంజర్స్, డిస్ ఇన్ఫెక్షన్ పరికరాలు, త్రీడీ ప్రింటెడ్ మెడికల్ ఇంప్లాట్స్, ప్రైమరీ ప్యాకేజింగ్ కాంపోనెంట్స్, యూరిన్ కలెక్షన్ బ్యాగ్స్, సర్జికల్ అప్లికేటర్స్, అల్ట్రా స్కానర్స్, ఆర్థో త్రీడీ ప్రింటింగ్, డెంటల్, ఆర్ధో ఇంప్లాట్స్, స్టేరైల్ కిట్స్, ఐవీఎఫ్, పల్స్ ఆక్సో మీటర్లు, ఎక్స్ రే పరికరాలు, కండ్ల అద్దాలు, డయాగ్నస్టిక్స్ కిట్స్, హెవీ ఇండస్ట్రియల్ రేడియేటర్స్, కండెన్సర్స్ తయారవుతాయి.
ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ యూనిట్..
మెడికల్ డివైజెస్ పార్కులో ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ యూనిట్ అయిన సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ (ఎస్.ఎం.టీ) ఉత్పత్తులను ప్రారంభించనున్నది. రూ.250 కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన ఈ యూనిట్ లో 2200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుంది. ఇందులో ప్రతిఏటా 12 లక్షల స్టంట్లు ఉత్పత్తి కానున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ సెమీ కండక్టర్ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన అమెరికాకు చెందిన మైక్రాన్ టెక్నాలజీ సంస్థ ముందుకొచ్చింది. సింగపూర్, తైవాన్, జపాన్, చైనా, మలేషియాల్లో పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ భారత్లో విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నది. కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్లో రూ.300 కోట్ల పెట్టుబడితో తమ సంస్థను ప్రారంభించనుంది. దీని ద్వారా సుమారు 1,000 ప్రత్యక్ష ఉద్యోగాలు కలగనున్నాయి. కంపెనీ విస్తరణకు మాదాపూర్లో సుమారు 1.80 లక్షల చదరపు అడుగుల కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన యువత ఇతరుల వద్ద పని చేయడమొక్కటే కాదు. ఇతరులకు ఉద్యోగం కల్పించే స్థాయికి ఎదగాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. ఈ మేరకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను, పెట్టుబడులను ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వం టీఎస్ ప్రైమ్, టీఎస్ ప్రైడ్ ను ప్రవేశపెట్టింది. 2 జూన్ 2014 నుంచి టీఎస్ ప్రైడ్ కింద 31,813 యూనిట్ల స్థాపనకు 1688 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు 30,715 యూనిట్లకు గాను, రూ.1604 కోట్లు మంజూరు కాగా, వికలాంగులకు 1098 యూనిట్లకు రూ. 83.72 కోట్లు మంజూరయ్యాయి.
రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల పరిధిలో 19,333 ఎకరాల్లో హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మాసిటీని నెలకొల్పనున్నారు. తొలిదశలో 8,382 ఎకరాల్లో ఫార్మా సిటీ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ. 28,700 కోట్లు కాగా, తొలిదశకు రూ.15,085 కోట్లు ఖర్చుకానుంది. దీనికి హడ్కో రూ.740 కోట్ల రుణం అందజేసింది. మొత్తం పెట్టుబడులు రూ.64 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. రూ.58 వేల కోట్ల ఎగుమతులు జరుగుతాయని అంచనా వున్నది. ఫార్మా యూనివర్సిటీ, ఫార్మా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ను ఇందులో భాగంగానే స్థాపించనున్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఎకో ఫ్రెండ్లీ ఫార్మాసిటీ నెలకొల్పుతారు. ఫార్మా పరిశ్రమలతోపాటు అందులో పనిచేసే ఉద్యోగుల కోసం టౌన్ షిప్ కూడా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫార్మాసిటీ వల్ల కాలుష్యం ప్రబలకుండా చర్యలు తీసుకొని, పర్యావరణానికి కూడా ఎలాంటి విఘాతం కలుగనీయకుండా నిర్మించనున్నారు. పారిశ్రామిక వ్యర్థాల విసర్జన వల్ల పరిసరాలు కలుషితం కాకుండా, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థతో ఫార్మాసిటీ పనిచేయనుంది. స్థానిక ఫార్మా కంపెనీలే అక్కడ రూ.30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చాయి. కందుకూరు, యాచారం, మండలాలతోపాటు మహబూబ్నగర్ జిల్లా కడ్తాల్ గ్రామ పరిధిలో ప్రతిపాదించిన ఫార్మాసిటీలో ఫార్మారంగం దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఫార్మా సిటీకి అవసరమయ్యే 500 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను కూడా అక్కడే నెలకొల్పుతారు. ఈ ఫార్మా సిటీ ద్వారా 4.25 లక్షల మందికి (ప్రత్యక్షంగా 1.7 లక్షల మందికి, పరోక్షంగా 3.86 లక్షల మందికి) ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం వేగంగా భూ సేకరణ జరుపుతూ 7,424 ఎకరాల భూమిని సేకరించింది.
మరో రెండు ఫార్మా కంపెనీలు
రెండు ప్రముఖ ఫార్మా కంపెనీలు గ్రాన్యూల్స్ ఇండి యా రూ.400 కోట్లతో, లారస్ ల్యాబ్స్ రూ.300 కోట్ల పెట్టుబడితో తమ కార్యకలాపాలను హైదరాబాద్లో విస్తరించడానికి ముందుకొచ్చాయి. 24 నవంబర్, 2020న ఈ రెండు కంపెనీల ప్రతినిధులు ఈ విషయాన్ని ప్రకటించారు.
