సమాచార సాంకేతిక విజ్ఞానానికి దేశంలో ప్రముఖంగా వినిపించే పేరు తెలంగాణ రాష్ట్రం. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరం. అందుకే ఐటీ రంగాన్ని అభివృద్ధి పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను కేటాయిస్తున్నది.
ఐటి
ఏడేండ్లలో రెట్టింపైన ఐటీ ఎగుమతులు :
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి ఏడేండ్లలో ఐటీ ఎగుమతులు రెట్టింపయ్యాయి. రాష్ట్రం ఏర్పడినపుడు రూ.66,276 కోట్ల ఐటీ ఎగుమతులు జరిగితే, 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.1,09,219 కోట్లకు, 2019-20లో రూ.1,28,807 కోట్లకు ఎగుమతులు పెరిగాయి. 2020లో కరోనా ప్రభావం ఐటీ రంగంపై పడినప్పటికీ తెలంగాణ ఐటీ మాత్రం ఎగుమతుల్లో జాతీయ స్థాయి 8.09 శాతంకంటే ఎక్కువగా 17శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. 2019- 20 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 23.53 శాతానికి చేరుకొని ఐటీలోనే మేటిగా నిలిచింది. ఐటీ ఉద్యోగాల కల్పనలోనూ తెలంగాణ 19.07 శాతానికి చేరుకొని తన మార్కును చాటింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఏడేళ్లలో మరో 2.10 లక్షల మందికి అదనంగా ఉద్యోగాలు వచ్చాయి.
మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐ.బీ.ఎం., ఒరాకిల్ వంటి అనేక బహుళజాతి సంస్థలు తెలంగాణలో తమ కార్యాలయాల్ని నడుపుతున్నాయి. దేశీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్., టెక్ మహేంద్ర వంటి కంపెనీలెన్నో తెలంగాణలో ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్ సంస్థ వారు రూ. 1,000 కోట్ల పెట్టుబడితో తమ క్యాంపస్ ను నెలకొల్పారు. గూగుల్ సంస్థ అమెరికా బయట, అదీ హైదరాబాద్ లో ఇంత పెద్దఎత్తున తమ కార్యకలాపాల్ని విస్తరించడం విశేషం. అమెజాన్ సంస్థ తమ క్యాంపస్ ను హైదరాబాద్ లో ప్రారంభించింది. అలాగే ప్రపంచ ప్రఖ్యాత యాపిల్ కంపెనీ హైదరాబాద్లో 2016 మే 19న మాప్స్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించింది. నానక్రామ్గూడలోని వేవ్ రాక్లో యాపిల్ సంస్థ నూతన కార్యాలయాన్ని యాపిల్ సీఈఓ టిమ్ కుక్, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. యాపిల్ ఉత్పత్తులైన ఐ ఫోన్, ఐ ప్యాడ్, యాపిల్ వాచ్ల వంటి ఉత్పత్తులకు మ్యాప్ల అభివృద్ధి పనులను ఈ కేంద్రం నుంచి సాగిస్తారు. ఈ కేంద్రంలో 4 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మ్యాప్స్ డెవలప్మెంట్ కోసం హైదరాబాద్లో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. పెట్టుబడులకు అనుకూలమైన విధానాలతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. ఇదే స్పూర్తితో మరింత నిర్మాణాత్మకంగా ముందుకు పోతున్నది తెలంగాణ ప్రభుత్వం. ప్రపంచంలోని అగ్రశేణి ఐదు ఐటీ సంస్థలయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్, సేల్స్ఫోర్స్ తమ రెండో అతిపెద్ద కార్యాలయాలను కూడా ఏర్పాటు చేశాయి.
అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రపంచంలోనే అతి పెద్ద క్యాంపస్ భవనాన్ని హైదరాబాద్లో ప్రారంభించనుంది. ఈ భవనాన్ని నానక్రాంగూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 10 ఎకరాల స్థలంలో అత్యాధునిక మౌలికవసతులతో నిర్మించారు. 15 అంతస్తుల భవనంలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో పార్కింగ్ ప్రదేశం, మరో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉద్యోగులు పనిచేసే కార్యాలయ ప్రాంగణాన్ని నిర్మించారు. దీన్ని 21 ఆగస్టు, 2019న ప్రారంభించారు. ఈ క్యాంపస్ ద్వారా 9 వేల మంది ఉద్యోగులకు ఉపాధి లభిస్తుంది. అమెజాన్కు చెందిన వివిధ గ్లోబల్ బిజినెస్, టెక్నాలజీ టీమ్స్ బ్యాకెండ్ కార్యకలాపాలను ఇక్కడ నుంచే ఉద్యోగులు నిర్వహించనున్నారు. దేశంలోనే అతిపెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్ (గోదాము)ను శంషాబాద్ వద్ద రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇది నాలుగు లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో ఉంది. దీన్ని 5.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంకు పెంచుకోవాలన్న యోచనలో ఉంది.
తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడి..
రూ.20,761 కోట్లతో డాటా సెంటర్ రీజియన్
తెలంగాణ రాష్ట్రంలో ఎంతో సానుకూల వాతావరణం ఉండటం, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందజేస్తుండటంతో దేశ, విదేశీ కంపెనీలు భారీ సంఖ్యలో తమ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగనంత భారీ స్థాయిలో.. హైదరాబాద్ లో డాటా సెంటర్ రీజియన్ ఏర్పాటు కోసం రూ.20,761 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు అంతర్జాతీయ దిగ్గజ సంస్థ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏ.డబ్ల్యు.ఎస్) 2020 నవంబర్ 6న ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలో ఇదే అతిపెద్ద విదేశీ పెట్టుబడి. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు 2020 ఆరంభంలో దావోస్ పర్యటనకు వెళ్లినపుడే ఈ అమెజాన్ పెట్టుబడికి బీజం పడగా, అది కార్యరూపం దాల్చింది. కాగా, అమెజాన్ 2019లోనే హైదరాబాద్ లో అతిపెద్ద క్యాంపస్ ను నెలకొల్పింది. 9.5 ఎకరాల్లో నిర్మించిన ఈ కార్యాలయం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇందులో 49 అత్యాధునిక లిఫ్టులు ఏర్పాటు చేశారు. కేవలం ఒక సెకనులోనే మరో ఫ్లోర్ కు చేరుకోగలిగే ఈ లిఫ్టులను ఒకేసారి 972 మంది ఉపయోగించుకోవచ్చు. 282 అడుగుల ఎత్తుండే ఈ భవన నిర్మాణం కోసం 2 వేల మంది కార్మికులు, సిబ్బంది 39 నెలలపాటు శ్రమించారు. ఈఫిల్ టవర్ నిర్మాణానికి వాడిన ఉక్కుకంటే హైదరాబాద్ అమెజాన్ క్యాంపస్ కు రెండురెట్లు ఎక్కువ ఉక్కును ఉపయోగించడం విశేషం.
రాష్ట్రాల్లో ఇదే అతిపెద్ద పెట్టుబడి..
ఒక రాష్ట్రంలో అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఒకేసారి 20వేల కోట్లకు పైగా భారీ పెట్టుబడి పెట్టడం ఇదే తొలిసారి.
అమెజాన్ కు 131 ఎకరాల భూమి కేటాయింపు
తెలంగాణలో రూ.20,761 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన ఆన్ లైన్ వాణిజ్య సంస్థ అమెజాన్ కు రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతగా రంగారెడ్డి జిల్లాలోని 3 ప్రాంతాల్లో 131 ఎకరాల భూమిని కేటాయించింది. రావిర్యాల ఎలక్ట్రానిక్ సిటీలో 50 ఎకరాలు, కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో 48 ఎకరాలు, షాబాద్ మండలం చందనవెల్లిలో 33 ఎకరాల భూమిని ఇచ్చింది. అమెజాన్ రావడం వల్ల ఫార్మాసిటీ, పారిశ్రామిక పార్కులకు, పరిశ్రమలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు భూములు కేటాయించింది.
ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలతో పరిశ్రమలతోపాటు పెద్దఎత్తున ఐటీ కంపెనీలు కూడా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఐటీ కంపెనీల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తున్నది. ఫలితంగా అమెజాన్, డీఈ. షా,గూగుల్, ఊబర్, సెల్ కాన్ లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. 2018-19 నాటికి 1500 ఐటీ/ఐటీఇఎస్ కంపెనీల్లో 5,43,033 మందికి పైగా ప్రత్యక్షంగా, 7లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించింది. 2017-18 తో పోలిస్తే ఉద్యోగాల పెరుగుదల శాతం 14.2 శాతం పెరిగి అదనంగా 67,725 మందికి ఉద్యోగాలు లభించాయి. 2013-14 లో రూ.52.25 వేల కోట్లు ఉన్న ఐటి ఎగుమతులు 2019-2020 నాటికి రూ.1,28,807 కోట్లకు చేరాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో కేవలం 8.7 శాతం వృద్ధి రేటు నమోదైతే, 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరో 2.8 అదనపు వృద్ధి సాధించి, మొత్తంగా 11.5 శాతం వృద్ధి రేటును సాధించింది. జాతీయ ఐటీ ఎగుమతుల వృద్ధి 7.8 శాతం మాత్రమే ఉన్నది. జాతీయ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ ఐటీ వాటా 11 శాతంగా వున్నది. రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తున్న ఎగుమతుల్లో ఐటీ ఎగుమతులే 50 శాతం వున్నాయి. తెలంగాణ ఐటీ ఎగుమతులు 13 శాతం పెరిగాయి.
