తెలంగాణ రాష్ట్రంలో 31 మే 2021 నాటికి కరోనా పాజిటివ్ కేసులు మొత్తం 5,78,351 నమోదు కాగా, ఇందులో మొత్తం 5,40,986 మంది రికవరీ అయ్యారు. కరోనా కారణంగా మొత్తం 3,281 మంది మరణించారు.
ఇంటింటి జ్వర సర్వే :గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 17 లక్షల 14 వేల ఇండ్లలో, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 21 లక్షల 24 వేల ఇండ్లలో జ్వర సర్వే చేశారు. వీరందరికీ కరోనా మందుల పంపిణీ జరిగింది. 1 కోటి మందికి ఉచితంగా నిత్యావసర వస్తువులు ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో 44 సెంటర్ల ద్వారా 10 లక్షల మందికి భోజనం అందించారు.
కరోనా వైరస్ పుట్టుక : కరోనావైరస్ (కొవిడ్ – 19) ను మొదట చైనాలోని వుహాన్ నగరంలో 2019 నవంబర్ మాసంలో పుట్టినట్లు చైనీస్ పత్రిక ‘సౌత్ మార్నింగ్ పోస్ట్’ ప్రకటించినప్పటికీ, దాన్ని నెల తర్వాత డిసెంబరు 1 న గుర్తించారు. ఈ వైరస్ ను మొదట లీ వెన్లియాంగ్ అనే చైనా వైద్యుడు గుర్తించాడు. దీంతో వుహాన్లో ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్ లో ఈ వైరస్ పుట్టిందని చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మార్కెట్ ద్వారానే వైరస్ వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. వైరస్ కారణంగా వుహాన్లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్ను లండన్కు పంపించి పరిశోధనలు నిర్వహించారు. పరిశోధనల్లో “కరోనావైరస్”గా గుర్తించారు.
వైరస్ లక్షణాలు : కరోనా వైరస్ (కొవిడ్ – 19) అనేది ప్రధానంగా శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కరోనా వైరస్ చాలా సాధారణంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రారంభ లక్షణాలతో దానిని గుర్తించవచ్చు. వ్యాది సోకిన వ్యక్తిలో వైరస్ లక్షణాలు బయటపడడానికి కనీసం 5 రోజుల నుంచి 14 రోజులు పడుతుంది. వ్యాధికి ఎటువంటి టీకాలు, మందులు లేవు. నివారణ ఒక్కటే మార్గం. ఈ వైరస్ కణాలు చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి. ఓ గుండు సూది మొన మీదనే కొన్ని కోట్ల వరకు ఈ కణాలు ఉంటాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
వైరస్ వ్యాప్తిచెందే తీరు : ఇది ఒక అంటువ్యాధి. మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తిస్తుంది. ఒక వ్యక్తి మరో వ్యక్తిని తాకినా, వ్యక్తి దగ్గినప్పుడో, తుమ్మినప్పుడో నోటి నుండి వచ్చే తుప్పర్ల ద్వారా వేరే వారికి సోకుతుంది. కరోనా సోకిన వ్యక్తి ఏదైనా వస్తువును తాకినప్పుడు ఆ ప్రాంతం వైరస్ తో కలుషితమవుతుంది. వైరస్ తో కలుషితమైన ఏ ప్రాంతాన్నైనా వేరే వ్యక్తి ముట్టుకున్నా, తాకినా వైరస్ వారికి అంటుకుంటుంది. వారికి అంటిన వైరస్ కణాలు కళ్ళు , ముక్కు , నోటి ద్వారా ఇది శరీరంలోకి చొరబడుతుంది. శరీరంలోకి ప్రవేశించిన వైరస్తో మొదట గొంతు, శ్వాస నాళాలు, ఊపిరితిత్తుల్లో ఉన్న కణాలలోకి ఇది వ్యాపిస్తుంది. శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతింటుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని ఈ వైరస్ దెబ్బతీస్తుంది. చివరగా మనుషులు ప్రాణాలు కోల్పోతారు. ఈ వైరస్ గాలిద్వారా వ్యాపించదని నిర్ధారించబడింది. రోగనిరోధక శక్తి అధికంగా ఉన్నవారు ఈ వ్యాది నుంచి కోలుకుంటారు. చిన్న పిల్లల్లో, వయసు పై బడిన వారిలో ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉంటుంది.
వైరస్ నివారణా మార్గాలు : మనుషుల నుంచి మనుషులకు ఈ వైరస్ చేరుతుంది. వైరస్ తో కలుషితమైన ప్రాంతాలను ఎవరైనా తాకినప్పుడు అది వారికి వ్యాపిస్తుంది. వ్యక్తులు తుమ్మినా, దగ్గినా వారి నోటి నుండి వచ్చే తుప్పిర్ల ద్వారా ఇతరులకు వైరస్ వ్యాప్తిస్తుంది. కనుక వైరస్ నివారణకు వ్యక్తిగత దూరం పాటించడం, వ్యక్తిగత శుభ్రత, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే మార్గం. ఇందుకు వివిధ దేశాలు ప్రజలను ఎక్కడికక్కడ నిలువరించటం కోసం లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి
వైరస్ చైనా నుంచి విదేశాలకు వ్యాప్తి : వైరస్ చైనా లోని వూహన్ నగరం నుంచి క్రమంగా ఆ దేశమంతా వ్యాప్తించింది. సాధారణంగా చైనా నుంచి ప్రతీరోజూ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు వేలసంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగించేవారు. చైనాలో ఈ వైరస్ వ్యాప్తితో అప్రమత్తమైన ఇతర దేశాల వారంతా స్వదేశాలకు తిరుగు పయనమయ్యారు. కానీ అప్పటికే వైరస్ చైనా అంతటా వ్యాపించింది. విదేశీయులకు కూడా చాలా మందికి ఈ వ్యాధి ప్రబలింది. వీరిలో అమెరికా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాలకు చెందిన వారు ఎక్కువగా ఉండడంతో ఈ దేశాల్లో వైరస్ ముందుగా వ్యాపించింది. మిగతా ఇతర దేశాలకు కాస్త ఆలస్యంగా అంటుకున్నది. చైనాలో నవంబర్ లో పుట్టిన వైరస్ ఆయా దేశాలను చుట్టుముట్టి నాలుగు నెలల తర్వాత భారతదేశం దాకా వచ్చింది.
భారతదేశంలో ప్రవేశించిన కరోనా వైరస్ : చైనాలోని వూహాన్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న కేరళ విద్యార్థినితోపాటుగా కరోనా కోవిడ్-19 వైరస్ భారత్ లో ప్రవేశించింది. ఆ విద్యార్థిని ప్రభుత్వం 2020 జనవరి 30న గుర్తించింది. భారతదేశం నుండి చైనా మధ్య క్రమం తప్పకుండా ప్రయాణించే ఓ వ్యక్తి ద్వారా ఫిబ్రవరి 2 న కేరళలో రెండవ కేసు, ఫిబ్రవరి 3 న కేరళలోనే మూడవ కేసు నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తితో విదేశాల్లోని భారతీయులు స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. వీరి ద్వారా కరోనా వైరస్ క్రమంగా భారతదేశం అంతటా వ్యాపించింది.
రాష్ట్రంలోకి ప్రవేశించిన కరోనా వైరస్ : తెలంగాణ రాష్ట్రంలో మొదటి కరోనా కేసు 2 మార్చి, 2020 న నమోదయ్యింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి అనారోగ్య కారణాలతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరగా.. అతని నమూనాలను పరీక్షించగా అతనికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇదే తెలంగాణలో నమోదైన మొదటి కరోనా కేసు. ఇలా విదేశాల నుంచి వచ్చిన వారితో క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందింది. అయితే, మొదటి కేసు నమోదయిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.
అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం : దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అవ్వగానే తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ అత్యవసరంగా సమావేశమయ్యారు. కరోనా విషయంపై అసెంబ్లీలో చర్చిస్తామని మార్చి 6న జరిగిన బీఏపీ సమావేశంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 7 మార్చి, 2020న కరోనాపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం కేసీఆర్, మార్చి 13న కరోనాపై విస్తృత చర్చ జరిపారు.
020 ఫిబ్రవరి 12 రోజునే కరోనా విషయాన్ని ప్రస్తావించిన సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమంపై 12 ఫిబ్రవరి 2020న కలెక్టర్లతో జరిపిన సమావేశంలోనే సీం కేసీఆర్ కరోనాపై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా శుభ్రంగా ఉంటూ, పరిసరాల పరిశుభ్రత పాటించినట్లయితే కరోనా లాంటి అంటువ్యాధులు రాకుండా చూడవచ్చన్నారు.
మార్చి 14 నుంచి పాక్షిక లాక్ డౌన్ అమలు: కరోనా వ్యాప్తిని నిరోధించడానికి లాక్డౌన్ ఒక్కటే మార్గమని నిర్ణయించిన ముఖ్యమంత్రి, మార్చి 14 నుంచే తెలంగాణ రాష్ట్రంలో పాక్షిక లాక్డౌన్ అమలుచేశారు. జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే విద్యాసంస్థలు, సినిమాహాళ్లు, ఫంక్షన్హాళ్లు, క్లబ్బులు, పబ్బులు, బార్లు మూసివేశారు. కేసీఆర్ ప్రకటించిన పదిరోజుల తరువాత 24 మార్చి, 2020న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 19 నుంచి రాష్ట్ర సరిహద్దుల వద్ద నిఘా ఏర్పాటుచేసి, ఇతర రాష్ర్టాల నుంచి రాకపోకలపై ఆంక్షలు విధించింది. దేశవ్యాప్తంగా మార్చి 24 నుంచి రాకపోకలు బంద్ అయ్యాయి. విదేశాల నుంచి వచ్చే విమానాలను బంద్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 20న ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కోరగా.. ఆయన వెంటనే స్పందించి, అదేరోజు రాత్రి విదేశీ విమానాల రాకపోకలను బంద్ చేశారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ర్టానికి వచ్చే రైళ్లను కూడా బంద్ చేయాలని కేసీఆర్ ముందుగానే కోరారు.
22 మార్చి – జనతా కర్ఫ్యూ : ప్రధాని మోదీ పిలుపు మేరకు తేదీ 22 మార్చి 2020 ఆదివారం 14 గంటలపాటు జనతా కర్ఫ్యూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగింది. సాయంత్రం 5 గంటల సమయంలో రాష్ట్రం ప్రజానీకమంతా ఇండ్ల బాల్కనీలలోకి వచ్చి చప్పట్లు కొడుతూ ప్రజలు తమ సంఘీబావాన్ని తెలిపారు. జనతాకర్ఫ్యూకు కొనసాగింపుగా కేసీఆర్ మరో పదిగంటల పాటు (సోమవారం ఉదయం 6 గంటల వరకు) కర్ఫ్యూని పొడిగించి 24 గంటల పాటు పాటించారు.
మొదట తెలంగాణలో మార్చి 31 వరకు లాక్ డౌన్ : కరోనా కట్టడికి ప్రభుత్వం తెలంగాణలో 1897 ఎపిడమిక్స్ డిసీజెస్ యాక్ట్ ను 23 మార్చి నుంచి అమలు చేసింది. వ్యాధులు ప్రబలినపుడు అత్యవసర సమయాల్లో ఈ చట్టాన్ని అమలు చేస్తారు. ఈ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రం మార్చి 31 వరకు లాక్ డౌన్ లో ఉంటుంది. విద్యాశాఖ సంబంధిత కార్యకలాపాలన్నీ బంద్ చేశారు. విమానాల రాకపోకలు నిలిపి వేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఉన్న సరిహద్దులన్నీ మూసివేశారు. సినిమాహాళ్లు, ఫంక్షన్హాళ్లు, క్లబ్బులు, పబ్బులు, బార్లు, వైన్సులు మూసివేశారు. ప్రజారవాణా పూర్తిగా నిలిపివేశారు.