గ్రాన్యూల్స్ ఇండియా : హైదరాబాద్ నగరానికి చెందిన గ్రాన్యూల్స్ ఇండియా రూ.400 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి యూనిట్ను ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించింది. దాదాపు 10 బిలియన్ ఫినిష్డ్ డోసులను తయారుచేసే సామర్థ్యం ఈ ఫార్మా కంపెనీకి ఉన్న ది. దీని ద్వారా 1600 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
హైదరాబాద్ లో లారస్ ల్యాబ్స్ రూ.1,200 కోట్ల పెట్టుబడులు –
లారస్ ల్యాబ్స్ కంపెనీ సింథటిక్ వ్యాపారానికి హైదరాబాద్ ను కేంద్రంగా మార్చుకుంది. రెండేళ్లలో రూ.1,200 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. తొలి దశలో రూ.300 కోట్లు పెట్టుబడి పెడుతున్నది. ఐదు బిలియన్ డోసుల సామర్థ్యం గల ఫార్ములేషన్ ఫెసిలిటీ యూనిట్ కోసం ఈ పెట్టుబడిని వినియోగిస్తారు. హైదరాబాద్ ఐకేపీ, జినోమ్ వ్యాలీలో రూ.60 కోట్లతో ఆర్ అండ్ డి సెంటర్ కూడా ప్రారంభించనున్నది.
(పెట్టబడుల సాధన కోసం.. కేటీఆర్ దావోస్ పర్యటన)
రూ.500 కోట్ల పెట్టుబడులతో పిరమల్ సంస్థ తెలంగాణలో తమ కార్యక్రమాలను విస్తరించడానికి ముందుకొచ్చింది. ఈ పెట్టుబడితో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన మందుల తయారీ ప్లాంట్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే తమకున్న పిరమల్ ఫార్మా ఫెసిలిటీ సెంటర్ ను మరింత బలోపేతం చేసేందుకు రాబోయే మూడేండ్లలో ఈ పెట్టుబడులను పెట్టనున్నది. ఈ సంస్థకు ఇప్పటికే అన్ని రకాల అనుమతులు కలిగిన మూడు తయారీ బ్లాకులు రాష్ట్రంలో ఉన్నాయి. వీటిలో 1400 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం పెట్టే పెట్టుబడులతో మరో 500 మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. 2020 జనవరి 21 నుంచి 24వ తేదీ వరకు స్విట్జర్ లాండ్ లోని దావోస్ లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్య్లూఈఎఫ్) వార్శిక సదస్సు జరిగింది. తెలంగాణ ప్రగతిని అంతర్జాతీయంగా చాటి, రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే లక్ష్యంతో మంత్రి కె.తారక రామారావు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులోనే 22 జనవరి, 2020న పిరమల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
రాష్ట్రంలో రూ.270 కోట్లతో కరీంనగర్, మహబూబ్నగర్, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్, ఆర్మూర్ తదితర ప్రాంతాల్లో 9 లెదర్ పార్కులను ఏర్పాటుచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పార్కులతో 20 వేల మందికి ఉపాధి లభిస్తుంది. స్టేషన్ ఘన్ పూర్ లో ఐదారు తోళ్ల పరిశ్రమలున్నాయి. ఇక్కడ లెదర్ పార్కు ఏర్పాటు చేస్తాసేందుకు ప్రభుత్వం 117 ఎకరాల స్థలాన్ని సేకరించింది. రూ.105 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసింది.
ఖమ్మం, కామారెడ్డి, మిర్యాలగూడ, మంచిర్యాల, కరీంనగర్, రామగుండం ప్రాంతాల్లో ఆటోనగర్ల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. రాష్ట్రంలో బస్బాడీ యూనిట్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అశోక్ లేలాండ్ ఒప్పందం కుదుర్చుకుంది. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించడానికి సుల్తాన్పూర్లో 50 ఎకరాలు కేటాయించారు. హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ను అభివృద్ధి చేయడానికి భువనగిరి, జనగామ, స్టేషన్ఘన్పూర్, మడికొండ, శాయంపేట, సంగెంలో ప్రాంతాల్లో క్లస్టర్లను ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. టీ-ప్రైడ్ ద్వారా రాష్ట్రంలో 167 యూనిట్లు ఎస్సీలకు, 90 యూనిట్లను ఎస్టీలకు మంజూరు చేశారు. దీని కోసం రూ.290 కోట్లు అవసరం కాగా, 2016 డిసెంబర్ నాటికి రూ.190 కోట్లు విడుదల చేశారు.ఐటీఐ, డిప్లోమా హోల్డర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంగా 4 సెల్ కంపెనీలు యూనిట్లను ప్రారంభించాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోనే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపై కదలిక వచ్చింది.మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన మెకాన్ లిమిటెడ్ ప్రతినిధులు 18 జనవరి, 2019న గార్లడోర్నకల్బయ్యారం మండలాల్లో రెండురోజుల పాటు పర్యటించి, పరిశీలించి వెళ్లారు.
హైదరాబాద్ లోని సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హిందుస్థాన్ శానిటరీ ఇండస్ర్టీస్ కంపెనీ ప్రాన్స్ కంపెనీతో కలిసి గ్లాస్ హీటర్ల ప్లాంట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది తెలంగాణలో సొమానీకి ఎనిమిదో యూనిట్ అవుతుంది. రూ.15 కోట్ల డాలర్లతో టెక్నికల్ టెక్స్టైల్ ప్రాజెక్టును చేపట్టిన వెల్స్పన్ గ్రూప్ తాజాగా లాజిస్టిక్స్ పార్కును ఏర్పాటు చేయనుంది. ఇందుకు ప్రభుత్వం భూమిని కూడా కేటాయించింది.
మానవ రహిత విమానాలను తయారు చేయడానికి ఏరోస్పేస్ పార్క్ను ఏర్పాటు చేసిన అదానీ గ్రూప్ కూడా లాజిస్టిక్ పార్కును రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించనుంది. ఇక్కడి టెక్నాలజీ కేంద్రంలో ఓయో బీ2బీ వ్యాపార కార్యకలాపాలను విస్తరించాలని భావిస్తోంది.
అదానీ, వెల్స్పన్ వంటి కంపెనీలతోపాటు ఇప్పటికే లాజిస్టిక్స్ రంగంలో ఉన్న అనేక కంపెనీలు తెలంగాణాలో లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉన్నందున..
ఇ-కామర్స్ కంపెనీలు హైదరాబాద్లో గోదాములను ఏర్పాటు చేస్తున్నాయి. అమెజాన్కు దేశంలోనే అతిపెద్ద గోదాము ఇక్కడ ఉంది. హైదరాబాద్లో 30 లక్షల చదరపు అడుగుల స్థలంతో అమెజాన్ టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం 11 రోజుల్లోనే అన్ని అనుమతులు మంజూరు చేసింది.
దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.3,690 కోట్ల వ్యయంతో 1,500 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్రంలో అద్భుతమైన ఉపరితల ఓడరేవులు (డ్రైపోర్టులు) ఏర్పాటు చేయనున్నట్లు 2016 డిసెంబర్ 21న ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ప్రభుత్వం ‘ఎర్నెస్ట్, యంగ్ కన్సల్టెన్సీ’ సలహాలు, సూచనలు తీసుకొంటున్నది. హైదరాబాద్కు తూర్పు, పడమర దిశల్లో డ్రైపోర్టుల ఏర్పాటు చేయడం లాభదాయకమని ఈ కన్సల్టెన్సీ సూచించింది. దీనికి కావలసిన భూమిని గుర్తిస్తున్నారు. ఇందులో మొదటిదశగా రూ.1,650 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు టీఎస్ ఐఐసీని డ్రైపోర్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజన్సీగా నియమించింది. టీఎస్ఐఐసీ 2017 మార్చి 5న కేంద్ర ప్రభుత్వ ఉపరితల రవాణా శాఖ సూచన మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో తెలంగాణ రాష్ట్రంలో లాజిస్టిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డ్రై పోర్ట్ నెలకొల్పడానికి అంగీకరిస్తూ జాతీయస్థాయి సమ్మిట్ లో ఎం.ఓ.యూపై ప్రభుత్వం సంతకం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, దుబాయికి చెందిన ప్రఖ్యాత లాజిస్టిక్ డెవలప్ మెంట్ కంపెనీ డీ.పీ. వరల్డ్ తో కూడా డ్రైపోర్ట్ నెలకొల్పడానికి, నిర్వహణకు ఎం.ఓ.యు.పై సంతకం చేసింది.
తైవాన్ కు చెందిన ఫాక్స్ కాన్ టెక్నాలజీస్ గ్రూప్ అనుబంధ కంపెనీ ఫాక్స్ కాన్ ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ హైదరాబాద్ లో అడ్వాన్సుడ్ ఇండస్ట్రియల్ ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఫాక్స్ కాన్ గ్రూప్ కంపెనీలకు ఇది టెక్నాలజీ సేవలు, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్లను అందిస్తుంది. హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకొని భారత్ లో విద్యా సంస్థలు, పరిశ్రమలతో కలిసి ఈ కేంద్రం ఆధారంగా మొబైల్ డివైసెస్, ఐఓటీ, బిగ్ డే గా వంటి రంగాల్లో పరిశోధనలు నిర్వహిస్తారు. ఈ సంస్థ ఏర్పాటుపై సంస్థ ప్రతినిధులతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
రాష్ట్రంలో పలు కంపెనీలు రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్.అండ్.డీ) కేంద్రాలను ఏర్పాటు చేయగా.. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తమ కేంద్రాన్ని హైదరాబాద్ లో ప్రారంభించింది. దక్షిణాసియాలోనే ఇది తొలి ఆధునిక ప్రత్యేక (ఫ్లాగ్ షిప్) విక్రయ కేంద్రం. చైనా తర్వాత హైదరాబాద్లో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఆర్ అండ్ డీ సెంటర్ ఇదే. ఒప్పో తొలుత విడుదల చేసిన ఏ సిరీస్ నుంచి తాజా రెనో శ్రేణి 10 ఎక్స్ జూమ్ మోడళ్ల మొబైల్స్ ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటాయి. ఒప్పో కేంద్రాన్ని 15 డిసెంబర్, 2018న రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. దేశీయ మొబైల్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని పలు నూతన మొబైళ్లను తయారు చేయడానికి ఈ పరిశోధన కేంద్రం దోహదం చేయనుంది. చైనా బయట ఏర్పాటు చేసిన అతిపెద్ద ఆర్ అండ్ డీ సెంటర్ ఇదే. ఈ సంస్థ అమెరికా, జపాన్లలోనూ ఇలాంటి సెంటర్లను నిర్వహిస్తున్నది.
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ 4 నవంబర్ 2020న హైదరాబాద్ లో వన్ ప్లస్ స్టోర్ ను ప్రారంభించింది. హిమాయత్ నగర్ లో ఏర్పాటైన ఈ స్టోర్ అంతర్జాతీయంగా వన్ ప్లస్ సంస్థకు భారీ స్టోర్. వన్ ప్లస్ నిజాం ప్యాలెస్ పేరుతో 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు.
దేశంలోనే అతిపెద్ద హెర్బల్, ఆయుర్వేదిక్, వ్యక్తిగత సంరక్షణ, పోషక పదార్థాల ఉత్పత్తి సంస్థ లైఫ్ స్పాన్.. హైదరాబాద్ లో రూ.100 కోట్లతో శీతల పానీయాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. 2023 నాటికి కార్యకలాపాలను ప్రారంభించాలని భావిస్తున్న ఈ సంస్థ 4 నవంబర్ 2020న మాదాపూర్ లో కార్పొరేట్ ఆఫీసును కూడా ప్రారంభించింది.
హైదరాబాద్లో ప్రపంచ ప్రఖ్యాత మొబైల్ కంపెనీ ‘వన్ ప్లస్’ అంతర్జాతీయ సంస్థ తన పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యక్రమాలను ప్రారంభించనున్నది. ‘వన్ ప్లస్’ తన ఆర్అండ్డీ కేంద్రాన్ని నానక్రాంగూడలో 26 ఆగస్టు, 2019న ప్రారంభించారు. ప్రీమియం స్మార్ట్ఫోన్ బ్రాండ్ అయిన ‘వన్ ప్లస్’ తమ జాతీయ, అంతర్జాతీయ అవసరాలను తీర్చగలిగే ఆర్అండ్డీ కేంద్రాన్ని భారత్లో ఏర్పాటు చేయాలని ఈ ఏడాది ప్రథమార్ధంలోనే నిర్ణయించింది. ఇందుకోసం ఆ సంస్థ.. స్టార్టప్ కల్చర్కు, సాంకేతిక విజ్ఞానానికి సుపరిచిత చిరునామాగా ఉన్న హైదరాబాద్ను ఎంచుకున్నది. మూడేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్డీ కేంద్రంగా 15 అంతస్తుల భవనంలో దీన్ని తీర్చిదిద్దాలని ‘వన్ప్లస్’ భావిస్తున్నది. ఈ కేంద్రం ‘మేకిన్ ఇండియా’ ఆకాంక్షలను నెరవేర్చడమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ రంగాల్లో కీలకపాత్ర పోషిస్తుందని ‘వన్ ప్లస్ పేర్కొంది.
ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కేంద్రం
హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద ఓలెక్ట్రా గ్రీన్టెక్ ఎలక్ట్రిక్ బస్ల తయారీ ప్లాంటు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటుచేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సంస్థకు ఇప్పటికే జడ్చర్ల వద్ద తయారీ కేంద్రం ఉంది. ఈ సంస్థ తయారు చేసిన 40 ఎలక్ట్రిక్ బస్సులను టీఎస్ఆర్టీసీకి అందించింది. 5 మార్చి, 2019న ఈ బస్సులను టిఎస్ఆర్టీసీ ప్రారంభించింది. ఈ ప్రతిపాదిత నూతన ప్లాంటుకు రాష్ట్ర ప్రభుత్వం 300 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసింది. ఏడాదిన్నరలో ఈ ప్లాంట్ మొదటిదశ పనులు పూర్తికానున్నాయి. ఆ తర్వాత రెండేండ్లలో రెండవ, మూడవ దశ పనులు పూర్తచేయనున్నారు. ఈ ప్రాజెక్టును రూ.300 కోట్లతో పూర్తి చేయనున్నారు. ఈ ప్లాంట్ నిర్మాణం మొత్తం పూర్తయితే ప్రత్యక్షంగా 3,500 మందికి, పరోక్షంగా 4,000 మందికి ఉపాధి లభిస్తుంది.
డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ (డీబీఎస్) గ్రూప్ తమ సంస్థను రాయదుర్గంలోని ఆర్ఎంజెడ్ స్కైవ్యూలో రూ.260 కోట్లతో, 2 లక్షల చదరపు అడుగుల్లో తమ కొత్త క్యాంపస్ ను ఏర్పాటు చేయనున్నట్లు 5 మార్చి, 2019న ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అంతకు ముందే 2016లో నానక్రాంగూడలోని వేవ్రాక్లో 2 లక్షల చ.అ.ల్లో డీబీఎస్ హబ్–2 ఏర్పాటు చేశారు. ఇందులో 2 వేల మంది ఇంజనీర్లు, డెవలపర్లు పనిచేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న డీబీఎస్ రెండవ సంస్థలో ఏడాదిలో వెయ్యి మంది ఇంజనీరింగ్, టెక్నాలజీ నిపుణులను నియమించనున్నారు. సింగపూర్ తర్వాత రెండో అతిపెద్ద టెక్నాలజీ హబ్ ఇదే. ఈ సెంటర్లో అతిపెద్ద బ్యాంకింగ్ అప్లికేషన్స్ ప్రొగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఫ్లాట్ఫామ్స్ (ఏపీఐఎస్), ఇంటిగ్రేటెడ్ ఈ-బ్యాంకింగ్ సొల్యూషన్స్, అకౌంటింగ్ అండ్ ఈఆర్పీ ఫ్లాట్ఫామ్ల అభివృద్ధి జరుగుతుంది. మన దేశంతో పాటూ చైనా, తైవాన్, సింగపూర్, హాంగ్కాంగ్ మార్కెట్లలో 350కి పైగా ఏపీఐఎస్ సేవలను ఈ సంస్థ అందిస్తున్నది.
టీఎస్ఐపాస్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికరంగానికి ఊతమిచ్చే చర్యలు తీసుకోవడంతోపాటు పరిశ్రమలకు అనువైన స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. కుషాయిగూడ పారిశ్రామికవాడలోని సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, వారికి స్థలాలు కేటాయించింది. పదిహేను వందలకు పైగా చిన్న పరిశ్రమలున్న కుషాయిగూడ పారిశ్రామికవేత్తలకు మొదటి విడతగా టీఎస్ఐఐసీ ద్వారా యాద్రాది భువనగిరి జిల్లా, రాయరావుపేటలోని సుమారు 40 ఎకరాల స్థలం కేటాయించడంతోపాటు, 450 మీటర్ల నుంచి 500 మీటర్ల వరకు విభజించిన 174 యూనిట్లకు ప్లాట్లు కేటాయించారు. మూడు గ్రీన్బెల్టులను ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించారు. మరిన్ని యూనిట్లకు టీఎస్ఐఐసీ అధికారులు యాదాద్రి భువనగిరి జిల్లా మదాపూర్లో సుమారు 300 ఎకరాల స్థల సేకరిస్తున్నారు.
హైదరాబాద్లో ఇన్నోవ్యాప్టివ్ గ్లోబల్ సొల్యూషన్స్ అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం, టెక్నికల్ సర్వీస్ సెంటర్ ను ఆ సంస్థ 25 మార్చ్, 2019న ప్రారంభించింది. 5 మిలియన్ డాలర్లతో, 150 వర్కింగ్ స్టేషన్లతో ఈ సెంటర్ను ప్రారంభించారు. అమెరికాలోని హోస్టర్లో కేంద్ర కార్యాలయం ఉన్న ఇన్నోవ్యాప్టివ్ సంస్థ 16 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
లిథియం అయాన్ బ్యాటరీల తయారీ ప్లాంట్లు తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు మూడు కంపెనీల ఏర్పాటుకు.. తొలిదశలో రూ.1500 కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చాయి. హైదరాబాద్లోని శంషాబాద్ వద్ద ఈ కేంద్రాలు రానున్నాయి. ఒక గిగావాట్తో ప్రారంభమై మూడు దశల్లో 10 గిగావాట్ సామర్థ్యానికి చేరుకుంటాయి. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ 17 జులై, 2019న నిర్వహించిన ఎలక్ట్రిక్ వెహికల్ సమ్మిట్లో తెలియజేశారు. ఈ మూడు కంపెనీల ద్వారా రూ.6,000 కోట్ల వరకు పెట్టుబడులు రానున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల కోసం 200 ఎకరాల పార్క్ ను తొలుత అభివృద్ధి చేసి, దీనిని 900 ఎకరాల స్థాయికి పెంచనున్నారు. బ్యాటరీ ఫ్యాక్టరీల నిర్మాణం ప్రారంభమైన తర్వాత ఏడాదిలోగా ఉత్పత్తి ప్రారంభం కానుంది.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో 5 ఆగస్టు 2020న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రానిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రత్యేక రాయితీలు ఇచ్చి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించాలని నిర్ణయించింది. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఎలక్ట్రిక్ వాహనం మేడిన్ తెలంగాణ!