2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో ఐటీ ఎగుమతులు, ఉపాధికల్పనలో తెలంగాణ
అంశం | 2018-19 | 2019-20 | పెరిగిన శాతం |
తెలంగాణ ఐటీ ఎగుమతులు (రూ.కోట్లలో) | 109219 | 128807 | 17.93 |
ఉపాధి పొందిన వారు | 543033 | 582126 | 7.20 |
దేశంలో మొత్తం ఐటీ ఎగుమతులు | 1029248 | 1112496 | 8.09 |
దేశవ్యాప్తంగా ఉపాధి పొందిన వారు | 4158000 | 4363000 | 4.93 |
ఇతర రాష్ట్రాల ఎగుమతులు | 920029 | 983689 | 6.92 |
ఇతర రాష్ట్రాల్లో ఉపాధి పొందిన వారు | 3614967 | 3780874 | 4.59 |
లుక్ ఈస్ట్.. గ్రేటర్ హైదరాబాద్ తూర్పున ఐటీ పార్కులు
ఐటీరంగంలో హైదరాబాద్ నగరం నలువైపులా పెట్టుబడులను ఆకర్శించేందుకు గ్రోత్ ఇన్ డిస్పర్షన్ (గ్రిడ్) పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన లుక్ ఈస్ట్ నినాదంతో.. గ్రేటర్ హైదరాబాద్ తూర్పు దిక్కున గల ఉప్పల్, మల్లాపూర్, నాచారం తదితర ప్రాంతాల్లో ఐటీ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ప్రాంతాల్లో ఖాయిలాపడిన పరిశ్రమల స్థానంలో ఐటీ పార్కులను నిర్మించనున్నారు. వీటి భూ మార్పిడికి ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. 35 ఎకరాల్లో 25 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు జరపనున్నారు. ఇవి పూర్తయితే దాదాపు 30 వేల మంది ఐటీ ఉద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి.
ఐటీ రంగంలో లక్ష కొత్త ఉద్యోగాలు
హైదరాబాద్లో ఐటీ పరిశ్రమలు ఒకేచోటకాకుండా నగరం నలువైపులా విస్తరించాలని క్యాబినెట్ అభిప్రాయపడింది. హైదరాబాద్ పశ్చిమ ప్రాం తంలో తప్ప మిగతా చోట్ల ఐటీ కంపెనీలు పెట్టేవారికి అదనపు ప్రోత్సాహకాలు అందించే హైదరాబాద్ గ్రిడ్(గ్రోత్ ఇన్ డిస్పెర్షన్) పాలసీని క్యాబినెట్ బుధవారం ఆమోదించింది. వచ్చే ఐదేండ్లలో లక్ష కొత్త ఐటీ ఉద్యోగాలు వస్తాయని అంచనావేసింది. అటు ఉద్యోగులకు, ఇటు కంపెనీలకు ప్రయోజనకరంగా ఈ గ్రిడ్ను రూపొందిస్తున్నారు. హైదరాబాద్ గ్రిడ్ గురించి..
హైదరాబాద్ ఐటీ ఎగుమతులు గతేడాది(2019-20) 18శాతం వృద్ధి సాధించి, రూ.1,18,000 కోట్లు నమోదు చేసుకున్నాయి. ఇది భారతదేశ సగటు వృద్ధి(8శాతం) కంటే రెట్టింపునకు పైగా ఉండడం గమనార్హం. ఈ ఐటీ వృద్ధి 90శాతం మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ చుట్టుపక్కన ఉన్న పశ్చిమ ప్రాం తంలోనే కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ కారిడార్ వెలుపల అనగా-ఉత్తరాన(కొంపల్లి, దాని పరిసరాలు), తూర్పు(ఉప్పల్, పోచారం), దక్షిణ(విమానాశ్రయం, శంషాబాద్, ఆదిభట్ల), వాయవ్యం(కొల్లూరు, ఉస్మాన్సాగర్), సహా పశ్చిమానికి వెలుపల ప్రాంతాల్లో వృద్ధిని ప్రోత్సహించడానికి గ్రిడ్విధానం ఉపకరిస్తుంది.
గ్రిడ్ విధానంతో అందరికీ ప్రయోజనమే..
• ఉద్యోగులకు: ఉద్యోగులపరంగా.. ఉప్పల్ ప్రాంతంలోని ఐటీ పార్క్లకు మెట్రో సదుపాయం బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలితో పోలిస్తే నివాస ఖర్చులు సైతం చాలా తక్కువగా ఉంటాయి.
• కంపెనీలకు..: కార్యాలయాలకు సంబంధించిన ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. లీజుకు అయ్యే ఖర్చు, రవాణా ఖర్చులు తగ్గుతాయి.
• సదుపాయాలు: నలుదిశల అభివృద్ధి జరుగడంతో నగరంలోని మౌలిక సదుపాయాలపై భారం తగ్గుతుంది.
ప్రోత్సాహకాలు..
2025 వరకు పెట్టుబడుల అంచనా..
• 2025 వరకు 100 ఎకరాల పారిశ్రామిక పార్క్లు స్థలం మారుతాయని అంచనా.
• పశ్చిమ కారిడార్ వెలుపల ఉన్న ప్రాంతాలు(ఉప్పల్, పోచారం, ఘట్కేసర్, కొంపలిసహా) సుమారు 10 మిలియన్ చదరపు అడుగుల అంతర్నిర్మిత స్థలం, ఒక లక్ష ఐటీ ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా.
వ్యవధి, పెట్టుబడి…
• పాలసీ ఇష్యూ నుంచి ఐదేండ్ల కాలానికి గ్రిడ్ మార్గదర్శకాలు అమలులో ఉంటాయి. ఏదైనా సంస్థ ఐదేండ్ల వ్యవధిలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన సమయం నుంచి 5 ఏండ్ల కాలానికి ప్రయోజనాలు పొందవచ్చు.
• గ్రిడ్ పాలసీకి ప్రోత్సాహకాలుగా విడుదల చేయాల్సిన మొత్తం-పదేండ్లలో రూ.66.75కోట్లు.
• కన్వర్షన్ చార్జీల ద్వారా డెవలపర్ల నుంచి పొందే మొత్తం రుసుం రూ.150 కోట్లు.
ఐటీ రంగాన్ని గ్రామస్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సాఫ్ట్ వేర్ అభివృద్ధి కేంద్రాలు, బీపీవోల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది. ప్రభుత్వ కృషి కారణంగా సైంట్ లిమిటెడ్ సంస్థ తన సాప్ట్ వేర్ అభివృద్ధి కేంద్రాన్ని వరంగల్లో ఏర్పాటు చేయగా, వాంక్డోత్ సాప్ట్ వేర్ సొల్యూషన్స్ సంస్థ జనగామ, హుజూరాబాద్లలో కార్యకలాపాలను ప్రారంభించింది. ఎక్లత్ హెల్త్ సొల్యూషన్ సంస్థ కరీంనగర్లో 100 సీట్లతో బీపీవోను ప్రారంభించగా, రూరల్స్ షోర్స్ సంస్థ ఖమ్మంలో బీపీవో సెంటర్ను ప్రారంభింభిస్తున్నది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో బీపీవోల ఏర్పాటు విషయాన్ని పరిశీలిస్తున్నాయి.
టైర్ -2, టైర్ 3 పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహించే ఐటీ కంపెనీలకు ఐసీటీ పాలసీ, గ్రామీణ సాంకేతిక కేంద్ర పాలసీ కింద ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీ అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇందులో పంచాయతీ/మున్సిపల్ పన్నులతోపాటు ఎగ్జిబిషన్ స్టాల్ అద్దెల తిరిగి చెల్లింపు, ఈవెంట్ వ్యయం తిరిగి చెల్లింపు, స్టాంపు డ్యూటీ, టాన్స్ ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు తిరిగి చెల్లింపు, విద్యుత్ కేటగిరీ మార్పు, నాణ్యత ధ్రువీకరణ రుసుం, ఇంటర్నెట్, టెలిఫోన్ ఛార్జీలు తిరిగి చెల్లింపు, టెండర్ డాక్యుమెంట్ వ్యయం ఎస్డీ/ ఈఎండీ చెల్లింపు నుంచి మినహాయింపు, తక్షణ సబ్సిడీ, నియామక సాయం, పునరుత్పాదక విద్యుత్ సౌలభ్యం, మొదటి 3 యాంకర్ యూనిట్ల ప్రారంభ సబ్సిడీ, పెట్టుబడి, అద్దెల్లో రాయితీ ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.
ఐటీ రంగంలో ప్రశంసాత్మకంగా చెప్పదగిన మరో ముందడుగు డిజిటల్ తెలంగాణ కార్యక్రమం. పల్లె పల్లెలో ప్రతి పౌరుడికి డిజిటల్ సౌకర్యాలను అందించాలన్న లక్ష్యంతో 2015 జూలై 1న ప్రారంభించారు. ఆదునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకుని సొసైటీ ఫర్ తెలంగాణ స్టేట్ నెట్ వర్క్ (సాఫ్ట్ నెట్) పనిచేస్తుంది. టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్ల ద్వారా విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి, నైపుణ్యం, శిక్షణ వంటి రంగాల్లో అధునిక పద్ధతులను అవలంభించేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పాఠశాల విద్యపై దృష్టి కేంద్రీకరించి ఈ-లెర్నింగ్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నది. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య, సాంకేతిక విద్య విభాగాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తూ ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తోంది టి-సాట్. 2017లో విద్యార్థులు, నిరుద్యోగులు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, విద్య, వైద్య రంగాల్లో నైపుణ్యం పెంపొందించడానికి 3 వేల గంటల ప్రసారాలు చేసింది.