లాక్ డౌన్ లో మినహాయింపు నిచ్చిన రంగాలు
లాక్ డౌన్ సమయంలో అత్యవసర (ఎమర్జెన్సీ) సేవలను 100 శాతం కొనసాగించారు. వైద్య సిబ్బంది, పోలీసు శాఖ, పారిశుద్య సిబ్భంది సేవలను వినియోగించుకున్నారు. ప్రజలకు నిత్యావసర సరుకుల కొరత రాకుండా వారి కోసం కిరాణా షాపులకు, కూరగాయల మార్కెట్లకు, పాల డెయిరీలకు కూడా మినహాయింపు నిచ్చారు. వీటి రవాణా కోసం వాహనాలకు పాస్ లు మంజూరు చేశారు. సరుకుల రవాణా వాహనాలకు అనుమతినిచ్చారు. నిత్యావసరాల, ఆరోగ్యశాఖకు అవసరమైన ఉత్పత్తుల, ఆహార పరిశ్రమలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపునిచ్చారు. 26 రకాల పరిశ్రమలు తెరిచి ఉంచేందుకు అనుమతి నిచ్చారు. నీరు, విద్యుత్ సరఫరా, ఫైర్ సర్వీసు, గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకులు పనిచేస్తున్నాయి.డాక్టర్లకు భారం కాకుండా ఉండేందుకు అత్యవసరంకాని శస్త్రచికిత్సలు వాయిదా వేశారు. ప్రసవానికి దగ్గరగా ఉన్న గర్భిణుల కోసం అమ్మఒడి వాహనాలు సిద్ధంగా ఉంచారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, అసంఘటిత కార్మికులకు వేతనాలను యాజమాన్యాలు చెల్లించాలని ఆదేశించారు.
మర్కజ్ ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చి, కేంద్రాన్ని అప్రమత్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
‘మర్కజ్’ ప్రార్థనల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తతతో వ్యవహరించడం దేశానికి ఎంతో ఉపయోగపడింది. మార్చి 18న కరీంనగర్లో ఇండోనేషియా నుంచి వచ్చిన ఏడుగురికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు వారి మూలాలను వెతికారు. వారు మార్చి 13-15 వరకు ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొని వచ్చారని, అక్కడే కరోనా సోకిందని గుర్తించారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సమాచారం ఇచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ర్టాలు అప్రమత్తమయ్యాయి. మర్కజ్ వెళ్లి వచ్చేవారిని గుర్తించి, వైద్యం అందించడం ప్రారంభించాయి.
ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ : 2020 మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించగా, మార్చి 27 న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ ను ప్రకటించారు. లాక్ డౌన్ ముగిసే సమయం దగ్గరకు వస్తున్నప్పటికీ కరోనా కేసుల సంఖ్య తగ్గక పోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పూర్తి స్థాయి కర్ఫ్యూ ని అమలు చేయాలని నిర్ణయించింది.
ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు : కరోనా కేసులు నియంత్రణ కాకపోవటంతో ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను 12 ఏప్రిల్ 2020 న విడుదల చేశారు. గతంలో లాక్ డౌన్ లో అమలైన నియమనిబంధనలే ఇప్పుడూ అమలవుతాయి. లాక్ డౌన్ ను పొడిగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ 6వ తారీఖునే ప్రధానికి వినతి చేశారు. ఆ తర్వాత అనేక రాష్ర్టాలు అదే డిమాండ్ చేశాయి. చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ అభిప్రాయంతో ఏకీభవించి లాక్డౌన్ను మే నెల 3 వరకు పొడిగించింది. ఏప్రిల్ 20 నుంచి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నుంచి కొన్ని రంగాలకు సడలింపులు కల్పించింది.
మే 7 వరకు లాక్ డౌన్ పొడిగింపు : ఏప్రిల్ 19న రాష్ట్రం ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ ను నిర్వహించింది. ఈ సమావేశంలో లాక్ డౌన్ ను మే 7 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 20 నుంచి కేంద్ర ప్రభుత్వం కొన్ని రంగాలకు సడలింపులు కల్పించింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు.. వైరస్ వ్యాప్తి దృష్ట్యా లాక్ డౌన్ యదావిధిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.
మే 29 వరకు లాక్ డౌన్ కొనసాగింపు : మే 7 వరకు లాక్ డౌన్ కొనసాగినప్పటికీ కరోనా పాజిటివ్ సంఖ్యలు పూర్తిగా తగ్గలేదు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే కేసుల సంఖ్య మాత్రం చాలా వరకు తగ్గింది. ఈ సమయంలో లాక్ డౌన్ ఎత్తెయ్యడం వల్ల ఇన్ని రోజులు పడ్డశ్రమ అంతా వృదాఅయ్యి మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వం మే 29 వరకు లాక్ డౌన్ ని పొడిగించింది. అయితే కొన్ని రంగాలకు మాత్రం సడలింపులు కల్పించింది. సడలింపులకు సంబంధించి ప్రభుత్వం 7 మే, 2020న మార్గదర్శకాలను విడుదలచేసింది. ఈ మార్గదర్శకాలను కచ్చితంగా అమలుచేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు ఉన్న లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగించింది. ఇండ్ల నుంచి పనులకోసం బయటకు వచ్చేవారు విధిగా మాస్క్ ధరించాలని, మాస్క్ లేకుండా బయటకు వస్తే రూ.1000 జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.
మే 31 వరకూ లాక్ డౌన్ కొనసాగింపునకు కేబినెట్ నిర్ణయం
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 18 మే 2020న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగింది. అనంతరం ప్రగతిభవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేబినెట్ నిర్ణయం మేరకు రాష్ట్రంలో మే నెల 31 వరకు లాక్డౌన్ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటివరకు రాత్రిపూట కర్ఫ్యూ యథావిధిగా ఉంటుందన్నారు. 31 తరువాత లాక్డౌన్ కొనసాగింపుపై ఆలోచిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాలు తప్ప అన్ని జోన్లను గ్రీన్ జోన్లుగా రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు నడుస్తాయని పేర్కొన్నారు. సెలూన్లు సహా అన్ని దుకాణాలకు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు పూర్తి అనుమతినిస్తున్నట్టు తెలిపారు. అయితే అందరూ కొవిడ్-19 నిబంధనలను పాటించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో 17 వేల బెడ్లు రెడీగా ఉన్నాయని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వ సన్నద్ధంగా ఉందని, వెనుకాముందు చూసుకొనే సడలింపులు ఇస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఐదో విడత లాక్ డౌన్ విధించింది. 2020 జూన్ 30 వరకూ ఈ లాక్ డౌన్ -5 కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఇప్పటివరకు నాలుగుదశల్లో అమల్లో ఉన్న మార్గదర్శకాలే ఐదో దశ లాక్ డౌన్ లోనూ ఉంటాయని పేర్కొంది. అయితే కర్ఫ్యూ లాక్డౌన్ జూన్ 30 వరకు కంటైన్మెంట్ జోన్ల వరకే ఆంక్షలు పరిమితం అవుతాయి. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కొనసాగనుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్ తెరిచేందుకు కేంద్రం అనుమతించింది. బార్లు, సినిమా హాళ్లు, పార్కులు, మెట్రో రైళ్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు బంద్ కొనసాగిస్తారు. విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ లాక్ డౌన్ సమయంలో నిరుపేదలు ఆకలితో ఎలాంటి ఇబ్బంది పడకుండా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికానికి నిత్యావసరాల సమస్యలు తలెత్తకుండా, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగు ప్రణాళికలతో ముందుకు సాగింది. అందుకు తగు చర్యలు చేపట్టింది. కరోనా వ్యాప్తి నివారణకు, కరోనా సహాయక చర్యలకు అవసరమయ్యే నిధుల సమీకరణకూ ప్రణాళికలు రూపొందించింది.
సాదారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా 87.59 లక్షల తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున ఉచిత బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ.1,500 నగదు పంపిణీ చేయాలని మార్చి 22న ప్రకటించింది. ఏప్రిల్ నెలకు మొత్తం రూ.1103 కోట్ల విలువైన 3.36 లక్షల టన్నుల బియ్యాన్ని ఉచితంగా అందించింది. ఏప్రిల్ 14 న రేషన్ కార్డుదారులకు నిత్యావసరాలకై రూ.1500 చొప్పున వారి వారి బ్యాంక్ అకౌంట్లలో నగదును జమ చేసింది. ఇందు కోసం రూ.1314 కోట్ల రూపాయలను విడుదల చేసింది. బియ్యం, నగదు కలిపి మొత్తం రూ.2,417 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. మే నెలలో కూడా లాక్ డౌన్ కొనసాగినందున మే, రెండో తేదీ నుంచి రేషన్ బియ్యం పంపిణీని ప్రారంభించింది. మే నెలలో బియ్యంతోపాటు కందిపప్పును కూడా అందించారు. రూ.1500 నగదును బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. తెల్ల రేషన్ కార్డుదారుల్లో ప్రతీ ఒక్కరికి జూన్ నెలలో కూడా 12 కిలో బియ్యం ఇస్తారు. లాక్ డౌన్ సడలింపులతో పేదలకు, కార్మికులకు ఉపాధి దొరుకుతుంది కాబట్టి, ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఇచ్చే 1500 రూపాయలు జూన్ నెల నుంచి ఇవ్వదు.
బ్యాంకు ఖాతాలున్న74,07,186 మంది రేషన్ కార్డుదారులకి 14 ఏప్రిల్, 2020 నాటికి రూ.1500 చొప్పున వారివారి ఖాతాల్లో జమచేశారు. ఖాతాల్లేని 5,21,641 మందికి పోస్టాఫీసుల్లో జమచేశారు. దీనికి రూ.78.24 కోట్లును జీపీఓ హైదరాబాద్ ఖాతాలో వేశారు. వలస కార్మికులకు రూ.30 కోట్లను అందించారు.
కరోనా (కోవిడ్ -19) వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ తో ఈ రాష్ట్రాన్ని నమ్ముకొని వచ్చిన వలస కార్మికులను అభివృద్ధి భాగస్వాములుగా ప్రకటించిన సీఎం కేసీఆర్ వారిని ఆదుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు, బిల్డింగ్, రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణ పనుల్లో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం 12 కిలోల బియ్యం, రూ.500 చొప్పున నగదు అందించింది. ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయించి, ప్రతిరోజూ భోజనాలు కూడా పెట్టి, దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలందుకున్నది. ఈ క్రమంలోనే వలస కార్మికుల కోరిక మేరకు దాదాపు 2 లక్షల మందికి పైగా ఉచితంగా వారి స్వస్థలాలకు సగౌరవంగా పంపించింది. దేశం మొత్తం మీద దాదాపు 2 లక్షల మంది వలస కార్మికులను సగౌరవంగా తమ స్వరాష్ట్రం పంపించింది ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే!