ఆధునిక టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ముందుంటున్న తెలంగాణ.. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోనూ ప్రధానకేంద్రంగా మారనున్నది. ఈ రంగంలో రాష్ర్టానికి రూ.30వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పెట్టుబడులతో 1.20 లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో 2.50 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కలుగనున్నది. ఉత్పత్తి కంపెనీలతోపాటు, వినియోగదారులకూ ప్రోత్సాహకాలను అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్ పాలసీని ఆమోదించింది.
రోజురోజుకూ పెరిగిపోతున్న వాహనాలతో కాలుష్యం కూడా బాగా ఎక్కువవుతున్నది. దీనిని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పాలసీని తీసుకువచ్చింది. కేంద్రప్రభుత్వం 2019లో ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని తెచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు అవసరమైన ఇన్సెంటివ్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల పాలసీలను ఆధ్యయనం చేయడంతోపాటు. ఈ రంగంతో సంబంధం ఉన్న వ్యాపారసంస్థల ప్రతినిధులు, నిపుణులతో చర్చించిన తెలంగాణ ప్రభుత్వం.. నూతన పాలసీని రూపొందించింది. కాలుష్య నియంత్రణ, వినియోదారులకు ప్రయోజనాలు.. ఈ రెండూ ప్రధానాంశాలుగా దీనిని తయారుచేసింది.
పెట్టుబడులకు ప్రోత్సాహం
కొత్త పాలసీ ప్రకారం.. రూ.30 కోట్ల వరకు ఉండే పెట్టుబడులపై కాపిటల్ ఇన్వెస్ట్మెంట్పై 20% సబ్సిడీ ఇస్తారు. ఏడేండ్ల వరకు రాష్ట్ర జీఎస్టీ మినహాయింపులు ఉంటాయి. ఐదేండ్లపాటు పవర్ టారిఫ్లో రూ.5 కోట్ల గరిష్ఠ పరిమితితో 25% సబ్సిడీ ఉంటుంది. రూ.5 కోట్ల పరిమితితో 5.25% వడ్డీ గ్రాంటు వర్తింపజేస్తారు. రూ.5 కోట్ల గరిష్ఠ పరిమితితో ఐదేండ్ల దాకా 60% రవాణా సబ్సిడీ వర్తిస్తుంది. స్టాంప్డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు రీయింబర్స్మెంట్, లీజు రెంటల్ అసిస్టెంట్, పేటెంట్ ఫిల్లింగ్ అసిస్టెంట్, క్వాలిటీ సర్టిఫికేషన్, క్లీనర్ ప్రొడక్షన్, ఎగ్జిమిషన్ కాస్ట్ రీయింబర్స్మెంట్లు, స్కిల్ డెవలప్మెంట్ అసిస్టెంట్ వంటివి వర్తింపజేస్తుంది.
పెట్టుబడి, ఉపాధి అవకాశాలు
ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి రంగంలోని ప్రముఖ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్నాయి. దేశంలో ఎలక్ట్రానిక్ బస్సులను తయారుచేసే ఒలెక్ట్రా గ్రీన్టెక్-బీఐడీ, త్రీవీలర్ వాహనాలను తయారుచేసే గయామ్ మోటార్ వర్క్స్ కంపెనీలకు తెలంగాణలో ఇప్పటికే ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. బస్సులను తయారుచేసే మిత్రా, లీ-ఐయాన్ సెల్/బ్యాటరీ మాన్యుఫ్యాక్చురర్స్, ఎగ్జిమ్ అండ్ చార్జీక్సో కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత తెలిపాయి. ఈ కంపెనీల ప్రతిపాదిత పెట్టుబడుల విలువ రూ.4,600 కోట్లుగా ఉన్నది.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీరంగంలో పెట్టుబడుల తీరు
రాష్ర్టానికి వచ్చే పెట్టుబడుల అంచనా: రూ.30 వేల కోట్లు
ప్రత్యక్షంగా ఉపాధి: 1.20 లక్షల మందికి
పరోక్షంగా ఉపాధి: 2.50 లక్షల మందికి
పాలసీ కాలపరిమితిలో మొత్తం ఇన్సెంటివ్: రూ.1,425.45 కోట్లు (దీంట్లో చార్జింగ్ మౌలిక వసతులు, కచ్చితమైన ఇన్సెంటివ్ రూ.8,25.45 కోట్లు, ఎలక్ట్రానిక్ పాలసీ-2016 ప్రకారం రూ.600 కోట్లు)
పాలసీ ప్రకారం అవసరమైన భూమి: 775 ఎకరాలు
ఒక ఉద్యోగం కల్పన కోసం పెట్టే ఖర్చు: ప్రత్యక్ష ఉపాధి రూ.50 వేలు
కొనుగోలుతోపాటు 15 ఏండ్ల నిర్వహణ వినియోగదారులకు ఆదా అయ్యే మొత్తం: రూ.22,588 కోట్లు
15 ఏండ్లపాటు ఎలక్ట్రిక్ వాహనాలతో తగ్గే కార్బన్డైఆక్సైడ్: 6.61 టెర్రా గ్రాములు (661 కోట్ల కిలోలు)
కంపెనీ పెట్టుబడి (రూ.కోట్లు) భూమి (ఎకరాలు) ఉద్యోగాలు
ఒలెక్ట్ట్రా 1000 100 1395
చార్జిక్సో 1000 50 1200
మిత్రా 6000 20 600
యూకే దేశానికి చెందిన పలు కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఏరో స్పేస్, డిఫెన్స్, హెవీ ఇంజనీరింగ్, ఫుడ్, హెల్త్ కేర్, ఫార్మా, హయ్యర్ ఎడ్యుకేషన్ రంగాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు యూకే- ఇండియా బిజినెస్ కౌన్సిల్ 26 మార్చి, 2019న ఒప్పందం కుదుర్చుకున్నది. హైదరాబాద్లోని యూకేకు చెందిన కంపెనీల్లో ఇప్పటికే 10 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రబ్బర్ వుడ్ పరిశ్రమ ఏర్పాటుకు థాయ్ లాండ్ ప్రభుత్వం అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. హైదరాబాద్ లో 18 జనవరి,2020న జరిగిన ఇండియా-థాయ్ లాండ్ మ్యాచింగ్, నెట్ వర్కింగ్ సెమినార్ లో ఈ ఒప్పందం కుదిరింది. థాయ్ ఉప ప్రధాని జురిన్ లక్సనావిసిత్, మంత్రి కేటీఆర్ ఈ సెమినార్ లో పాల్గొన్నారు.