విద్యారంగానికి సేవలు అందించడమే కాకుండా, తెలంగాణ నిరుద్యోగ యువతను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పోటీ పడేందుకు ప్రత్యేక కృషి చేస్తుంది టి-సాట్ టీవీ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న నిరుద్యోగ యువతకు వివిధస్థాయిల్లో అవగాహన కార్యక్రమాల ప్రసారాలందిస్తూనే, వేలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ సాధనలో చేయూత నందించింది. మారుమూల ప్రాంతాలు, వ్యయ భారాన్ని మోయలేని నిరుద్యోగ యువకులకు టీ-సాట్ టీవీ అవగాహన కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.పోటీ పరీక్షలే కాకుండా ఆధ్యాత్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రజలకు అందిస్తోంది. టీ-సాట్ నెట్ వర్క్ ప్రసారాలు గతంలో ఉన్న ఆర్వోటీ వ్యవస్థను ఉపయోగించుకుంటూనే కేబుల్ ద్వారా ప్రసారాలు చేస్తూ విస్తృత కనెక్టివిటినీ పొందగలిగింది. తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, సొషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ తదితర సుమారు 4500 పాఠశాలల విద్యార్థులు టీ-సాట్ ప్రసారాలను అందుకుంటున్నారు. డిజిటల్ బోధన, ప్రసారాలు, శిక్షణ ద్వారా దేశంలోనే అగ్రభాగాన నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. దేశంలో ఈ తరహా సేవలందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేవలం 3,500 ఆర్వోటీలకు పరిమితమైన మన టీవి, తెలంగాణ ఆవిర్భావం తరువాత కేబుల్ రంగంలోకి ప్రవేశించి తెలంగాణలోని 70 లక్షల నుండి 80 లక్షల కుటుంబాలకు టీ-సాట్ ప్రసారాలను అందిస్తుంది. తెలంగాణలోని 40మంది ఎంఎస్ఓలు తమ ప్రసార కేంద్రాల ద్వారా ప్రజలకు టి-సాట్ విద్య, టి-సాట్ నిపుణ ప్రసారాలు అందుతున్నాయి. కేబుల్ ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా టి-సాట్ నెట్ వర్క్ ఛానళ్ల ప్రసారాలు వెళుతున్నాయి. సంవత్సర కాలంలో యూట్యూబ్ వ్యూస్ 2,61,69,146 ఉండగా, సబ్ స్ర్కైబ్స్ 1,48,006 లభించాయి. టీ-సాట్ ప్రసారాలను ఆన్ లైన్ లో చూసిన వీక్షకుల సంఖ్య 14,99,84,995గా నమోదైందంటే టీ-సాట్ ప్రసారాలకు ఆదరణ అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ శాఖలైన మహిళా శిశు సంక్షేమ ప్రసారాలను నేరుగా 2 వేల మంది అంగన్ వాడీ ఆయాలు, సూపర్ వైజర్లు, సీడీపీవోలు చూస్తుండగా పరోక్షంగా లక్షల మంది చిన్నారులు వారి తల్లిదండ్రులు ప్రసారాలు చూస్తూ అవగాహన పెంచుకుంటున్నారు. ఇక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఫీల్డ్ అసిస్టెంట్స్, గ్రామజ్యోతి కమిటీ సభ్యులు, సర్పంచ్ వార్డు సభ్యులు 4వేల మంది నేరుగా ఉన్నతాధికారుల ప్రసారాలు చూస్తుండగా పరోక్షంగా 1 లక్షా 50 వేల మందికి పైగా సిబ్బంది, సంబంధీకులు అనుసరిస్తున్నారు. విద్యాశాఖ ద్వారా ప్రసారమవుతున్న విషయాలు పాఠశాలలు, కళాశాలలు, సాంకేతిక కళాశాల్లోని 30 లక్షల విద్యార్థులకు చేరుతున్నాయి.
ఐటీ పాలసీని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2016 ఏప్రిల్ 4న ఐటీ దిగ్గజాల సమక్షంలో విడుదల చేసింది. మొత్తం అభివృద్ధి ఒక్కచోటనే కాకుండా వికేంద్రీకరణ, సర్వతోముఖాభివృద్ధి లక్ష్యాలుగా ఈ పాలసీకి రూపకల్పన చేశారు. గ్రామీణ, పట్టణ యువతను ప్రోత్సహించేలా ఐటీ పాలసీ ఉంది. దీంతోపాటు మరో 4 అనుబంధ పాలసీలు కూడా ఆవిష్కరించారు. ఇన్నోవేషన్, గేమింగ్ – యానిమేషన్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, రూరల్ టెక్నాలజీ పాలసీలు ఈ విధానంలో పొందుపరచబడి ఉన్నాయి. ఈ ఐటీ పాలసీ ద్వారా 2020 నాటికి 4 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా, 20 లక్షల ఉద్యోగాలు పరోక్షంగా ఏర్పడనున్నాయి. రూ.1 లక్షా 20 వేల కోట్ల ఐటీ ఎగుమతులు సాధించడానికి ఈ పాలసీ ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది.
ఐటీ ప్రపంచంలో హైదరాబాద్ ఖ్యాతిని మరింత ఉన్నతస్థానానికి తీసుకెళ్లేందుకు అంతర్జాతీయస్థాయిలో సిద్ధమైన ఇంక్యుబేటర్ సెంటర్ టీ-హబ్ ను 2015 నవంబర్ 5న ప్రారంభించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాత సౌకర్యాలతో టీ-హబ్ భవనాన్ని కాటలిస్ట్ పేరుతో నిర్మించారు. దేశంలోనే ప్రభుత్వ రంగంలో నిర్మితమైన ఇంక్యుబేటర్ సెంటర్ ఇదే కావడం విశేషం. మౌలిక సదుపాయాలతోపాటు.. మూలధన నిధుల కింద రూ.10 కోట్లను కూడా టీ సర్కారు కేటాయించింది. 1జీబీ ఇంటర్నెట్, అన్లిమిటెడ్ వైఫై సదుపాయం, అత్యున్నత సదుపాయాలతో జీ+5 విధానంలో టీ హబ్ భవంతిని నిర్మించింది. ఈ భవనానికి కాటలిస్ట్ పేరును ఖరారు చేసి, గ్రీన్ బిల్డింగ్గా, ఎనర్జీని ఎఫీషియెంట్గా తీర్చిదిద్దింది. కేవలం మౌలిక వసతులతో భవనం నిర్మించి వదిలేయకుండా.. స్టార్టప్లకు అండగా నిలిచేందుకు అత్యున్నత సంస్థలనూ భాగస్వామ్యం చేసింది. టెక్నాలజీ స్టార్టప్ లను టీ- హబ్ ప్రొత్సహిస్తుంది. మంచి ఆలోచనలతో కంపెనీని ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహికులకు ఇది ప్రేరణగా నిలుస్తున్నది. వినూత్న ఆలోచన కలిగిన శక్తివంతమైన పారిశ్రామిక వేత్తలను ఒక్కచోట చేర్చేందుకు టి- హబ్ కృషి చేస్తున్నది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు విజేతలై నిలిచేందుకు ఇది తోడ్పాటునిస్తుంది.
టీ హబ్ ఇంక్యుబేటర్ మొదటి దశ ప్రగతి
నవంబర్ 2017 నాటికి టీ-హబ్లో 337 స్టార్టప్లను ఇంక్యుబేట్ చేశారు. ఇవి పెట్టుబడిదారుల నుంచి రూ. 91.65 కోట్ల నిధులు సమకూర్చాయి. 25 కార్పొరేట్ సంస్థల నుంచి టీ-హబ్ భాగస్వామ్య ప్రతిపాదనలు స్వీకరించింది. దాదాపు 10 స్టార్టప్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. టీ-బ్రిడ్జ్ అనే విలక్షణమైన కార్యక్రమాన్ని కూడా టీ-హబ్ ప్రారంభించింది. దీనిద్వారా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్లు అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునేలా ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తున్నది. ఇక్కడ నెలకొల్పబడిన పలు స్టార్టప్ లు దేశ, విదేశాల్లో పనిచేస్తున్న ఐటీ, బీపీవో, కేపీవో, సేవా, బీమా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హెల్త్ కేర్, ఇండస్ట్రీస్ రంగాల్లో సేవలందిస్తోన్న కంపెనీలకు సాంకేతిక సహకారం అందిస్తున్నాయి. అయితే, ఇది తొలిదశ మాత్రమే. టీ-హబ్ అసాధారణ విజయం తరువాత, 4వేల మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం అదనపు ఇంక్యుబేషన్ స్థలంతో టీ-హబ్ IIవ దశను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది.