కరోనా లాక్ డౌన్ తో వివిధ రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వచ్చిన వలస కూలీలు, వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగాలు, చదువుల కోసం వచ్చిన యువకులు, విద్యార్థులు భోజనానికి ఇబ్బందులు పడకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైదరాబాద్ అంతటా 300 అన్నపూర్ణ ఉచిత భోజనం సెంటర్లను ఏర్పాటు చేసి, విజయవంతంగా నిర్వహిస్తున్నది. మరేవైనా ప్రాంతాలకు భోజనం సెంటర్లు అవసరమైన పక్షంలో 040-21111111 నంబరుకు ఫోన్ చేసి తెలిపితే మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో తెలంగాణ ప్రభుత్వం ఖర్చు విషయంలో ఎంత మాత్రం రాజీపడటంలేదు. వైరస్ రాష్ట్రానికి ప్రవేశించిన వెంటనే ప్రత్యేక వ్యూహంతో ముందస్తు చర్యలు చేపట్టింది. మార్చి 2న తొలి పాజిటివ్ కేసు నమోదైన క్షణాన్నే రాష్ట్రంలో అప్రమత్త చర్యలు చేపట్టింది. ఏప్రిల్ చివరి నాటికి పలు విడుతల్లో రూ.3,410.09 కోట్లు విడుదల చేసింది. ఇందులో వైద్య ఆరోగ్య శాఖకు రూ.797.69 కోట్లు, సీఎం ఇన్సెంటివ్ కు రూ.88.07 కోట్లు, పోలీసు శాఖకు రూ.53.53 కోట్లు, పౌరసరఫరాల శాఖకు ర.2,446.96 కోట్లు, రెవెన్యూ శాఖకు రూ.23.84 కోట్లు కేటాయించింది. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన కుటుంబాలను, వలస కూలీలను ఆదుకొనేందుకు, తమ ప్రాణాలను ఎదురొడ్డి సేవలందిస్తున్న వైద్య, జీహెచ్ఎంసీ, మున్సిపల్, గ్రామపంచాయతీల పరిధిలోని కొవిడ్ వర్కర్లకు ఇన్సెంటివ్కు ఈ నిధులు విడుదలచేసింది.
గచ్చిబౌళి క్రీడా గ్రామంలోని 1500 పడకల ఆసుపత్రిని ‘తెలంగాణ ఇన్స్టిసట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చి’ (టిమ్స్)గా తీర్చిదిద్దుతున్నట్లు 19 ఏప్రిల్, 2020 న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను 25 ఏప్రిల్, 2020న జారీ చేశారు. గచ్చిబౌలి క్రీడామైదానాన్ని 78 ఎకరాల పరిధిలో నిర్మించారు. అందులో కొంత స్థలాన్ని విల్లాలకు, ప్లాట్లకు కేటాయించడంతో సుమారు 9.16 ఎకరాల భూమి మిగిలి ఉంది. ఇందులో 750 సాధారణ పడకలు ఉంటాయి. మరో 750 మల్టీ స్పెషాలిటీ పడకలను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఆసుపత్రిలో పీజీ వైద్యవిద్య సైతం ఉంటుంది. హైదరాబాద్లోటని నిమ్స్ స్థాయిలో అన్నిరకాల స్పెషాలిటీ వైద్యసేవలూ ఇందులో లభించనున్నాయి. తొలుత కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత మరో 15 ఎకరాల భూమిని జతచేసి అద్భుతమైన స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. టిమ్స్ లో మరమ్మతులు, పునరుద్ధరణ పనుల కోసం ప్రభుత్వం రూ.24.05 కోట్లు మంజూరు చేస్తూ 25 ఏప్రిల్, 2020న ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానికి నాలుగు దిక్కుల్లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా బీబీనగర్ లో ఎయిమ్స్ ఇప్పటికే ఏర్పాటయ్యింది.
జీహెచ్ఎంసీతోపాటు, సూర్యాపేట, జోగుళాంబ గద్వాల, వికారాబాద్ జిల్లాలో కరోనా వ్యాప్తి తీవ్రంగా పెరుగుతూ వస్తున్నది. మర్కజ్ ప్రార్థనల విషయాన్ని వెలుగులోకి తెచ్చిన కరీంనగర్లో వైరస్ అదుపులో ఉన్నప్పటికీ.. ఆ మూడు జిల్లాలో మాత్రం గ్రామాలకు విస్తరిస్తున్నది. తీవ్రతను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో సీఎస్ సోమేశ్కుమార్ నేతృత్వంలో డీజీపీ మహేందర్రెడ్డి, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి శాంతికుమారి, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్చంద్, వెస్ట్జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్ బృందాన్ని పంపించారు. వీరు 22 ఏప్రిల్, 2020న ఆయా జిల్లాల్లో క్షేత్రస్తాయిలో పర్యటించి అధికారులతో సమీక్షలు నిర్వహించి.. కార్యాచరణ ప్రణాళికలు రూపొందాంచారు. వైరస్ వ్యాప్తికి గల కారణాలను తెలుసుకున్న బృందం.. నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఇకపై జిల్లాలోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఏ ఒక్కరూ బయటకురాకుండా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఇంటి వద్దకే నిత్యావసరాలు పంపివ్వాలని నిర్ణయించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సూర్యాపేట డీఎస్పీ, డీఎంహెచ్వోను బదిలీచేశారు.
కరోనా కాటుతో రాష్ట్ర ఖజానాకు ఒక్క 2020 మార్చి చివరివారంలోనే దాదాపు రూ.5 వేల కోట్ల గండి పడింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి పరిస్థితి మరింత విషమించడంతో నెలకు రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు రావలసిన ఆదాయం 95 శాతానికిపైగా పడిపోయింది.
కరోనాపై పోరుకు సంఘీభావ సంకేతంగా ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు 2020 మార్చి 5న రాత్రి 9 గంటలకు రాష్ట్ర ప్రజలంతా విద్యుత్ లైట్లు బంద్ చేసి దీపాలు వెలిగించాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులందరూ కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావాన్ని తెలియజేసారు.
కరోనా వైరస్పై పోరుకు సంఘీభావంగా ప్రధాని మోడీ పిలుపు మేరకు 6 ఎప్రిల్, 2020న రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి లైట్లు ఆర్పి ప్రజలు తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంలో విద్యుత్ డిమాండ్ ఒకే సారి 1500 మెగావాట్లకు పడిపోయింది. ఈ భారీ మార్పుతో ఉత్పత్తి – సరఫరాలో సమతూకం కోల్పోయి విద్యుత్ గ్రిడ్ కు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని గమనించిన విద్యుత్ శాఖ పక్కావ్యూహంతో ఉత్పత్తి – సరఫరాలో పూర్తి సమతూకాన్ని సాధించి ఎలాంటి నష్టం జరగకుండా నివారించింది. ఆ రోజు రాత్రి 9 గంటల వరకు 7,300 మెగావాట్లున్న విద్యుత్ డిమాండ్.. తర్వాత ఒక్కసారిగా లైట్లు ఆర్పివేయడంతో 5,800 మెగావాట్లకు పడిపోయింది. తగ్గిన 1,500 మెగావాట్ల డిమాండ్ను మెయిన్టెయిన్ చేసేందుకు నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల వద్ద రివర్స్ పంపింగ్ నిర్వహించి సమతూకం సాధించారు.
కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం రూ.370 కోట్లు విడుదల చేసింది. విపత్తు నిర్వహణ నిధి నుంచి వైద్యారోగ్య శాఖకు ఈ నిధులు బదలాయించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు 02 ఎప్రిల్, 2020 న జారీ అయ్యాయి. వైరస్ కట్టడికి అవసరమైన వస్తువుల కొనుగోలు కోసం ఈ నిధులను వినియోగిస్తారు.
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్రం తన సాయంగా రాష్ట్రం విపత్తు నిర్వహణ నిధి కింద తొలి విడతగా తెలంగాణ రాష్ట్రానికి రూ. 225 కోట్లను 3 ఎప్రిల్, 2020న విడుదల చేసింది. ఈ నిదులను క్వారంటైన్ కేంద్రాల నిర్వహణకు, నమూనాల సేకరణ, పరీక్షల నిర్వహణ, అదనపు ప్రయోగశాలల ఏర్పాటు, రక్షణ పరికరాల కొనుగోలుతో పాటు అత్యవసరమైన వైద్య పరికరాల కొనుగోలుకు ఈ నిధులు వెచ్చించనున్నారు.
రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న నిమ్మ, బత్తాయి, సంత్ర పండ్లను అన్ని మార్కెట్లు సేకరించి వీటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. ఈ పండ్లు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కరోనా వైరస్ ను శరీరం తట్టుకోవాలంటే ఈ పండ్లు తినటం ఎంతో మేలని, వాటి ఉపయోగాలను ప్రజలకు తెలియజేశారు. మన రాష్ట్రంలో ఈ పండ్ల తోటల సాగు అధికంగానే ఉన్నది. కాబట్టి ఈ పండ్లను వేరే ప్రాంతాలకు ఎగుమతి చేయకుండా, మన రాష్ట్ర ప్రజలకే అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తొలి ఐదేండ్లలో ఒక్కొక్కటిగా ఆవిష్కరించిన అద్భుతాలను ఆశ్చర్యంగా చూసిన యావత్దేశం, ఇప్పుడు తెలంగాణ వంక ఎంతో ఆశగా చూస్తున్నది. జటిల సమస్యను పరిష్కరించడానికి, సం క్షోభాన్ని తట్టుకొని నిలబడటానికి అవసరమైన వెలుతురు తెలంగాణ నుంచి కచ్చితంగా ప్రసరిస్తుందని భారతావని భరోసాతో ఉన్నది. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే, అది కచ్చితంగా ప్రజోపయోగకరమైనదిగా, ఆచరణనీయమైనదిగా ఉంటుందనే బలమైన భావన ఇవాళ దేశంలో ఏర్పడింది.
హైదరాబాద్లో సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మోలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లో కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు నిర్వహించాలని మార్చి 20న కేసీఆర్ ప్రధాని దృష్టికి తెచ్చారు. కేసీఆర్ చూపిన చొరవ కారణంగా అక్కడ మార్చి 30 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. సీఏఏ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ నిండు అసెంబ్లీలో తీవ్రంగా విబేధించారు. కరోనాపై పోరు విషయంలో కేంద్ర ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదనే విమర్శలను అదే అసెంబ్లీలో గట్టి గా ఖండించారు. ఈ రెండు ఘటనలు కేవలం రెండురోజుల వ్యవధిలోనే జరిగాయి. విపత్తుల సమయంలో రాజకీయాలను పక్కనపెట్టి దేశమంతా ఒకటిగా కలిసినడువాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని నిర్ణయాలకు కేసీఆర్ పూర్తి మద్దతును ప్రకటించారు. ప్రభుత్వంపై కేసీఆర్ ఎన్నడూ గుడ్డి వ్యతిరేకతను ప్రదర్శించలేదు. పైన చెప్పిన ఉదంతాలన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే.