రాష్ట్రంలో చైనాకు చెందిన ఎలక్ర్టానిక్స్ కంపెనీ స్కైవర్త్ తెలంగాణలో రూ.700 కోట్లతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ యూనిట్ ను 50 ఎకరాల్లో ఏర్పాటు చేయనుంది. దీంతో 5 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త ఫీచర్లనందించే స్కై వర్త్ కంపెనీ మెట్జ్ బ్రాండ్ ఎల్ఈడీ టీవీలను ఇప్పటికే ఉత్పత్తి చేస్తోంది. కంపెనీ రెండోదశ విస్తరణలో లిథియం బ్యాటరీలు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు తయారు చేస్తారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో స్కైవర్త్ గ్రూప్ బోర్డు చైర్మన్ లై వీడ్ 29 నవంబర్ 2019న ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఎంవోయూ కుదుర్చుకున్నారు.
మేకిన్ తెలంగాణలో హైదరాబాద్ దూసుకెళుతున్నది. ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీలో సత్తాచాటుతున్నది. ఈ విభాగంలో గ్లోబల్ లీడర్గా గుర్తింపుపొందిన సామ్సంగ్, ఇతర బహుళజాతి సంస్థలకు చెందిన ఎల్ఈడీ టీవీల తయారీకి హైదరాబాద్ వేదికైంది. రేడియంట్ అప్లయెన్స్ సంస్థ మహేశ్వరంలోని ఫ్యాబ్ సిటీలో అంతర్జాతీయ కొనుగోలుదారులకు ఉపయోగపడే ఎల్ఈడీ టీవీలను తయారు చేస్తున్నది. ఈ విషయమై ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు 11 ఫిబ్రవరి 2020న తన ట్విట్టర్లో అభినందించారు.
2020 సెప్టెంబర్ లో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభం (15 జూన్ 2020)
1985లో మూతపడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రూ.6,120 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టగా పూర్తయ్యాయి. ఈ ఫ్యాక్టరీలో ప్రతిరోజూ 3,850 మెట్రిక్ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. రాష్ట్ర అవసరాలకు 50శాతం ఎరువులు ఇక్కడి నుంచే అందనున్నాయి. 2020 సెప్టెంబర్ లో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. ప్రభుత్వం ఈ ఎరువులను కిసాన్ బ్రాండ్ పేరిట దేశీయ మార్కెట్లోకి తీసుకురానుంది.
తెలంగాణ విద్యుత్ వాహన విధానం 2020-30 (తేదీ 2020 అక్టోబర్ 30)
ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి తెలంగాణను గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధన కోసం 3-డీ మంత్ర (డీ కార్బనైజేషన్, డిజిటైజేషన్, డీ సెంట్రలైజేషన్) విధానంతో ముందుకు వెళ్తున్నది. అలాగే వాయు, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడానికి, సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే, రాష్ట్ర ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంధన నిల్వల పాలసీ-2020-30ని కూడా రూపొందించగా, 2020 అక్టోబర్ 30న హైదరాబాద్ లో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.
మొదటి రోజే రూ. 3,200 కోట్ల పెట్టుబడులు
తెలంగాణ ఈవీ పాలసీ ప్రకటించిన మొదటిరోజే భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. మైత్ర ఎనర్జీ సంస్థ రూ.2 వేల కోట్ల పెట్టుబడిని పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నది. ప్రముఖ ఎలక్ట్రిక్ బస్సుల సంస్థ ఒలెక్ట్రా రూ.300 కోట్లు, ఈటీవో మోటర్స్ రూ.150 కోట్లు, గాయం మోటర్స్ రూ.250 కోట్లు, ప్యూర్ ఎనర్జీ సంస్థ రూ.500 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చాయి. వీటి ద్వారా 14,750 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
రిజిస్ట్రేషన్, రోడ్ టాక్స్ రద్దు
ఈవీ పాలసీ ప్రకారంగా మొట్టమొదటి 2 లక్షల ఎలక్ట్రిక్ బైకులు, 20 వేల ఆటోలు, 5 వేల ప్యాసింజర్ వెహికిల్స్, 5 వేల కార్లు, 500 బస్సులు, రవాణా చేసే 10వేల ఆటో ట్రాలీలు, త్రీ వీలర్స్, ట్రాక్టర్లకు (రవాణాశాఖ నిబంధనల ప్రకారం) రిజిస్ట్రేషన్ చార్జీలు, రోడ్డు పన్ను రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చార్జింగ్ స్టేషన్లకు, బ్యాటరీ సంస్థలకు రాయితీలు అందిస్తున్నది. ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్, ఆటోమొబైల్ పార్క్, మొబిలిటీ పార్క్ను ఏర్పాటు చేస్తున్నది.
ఎలక్ట్రిక్ వాహన పాలసీ ముఖ్యాంశాలు..
-రూ.200 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ చేపట్టే పరిశ్రమలకు రూ.30 కోట్లకు తగ్గకుండా 20 శాతం ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ.
-రూ.25 కోట్లకు తగ్గకుండా 7 ఏండ్లపాటు జీఎస్టీ తిరిగి చెల్లింపు.
-ఐదేండ్లపాటు రూ.5 కోట్ల పరిమితితో 25 శాతం విద్యుత్ సబ్సిడీ.
-రూ.5 కోట్లకు తగ్గకుండా ఐదేండ్లపాటు 60 శాతం రవాణా రుసుము, రూ.5 కోట్లకు తగ్గకుండా 5.25 శాతం వడ్డీ రాయితీ.
-పారిశ్రామిక ప్రాంతాల్లో వాహనాల తయారీ, ఇంధన నిల్వల కంపెనీలకు ప్రోత్సాహం.
-స్టాంపు డ్యూటీ బదిలీ, రిజిస్ట్రేషన్ రుసుముల నుంచి మినహాయింపు.
-కొత్త రకం ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పరిశోధన, అభివృద్ధి కేంద్రాల స్థాపన రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు.
-ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలు
-తొలి రెండు లక్షల ఎలక్ట్రిక్ బైకులకు, ఇరవై వేల ఆటోలకు, ఐదు వేల ప్యాసింజర్ వెహికిల్స్కు, ఐదు వేల కార్లకు, ఐదు వందల బస్సులకు, రవాణా చేసే పదివేల త్రీవీలర్స్కు, ట్రాక్టర్లకు(రవాణాశాఖ నిబంధనల ప్రకారం) రిజిస్ట్రేషన్ చార్జీలు, రోడ్డు పన్ను రద్దు.
-పారిశ్రామిక లాజిస్టిక్స్, రవాణా కేంద్రాల పరిధిలో రాత్రిపూట పార్కింగ్, చార్జింగ్ సదుపాయాల కల్పన.
-ఆటోలకు అదనంగా ఫిట్మెంట్ రాయితీల కింద రూ.15 వేలకు మించకుండా 15 శాతం రాయితీ.
చార్జింగ్ సౌకర్యాలు
-హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో వాహనాలకు ప్రత్యేక చార్జింగ్ కేంద్రాలు.
-రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ ద్వారా చార్జింగ్ కేంద్రాలకు ప్రత్యేక ఫీజు వసూలు.
-టౌన్ షిప్లలో చార్జింగ్ కేంద్రాల స్థాపనకు వెసులుబాటు.
-మహా నగరాలకు వెళ్లే జాతీయ రహదారుల పక్కన ప్రతి 50 కిలోమీటర్ల చొప్పున చార్జింగ్ కేంద్రాలు.
– ఆర్టీసీ, మెట్రో రైల్ సంస్థలు తమ డిపోల వద్ద ద్విచక్ర వాహనాలకు చార్జింగ్ కేంద్రాలు.
ఎలక్ర్టికల్ వాహన కొనుగోలుదారులకు ప్రభుత్వం రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి మినహాయింపును కల్పించడంతో ఒక్కో కొనుగోలుదారునికి రూ.6,330 నుంచి 10,110 వరకు లబ్ధి చేకూరుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.300లు ఉండగా, రోడ్ ట్యాక్స్ వాహన ధరలనుబట్టి రూ.6,030 నుంచి 9,810 వరకు ఉన్నది. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ వాహన ధరలను ఒక్కసారి పరిశీలిస్తే..
అథర్:
ఈ సంస్థ రెండు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నది. అథర్ 450 ఎక్స్షోరూం (ఢిల్లీ) ధర రూ.1.13 లక్షలు. వేరియంట్ను బట్టి 50ఎక్స్ మోడల్ ధర (హైదరాబాద్) రూ.1.42-1.61 లక్షలుగా ఉన్నది.
టీవీఎస్ మోటర్:
టీవీఎస్ మోటర్ ఇటీవలే ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్కు పరిచయం చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.09 లక్షలు. గంటకు 78 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. త్వరలో క్రెయాన్ మోడల్నూ తీసుకురానుండగా, దీని ధర రూ.70వేలు ఉంటుందని అంచనా.
హీరో ఎలక్ట్రిక్: హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్, ఆప్టిమా, ఎన్వైఎక్స్, డాష్, ఫోటాన్ మోడళ్లను విక్రయిస్తున్నది. వీటి ఎక్స్షోరూం (ఢిల్లీ) ధరల శ్రేణి రూ.41వేల నుంచి 80 వేల వరకు ఉన్నది.
రివోల్ట్ :
రివోల్ట్ ఆర్వీ400 మోటర్సైకిల్. దేశంలోనే తొలి కృత్రమ మేధస్సు (ఏఐ) ఆధారిత బైక్. గంటకు 85 కిలోమీటర్ల వేగం దీని సొంతం. దీని ఎక్స్షోరూం (ఢిల్లీ) ధర రూ.98,999-1.03 లక్షలు.
బజాజ్ ఎలక్ట్రిక్:
ఒకప్పుడు ఎంతో ప్రజాదరణ పొందిన చేతక్ పేరిట ఎలక్ట్రిక్ స్కూటర్ను బజాజ్ అందుబాటులోకి తెచ్చింది. దీని ఎక్స్షోరూం (హైదరాబాద్) ధర రూ.1.15 లక్షలు.
ఎంజీ జెడ్ఎస్ ఈవీ కారు:
ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 20.88 లక్షల నుంచి రూ. 23.58 లక్షల మధ్య ఉన్నది. ఒక్క చార్జింగ్పై 340 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు.
తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది
సినీ నటుడు విజయ్ దేవరకొండ ప్రశంసలు (30.10.2020)
తెలంగాణ రాష్ర్టం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని సినీ నటుడు విజయ్ దేవరకొండ ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అద్భుతమైన కొత్త పాలసీలతో రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారని అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం రూపొందించిన నూతన ఎలక్ర్టిక్ వెహికిల్ (ఈవీ) పాలసీ విడుదల కార్యక్రమంలో విజయ్ దేవరకొండ పాల్గొని ప్రసంగించారు. గతంలో సమస్యలు వస్తే పరిష్కరించేందుకు చాలా సమయం పట్టేది.. ఇప్పుడు ఆ సమస్య లేదన్నారు. ముందు చూపుతో సమస్యలను వీలైనంత త్వరగా ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు.
కరువు ప్రాంతాలైన నల్లగొండ, పాలమూరు జిల్లాలకు కూడా సాగు నీరు వచ్చిందని, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం, సాగునీరు రావడం వల్ల రైతులు రెండు పంటలు వేసుకుంటున్నారని, భూముల ధరలు కూడా పెరిగాయన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు కూడా భారీగా వస్తున్నాయని తెలిపారు. ఎలక్ర్టిక్ వెహికల్స్ వచ్చాయని, దీంతో హైదరాబాదీల లైఫ్ స్టైల్ మారబోతుందని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు.