టీ హబ్ ఫేజ్ 2
టీ హబ్ రెండో దశను 2020 జూన్ నాటికి పూర్తిచేయనున్నారు. టీహబ్ రెండోదశ భవనాన్ని 9 అంతస్తులు 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. నాలుగు వేలమంది సాంకేతిక నిపుణులకు ఇది వేదిక కానుంది. బయటి నుంచి చూసేవారికి ప్రధాన కేంద్రం నుంచి 4 పిల్లర్లు, రెండు స్టీలు దూలాలతో వేలాడే భవంతిలా కనిపించనుంది. 9 అంతస్తుల్లో 60 మీటర్ల ఎత్తు, 90 మీటర్ల పొడవున దీనిని నిర్మిస్తున్నారు. రెండు లక్షల చదరపు అడుగుల నిర్మాణ వైశాల్యం, మరో రెండు లక్షల అడుగుల పార్కింగ్ సదుపాయంతో సుమారు రూ.330 కోట్ల అంచనా వ్యయంతో దీనిని చేపట్టారు. దుబాయ్లోని బుర్జ్ దుబాయ్ నిర్మాణశైలిని పోలినరీతిలో ఈ అధునాతన భవంతి నిర్మాణం జరుగుతున్నది.
టి-హబ్ మాదిరిగా ఎలక్ట్రానిక్స్, హార్ట్ వేర్ పరిశోధనల కోసం ప్రభుత్వం టి-వర్క్స్ ను ఏర్పాటు చేస్తున్నది. దీనివల్ల హైదరాబాద్ లో హార్డ్ వేర్ పరిశోధనలకు, ఆలోచనలకు ఊతం లభిస్తుంది. టి హబ్ ఫేజ్ – II భవనానికి సమీపంలోనే టీ వర్క్స్ భవనాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. దాదాపు రూ.44 కోట్ల వ్యయంతో 78 వేల చదరపు అడగుల విస్తీర్ణంలో టీ వర్క్స్ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 2020 నాటికి 75 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పనులను వేగంగా పూర్తిచేసి జూన్ 2020 నాటికి ప్రారంభించనున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రోగులకు వెంటిలేటర్ల అవసరం బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో టీ వర్క్స్ ఆధ్వర్యంలో రూ.35 వేలల్లోనే కరోనాకు వెంటిలేటర్ ను మరికొందరు స్టార్టప్ లతో కలిసి తయారుచేశారు.
పరిపాలనలో పారదర్శకత- ప్రజలకు జవాబుదారీగా ఉండాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో నూతనమార్పులకు శ్రీకారం చుట్టింది. కాగితాలతో పని లేకుండా, ఆలస్యం, అలసత్వానికి తావులేకుండా ఈ- ఆఫీస్ను తీసుకువచ్చింది. తొలివిడతలో సాధారణ పరిపాలనశాఖ, అబ్కారీ, మద్యనిషేధశాఖ, వాణిజ్యపన్నులు, ప్రధాన కమిషనర్, భూపరిపాలనశాఖలు ఈ-ఆఫీస్ విధానం అమలుకు 18 జూలై 2020న శ్రీకారంచుట్టాయి.. కొత్త విధానం ద్వారా సమయం వృథా కాకపోవడంతోపాటు.. పాలనలోనూ పారదర్శకత పెరుగుతుంది. ఫైల్ ఎక్కడా ఓవర్లుక్ కాకుండా ఉంటుంది. ఇందులో ప్రస్తుతం 1,600 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారు. ప్రతి దరఖాస్తు, పరిష్కారానికి జవాబుదారీతనం ఏర్పడుతుంది. జాప్యానికి తావులేకుండా పౌరులకు సత్వర, మెరుగైన సేవలు అందుతాయి.
సమస్త సమాచారం కంప్యూటరీకరణ
రాష్ట్ర ఆవిర్భావం నుంచే సమస్త సమాచారాన్ని కంప్యూటరీకరించే కార్యక్రమం చేపట్టింది. ఇందులోభాగంగానే భూ రికార్డులన్నింటినీ ప్రక్షాళనచేసి కంప్యూటరీకరించింది. ఇంటర్నెట్లో భూములకు చెందిన సమస్త వివరాలు అందులో ఉన్నాయి. ఏ భూమి ఎవరికి ఏ విధంగా సంక్రమించిదనే వివరాలను కూడా పొందుపరిచింది. ఇప్పుడు నోట్ఫైల్ కూడా ఈ- ఆఫీస్ ద్వారా చేయడానికి శ్రీకారం చుట్టింది.
హైదరాబాద్ నగరంలో గేమింగ్, మల్టీమీడియా, యానిమేషన్ రంగాలకోసం ఇమేజ్ సిటీని నిర్మించనున్నారు. ఇందులో 5 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో ఇమేజ్ టవర్ నిర్మించ నున్నారు. 2017 డిసెంబర్ 9న జరిగిన నాస్కామ్ సదస్సులో ఇమేజ్ టవర్స్ నమూనాను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. గేమింగ్ ఇండస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వం పన్నుల మినహాయింపు, ఇంటర్నెట్ బిల్లుల రీయింబర్స్మెంట్ సహా భారీఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తున్నది. రెండున్నరేళ్లలో 2550 సంస్థలు రూ. 45 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. 1.6 లక్షల మందికి ప్రత్యక్షంగా, 5 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తున్నది.
ఐటీ రంగ వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు క్రియాశీలంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అందులో భాగంగా ఇమేజ్ టవర్ ఏర్పాటుకు సిద్ధమైంది. యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్ రంగానికి హైదరాబాద్ను కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు 2016లో ఇమేజ్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో భాగంగా రూ.900 కోట్ల వ్యయంతో సాలార్ పురియా వారు ఇమేజ్ టవర్ను 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిలో నిర్మిస్తున్నారు. ఈ టవర్ నుంచి 200కు పైగా కంపెనీలు తమ వ్యాపార కార్యకలపాలను కొనసాగించవచ్చు. ఇందులో స్టూడియోలు, ప్రివ్యూ థియేటర్లు సహా మరికొన్నింటిని కామన్ ఫెసిలిటీ కింద అందిస్తారు. ఇమేజ్ టవర్లో కార్యకలాపాలు కొనసాగించే కంపెనీలకు సంబంధించిన ధరను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 2017 చివరలో ప్రారంభమైన ఈ టవర్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
2022 నాటికి అందుబాటులోకి టవర్స్ : మంత్రి కేటీఆర్
యానిమేషన్, గేమింగ్ పరిశ్రమలను ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్ లో వెయ్యి కోట్ల రూపాయలతో ఇమేజ్ టవర్స్ నిర్మించనున్నట్లు ఇండియా జాయ్ -2019 వార్షిక సదస్సులో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. అంతర్జాతీయగా యానిమేషన్, గేమింగ్, వీఎఫ్ఎక్స్ పరిశ్రమలకు మారుతోందనీ, ఇమేజ్ టవర్స్ కూడా 2022 నాటికి అందుబాటులోకి వస్తాయని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలతో మేకిన్ తెలంగాణలో హైదరాబాద్ దూసుకుపోతున్నది. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో గ్లోబల్ లీడర్ గా గుర్తింపు పొందిన సామ్ సంగ్, ఇతర బహుళజాతి సంస్థలకు చెందిన ఎల్ ఈ డిల తయారీకి హైదరాబాద్ వేదికగా నిలిచింది. రేడియంట్ అప్లయెన్స్ సంస్థ మహేశ్వరంలోని ఫ్యాబ్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎల్ఈడి టివిలను తయారుచేస్తోంది.
పరిశ్రమల ఒలంపిక్స్గా పేరుగాంచిన వరల్డ్ ఐటీ కాంగ్రెస్కు 40 ఏళ్ల చరిత్ర ఉండగా, 22వ సదస్సును మనదేశంలో నిర్వహించారు. 2017డిసెంబర్ నెలలో హైదరాబాద్ లో వరుసగా ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు, ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం 2018 ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు హైదరాబాద్లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లోవరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సును ఘనంగా నిర్వహించింది. వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలయెన్స్ (డబ్ల్యూఐటీఎస్ఏ)- నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్)- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. సదస్సులో 30 దేశాల నుంచి 2 వేల మంది దార్శనికులు, 20 మంది ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ పరిశ్రమల సీఈఓలు, 100 మందికి పైగా ఎగ్జిక్యూటివ్లు, విద్యావేత్తలు, మేధావులు, ఐటీ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సులో 50కి పైగా చర్చాగోష్టులు (సెషన్లు) జరగ్గా, మరో 50కి పైగా అత్యాధునిక ఐటీ రంగ ఉత్పత్తులపై ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 20న మానవరూప రోబో సోఫియా ప్రసంగం, ఇంటర్వ్యూ సదస్సుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మహిళా సాధికారతకుకట్టుబడి, మహిళలు కొత్త చరిత్ర లిఖించి ఆవిష్కర్తల రంగంలో ముందడుగు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వీహబ్ ను ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వీహబ్ ను 2018 మార్చి 8న హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఐటీరంగ ఆవిష్కరణలే కాకుండా అన్ని ఆవిష్కరణలకు వీహబ్ కేంద్రంగా నిలుస్తుంది. దేశంలో తొలిసారిగా ప్రభుత్వమే ముందుకు వచ్చిఈ వీహబ్ ఏర్పాటుచేసింది. ప్రత్యేకంగా మహిళా పారిశ్రామికవేత్తలకోసం ‘వీ–హబ్’ పేరుతో స్టార్టప్ ఇంక్యుబేటర్ను ఏర్పాటు చేస్తామని జీఈఎస్ సదస్సు ముగింపు సందర్భంగా 2017 నవంబర్ 11న ప్రభుత్వం ప్రకటించింది. ‘విమెన్ ఎంట్రప్రెన్యూర్స్ (డబ్ల్యూఈ) – హబ్ (వీ–హబ్)’గా దీనిని పిలువనున్నారు. దీంతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలు స్థాపించే పరిశ్రమల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టుబడులు పెట్టేందు కు రూ.15 కోట్లతో ‘టీ–ఫండ్’ పేరిటకార్పస్ ఫండ్ను ఏర్పాటు చేసింది. వీహబ్ కు 2018-19 బడ్జెట్లోరూ.15 కోట్లు కేటాయించారు. ఈ నిధుల నుంచి ఒక్కో పరిశ్రమలో రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు ప్రభుత్వం పెట్టుబడులు పెట్టనుంది. ప్రభుత్వం జరిపే కొనుగోళ్లలో 20 శాతం వస్తువులను సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) నుంచి కొనుగోలు చేయాలన్ననిబంధన ఉండేది. ఈ 20 శాతంలో కనీసం నాలుగోవంతు వస్తువులను తప్పనిసరిగా మహిళల పరిశ్రమలనుంచే సేకరించాలన్ననిబంధన తీసుకొచ్చింది. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా 3 పారిశ్రామిక వాడలు ఉన్నాయి. మహిళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్నో పెట్టుబడి రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. వారికి మరింత చేయూత అందించాలని వీ – హబ్ ఏర్పాటు చేశారు. వీటిలో 290 స్టార్టప్స్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు.
మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసేందుకు వీహబ్ తరహాలోనే వింగ్
మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడానికి, ప్రోత్సహించడానికి దేశంలోనే తొలిసారిగా రూ. 15 కోట్లతో వీహబ్ నెలకొల్పిన రాష్ట్ర ప్రభుత్వం.. అదే తరహాలో ‘వింగ్’ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసింది. కేంద్రప్రభుత్వ డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఆధ్వర్యంలో శిక్షణను ఇచ్చి మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడమే వింగ్ లక్ష్యం. 20 డిసెంబర్ 2019న హైదరాబాద్ లో వింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు భూముల కేటాయింపులో రాయితీలు, సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్ అందిస్తున్నామని కేటీఆర్ చెప్పారు.
ఇంటింటికీ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన టీ-ఫైబర్ గ్రిడ్ పథకం పైలట్ ప్రాజెక్టును ప్రభుత్వం ఆవిష్కరించబోతోంది. సాంకేతిక విప్లవంలో భాగంగా ఇంటింటికీ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఇచ్చేందుకు పథకాన్ని రూపొందించింది. పౌరసేవలను నేరుగా ప్రజలకే అందుబాటులోకి తేవడం, సామాన్యుడికి సాంకేతిక విప్లవ ఫలాలను అందించాలనే లక్ష్యంతో టీ-ఫైబర్ గ్రిడ్కు శ్రీకారం చుట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టుతో కలిపి ఐటీశాఖ టీ-ఫైబర్ గ్రిడ్ ను ముందుకు తీసుకుపోతున్నది. ఈ ఫైబర్ గ్రిడ్ పథకంలో రాష్ట్రంలోని 33జిల్లాలు, 589 మండలాలు, 8,778 గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనుంది. మొత్తం 47,18,909 ఇళ్లకు, గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు, మిషన్ భగీరథ పైపులైనుతోపాటుగా ఇంటర్నెట్ సౌకర్యం ఇస్తున్నారు, 15 ఎంబీపీఎస్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్తో తెలంగాణలోని కోటి ఇండ్లు ఇంటర్నెట్తో అనుసంధానం అవుతున్నాయి. పంచాయతీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు.. అన్నీ టీ ఫైబర్తో లింక్ కానున్నాయి.
గ్రామాల్లో జరుగుతున్న అంతర్గత పైపు (ఇంట్రా విలేజ్) లైను పనులు 8947 కి.మీ. మేర జరిగాయి. మరో 18,679 కిలోమీటర్ల మేర ఇంటర్ విలేజ్ పనుల్లో పైపులైన్లతోపాటుగా ఇంటర్ నెట్ సేవలందించే పనులు కూడా పూర్తయ్యాయి.
తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్గా మంత్రి కేటీఆర్
తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్గా ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి కే.
తారకరామారావును 30 జనవరి 2020న రాష్ట్రప్రభుత్వం నియమించింది. కార్పొరేషన్
వైస్చైర్మన్గా ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్గా
సుజయ్ సుభాష్ కారంపూరి, ఫైనాన్స్ డైరెక్టర్గా ప్రభుత్వకార్యదర్శి సందీప్కుమార్
సుల్తానియాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రపంచంలోని మొదటి 10 స్టార్టప్ నగరాల్లో హైదరాబాద్ ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఏర్పాటు చేసిన టీ-బ్రిడ్జి, టీ-హబ్ ఔట్ పోస్టుని రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబర్ 15న ప్రారంభించింది. ప్రపంచంలోని వివిధ దేశాల స్టార్టప్లతో హైదరాబాద్ స్టార్టప్లను అనుసంధానించేందుకు ఈ టీ-బ్రిడ్జ్ ఉపయోగ పడనుంది. భారతదేశం – సిలికాన్ వ్యాలీ మధ్య ఆలోచనల మార్పిడికి, స్టార్టప్ ల బదలాయింపులకు టీ బ్రిడ్జి దోహదపడుతుంది. రాష్ర్టానికి చెందిన స్టార్టప్ లకు ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తున్నది. టీ-బ్రిడ్జ్ వల్ల భారతీయ స్టార్టప్ లు, సిలికాన్ వ్యాలీ స్టార్టప్ ల మధ్య ఆలోచనల మార్పిడి జరుగుతుంది. టీ-బ్రిడ్జ్ ద్వారా 100కుపైగా స్టార్టప్లు అంతర్జాతీయ మార్కెట్లో తమ సేవలను అందిస్తున్నాయి. హైదరాబాద్లో 40కిపైగా జాతీయస్థాయి పరిశోధన ల్యాబ్లు.. అంతర్జాతీయ ప్రమాణాలతో పని చేస్తున్నాయి. స్టార్టప్లు చిన్నపాటి బహుళజాతి సంస్థలుగా ఎదుగుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 4 వేల స్టార్టప్లు ఉన్నాయి. దేశీయ స్టార్టప్లలో ఇవి 15-20 శాతం వాటా కలిగి ఉన్నాయి.
స్టార్టప్ లకు అడ్డా.. తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో తెలంగాణ ఐటీరంగం దూసుకుపోతున్నది. స్టార్టప్ల కేంద్రంగా మారిన హైదరాబాద్ నగరం తాజాగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. స్టార్టప్లను నెలకొల్పేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించే ఎకోసిస్టమ్స్లో ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 30 ప్రదేశాలలో తెలంగాణ ఒకటిగా నిలిచింది. వర్ధమాన ఎకోసిస్టమ్స్లో ఈ ఏడాది ఎంపికచేసిన టాప్ 100 ప్రదేశాలలో హైదరాబాద్ కూడా వాటిలో ఒకటిగా ఉన్నది. గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్, స్టార్టప్ జీనోమ్ సంస్థలు సంయుక్తంగా 25 జూన్ 2020న ‘గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్-2020 (జీఎస్ఈఆర్)’ నివేదికను విడుదలచేశాయి.
ఇప్పటివరకు ప్రజలు ఏదైనా దృవపత్రాలు పొందాలన్నా, రుసుములు చెల్లించాలన్నా మీ-సేవ కేంద్రాలకు వెల్లి క్యూలో నిలబడి వేచివుండేవారు. ప్రజల సమయం వృథా అయ్యేది. అక్కడ మీ సేవలో దరఖాస్తు సమయంలో తగిన పత్రాలు లేకుంటే మళ్లీ ఇంటికి వెళ్లి తీసుకురాల్సిన పరిస్థితి ఉండేది. ఇలా నిత్యం తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో వందలాది మంది వివిధ ధ్రువపత్రాల కోసం ఇబ్బందులు పడేవారు. ఈ పరిస్థితిని గుర్తించిన తెలంగాణ ఐటీశాఖ ప్రజలకు అందుబాటులోకి మీ సేవ 2.0ను తీసుకొచ్చింది. దీంతో ప్రజలు తమ ఇళ్ల నుండే కంప్యూటర్లు, సెల్ ఫోన్ల ద్వారా సేవలు పొందవచ్చు. రుసుం చెల్లింపులు కూడా.. వివిధ ధ్రువపత్రాలకు ప్రభుత్వానికి చెల్లించే రుసుములు కూడా ఆన్లైన్లోనే చెల్లించవచ్చు. మన దగ్గర ఉన్న అండ్రాయిడ్ ఫోన్ల ద్వారా చెల్లించే వీలుంది. ఈ విధానాన్ని అమలుచేసే విధంగా అధికారులకు శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం టీ-యాప్ (టీ-వాలెట్) ద్వారా ఇప్పటికే పలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవల్లో కొత్తగా అమలు చేస్తున్న మీ సేవ 2.0 వెర్షన్ ద్వారా ప్రజలకు తరుచూ అవసరమయ్యే 37రకాల ప్రభుత్వ పౌర సేవలను ఇంటి వద్ద నుంచే పొందే వీలుంది. దరఖాస్తుదారులు తమ సెల్ఫోన్లలో, కంప్యూటర్ల ద్వారా సిటిజన్ సైట్లో రిజిష్టర్ అయిన తర్వాత లాగిన్ అయ్యి మీ సేవకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం మీ సేవ కేంద్రాల్లో నిర్ణీత రుసుము రూ.15 చెల్లించి ధ్రువ పత్రాలన్నీ తీసుకుంటున్నారు. ఈ కొత్త విధానంలో మీసేవ కేంద్రంలో దరఖాస్తు రుసుమును చెల్లించాల్సిన అవసరం ఉండదు. రుసుం చెల్లింపు, ధ్రువీకరణ పత్రాలను పొందడంలో మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. పౌర సేవల నిర్ణీత రుసుమును సెల్ లోనే ఆన్లైన్ ఖాతా నుంచే చెల్లించవచ్చు. ఈ విధానంలో సందేహాలుంటే 1100, 1800425110 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. దీంతో పనిభారం తగ్గుతుంది. దేశంలో యాప్ ద్వారా ఈ సౌకర్యం కల్పిస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ప్రజల ఆదరణ పెరగడంతో టీ-వ్యాలెట్ లో రిజిస్ట్రేషన్లు పది లక్షలకు చేరాయి.
వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలోనే అతిపెద్ద ఐటీ, ఐటీ అనుబంధ సేవల సంస్థ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కాం) తెలంగాణ ప్రభుత్వంతో జట్టుకట్టింది. దేశంలోనే మొట్టమొదటి డాటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనుంది. ప్రాథమికంగా రూ.40 కోట్ల పెట్టుబడితో పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది. రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, నాస్కాం చైర్మన్ ఆర్. చంద్రశేఖర్ ఈ మేరకు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో 2018 ఫిబ్రవరి 20న ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఐఐఐటీలో తాత్కాలికంగా ఈ కేంద్రం ఏర్పాటు అవుతుంది. భవిష్యత్తులో దీన్ని బుద్వేల్లో నెలకొల్పుతారు.
హైదరాబాద్ నగరం ఇండియాలో ఐటీ రంగంలో డెస్టినేసన్ గా మారబోతుంది. 2018 ఫిబ్రవరి 20న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డాటా సైన్స్ అండ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కేంధ్రం ఏర్పాటుకు నాస్కాం ప్రెసిడెంట్ తో తెలంగాణ ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కేంద్రాన్ని మొదట ట్రిపుల్ ఐటీలో, ఆ తరువాత బుద్వేల్ కు ఐటీ పార్క్ కు తరలించనున్నారు. రాబోయే రోజుల్లో ఐటీరంగంలో డాటా అనలైజింగ్.. ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రముఖపాత్ర పోషించబోతున్నాయి. 8 కీలక రంగాలకు, సైబర్ సెక్యూరిటీకి ఈ సెంటర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వీటి ఏర్పాటు వల్ల దేశంలో 7 నుండి 8 శాతం వృద్ధి రేటు ఉండబోతోంది. ఉద్యోగావకాశాలు పెరిగి, ఉత్పత్తి రంగం వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయి.
2014 నుండి ప్రభుత్వ కార్యాలయాల్లో కాగితం అవసరం లేకుండా, ‘ఈ –ఆఫీస్’ సాంకేతిక విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్ఐసీ అభివృద్ధి చేసిన ఈ విధానం వల్ల డిజిటల్ ఫైళ్ల ఫైల్ ట్రాకింగ్ సులభమవుతుంది. నిర్వహణ వేగవంతమవడమేగాక, అవినీతికి ఆస్కారం ఉండదు. పారదర్శకత సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియ వల్ల ప్రధానంగా ఆఫీసుల్లో ఉండే రెడ్టేపిజం పోయి, పనివేగం పెరుగుతుంది. ఎక్కడ ఏ ఫైల్ ఉంది, ఎక్కడ ఎందుకు ఆలస్యం జరుగుతోంది ఒక్క క్లిక్తో తెలిసిపోతుంది. పారదర్శకత, జవాబుదారీతనం, సిబ్బంది పనితీరు మరింతగా మెరుగుపడతాయి. రాష్ట్రంలోని హెచ్.ఓ.డీలలో, సెక్రటేరియట్ డిపార్టుమెంట్లలో, 5 జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఈ ఆఫీస్ నిర్వహణ అమలవుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం, డాటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీఎస్సీఐ) సంయుక్తంగా సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని 28 జనవరి, 2020న కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్ప్రకాశ్ సాహ్నీ ప్రారంభించారు.
సైబర్ సెక్యూరిటీకి పెద్దఎత్తున ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం ఇందుకోసం తెలంగాణ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ (టీసాక్)ను ఏర్పాటుచేసింది. ఇలాంటి వ్యవస్థ 3-4 రాష్ర్టాల్లో మాత్రమే ఉంది. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సైబర్ సెక్యూరిటీ నిపుణులు పర్యవేక్షిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ వ్యవస్థలోని అన్ని విభాగాలను టీ-సాక్ సమన్వయం చేసుకొని వాటిని పర్యవేక్షిస్తుంది. ఐటీ వ్యవస్థకు సాంకేతిక ముప్పు ఏర్పడితే సంబంధిత కమాండ్ సెంటర్ను అప్రమత్తం చేస్తుంది. స్టేట్ డాటా సెంటర్తో పాటుగా సెక్రటేరియట్ కమాండ్ ఏరియా నెట్వర్క్ను పర్యవేక్షిస్తుంది. నిమిషానికి 20 వేల ఈవెంట్లను పర్యవేక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. రెండోదశలో సెకన్కు లక్ష ఈవెంట్లను అధ్యయనం చేసే వ్యవస్థను రూపొందించనున్నారు.
మొబైల్ ఫోన్ల విస్తృతి పెరిగిపోవడం, సమాచారం చిటికెలో అందిపుచ్చుకోవడంపై ప్రజల నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ వెబ్సైట్లను వినియోగదారుల ఆలోచనలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమై గైడ్లైన్స్ ఫర్ తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్స్ (జీటీజీడబ్ల్యూ)ను నిబంధనల ప్రకారం రూపొందించింది. ఇందుకోసం టీవెబ్ ప్రాజెక్ట్ ను రూపొందించింది. కేవలం ఒక్క వెబ్సైట్లో అనుసంధానం అయిఉండటం వల్ల వాటిని పొందడం సులభం అవుతుంది. స్థూలంగా చెప్పాలంటే ఇదో వెబ్ డైరెక్టరీ. దీని ద్వారా ఆయా శాఖలకు సంబంధించిన సమాచారాన్ని అందిపుచ్చుకోవచ్చు.
సాంకేతిక ఉద్యోగ ఫలాలను తెలంగాణ బిడ్డలందరికీ చేరవేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ద్వితీయ శ్రేణి నగరాలైన కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లో ఐటీ ఇంక్యుబేషన్ కేంద్రాలను రూ.31 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ జిల్లా మడికొండలోని ఐటి పార్కులో టెక్ మహీంద్రా, సైయెంట్ వంటి దిగ్గజ కంపెనీలు తమ బ్రాంచీలను ఏర్పాటు చేశాయి. తాజాగా క్వాడ్రంట్ రిసోర్సెస్ ప్రైవేటు లిమిటెడ్ మడికొండలోని ఐటి పార్కులో భూమి పూజ చేసింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో రాష్ట్రంలో ఐటి పరిశ్రమలు విస్తరిస్తున్నాయి.
ఖమ్మం : ఖమ్మంలో ఇంక్యుబేషన్ సెంటర్ కు మంత్రి కేటీఆర్ 2017 జూన్ 15న శంకుస్థాపన చేసారు. ఈ సెంటర్ ను 50 వేలచదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.25 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్నారు. దీని నిర్మాణం 2019 నాటికి పూర్తికానున్నది. ఈ సెంటర్ ద్వారా సుమారు 2000 మంది సాఫ్ట్ వేర్ నిపుణులకు ఉపాధి లభించనుంది.
కరీంనగర్ : జిల్లాలో 51,600 చ.అ. విస్తీర్ణంలో రూ.25 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్నారు. ఇంక్యుబేషన్ సెంటర్ కు 2018 జనవరి 8న మంత్రి కె.టి.ఆర్. శంకుస్థాపన చేశారు.
కరీంనగర్ లో ఐటీ హబ్ ప్రారంభం (21 జూలై 2020)
కరీంనగర్ లో రూ.34 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ హబ్ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు 21 జూలై 2020న ప్రారంభించారు. ఈ ఐటీ టవర్లో 17 ఐటీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. ఈ కంపెనీల్లో వివిధ ఉద్యోగాలకు ఎంపికైనవారికి కేటీఆర్ నియామక పత్రాలు అందజేశారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదేండ్లలో ఐటీ ఎగుమతులు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జూలై 2020 నాటికి రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రూ.1.28 లక్షల కోట్లకు చేరుకున్నాయని, ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నదని చెప్పారు.
వరంగల్ : వరంగల్ నగరంలోని మడికొండ ప్రాంతంలో ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ను 15 వేలచదరపు అడుగుల విస్తీర్ణంలో 2 ఎకరాల స్థలంలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. దీనికి 2016 ఫిబ్రవరి 19న శంకుస్థాపన చేశారు.
వరంగల్ లో సైయెంట్, టెక్ మహీంద్రా క్యాంపస్ లు ప్రారంభం
ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ విస్తరణలో భాగంగా వరంగల్ శివారులోని మడికొండలో నూతనంగా ఏర్పాటుచేసిన సైయెంట్, టెక్ మహీంద్రా క్యాంపస్ లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ క్యాంపస్ ల ద్వారా వరంగల్ జిల్లాలోని విద్యావంతులైన 1000 మంది స్థానిక యువకులకు ఉపాధి లభిస్తున్నది.