రాష్ర్టంలోని పంచాయతీల్లో 8,20,727 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులున్నారు. మున్సిపాలిటీ స్టాండింగ్ కమిటీలో 3,400 సభ్యులున్నారు. వార్డుల్లో 2,04,300 మంది సభ్యులున్నారు. మొత్తం కలిపితే పది లక్షలమంది ఉన్నారు. వీళ్లందరితో ప్రజాసైన్యం తయారు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి సూచించారు. కేసీఆర్ ఆదేశంతో ఆయా వార్డుసభ్యులు, సర్పంచ్లు, మేయర్లు, చైర్మన్లు.. తమ తమ స్టాండింగ్ కమిటీ సభ్యులను కలుపుకొని కరోనా నయంత్రణలో పనిచేశారు. ఏ ఊరి సర్పంచ్ ఆ ఊరి కథానాయకుడిగా మారాడు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు, సింగిల్ విండో చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు అంతా తమ తమ పరిధుల్లో బాద్యతలు తీసుకున్నారు. ప్రజల మధ్యలో పోలీసులతో కలిసి పనిచేశారు.
ప్రజా ప్రతినిధులు ప్రజలవెంటే ఉండాలన్న సీఎం : ప్రజాప్రతినిధులంతా ఇలాంటి ఆపత్కాల పరిస్థితుల్లో ప్రజలవెంటే ఉండాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. జీహెచ్ఎంసీలో 150 మంది కార్పొరేటర్లు, జంటనగరాల్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్మన్లు అంతా రంగంలోకి దిగి కరోనా నియంత్రణకు భాద్యత తీసుకున్నారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే ప్రజలకు కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించారు. పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకొని పనిచేశారు. సమస్యను ఎదుర్కొనేలా ప్రజలను చైతన్యపరిచారు.
12 ఆసుపత్రులు పూర్తిగా కరోనా చికిత్స కే వినియోగం – 30.03.2020 కరోనా మహమ్మారిపై యుద్ధం చేసేందుకు తెలంగాణ సర్కారు అన్ని రకాలుగా సిద్ధమైంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో 12 కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేష్రెడ్డి 30 మార్చి, 2020న అంతర్గత ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్లో 9, వరంగల్లో 2, రంగారెడ్డిలో ఒక ఆసుపత్రి కరోనా కోసం ప్రత్యేకంగా పనిచేస్తాయి. వీటిలో ఇతర రోగులకు చికిత్స చేయరు. ఆయా ఆసుపత్రుల్లో 4,177 ఐసోలేషన్, 600 ఐసీయూ పడకలను సిద్ధం చేశారు. ఇవికాక, మిగతా జిల్లాల్లోని జిల్లా ఆసుపత్రులతో కలిపి మొత్తం 12 వేల పడకలను అందుబాటులోకి తెచ్చారు. కరోనాకు చికిత్స అందించే డాక్టర్లకు సలహా సూచనలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జిప్మార్ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ అగర్వాల్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి బృందాన్ని ఏర్పాటు చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం, బాధితులకు చికిత్స చేయడం ఒక ఎత్తయితే.. అనుమానితులకు పరీక్షలు చేయడం మరో ఎత్తు. ఇలాంటి కీలక బాధ్యతలో టెస్టింగ్ ల్యాబ్లలోని మైక్రోబయాలజిస్ట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు ముందుంటూ తమ ప్రాణాలనే పణంగా పెట్టి 24 గంటలు కష్టపడుతున్నారు. రాష్ర్టంలో 9 లేబరేటరీస్ లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో లాబ్ రోజుకు 1600 పరీక్షలు చేసే సామర్ధ్యం కలిగిఉన్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందడుగు వేసింది. తొలి కేసు నమోదైన తర్వాత ముందు జాగ్రత్త చర్యగా గాంధీ దవాఖానలో నిర్ధారణ పరీక్షలు చేయడం ప్రారంభించారు. అనంతరం ఫీవర్, ఉస్మానియా, నిమ్స్తోపాటు సీసీఎంబీ, ఐపీఎంలో నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. అనుమానిత లక్షణాలున్నవారు ఎందరు వచ్చి నా పరీక్షలకు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది.
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను వేగంగా చేపట్టేందుకు ఈఎస్ఐ దవాఖాన సహకారంతో హైదరాబాద్ డీఆర్డీవో దేశంలోనే మొదటిసారిగా మొబైల్ వైరాలజీ రిసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ను రూపొందించింది. ఈ ల్యాబ్ ను 23 ఏప్రిల్, 2020న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ఢిల్లీనుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. సాధారణంగా ఈ ల్యాబ్ తయారీకి ఆరునెలలు సమయం పట్టనుండగా.. కేవలం 15 రోజుల్లోనే సిద్ధం చేసి అద్భుతం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, అధునాతన సాంకేతికతతో ఈ ల్యాబ్ను తయారుచేశారు. కరోనాతోపాటు ఇతర వైరస్ల నిర్ధారణ పరీక్షలకు, పరిశోధనలకు ఇది ఉపయోగపడుతుంది. హైదరాబాద్ ఈఎస్ఐ వైద్యకళాశాల ఆవరణ నుంచి ఈ ల్యాబ్ సేవలందిస్తుంది. ఈ ల్యాబ్ ద్వారా రోజుకు వెయ్యి నుంచి 1500 వరకు టెస్టులు చేయవచ్చు. ఈ సామర్థ్యాన్ని మరింత పెంచుకొనే అవకాశం ఉన్నది.
ఒక్కో పరీక్షకు కొన్ని గంటల సమయం పడుతున్న నేపధ్యంలో.. అనుమానితులనే కాకుండా అందరికీ పరీక్షలు నిర్వహించాలనే విధానాన్ని ప్రభుత్వం పక్కనపెట్టింది. ప్రభుత్వం పక్కావ్యూహంతో అనుమానితులకే పరీక్షలు చేసి ఎక్కువ ఫలితం సాధిస్తున్నది. సరైన అంచనాతో పాజిటివ్ కేసులను గుర్తిస్తుంది. వైరస్ వాహకుల గొలుసును గుర్తించి వారి ఫస్ట్ కాంటాక్ట్ లకు పరీక్షలు నిర్వహిస్తున్నది. సెకండ్ కాంటాక్ట్ లను హోం క్వారంటైన్ లలో ఉంచి.. వీరి వివరాలను యాప్ లలో పొందుపరిచి వైద్యలు, పోలీసుల పర్యవేక్షణలో ఉంచుతున్నారు. వీరికి వైరస్ లక్షణాలు బయటపడినట్లయితే పరీక్షలు నిర్వహించి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఐసీఎమ్మార్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పక్కా వ్యూహం, ప్రణాళికతో రాష్ట్రవ్యాప్తంగా 19,200 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 1,038 (5.3శాతం) మం దికి పాజిటివ్ వచ్చింది. దేశవ్యాప్తంగా 8,30,201 మందిని పరీక్షిస్తే 34,007(4.1శాతం)మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
పాజిటివ్ కేసులకు మెరుగైన చికిత్స, సరైన పౌష్టికాహారం అందిస్తుండడంతో బాధితులు ఎక్కువ సంఖ్యలో కోలుకొని డిశ్చార్జ్ అవుతున్నారు. డిశ్చార్జ్ రేటులో దేశ సరాసరి కంటే తెలంగాణ సరాసరి ఎక్కువగా ఉన్నది. డిశ్చార్జ్ లో తెలంగాణ 33.69 శాతం ఉండగా.. దేశ సరాసరి 30.65 శాతంగా ఉన్నది.
కరోనా వ్యాధి సోకిన వ్యక్తి శరీరంలో వైరస్ ప్రభావం పెరిగి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటే.. ప్లాస్మా చికిత్సద్వారా నయం చేయవచ్చని గాంధీ దవాఖాన వైద్యులు తెలిపారు. చైనాలో విషమ పరిస్థితిలో ఉన్న ఐదుగురు కరోనా రోగులపై చేసిన ఈ ప్రయోగం సత్ఫలితాలనిచ్చింది. ఈ నేపథ్యంలో ప్లాస్మా చికిత్సకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం భారత వైద్య పరిశోధన మండలికి (ఐసీఎంఆర్) విజ్ఞప్తి చేయగా.. అందుకు కేంద్రం 28 ఏప్రిల్, 2020న అనుమతినిచ్చింది. గాంధీ ఆస్పత్రిలో అత్యవసర స్థితిలో ఉన్న రోగులకు ఈ చికిత్స విధానాన్ని ఉపయోగించడానికి వైద్యులకు మార్గం సుగమమైంది. కరోనా బారినపడిన పలు దేశాల్లో కూడా ఈ చికిత్సను అందిస్తున్నారు. దేశంలోని పలురాష్ట్రాలతో పాటు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ దిశగా ప్రయత్నాలు మొదలెట్టింది. కరోనా సోకినవారందరికీ ప్లాస్మా చికిత్స చేయరని, విషమ పరిస్థితికి చేరినవారికి మాత్రమే చివరి అస్త్రంగా ప్లాస్మా ట్రాన్స్ఫ్యూజన్ చేపడుతామని రాష్ట్ర కొవిడ్ చికిత్స నోడల్ అధికారి, గాంధీ దవాఖాన జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ రాజారావు పేర్కొన్నారు. వెంటిలేటర్పై ఉండి, విషమ స్థితికి చేరుకున్న రోగులకు మాత్రమే ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తామని చెప్పా రు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవని, అయితే చికిత్సకు ముందు రోగి కుటుంబసభ్యుల అనుమతి తప్పనిసరి అని చెప్పారు. ఐసీఎంఆర్, సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ కూడా తమను అనుమతించాల్సి ఉంటుందని తెలిపారు.
కరోనా వైరస్ను పూర్తిస్థాయిలో కట్టడిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టంగా చర్యలు చేపట్టింది. వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఆరు ల్యాబ్లు 24 గంటలు పనిచేస్తున్నాయి. పాజిటివ్ కేసులు సంఖ్య పెరిగినప్పటికీ అందుకు తగిన విధంగా చికిత్స అందించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వైద్య సిబ్బందికి అవసరమైన ఐదు లక్షల ఎన్-95 మాస్కులు, 20 లక్షల సర్జికల్ మాస్కులు, 25 లక్షల హ్యాండ్ గ్లౌజ్లు ఐదు లక్షల పీపీఈ కిట్లు, ఐదు లక్షల వైరల్ ట్రాన్స్మిషన్ కిట్లు, 500 వెంటిలేటర్లు, నాలుగు లక్షల కరోనా టెస్టింగ్ కిట్లను సిద్ధంచేసేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లుచేసింది. కరోనా చికిత్సలో ఉపయోగించే ప్రధాన డ్రగ్స్ను కూడా ప్రభుత్వం పెద్దమొత్తంలో కొంటున్నది. వ్యాధిగ్రస్తులకు కావలసిన బెడ్లను, ఐసీయూలను, వెంటిలేటర్లను పెద్ద సంఖ్యలో ప్రభుత్వం సమకూరుస్తున్నది.
హైదరాబాద్కు చెందిన ‘హువెల్ లైఫ్ సైన్సెస్’ సంస్థ కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపడానికి అభివృద్ధి చేసిన టెస్ట్ కిట్కు ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ (ఐసీఎంఆర్) ఆమోదం లభించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వివిధ సంస్థలు తయారుచేసిన మొత్తం 24 కిట్లలో ఆరింటికి మాత్రమే ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. ఇందులో హువెల్ లైఫ్ సైన్సెస్ కిట్ కూడా ఉండటం విశేషం. అమెరికా నేషనల్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రొటోకాల్ను అనుసరించి ఈ కిట్ను తయారుచేశారు. కొవిడ్-19తోపాటు సార్స్ వంటి ఇతర కరోనా వైరస్లను కూడా గుర్తించే విధంగా ఈ కిట్ను రూపొందించారు. డిటెక్షన్ కిట్, ఎక్స్ట్రాక్షన్ కిట్, మాలిక్యులర్ ట్రాన్స్పోర్ట్ మీడియం (ఎంటీఎం), నమూనా సేకరణకు స్వాబ్ సహా అన్నీ ఇందులో ఉంటాయి. ‘హువెల్ లైఫ్ సైన్సెస్’ సంస్థ రోజుకు 4 వేల కిట్స్ తయారు చేసే సామర్థ్యం కలిగి ఉంది.