హైదరాబాద్ లో చైనా ఒప్పో కంపెనీ 5జీ ల్యాబ్ (1 జూన్ 2020)
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘ఒప్పో’ తన ఫైవ్(5)జీ ఇన్నోవేషన్ ల్యాబ్ను హైదరాబాద్లో నెలకొల్పింది. ఒప్పో సంస్థ చైనాకు వెలుపల ఓ ప్రయోగశాలను స్థాపించడం ఇదే మొదటిసారి. దీనితోపాటు త్వరలో మరో మూడు ప్రయోగశాలలను కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్టు ఒప్పో సంస్థ వెల్లడించింది. హైదరాబాద్లోని తమ పరిశోధన, అభివృద్ధి సంస్థలో నూతన ఆవిష్కరణల కోసం కెమెరా, పవర్- బ్యాటరీ, పనితీరును మెరుగుపరిచే మూడు క్రియాశీలక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. పశ్చిమాసియా, దక్షిణాసియా, ఆఫ్రికా, జపాన్, యూరోప్కు ఇక్కడి నుంచి తమ నూతన ఆవిష్కరణలను సరఫరా చేస్తామని కంపెనీ తెలిపింది. ఒప్పో ఆర్ అండ్ డీ బృందం భారత్లోని జియో, ఎయిర్టెల్, క్వాల్కాం, మీడియాటెక్తో కలిసి పనిచేస్తున్నది. ఐరోపా మార్కెట్లో తొలి 5జీ మొబైల్ ఫోన్లను ఆవిష్కరించిన ఒప్పో భారత్లో 5జీ వాట్సాప్ కాల్ను ప్రవేశపెట్టింది.
రాష్ట్రంలో హిందూస్థాన్ శానిటరీ వేర్ ప్లాంట్ (28.10.2020)
దేశంలోనే అతి పెద్ద గ్లాస్, ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ దిగ్గజం హిందూస్థాన్ శానిటరీవేర్, ఇండస్ట్రీస్ తెలంగాణ రాష్ట్రంలో రూ.320 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ నిధులతో భువనగిరి వద్ద నూతన గ్రీన్ ఫీల్డ్ స్పెషాలిటీ గ్లాస్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. 2022 చివరినాటికి ఇది ఉత్పత్తి ప్రారంభించనుంది. ఈ సంస్థ సనత్ నగర్, భువనగిరిలో ఏఐజీ గ్లాస్ ప్యాక్ కు ఒక్కో ఉత్పాదక కేంద్రం ఉన్నది. రోజుకు 1,600 టన్నుల కంటైనర్ గ్లాస్ తయారవుతున్నది. సంగారెడ్డిలో పైపులు, ఫిట్టింగ్స్ తయారీ ప్లాంట్ ఉండగా దాన్ని విస్తరించనున్నారు.
హైదరాబాద్ లో ఈ-చేతక్ ప్లాంట్ (25 అక్టోబర్ 2020)
ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ కోసం తెలంగాణణలో ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నది. 2025 నాటికి కొత్తగా ఉత్పత్తి అయ్యే ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో 80శాతం వాహనాలను ఎలక్ర్టిక్ వెహికల్స్ గా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్లాంట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం అవసరమైన భూమిని ఇస్తూ, భారీగా ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తున్నది.అలాగే, ఈవీ కొనుగోలుదారుల కోసం పన్ను మినహాయింపులు కూడా ఇస్తున్నది. దీంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ప్రకటించారు.
కొత్తగా 8 ఎస్ఎంఈ పార్కులు (11 నవంబర్ 2020)
రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏడాదిలోగా కొత్తగా 8 ఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయడంతోపాటు, మరో 12 ఎస్ఎంఈలను అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురంలో 400 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసింది. అదే తరహాలో ఒక్కోటి 50 నుంచి 60 ఎకరాల చొప్పున కొత్తగా 8 చిన్న, మధ్యతరహా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఉన్న 12 ఎస్ఎంఈ పార్కులను రూ.120 కోట్లతో అప్ గ్రేడ్ చేయనున్నారు.
ఫోర్బ్స్ జాబితాలో తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్త కీర్తిరెడ్డి (5.2.2021)
ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన 30 మంది యువ ప్రతిభావంతుల జాబితాలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన కొత్త కీర్తిరెడ్డి(24)కి చోటు దక్కింది. ఫోర్బ్స్ ఇండియా అండర్-30 జాబితాలో ఈమె స్థానం సంపాదించారు. కీర్తిరెడ్డి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కుమార్తె. ఈమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ నుంచి గ్లోబల్ మాస్టర్స్ పట్టా పొందారు. సింగపూర్కు చెందిన సైప్లె చైన్ కంపెనీ క్యూనికస్తో కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతం స్టాట్విగ్ అనే వ్యాక్సిన్ ట్రాకింగ్ కంపెనీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఈమె ఆ సంస్థ సహ వ్యవస్థాపకురాలు కూడా. ఫార్మా కంపెనీల్లో తయారైన వ్యాక్సిన్ గమ్యస్థానాలకు చేరేదాకా నిరంతరం పర్యవేక్షించేలా వ్యాక్సిన్ ట్రాకింగ్ విభాగాన్ని కీర్తి నిర్వహించి సత్ఫలితాలను సాధించారు.
పరిశ్రమలకు అత్యుత్తమ గమ్యస్థానం తెలంగాణ
బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలిల్ గుప్తే ప్రశంస (5.2.2021)
నిపుణులైన మానవ వనరులు, ఉత్తమ మౌలిక వసతులు, వ్యాపార అనుకూల విధానాలు, బాధ్యతాయుతమైన ప్రభుత్వం కలిపి తెలంగాణను ఆదర్శంగా నిలుపుతున్నాయని బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలిల్ గుప్తే కొనియాడారు. ప్రఖ్యాత విమానాల తయారీ సంస్థ బోయింగ్ తన ‘737 మోడల్’ విమానాల తోక భాగంలోని నిలువు రెక్కలను (వర్టికల్ ఫిన్ స్ట్రక్చర్స్) హైదరాబాద్లో ‘టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్’లో తయారు చేయనున్నట్టు 5.2.2021న ప్రకటించింది. ఈ సందర్భంగా గుప్తే మాట్లాడుతూ.. ‘నిపుణులైన మానవ వనరులు, అత్యుత్తమ మౌలిక వసతులు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దీనికితోడు బాధ్యతాయుతమైన ప్రభుత్వం, అధికార యంత్రాంగం.. ఈ లక్షణాలు తెలంగాణను పరిశ్రమలకు అత్యుత్తమ గమ్యస్థానంగా నిలిపాయి’ అని ప్రశంసించారు. ఈ ప్రకటనతో తెలంగాణలో అదనంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు శిక్షణ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.