వరంగల్లో క్వాడ్రంట్ రిసోర్స్ ఐటీ సెంటర్
రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీని విస్తరించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఐటీ కంపెనీలు జిల్లా కేంద్రాల్లో తమ క్యాంపస్ లను ఏర్పాటు చేస్తున్నాయి. వరంగల్ నగరంలోని మడికొండ ఐటీ పార్క్ లో 16 ఫిబ్రవరి, 2020న క్వాడ్రంట్ రిసోర్సెస్ కంపెనీ భూమిపూజ నిర్వహించింది. ఈ సెంటర్ ను ఎకరంన్నర స్థలంలో నిర్మిస్తున్నారు. ఈ కంపెనీ ప్రారంభమైతే సుమారుగా 500 మందికి ఉపాధి లభిస్తుంది. ఇటీవలే సైయెంట్, టెక్మహీంద్ర కంపెనీలను వరంగల్ లోనే ప్రారంభించారు.
ఐటీశాఖలోని ఈఎస్డీ (ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ) విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 4,500 కు పైగా మీ సేవ కేంద్రాలు ప్రజలకు సమర్థంగా సేవలు అందిస్తున్నాయి. మీ సేవ కేంద్రాల ద్వారా ప్రతీ రోజు లక్ష నుంచి లక్షన్నర లావాదేవీలు జరుగుతున్నాయి. మొత్తంగా ఇప్పటివరకు 13.68 కోట్ల లావాదేవీలు జరిగాయి. ప్రభుత్వానికి సంబంధించిన 50 శాఖల్లో 500 లకు పైగా సేవలను ఈఎస్డీ అందిస్తున్నది. 4500 పైగా మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలు జరుపుతున్న ఎలక్ట్రానిక్ లావేదేవీల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉన్నట్టు ఈతాల్ పోర్టల్ సర్వే తెలిపింది.
ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా హైదరాబాద్ వేదికగా గూగుల్ క్లౌడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీవోఈ)ని 28 జనవరి, 2020న ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలకు సాంకేతికరంగంలో అత్యాధునిక సేవల్ని అందించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుంది. క్లౌడ్ బదిలీ సేవలు, గూగుల్ క్లౌడ్లో పలు సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ కేంద్రం పరిష్కారం చూపిస్తుంది. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అభివృద్ధి, డాటా ఎనలిటిక్స్కు పలు పరిష్కారాలు చూపించడంతోపాటు సంస్థల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ కేంద్రం దోహదం చేస్తుంది. సాంకేతికరంగంలో మెరుగైన సేవల్ని అందించడం వల్ల వినియోగదారుల సంఖ్య ను కూడా పెంచుకోవచ్చు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు ఐటీ సేవల భారాన్ని తగ్గించేందుకు ప్రఖ్యాత సంస్థలు ఇప్పటికే క్లౌడ్ సేవల్ని (డాటా స్టోరేజీ, సాంకేతిక సహకారం) ప్రారంభించి తక్కువ రుసుముతో సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నాయి.
హైదరాబాద్కే పరిమితమైన ఐటీరంగాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లోని యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు పోతున్నది. ద్వితీయ శ్రేణి నగరాలన్నింటిలో ఐటీ హబ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సాంకేతిక, శాస్త్ర పరిజ్ఞానం ఫలాలను సామాన్యులకు, ద్వితీయ శ్రేణి పట్టణాలకు, మారుమూల ప్రాంతాలకు తీసుకువెళ్లాలన్న సీఎం కేసీఆర్ సూచనమేరకు నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్ తదితర నగరాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
కరీంనగర్ లో ఐటీ టవర్
కరీంనగర్ జిల్లాలో దిగువ మానేరు జలాశయం పరిధిలో రూ.25 కోట్లతో చేపట్టిన ఐటీ టవర్ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ 2018 జనవరి 8న శంకుస్థాపన చేశారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.274 కోట్లు ఖర్చుపెట్టబోతోంది. మొదటిదశలో రూ.100 కోట్లతో పార్క్ అభివృద్ధి, నిర్మాణ పనులు మొదలుపెడుతున్నారు. దీన్ని 9 నెలల్లో పూర్తి చేయనున్నారు. శంకుస్థాపన జరిగిన రోజునే 8 కంపెనీలు 650 ఉద్యోగాల కల్పనతో ఒప్పందాలు చేసుకున్నారు. మరికొన్ని సంస్థలు కరీంనగర్లో తమ శాఖల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయి. తద్వారా కనీసంగా వెయ్యిమందికి ఇక్కడ ఉద్యోగాలు రానున్నాయి. కరీంనగర్లోనే మరో ఐటీ టవర్ కోసం త్వరలోనే రూ. 25 కోట్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
వరంగల్లో టీహబ్ కేంద్రం
వరంగల్లో టీహబ్ కేంద్రం ఏర్పాటు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. నిట్తో కలిసి తక్షణమే టీ-హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
నిజామాబాద్ కు ఐటీ-హబ్ : 2017 అక్టోబర్ 9న నిజామాబాద్కు ఐటీ హబ్ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే ఖమ్మంలో ఐటీ హబ్ను ఏర్పాటుచేసిన ప్రభుత్వం తాజాగా నిజామాబాద్కు ఐటీ హబ్కు అనుమతులు ఇచ్చింది. 2018 దసరా నాటికి ఐటీ హబ్ ప్రారంభం కానుంది. ఐటీ ఉద్యోగాలపై ఉన్న మక్కువతో తెలంగాణ విద్యార్థులు ఐటీ కోర్సులను అభ్యసిస్తున్నారు.ఈ నేపథ్యంలో హైదరాబాద్తోపాటు ఇతర జిల్లాల్లోనూ ఐటీ పార్కులను ఏర్పాటు చేసే క్రమంలో ఖమ్మంలో మొదటి ఐటీ టవర్ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో 400 ఎకరాల్లో ఐటీ, ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది.
మహతా ఇన్ఫర్మేషన్ ఇండియా సంస్థ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని నానక్రామ్గూడలో రూ.1,147 కోట్ల పెట్టుబడితో 7.172 ఎకరాల్లో ఐటీ సెజ్ నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. ఇందు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకుంది. ఈ సంస్థ మొత్తం రూ.2,088 కోట్ల విలువైన ఎగుమతులతో, 12,870 మందికి ఉపాధి కల్పిస్తామని నివేదించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ పరిధిలోని అనుమతుల మండలి ఆమోదం కోసం దీనిని పంపించింది. అది లభించిన వెంటనే సెజ్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. మొదటగా 2009లో ఐటీ సెజ్ ఏర్పాటయ్యింది. దాదాపు దశాబ్దం తర్వాత రాష్ట్రంలో కొత్త ఐటీ సెజ్ ఏర్పాటు కాబోతోంది. రాష్ట్రంలో 68 సెజ్(స్పెషల్ ఎకనమిక్ జోన్)లు ఉన్నాయి. ఇందులో 42 ఐటీవి. మిగిలినవి ఇతర రంగాలవి.
రాష్ట్రంలో విద్యార్థులకు ఐటీ రంగంలో ఉద్యోగాలు లభించేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నది. తెలంగాణ నైపుణ్య, పరిజ్ఞాన అకాడమీ (టాస్క్)ని ఏర్పాటు చేసి కళాశాలల నుంచి బయటకు వచ్చే గ్రాడ్యుయేట్లకు సాంకేతిక, సాంకేతికేతర పారిశ్రామిక అవసరాలకు సరిపోయే నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. ఇందుకోసం దేశంలోనే తొలిసారిగా టాస్క్ ను ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో ఫ్యాకల్టీ సభ్యులకు కూడా నైపుణ్య తరగతులు నిర్వహిస్తున్నారు. వీటికితోడు ఇన్స్ట్రక్టర్ లెడ్ శిక్షణ, ఈ-లర్నింగ్, స్వయం అధ్యయన ప్రయోగశాలల ద్వారా వివిధ కళాశాలల్లో నైపుణ్య తరగతులు నిర్వహిస్తున్నారు. టాస్క్ కు 2017-18 బడ్జెట్లో రూ.7.5 కోట్లు కేటాయించారు. 2015 సంవత్సరంలో 43,271, 2016 లో 62,678 మంది విద్యార్దులు టాస్క్ ద్వారా శిక్షణ పొందారు. అలాగే 2015 లో 888, 2016లో 2045 మంది ఫ్యాకల్టీ సభ్యులకు నైపుణ్య శిక్షణ అందించింది. ప్రఖ్యాత ఎంబ్రి రిడిల్ ఏరోనాటికల్ విశ్వవిద్యాలయం(ఇఆర్ఏయూ)తో తెలంగాణ నైపుణ్య విజ్ఞానాభివృద్ధి సంస్థ (టాస్క్) 2016 ఫిబ్రవరి 19న ఎంఓయూ కుదుర్చుకుంది. టాస్క్ లో 2018 మే 25 నాటికి నమోదు చేసుకున్న విద్యార్థులు 2,39,307 మంది ఉన్నారు. టాస్క్ కు రిజిస్టర్ అయిన కాలేజీలు 588, టాస్క్ తో రిజిష్టర్ చేసుకున్న విద్యార్థులు 1,28,246, నైపుణ్య భాగస్వాములు 34 వున్నాయి.