కరోనా వైరస్ కొవిడ్-19 చికిత్సకు అవసరమయ్యే వెంటిలేటర్లను హైదరాబాద్ బాలానగర్ లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) సంస్థ తయారుచేస్తున్నది. కరోనా చికిత్సలో పెద్దఎత్తున వెంటిలేటర్లు అవసరం అవుతాయని అంచనావేసిన కేంద్ర ప్రభుత్వం.. తయారీ బాధ్యతలను సీఐటీడీకి అప్పగించింది. దీంతో నమూనా (ప్రొటోటైప్) వెంటిలేటర్ తయారీలో సీఐటీడీ నిపుణులు నిమగ్నమయ్యారు.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలను ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలోని 22 ప్రైవేట్ వైద్య విద్య కళాశాలల్లోని పడకలన్నింటినీ కరోనా బాధితులకు సేవలందించేందుకే వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆయా కాలేజీల్లోని 3,350 ఐసోలేషన్ పడకలు, 236 ఐసీయూ పడకలు, 80 వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులోభాగంగా మెడికల్ కాలేజీల్లో ఓపీ సేవలను 30 మార్చి, 2020 నుంచి పూర్తిగా రద్దు చేశారు. ఇందుకోసం రూ.30కోట్లు ఖర్చు పెట్టనుంది. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, పీజీ చేస్తున్న వారి సేవలను వినయోగించుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం సర్కారీ ఆస్పత్రుల్లో ఐసొలేషన్, ఐసీయూ సేవలున్నా.. కొందరు రోగులు భయపడి రావడం లేదు. అటువంటి వారు ఇక్కడికొస్తారని సర్కారు భావిస్తోంది.
కరోనా కట్టడికి అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల సేవలనూ వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంపిక చేసుకున్న శస్త్రచికిత్సలను నిలిపివేయగా.. ఈ విధానాన్ని వెంటనే ప్రైవేటు ఆసుపత్రులకూ వర్తింపజేస్తూ 23 మార్చి, 2020న ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రజారోగ్య అత్యవసర పరిరక్షణ చర్యల్లో భాగంగా.. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులూ వెంటనే కరోనా అనుమానితులు, బాధితులకు వైద్యసేవలందించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రైవేటు ఆసుపత్రులు అనుసరించాల్సిన మార్గదర్శకాలను లిఖితపూర్తక ఉత్తర్వులను పంపించారు. ప్రభుత్వ ఆదేశాలన్నింటినీ కచ్చితంగా పాటించాల్సిందేనని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు.
► గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీలు, ఫీవర్ ఆసుపత్రి, నిమ్స్.. ఈ నాలుగుచోట్లా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఏయే జిల్లాల నమూనాలు పరీక్ష కేంద్రానికి పంపాలనేది కూడా సర్క్యులర్లో స్పష్టంచేశారు.
► ఉస్మానియా మెడికల్ కాలేజీ: కింగ్కోఠి, ఛాతీ ఆసుపత్రి, సరోజిని కంటి ఆసుపత్రి, వరంగల్ ఎంజీఎం నుంచి శాంపిళ్లు ఇక్కడకు వెళ్తాయి. ఇంకా నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమురంభీం, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల నుంచి వచ్చే శాంపిళ్లనన్నింటినీ ఈ కాలేజీకి పంపిస్తారు.
► ఫీవర్ ఆసుపత్రి: ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రి, నేచర్క్యూర్, నిజామియా జనరల్ ఆసుపత్రి, రామంతాపూర్ హోమియో ఆసుపత్రి నుంచి వచ్చే శాంపిళ్లను ఇక్కడకు పంపించాలి. అలాగే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగాం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, ములుగు, భూపాలపల్లి, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్కర్నూలు జిల్లాల శాంపిళ్లను కూడా ఇదే ఆసుపత్రిలో పరీక్షిస్తారు.
► గాంధీ ఆసుపత్రి: ఇక్కడికి నేరుగా వచ్చే కేసులతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల శాంపిళ్లను ఇక్కడ పరీక్షిస్తారు.
► నిమ్స్: గచ్చిబౌలిలో ఏర్పాటుచేసిన కరోనా ఆసుపత్రి నుంచి వచ్చే శాంపిళ్లను పరీక్షిస్తారు.
ఆసుపత్రి పేరు | పడకల సంఖ్య |
హైదరాబాద్ కింగ్ కోఠి ఆసుపత్రి | 350 |
గాంధీ ఆసుపత్రి | 1,500 |
ఛాతీ ఆసుపత్రి | 130 |
సరోజినీదేవి కంటి ఆసుపత్రి | 200 |
ఫీవర్ ఆసుపత్రి | 82 |
బేగంపేటలోని నేచర్ క్యూర్ | 250 |
చార్మినార్ నిజామియా జనరల్ ఆసుపత్రి | 200 |
ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రి | 200 |
రామంతాపూర్ హోమియో ఆసుపత్రి | 90 |
గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ | 1,500 |
వరంగల్ ఎంజీఎం | 175 |
వరంగల్ ఆయుర్వేద బోధనాసుపత్రి | 100 |
కరోనా రోగులను తరలించేందుకు, అవసరమైన వారు కరోనా ఆసుపత్రులకు చేరేందుకు 74 అంబులెన్సులను ఏర్పాటు చేశారు. ఏ జిల్లాలో ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటాయో కూడా లొకేషన్ సహా సర్క్యులర్లో పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర కలిగినవారు, వారితో కాంటాక్ట్ అయినవారు, ఒకవేళ పాజిటివ్ కేసున్నా ఈ అంబులెన్సులకు ఫోన్చేసి రప్పించుకోవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా భారీ ఏర్పాట్లకు రంగం సిద్ధం చేసింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల అనుబంధ ఆస్పత్రుల్లో 10 వేల పడకలను కరోనా ఐసోలేషన్కు వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇందులో 80 శాతం వరకూ కరోనా కోసమే వాడుకొనే అవకాశముంది. ఆయా ప్రైవేటు బోధనాస్పత్రుల్లో ఉంచే కరోనా రోగులకు అక్కడి డాక్టర్లు, సిబ్బందే చికిత్స అందించనున్నారు. కానీ రోగులకు కావాల్సిన ఆహారం, మందులు, మాస్కులు, శానిటైజర్లు ఇతరత్ర వస్తువులను ప్రభుత్వమే ఆయా ప్రైవేటు బోధనాస్పత్రులకు అందించనుంది.
వైద్యనిపుణులు అందుబాటులో ఉన్న కింగ్కోఠి ఆస్పత్రిని ప్రభుత్వం పూర్తిగా కరోనా చికిత్సా కేంద్రంగా తీర్చిదిద్దింది. 300 పడకలను ఐసోలేషన్కు, మరో 50 పడకలను ఐసీయూకు కేటాయించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఇతర వ్యాధులతో చికిత్స పొందుతున్న రోగులను ఉస్మానియా, నిలోఫర్, సుల్తాన్బజార్ ప్రసూతి ఆస్పత్రులకు తరలించారు. ఈ ఆసుపత్రిలో ఉన్న ఐదుగురు వైద్యనిపుణులకు తోడు.. 14 మంది అనస్థీషియా, పల్మనాలజి, జనరల్ ఫిజీషియన్ విభాగాల స్పెషలిస్టులను అధనంగా నియమించారు. వీరితోపాటు.. మరో 17 మంది వైద్యులు ఇక్కడ పనిచేస్తున్నారు.
గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ను పూర్తిస్థాయిలో కరోనా ఆస్పత్రిగా తీర్చిదిద్దుతున్నారు. పనులు వేగంగా జరుగుతున్నాయి. గచ్చిబౌలి క్రీడా స్టేడియంలో ఉన్న 13 అంతస్తుల భవనం కరోనా రోగులకు సేవలందించేందుకు సిద్దం చేశారు. మొత్తం 1200 పడకల సిద్ధం చేశారు. ఇక నుంచి కరోనా అనుమానిత కేసులకు ఇక్కడ చికిత్స అందించనున్నారు. కేవలం 15 రోజుల వ్యవధిలో ప్రభుత్వం దీన్ని పూర్తిస్థాయి ఆస్పత్రిగా అందుబాటులోకి తెచ్చింది. 13 అంతస్తుల్లో ఆరు అంతస్తులను వినియోగంలోకి తీసుకువచ్చారు. ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే మిగతావాటిని కూడా వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి రూమ్లో రెండు పడకలను ఏర్పాటుచేశారు. ప్రతి అంతస్తుకు కనీసం 80-90మంది రోగులను ఇక్కడ ఉంచనున్నారు. ఇక ఇక్కడ సేవలందించేందుకు 77 మంది వైద్యులు, 112 మంది పారామెడికల్ సిబ్బందిని నియమించారు. గాంధీ నుంచి వీరంతా ఇక్కడ సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారు.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా హైదరాబాద్ మహనగరంలో నమోదవుతున్నాయి. జనసమ్మర్ధం అధికంగా ఉండడం, విదేశాల నుంచి వచ్చిన వారు కూడా హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది ఉండడంతో వైరస్ వేగంగా వ్యాప్తిచెందే ప్రమాదం పొంచి ఉన్నది. దీంతో ప్రభుత్వం హైదరాబాద్పై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి.. ప్రత్యేక వ్యూహంతో చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లను 17 యూనిట్లుగా విభజించి.. ఒక్కో యూనిట్కు వైద్య, పోలీస్, మున్సిపల్, రెవెన్యూశాఖల నుంచి ఒక్కో అధికారిని నియమించింది. కంటైన్మెంట్ ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టింది.
తెలంగాణలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా 259 కంటైన్మెంట్లు ఏర్పాటు చేశారు. కేవలం హైదరాబాద్ నగరంలోనే 126 కంటైన్మెంట్లు ఉన్నాయి. ప్రతి కంటైన్మెంటుకూ ప్రత్యేక పోలీసు, నోడల్ అధికారిని నియమించారు. వారి ఆధ్వర్యంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులను ప్రభుత్వ యంత్రాంగమే అందిస్తుంది.
కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మరింత పకడ్బందీగా కట్టడి చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు దేశంలో 170 జిల్లాలు రెడ్జోన్లు, 207 జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా ప్రకటించింది. మిగిలిన జిల్లాలు గ్రీన్జోన్ పరిధిలో ఉన్నాయి. తెలంగాణలో 8 జిల్లాలు.. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, జోగుళాంబ గద్వాల, మేడ్చల్ మల్కాజిగిరి, కరీంనగర్, నిర్మల్ను రెడ్ జోన్లుగా నిర్ధారించింది. రెడ్జోన్ హాట్స్పాట్ క్లస్టర్ జిల్లాగా నల్లగొండను నిర్ణయించింది. ఆరెంజ్ జోన్ (నాన్ హాట్స్పాట్) జిల్లాలుగా సూర్యాపేట, ఆదిలాబాద్, మహబూబ్నగర్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేటను కేంద్రం నిర్ధారించింది. మిగిలిన జిల్లాలు గ్రీన్జోన్ పరిధిలో ఉన్నాయి.
కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో రాష్ట్రప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. ఒకవైపు లాక్డౌన్ను పకడ్బందీగా అమలుచేస్తూనే.. వైరస్ తీవ్రత ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించింది. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో 3 వేల బృందాలతో ఇంటింటి సర్వే చేపడుతున్నది. వైద్యారోగ్యశాఖ పరిధిలో ఏర్పాటుచేసిన 3 వేల ప్రత్యేక బృందాలు 259 కంటైన్మెంట్ క్లస్టర్ల పరిధిలోని 3,01,002 గృహాలకు వెళ్లి 12,04,008 మందిని కలిసి వారి ఆరోగ్యపరిస్థితిని తెలుసుకున్నాయి. పెరుగుతున్న పాజిటివ్ కేసులకు అవసరమైన మందులు రూ.400 కోట్లతో కొనుగోలుచేసి ముందస్తుగా సిద్ధం చేసింది.
లాక్డౌన్ వేళ ప్రజలకు అత్యవసర సమయాల్లో వైద్యుల సలహాలు, సూచనలు అందించేందుకు ఏర్పాటుచేసిన మెడికల్ హెల్ప్లైన్ నంబర్కు భారీ స్పందన లభిస్తున్నది. 040-48214595 నంబర్కు ప్రజలు 5 వేల కాల్స్ చేశారు.
కరోనా మహమ్మారిపై ఎప్పటికప్పుడు ప్రజలకు ఖచ్చితమైన సమరాన్ని అంధించడానికి వాట్సాప్ తెలంగాణ ప్రభుత్వం తో కలిసి పనిచేయడానికి సిద్దమైంది. కరోనాపై పౌరులకు ప్రామాణికమైన సమాచారం అందించాలనే లక్ష్యంతో వాట్సాప్ తన వినియోగదారులకు ప్రత్యేకంగా ‘చాట్ బోట్’ను తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. 06 ఎప్రిల్, 2020న మంత్రి కేటీఆర్ దీన్ని ప్రారంభించారు. కరోనాకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు, సందేహాలు ఉంటే చాట్బోట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. చాట్బోట్ సేవలకు +91-90006 58658 నంబరుకి ‘హాయ్’/‘హలో’ /‘కొవిడ్’ అని ఇంగ్లి్షలో సందేశం పంపిస్తే చాట్బోట్ యాక్టివేట్ అవుతుంది.
1.కొవిడ్-19 ప్రస్తుత పరిస్థితి; 2. కరోనా వైరస్ గురించి; 3. ఆరోగ్య కేంద్రాలు/ఐసోలేషన్ కేంద్రాలు; 4. ప్రభుత్వ అధికారిక సమాచారం; 5. లాక్డౌన్ సంబంధిత సమాచారం; 6. వదంతులు, తప్పుడు సమాచార నియంత్రణ; 7. జీహెచ్ఎంసీ ఉచిత భోజన కేంద్రాలు; 8. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు; 9. ఇతరులతో పంచుకోండి; 10. తాజా పత్రికా ప్రకటన.
లాక్డౌన్ సందర్భంగా సామాన్యులకు పాస్ల కష్టాలు తీర్చడానికి రాచకొండ పోలీసులు ఆన్లైన్ ఈ – పాస్ మేనేజ్మెంట్ను సర్వీస్ను ప్రారంభించింది. పాస్లు కావాల్సిన వారు https://covid-tspolice.nvipani.com/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో ఈ పాస్ను క్యూఆర్ కోడ్తో ఈ మెయిల్కు పంపిస్తారు. ఈ పాస్ రాచకొండ, సైబరాబాద్, రాచకొండ, సంగారెడ్డి ప్రాంతాల్లో చెల్లుతుంది.
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే విషయంలో, వ్యాధి సోకినవారికి వైద్యం అందించే విషయంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది గొప్ప సేవలు అందిస్తున్నారు. రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. అటువంటి వైద్యులు కూడా కొన్ని చోట్ల దాడులకు గురవుతున్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వం వారి భద్రతపై పూర్తి స్థాయిలో దృష్టిసారించింది. ఆసుపత్రుల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. వైద్యులు, పారామెడికల్, ఇతర వైద్యసిబ్బందిపై దాడులకు పాల్పడేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. కరోనా కట్టడికి నిరంతరం పనిచేస్తున్న డాక్టర్లు, వైద్యసిబ్బందికి 24 గంటలపాటు భద్రత కల్పించడానికి ప్రత్యేక వ్యూహం రచించింది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్లు, వైద్యసిబ్బంది, పోలీస్ అధికారులతో కలిపి రాష్ట్ర, కమిషనరేట్, జిల్లా, డివిజన్, సర్కిల్, పోలీస్స్టేషన్వారీగా వాట్సాప్గ్రూప్లు ఏర్పాటుచేస్తున్నారు. డాక్టర్లు ఎప్పుడైనా దాడులకు గురైనా, ఏవిధమైనటువంటి ఇబ్బంది ఎదురైనా గానీ ఈ వాట్సాప్ గ్రూప్ లో పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే పోలీసులు అప్రమత్తం అవడానికి వీలుంటుంది. అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు తమ పరిధిలోని వైద్యశాఖ ఉన్నతాధికారులతో టచ్లో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితులు తెలుసుకుంటారు.
నిరంతం కరోనా బాధితుల వెంటే ఉంటూ వారికి వైద్య సేవలందిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్భందికే కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరి ఆరోగ్యం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వైద్యులు, సిబ్భందిని మూడు బ్యుచ్ లుగా విభజించి షిఫ్టుల వారీగా ఐదురోజులపాటు విధులు నిర్వర్తించేలా అవకాశం కల్పించింది. విదులు పూర్తిచేసుకున్నాక ఐదురోజుల పాటు ప్రత్యేక కేంద్రాల్లో ఉండేలా ఏర్పాటు చేశారు. వీరు ఒక వేళ ఇంటికి వెళ్లినట్లయితే అక్కడ కూడా క్వారైంటన్ లో ఉండాల్సిందిగా సూచించింది. విధులు పూర్తిచేససుకుని ఇంటికి వెళ్లే ముందు ప్రతీ వైద్య సిబ్భందిక ఖచ్చితంగా ఆరోగ్యపరీక్షలు నిర్వహించిన తరువాతనే ఇంటికి పంపిస్తున్నారు. వైద్య సిబ్బందికి కరోనాసోకే అవకాశం ఎక్కువగా ఉన్నందున.. వారి ద్వారా వారి కుటుంబ సభ్యులకుగానీ, లేదా చుట్టుపక్కల వారికి గానీ కరోనా సోకకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. వీరు షిఫ్టుల వారీగా దవాఖానాకు వచ్చేందుకు 20 మార్గాల్లో వివిధ ప్రాంతాల నుంచి బస్సులను నడుపుతున్నారు. విదులు నిర్వర్తించేవారికి క్వారంటైన్ లో ఉన్నవారికి 3 పూటలా బలమైన పౌష్టికాహారం అందిస్తున్నారు.
పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటుచేసిన చిన్న జిల్లాలు కరోనాపై పోరుకు ఎంతో కలిసొస్తున్నాయి. కరోనా అనుమానితులను క్షణాల్లో గుర్తించి నిమిషాల్లోనే క్వారంటైన్ చేయడానికి అవకాశం ఏర్పడుతున్నది. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్రంలో 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించారు. దీంతో 10 మంది కలెక్టర్లు, ఎస్పీల స్థానంలో 33 మంది కలెక్టర్లు, ఎస్పీలు వచ్చారు. కొన్నిజిల్లాలను కలిపి పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటుచేసినచోట ఐపీఎస్ అధికారుల సంఖ్య కూడా పెరిగింది. దీంతో కేత్రస్థాయిలోనే పటిష్ఠమైన ప్రభుత్వ యంత్రాంగం ఏర్పడింది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో సీఎం కేసీఆర్ చేయించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు వారికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఏగ్రామంలో ఎవరున్నారనే జాబితా సిద్ధంగా ఉండటంతో ఏ చిన్న సంఘటన జరిగినా ప్రభుత్వయంత్రాగం క్షణాల్లో అక్కడ వాలిపోతున్నది. ఇప్పుడు కొవిడ్-19 నుంచి యావత్ రాష్ర్టాన్ని కాపాడేందుకు ఇదే ప్రధాన ఆయుధమయింది.
కరోనా ( కోవిడ్-19 )వ్యాధితో చనిపోయిన వారి మృతదేహాల తరలింపునకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. చనిపోయిన వ్యక్తి మృతదేహం తరలించేందుకు ప్రత్యేక సిబ్బంది ఏర్పాటుకు నిశ్చయించింది. ఈ ప్రత్యేక సిబ్బంది ఇతర విధులకు హాజరుకాకుండా చర్యలకు ఆదేశించింది. బాడీని బ్యాగ్లో శ్మశానానికి తరలించే ముందు మృతదేహానికి శానిటైజ్ చేయాలని పేర్కొంది. మృతదేహాల తరలింపునకు ప్రత్యేక వాహనాలు వినియోగించాలంది. అంత్యక్రియలకు ఐదుగురికి మించి హాజరుకాకూడదని ఆదేశాలు జారీచేసింది.
అన్నార్తులను, దాతలను కలిపేందుకు తెలంగాణ పోలీసు శాఖ వాట్సాప్ నెంబర్ ను ప్రకటించారు. ఇదే కాక మరింత సాంకేతికతలో వారిరువురినీ కలిపేలా పోలీస్ ఫుడ్ యాను కూడా రూపొందించారు. ఈ యాప్ లో భోజనం లేదా రేషన్ అవసరం ఉన్నవారు, దాతలు, కో-ఆర్డినేటర్లు (వలంటీర్లు) ఉంటారు. వీరు తమ ఫోన్ నెంబర్లను ఈ యాప్ లో రిజిస్టర్ చేసుకొని తగిన కార్యాచరణ ప్రారంభిస్తారు. ఈ యాప్ ద్వారా ఎక్కడా డబ్బు ప్రస్తావన రాదు.
కరోనా నేపథ్యంలో లాక్డౌన్ సమయాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొంటూ ఎస్.ఆర్.డి.పి. పనులను శరవేగంగా చేపడుతున్నారు. రోడ్లపై ట్రాఫిక్ లేకపోవడాన్ని అదునుగా తీసుకొని రేయింబవళ్లు పనులను చేపడుతున్నారు. ఈ మోకాను సద్వినియోగం చేసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఈ పనుల పర్యవేక్షణకు జీహెచ్ఎంసీ అధికారులు ఓ బృందంగా ఏర్పడ్డారు. గడువులోగా నిర్మాణాలు పూర్తిచేసేందుకు సాధ్యమైనంత ఎక్కువగా యంత్రాలను, మ్యాన్పవర్ను వినియోగించుకుంటూ విరామంలేకుండా 24 గంటలు పనులు కొనసాగిస్తున్నారు.
కరోనా వ్యాప్తి నిరోధానికి పోలీసులు తమవంతు పాత్రగా రేయింబవళ్లు కష్టపడుతున్నారు. అన్ని విడతల్లో లాక్ డౌన్ ను కఠినంగా అమలుచేయడంలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారు. గ్రామ, జిల్లా. రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేసుకొని ప్రజల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అయినప్పటికీ కొందరు లాక్ డౌన్ ను ఉల్లంగిస్తూ రోడ్ల మీదకు వస్తున్నారు. ఎటువంటి కారణం లేకుండానే కొంత మంది వీధుల్లోకి వస్తున్నారు. దీనివల్ల వారికి తెలియకుండానే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ సందర్భంలో పోలీసులు కఠినమైన నిబంధనలను అమలుచేశారు. ఏ కారణం లేకుండా బయటకు వచ్చేవారి మీద కేసులు పెడుతున్నారు. వారి బండ్లను సీజ్ చేస్తున్నారు. ప్రతీ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారు . అత్యవసర సేవలు, పనుల కోసం వెల్లేవారికి ప్రత్యేక పాస్ లు మంజూరుచేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, జనసంచారం ఉండే రైతు బజార్ల వద్ద మైకులతో ప్రజలకు కరోనా వైరస్ నివారణపై అవగాహన కల్పిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర బృందం కితాబు రాష్ట్రంలో కరోనా బాధితులకు చికిత్స అందించడంతోపాటు భద్రతా చర్యలు తీసుకోవడంలో దవాఖానల నిర్వహణ బాగున్నదని కేంద్రబృందం కితాబు ఇచ్చింది. వైరస్ వ్యాప్తి నివారణ, పాజిటివ్కేసులకు వైద్యం ఎలా అందిస్తున్నారనే విషయాన్ని పరిశీలించేందుకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్అగర్వాల్ బృందం 29 జూన్ 2020న హైదరాబాద్ పర్యటనకు వచ్చింది. గచ్చిబౌలిలో తెలంగాణ ఇన్స్టిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ను సందర్శించి, ఐసీయూ యూనిట్లు, ఐసొలేషన్ వార్డులను పరిశీలించింది. దోమలగూడలోని కంటైన్మెంట్ ఏరియా ధోబిగల్లీకి వెళ్లి పరిశీలించింది. గాంధీ దవాఖానను సందర్శించింది. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకున్న చర్యలపై పవర్పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చింది. రాష్ట్రంలో కరోనా చికిత్సకు 17,081 పడకలను సిద్ధంచేశామని, మెరుగైన వైద్యసేవలు అందించడానికి అదనపు సిబ్బందిని నియమించామని తెలిపింది. వైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రూ. 476 కోట్లు మంజూరు చేసినట్టు వివరించింది. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రం బృందం రాష్ట్రాన్ని ప్రశంసించింది.
కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు బాగున్నాయని కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్ముండా ప్రశంసించారు. 11 ఏప్రిల్ 2020న ఆయన తెలంగాణ గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో ఫోన్లో మాట్లాడి కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో గిరిజనుల కోసం తీసుకొంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకొన్నారు. లాక్డౌన్ సందర్భంగా గిరిజన ప్రాంతాల వారికి సీఎం కేసీఆర్ ఆదేశాలతో రేషన్ బియ్యం, అంగన్వాడీల ద్వారా పాలు, గుడ్లు, నిత్యావసరాలు అందిస్తున్నట్టు కేంద్రమంత్రికి మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. వైద్యసేవలకు ఇబ్బందులు లేకుండా ఐటీడీఏల ద్వారా అందించేందుకు సంబంధిత జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. బాలింతలు, గర్భిణులు, చిన్న పిల్లలకు వైద్యసేవల్లో లోపం రాకుండా అధికారులు చర్యలు తీసుకొంటున్నట్టు చెప్పగా, ఆయన ప్రశంసించారు.
కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్సింగ్ (19 ఏప్రిల్2020) కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా 2020 మే 7 వరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగించినప్పటికీ పాడి, మత్స్య, పౌల్ట్రీ, మాంస పరిశ్రమ, రైతులకు మినహాయింపులివ్వడం ప్రశంసనీయమని కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్సింగ్ అన్నారు. ఈ విషయమై ఆయన రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో ఫోన్లో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో ప్రజలకు రోగనిరోధక శక్తినిచ్చే పాడి, మత్స్య, పౌల్ట్రీ, మాంసం ఉత్పత్తులు లభిస్తున్నాయని కొనియాడారు.
కేంద్ర కుటుంబ సంక్షేమశాఖ సంచాలకుడు చంద్రశేఖర్ హైదరాబాద్లో కరోనా కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు బాగున్నాయని కేంద్ర కుటుంబ సంక్షేమశాఖ సంచాలకుడు డాక్టర్ చంద్రశేఖర్ ప్రశంసించారు. అత్యవసర బృందాలు 24 గంటలు పనిచేయడం పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. కంటైన్మెంట్లలో తీసుకొంటున్న చర్యలు, నిత్యావసరాలు అందుతున్న తీరుపై ఆరాతీశారు. హఫీజ్బాబానగర్, తాసీన్ ఫంక్షన్హాల్, బార్కాస్ ప్రాంతాల్లోని కంటైన్మెంట్లలో పర్యటించారు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చాలా కచ్చితంగా పనిచేస్తుందన్నారు.
(చాంద్రాయణగుట్ట సర్కిల్లో మూడు కంటైన్మెంట్ జోన్లను కేంద్ర కుటుంబ సంక్షేమశాఖ అధికారులు 22 ఏప్రిల్, 2020న సందర్శించారు.)
కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా ప్రశంస – 24.04.2020 కరోనా వ్యాప్తి నియంత్రణకకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కేంద్రం ప్రశంసించింది. రాష్ట్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో దాదాపు 45 లక్షల మాస్కులను తయారు చేశారు. వీటిని అత్యవసర సేవల్లో పాల్గొంటున్నవారికి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. నాణ్యమైన వస్త్రంతో తయారుచేస్తున్న ఈ మాస్కులను ఇతరులకు చౌకధరల్లో రూ.8 నుంచి రూ.10కి విక్రయిస్తున్నారు. స్వయంసహాయక సంఘాలు మాస్కులతోపాటు శానిటైజర్లను కూడా తయారుచేశాయి. రాష్ట్రంలో స్వయం సహాయక మహిళాసంఘాల ఆధ్వర్యంలో మాస్కుల తయారీని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా ట్విట్టర్ ద్వారా అభినందించారు. ఈ సంఘాలు కరోనా కట్టడికి పాటుపడుతూ, మహిళలకు ఆర్థికంగా ఆసరా కల్పిస్తున్నాయని, ఈ విధానం బాగున్నదని 24 ఏప్రిల్, 2020న ట్వీట్చేశారు.
కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. రోగులకు సకాలంలో పరీక్షలు నిర్వహించడమే కాకుండా వారికి మెరుగైన చికిత్సను అందజేస్తున్నదని కొనియాడింది. వ్యర్థాల నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం పక్కాగా చేపడుతున్నదని, దవాఖానలు, కంటైన్మెంట్ జోన్లు, రాత్రి బసకేంద్రాల్లోని ప్రజలకు భోజన సదుపాయాల్లో ఎలాంటి లోటులేకుండా చూస్తున్నదని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ ఢిల్లీలో మీడియాకు తెలిపారు.
కరోనా వైరస్ అన్ని శాఖలకు పాకుతున్న నేపథ్యంలో ప్రభుత్వం రక్షణ చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో సులభతర పాలనకు శ్రీకారం చుట్టింది. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు ఎలాంటి ఫైల్ అయినా డిజిటల్ పద్ధతిలోనే తయారయ్యేలా ప్రణాళిక రూపొందించింది. ప్రతి ఉద్యోగికి ప్రత్యేకంగా ఐడీ, పాస్వర్డ్ ఇచ్చి అన్ని ఫైళ్లను డిజిటల్ రూపంలోనే రూపొందించేలా ఆదేశాలిచ్చింది. దీంతో ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ- ఆఫీస్ విధానం అమల్లోకి రానున్నది.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వం రద్దుచేసింది. గతనెల విడుదలచేసిన ఫలితాల్లో ఫెయిలైన సెకండియర్ విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖంపట్టనందున విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైనవారిని కంపార్ట్మెంటులో పాస్చేస్తారు. ఈ నిర్ణయంతో 1.47 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది.
కోవిడ్ 19 పాజిటివ్ తో హోం ఐసోలేషన్లో ఉంటున్న కరోనా పేషంట్లకు ఉచితంగా కిట్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 17 రోజులకు సరిపోయే మందులను ఈ కిట్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఈ కిట్లలో విటమిన్ సి టాబ్లెట్లు -34, జింక్ టాబ్లెట్లు -17, బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు -17, క్లాత్ మాస్కులు-6, శానిటైజర్-1, గ్లోవ్స్ -2, సోడియం హైపోక్లోరేట్ ద్రవం -1 బాటిల్ ఉంటాయి. దీంతోపాటు హోం ఐసొలేషన్ లో ఎలా ఉండాలో సూచించే బ్రోచర్, కాల్ సెంటర్ల నంబర్లు, డాక్టర్లు, ఏఎన్ఎం, ఆశ వర్కర్ల మొబైల్ నంబర్లు ఉన్న ఓ పుస్తకం కూడా ఉంటుంది.
కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో ముందుండి పోరాడుతున్న గాంధీ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్న నర్సుల వేతనాన్ని రూ.17,500 నుంచి రూ.25 వేలకు పెంచుతున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. కోవిడ్ దవాఖానాల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి రోజుకు రూ.300 ఇన్సెంటివ్ కూడా ఇస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో కరోనాకు ఉచిత చికిత్స అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం తొలుత కామినేని, మమత, మల్లారెడ్డి మెడికల్ కాలేజీలను ఎంపిక చేశారు. ఆ మెడికల్ కాలేజీల్లో పడకల వివరాలు తెలిపేలా డ్యాష్ బోర్డు ఏర్పాటు చేస్తారు. ఫిర్యాదులకు వాట్సప్ నంబరు, హోం ఐసొలేషన్ సందేహాలకు 18005994455 టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతుండటంతో హైదరాబాద్ లోనే కాకుండా, జిల్లాల్లోనూ దాదాపు 30 చోట్ల క్రయోజనిక్ లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది.
రాష్ట్రంలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి, కోవిడ్ -19 పాజిటివ్ వచ్చినా, లక్షణాలు లేనివారందరికీ గ్రామస్థాయిలోనే వైద్యం అందించాలని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ వ్యాప్తి హైదరాబాద్ నుంచి జిల్లాలకు చేరుతుండటం, పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడంతో ఆరోగ్యశాఖ అధికారులు పీహెచ్.సీల్లోనూ యాంటీజెన్ టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్ ఉండి, లక్షణాలు లేనివారిని కూడా హోమ్ ఐసొలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నిమ్స్లో కొవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్
కరోనా వైరస్ కట్టడికి హైదరాబాద్లోని నిమ్స్లో కొవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ను వైద్యులు ప్రారంభించారు. ఇద్దరు వాలంటీర్లకు కొవాగ్జిన్ అనే వ్యాక్సిన్ను నిమ్స్ వైద్యులు ఇచ్చారు. స్వదేశీ కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ను భారత్ బయోటెక్ రూపొందించింది.
సమూహ వ్యాప్తి అరికట్టడంపై ప్రధాని మోదీకి కేసీఆర్ సూచనలు (19 జూలై 2020)కరోనాతో ఇక కలిసి బతకడం తప్పదని, దేశంలో ప్రజలను ఒక పక్క కాపాడుకొంటూనే మరోపక్క ఆర్థికరంగాన్ని కూడా నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో అన్నారు. 19 జూలై 2020న ప్రధాని మోదీ.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడిన ఈ క్రమంలో సీఎం కేసీఆర్తోనూ సంభాషించారు. దేశంలో కరోనా.. సామూహిక వ్యాప్తి దశకు చేరుకున్నదని ప్రధాని.. సీఎం కేసీఆర్తో చెప్పారు. దేశంలో కరోనాను నివారణకు అన్ని రాష్ట్రాలూ ప్రయత్నిస్తున్నాయని ప్రధాని అన్నారు.
దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలను తీసుకున్నదని, ప్రపంచవ్యాప్తంగా వైరస్ ఉద్ధృతి తగ్గకపోగా కమ్యూనిటీ స్ప్రెడ్ స్థాయికి చేరడం ఆందోళనకరమేనన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాతో సహజీవనం తప్పదని, మరింత జాగరూకతతో ప్రజలు తమ జీవనం కొనసాగించాల్సిన అవసరన్నదని, తమ ప్రభుత్వం ప్రజలను ఈ మేరకు అప్రమత్తం చేస్తున్నదని చెప్పారు. ఒక పక్క వైరస్తో పోరాడుతూనే ఆర్థికరంగాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని ప్రధానితో సీఎం కేసీఆర్ చెప్పారు.
కోవిడ్-19 ఆంక్షల నేపథ్యంలో ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ బోధన రెండు సెషన్లు చాలని , ప్రి ప్రైమరీ తరగతులకు రోజుకు అరగంట సరిపోతుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ తెలిపింది. 1 నుంచి 8 తరగతులకు రోజుకు రెండు క్లాసులు చాలని, ఒక్కోటి 30 నుంచి 45 నిమిషాలే ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నది. అలాగే 9 నుంచి 12 తరగతులకు గరిష్టంగా 4 సెషన్లలోనే బోధన ఉండాలని ప్రి ప్రైమరీకి రోజుకు అరగంట చాలునని అందులో వివరించింది.
రాష్ట్రంలోని మొత్తం 118 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 57 ప్రైవేటు ఆస్పత్రులుకాగా, మిగిలిన 61 సర్కారు దవాఖానాలు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గాంధీ, టిమ్స్ సహా అన్ని జిల్లాల ప్రభుత్వ, ప్రాంతీయ ఆస్పత్రులు, కొన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాలున్నాయి.
రాష్ట్రంలో కరోనా రోగుల రికవరీ రేటు 72శాతంగా నమోదైందని వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ పేర్కొన్నది. మరణాల శాతం 1 మాత్రమేనని మిగతావారు హోం క్వారంటైన్ లో, ఆస్పత్రుల్లో ఉన్నారని నివేదిక వివరించింది.
రాష్ట్రంలో కరోనా నిర్దారణ పరీక్షల ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ప్రతి 10 లక్షల జనాభాకు 140 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుండగా, రాష్ట్రంలో మాత్రం దానికంటే ఎక్కువగా దాదాపు 400 పరీక్షలు నిర్వహించినట్లు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ పేర్కొన్నది.
కరోనా విజృంభిస్తున్న వేళ రోగులు ఎలాంటి వైద్య ఇబ్బందులు ఎదుర్కోకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పడకల వివరాలను రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 55 కోవిడ్ ఆస్పత్రుల్లో 4,497 పడకలు, 1,616 ఐసీయూ పడకలు 3,537 ఆక్సిజన్ పడకలు ఉన్నట్లు వివరించారు. రాష్ట్రంలోని రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందకుండా ప్రభుత్వ, ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పడకలను వినియోగించుకోవచ్చని సూచించారు.
కరోనాకు చికిత్స అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పడకల సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిపేలా డ్యాష్ బోర్డు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకు అవసరమైన సాఫ్ట్ వేర్ ను ఆరోగ్యశ్రీ నుంచి తీసుకున్నారు. డ్యాష్ బోర్డు ద్వారా ఆస్పత్రుల సమాచారంతోపాటు కేసులు, మరణాలు, డిశ్చార్జిలు, టెస్టుల సంఖ్యను కూడా వెల్లడిస్తారు.
కోవిడ్ లాక్ డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా 2020 ఆగస్టు 1 నుంచి అన్ లాక్ 3.0 ప్రారంభం అవుతున్నది. ఇందులో భాగంగా 25శాతం సీటింగుతో సినిమాహాళ్లు, జిమ్ లు తెరిచేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది. విద్యాలయాలు, మెట్రో సర్వీసులు నడిపే విషయంలో కేంద్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
సిద్దిపేట : జిల్లా కేంద్రంలో కషాయ వితరణ కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు 25 జూలై 2020న ప్రారంభించారు. హరేకృష్ణ మూవ్మెంట్, మెగా కంపెనీ సహకారంతో కషాయ వితరణ కేంద్రం ఏర్పాటు చేశారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తన జన్మదినం సందర్భంగా ఇచ్చిన హామీని వారం రోజుల్లో నెరవేర్చారు. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా కరోనా నిర్ధారణ పరీక్షల కోసం తన సొంత డబ్బుతో ప్రభుత్వ దవాఖానలకు ఆరు కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్లు అందజేశారు. ప్రగతిభవన్లో 2020 జూలై 30న జరిగిన కార్యక్రమంలో అంబులెన్స్లకు జెండాఊపి వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్కు అప్పగించారు. తన పిలుపునకు స్పందించిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు దాదాపు 100 వరకు అంబులెన్స్లు ఇవ్వడానికి ముందుకొచ్చారు.
కరోనా అంశంపైనే ప్రత్యేకంగా 2020 ఆగస్టు 5న నిపుణులు, వైద్యులతో మంత్రివర్గం సమాలోచనలు చేసింది. కరోనాపై అధికారులు పూర్తి వివరాలను అందించారు. ‘ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు పాకిన కరోనా ప్రస్తుతం పెద్ద నగరాల్లో తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్లోనూ కేసులు తగ్గుతున్నాయి. తెలంగాణలో మరణాల రేటు తక్కువగా నమోదవుతున్నది. కాబట్టి ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని వైద్య నిపుణులు క్యాబినెట్కు వివరించారు.
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎన్ని కేసులు వచ్చినా వైద్యం అందించేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉన్నదని మంత్రివర్గం సమావేశం ప్రకటించింది. ఎక్కువ ఖర్చు చేసి ప్రైవేటు దవాఖానలకు పోవద్దని, ప్రభుత్వ హాస్పిటళ్లలో అన్ని వసతులు, మందులతోపాటు నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, వారి సేవలు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. కావాల్సిన మందులు, పరికరాలు, వసతులు ఏర్పాటు చేసేందుకు వెనుకాడబోమని స్పష్టంచేసింది.
లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల కష్టాలను ప్రపంచమంతా కళ్లారా చూసిందని, భవిష్యత్తులో వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని 5 ఆగస్టు 2020న జరిగిన క్యాబినెట్ సమావేశం అభిప్రాయపడింది. రాష్ట్రంలో పెద్దఎత్తున ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కార్మికులు పనిచేస్తున్నారని, వారి సంక్షేమానికి ప్రత్యేక పాలసీ తయారుచేయాలని నిర్ణయించింది. పుట్టిన ఊరిని, కన్న వారిని, కుటుంబాన్ని వదిలి పనికోసం తెలంగాణకు వచ్చే కార్మికులు.. ఇదే తమ ఇల్లు అనే భావన, భరోసా కలిగించేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. వలస కార్మికుల సంక్షేమ పాలసీని రూపొందించాలని అధికారులను ఆదేశించింది.
ఇజ్రాయెల్కు చెందిన కిడోడ్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ సంస్థ, మన దేశానికి చెందిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) కలిసి ఇటీవలే ‘వైరాన్’ పేరుతో ర్యాపిడ్ టెస్టింగ్ యంత్రాన్ని అభివృద్ధిచేశాయి. ఇది కంప్యూటర్ పరిమాణంలో ఉంటుంది. లాలాజలం నుంచి నమూనాలను సేకరించాల్సి ఉంటుంది. ఈ యంత్రం మన శరీరంలో కరోనా ఉన్నదో లేదో 50 సెండ్లలోనే గుర్తిస్తుంది. వైరస్ ప్రభావం వల్ల చనిపోయిన కణాలను గుర్తించే ‘అయాన్-మొబిలిటీ స్పెక్టోమెట్రీ’ (ఐఎంఎస్) టెక్నాలజీ ఆధారంగా ఇది పనిచేస్తుంది. డీఆర్డీవోతో కలిసి ఈ యంత్రాన్ని పరీక్షించగా, 95% కచ్చితత్వంతో 50 సెకండ్లలోనే ఫలితం వచ్చిందని కిడోడ్ తెలిపింది. వివరించింది. ఈ యంత్రంతో నిమిషానికి 70 పరీక్షలు చేయవచ్చని పేర్కొన్నది.
కొవిడ్-19 వ్యతిరేక పోరాటంలో భాగంగా జీ ఎంటర్టైన్మెంట్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి 20 అంబులెన్సులు, నాలుగు వేల పీపీఈ కిట్లను విరాళంగా ఇచ్చింది.
కరోనా రోగులకు వైద్యసేవలందించేందుకు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సొంతంగా రూ.50 లక్షలు వెచ్చించి ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బీబీనగర్లోని ఎయిమ్స్ సముదాయంలో 50 పడకలతో సౌకర్యాన్ని కల్పించారు. రోగులను తరలించేందుకు మూడు ప్రైవేటు అంబులెన్స్లూ అందుబాటులో ఉంచారు.
కరోనా మహమ్మారి నియంత్రణకు రాష్ర్ట ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో పలువురు దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. తాజాగా ఫ్లిప్కార్ట్ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి 50 వేల పీపీఈ కవర్ కిట్లను విరాళంగా ఇచ్చింది.
కరోనా వైరస్ వేగంగా విస్తరించకుండా అరికట్టడంలో తెలంగాణ సఫలమైంది. కోవిడ్ ను ఎదుర్కోవడంలో దక్షిణాది రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన పనితీరును కనబరిచిందని ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ), ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా), ఎఫ్.టి.సి.సి.ఐ (ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) పరిశీలనలో వెల్లడైంది. వైరస్ సోకినవారిని గుర్తించడం, వ్యాధి విస్తరణను నియంత్రించడం, బాధితులకు చికిత్స అందించడంలో దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాలకన్నా తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందని ఫిక్కీ, ఆస్కి, ఎఫ్.టీ.సీసీఐ ప్రకటించాయి.
క్వారంటైన్లో ఉన్నవారు | 25,937 |
07.04.2020 న డిశ్చార్జి అయ్యేవారు | 258 |
విదేశాలనుంచి వచ్చిన పాజిటివ్ కేసులు | 30 |
వారిద్వారా సంక్రమించిన కేసులు | 20 |
ఇప్పటివరకు డిశ్చార్జి అయినవారు | 35 |
08.04.2020 న డిశ్చార్జి అయ్యేవారు | 15 |
–
గుర్తించిన వ్యక్తులు | 1089 |
ఢిల్లీలో ఉన్నవారు | 30-35 |
పాజిటివ్ తేలినవారు | 172 |
వీళ్లద్వారా సంక్రమించినవాళ్లు | 93 |
వివరాలు సేకరించినవారి సంఖ్య | 3000 |
రిపోర్టుల కోసం వేచి ఉన్న కేసులు | 600 |
పాజిటివ్గా భావిస్తున్న కేసులు | 100-110 |
చనిపోయినవారు | 11 |