సోలార్ విద్యుత్ రంగంలో శిక్షణ : టాస్క్ తమ వేదికలు, అనుబంధ కాలేజీల ద్వారా శిక్షణను అందించిన టాస్క్ ఇప్పుడు ( జూన్ 2018) నేరుగా విద్యార్థుల వద్దకే వెళ్లి శిక్షణ అందిస్తున్నది. పునరుత్పాదక, పర్యావరణహిత ఇంధనవనరుగా ఇటీవల పెద్దఎత్తున అవకాశాలను అందిస్తున్న సోలార్ విద్యుత్ రంగంలో శిక్షణను క్షేత్రస్థాయిలో అందిస్తున్నది. నేరుగా విద్యార్థుల వద్దకే వెళ్లి శిక్షణ ఇవ్వాలని భావించిన టాస్క్ స్కిల్ ఆన్ వీల్స్ పేరుతో నూతన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా జిల్లాలకు వెళ్లి అక్కడే విద్యార్థులకు సోలార్ ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్, సర్వీసింగ్కు సంబంధించిన అన్ని అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. పదో తరగతి విద్యార్హత కలిగిన వారికి నిర్వహించే ఈ కోర్సుకు వాస్తవానికి రూ.10 వేలు ఖర్చు అవుతుంది. కానీ తెలంగాణ యువతకు మేలు చేసేందుకు నామమాత్రపు ఫీజు 500 రూపాయలతో శిక్షణ ఇస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వంతో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నది. ఐటీశాఖ పరిధిలోని టీ వర్క్స్ కు, జీఈ అప్లయెన్సెస్కు చెందిన ఫస్ట్, బిల్డ్ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా దేశంలోనే అతిపెద్ద మేకర్స్ స్పేస్ను హైదరాబాద్లో ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్రంలోని ఆవిష్కర్తలు, ఉత్పత్తిదారులు తమ ఆలోచనలకు రూపమిచ్చే అవకాశం లభిస్తుంది. ఈ అవగాహన పత్రాలపై టీవర్క్స్, ప్రతినిధులు 11 సెప్టెంబర్, 2018న సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా మన దేశంలోని డిజైనర్లు, ఇంజనీర్లు, ఇన్నోవేటర్ల ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చి గృహసముదాయాలకు తగిన ఉత్పత్తులను అందుబాటులోకి తేనున్నది. హైదరాబాద్లో ప్రారంభించనున్న మేకర్స్ స్పేస్ ఆధునిక జీవనశైలికి బీజంవేసే ప్రపంచశ్రేణి ఉత్పత్తులకు కేంద్రం గా నిలుస్తుంది.
టెంటమస్ వ్యాపారసంస్థ తమ ప్రధాన కేంద్రాన్ని దేశంలో తొలిసారిగా తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 25 జనవరి, 2019న పరిశ్రమల భవన్లో టెంటమస్ సీఈఓ బర్సేటెన్.. టీఎస్ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫుడ్ అండ్ ఫీడ్, ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్, ఆగ్రో కెమికల్స్, కాస్మోటిక్స్, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్ మెంట్లో కట్టింగ్ ఎడ్జ్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ద్వారా ఉత్పాదకతను పెంచేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుంది.
తెలంగాణ ప్రభుత్వంతో అమెరికాకు చెందిన టెలీకమ్యూనికేషన్స్ వెరిజోన్ 08 ఫిబ్రవరి, 2019 న ఒప్పందం చేసుకుంది. ఐటీశాఖ, హైదరాబాద్ సెక్యూరిటీ క్లస్టర్, వెరిజోన్ కలిసి డాటా బ్రీచ్ ఇన్వెస్టిగేషన్స్ రిపోర్ట్ (డీఐబీఆర్)పై పనిచేయనున్నాయి. వెరిజోన్తో కలిసి మన దేశంలో పనిచేయనున్న తొలిరాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. యూఎస్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెడీనెస్ టీం, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సెక్యూరిటీ, సిస్కో సెక్యూరిటీ సర్వీసెస్, మెక్ఆఫీ సంస్థలు కూడా కలిసి పనిచేయనున్నాయి. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి వివిధ అంశాల్లో చోటుచేసుకుంటున్న విషయాలు, ఇందుకు కారణమైన వ్యక్తులు, దాన్ని సవరించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఈ పక్రియలో ఎదురయ్యే వాటిని అధ్యయనం చేసి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసుకునేందుకు తగిన నివేదికలు అందిస్తారు.
దేశంలో యాపిల్ మొబైల్స్, ఇతర ఉత్పత్తులను విక్రయించే ఆప్ర్టోనిక్స్ 29 నవంబర్ 2019న హైదరాబాద్ లోని కొండాపూర్ శరత్ క్యాపిటల్ సిటీమాల్ లో 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే ఐదో పెద్దదైన యాపిల్ అవుట్ లెట్ ను ప్రారంభించింది. వినియోగదారులకు నూతన ఉత్పత్తులతో పాటు, టెక్ సేవలందించడమే లక్ష్యంగా ఈ సెంటర్ పనిచేస్తున్నది.
ఐటీ, ఫార్మా హబ్ గా కొనసాగుతున్న హైదరాబాద్.. ఇక ఎలక్ర్టిక్ పరికరాల తయారీకేంద్రంగా మారుతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు తమ సంస్థలను ఏర్పాటు చేశాయి. ప్రపంచ చిప్ ల తయారీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన మైక్రాన్, ఇంటెల్ సంస్థలు కూడా తమ చిప్ ల కేంద్రాల్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశాయి. ఈ సంస్థల్లో మూడు వేల మందికి ఉపాధి లభిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీ-వెబ్ ప్రాజెక్టు ద్వారా వివిధ శాఖల వెబ్సైట్లనింటినీ ఒకే ఫార్మాట్లోకి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ పథకాలు, సేవలు, సదరు శాఖ పూర్తి సమాచారాన్ని ఒకే ప్లాట్ఫాం మీదికి తెస్తున్నారు. 2018 డిసెంబర్ నాటికే 125 వెబ్సైట్లను టీ-వెబ్ పరిధిలోకి తీసుకొచ్చి, యూజర్ ఫ్రెండ్లీగా మార్చారు. దివ్యాంగులు కూడా ఇబ్బంది పడకుండా వినియోగించే స్థాయిలో వీటిని రూపొందించారు. మిగిలిన 375 ప్రభుత్వ వెబ్సైట్లను టీ-వెబ్ పరిధిలోకి తీసుకొచ్చి యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దనున్నారు.
అనలిటిక్స్, డేటా సర్వీసుల రంగంలో ఉన్న ఎస్అండ్పీ గ్లోబల్ హైదరాబాద్లో కొత్త ‘ఓరియన్’ కార్యాలయాన్ని ప్రారంభించింది. దీన్ని లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.70 కోట్ల ఖర్చుతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 700 మంది సపోర్ట్ సిబ్బంది ఓరియన్లో పనిచేస్తున్నారు. ఆగస్టు 2019 నాటికే ఎస్అండ్పీ గ్లోబల్కు హైదరాబాద్లో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైటెక్ సిటీ వద్ద ఒక కార్యాలయం ఉంది. ఇందులో 3,500 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్చ్సేంజ్ ఆఫ్ తెలంగాణ యాప్ లో రాష్ట్రంలోని అన్ని ఐటీ, కార్పోరేట్ కంపెనీలతో పాటు ఇతర రంగాల్లోని ఉద్యోగాల ఖాళీల వివరాలు పొందుపరుస్తారు. ఈ యాప్ లో ఏవిదమైనటువంటి విద్యార్హత కలిగిన వారికైనా వారి అర్హతకు తగ్గ ఉద్యోగాల ఖాళీల వివరాలు పొందుపరుస్తారు. ఎలాంటి విద్యార్హత లేనివారు కూడా ఈ యాప్ లో వారికి తగ్గ ఉద్యోగాల ఖాళీల వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఇలాంటి అవకాశం కల్పించిన తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఉన్నత విద్య చదివిన ఎందరో నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో ఈ యాప్ చక్కటి ప్లాట్ ఫాంగా ఉయోగపడుతున్నది. ఉద్యోగాలు కల్పిస్తామంటూ చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసే దళారుల మోసాలకు చెక్ పెట్టినట్లయ్యింది. ఈ యాప్ ద్వారా ఇప్పటికే 10 లక్షలకు పైడా అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
ప్రపంచంలోని 25 ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథ) హబ్ లలో హైదరాబాద్ కు స్థానం దక్కాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. 2030 నాటికి ప్రపంచ జీడీపీలో ఏఐ వాటా దాదాపు 40శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఈ కృత్రిమ మేధను ఎలా శక్తిమంతం చేయాలనే అంశంపై దావోస్ లో 2020 జనవరి 21 నుంచి 24వ తేదీ వరకు జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్యానెల్ లో మంత్రి కేటీఆర్ చర్చించారు. 2020 ఏడాదిని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా ప్రకటించారు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)లో తెలంగాణకు సాటిలేదు
నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్ ప్రశంస ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) అమలులో తెలంగాణ ప్రభుత్వం అగ్రపథాన దూసుకుపోతున్నదని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్ 13 ఆగస్టు 2020న ప్రశంసించారు. ఏఐలో ప్రయోగాత్మక విధానంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు. ఏఐని మొదటగా అమలుచేయడానికి తెలంగాణ కంటే మంచి రాష్ట్రం దేశంలోనే లేదని, మంత్రి కేటీఆర్తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉన్నదని వివరించారు.
స్మార్ట్ ఆఫీసుల్లో పనిచేసేందుకు యువత ఆసక్తి చూపుతుండటంతో అమెరికాకు చెందిన వివర్క్ కంపెనీ కో వర్కింగ్ స్పేస్ అందించే సేవలను హైదరాబాద్ కు విస్తరించి 7 వేల సీట్లను అందుబాటులోకి తెచ్చింది. మాదాపూర్ లో 2.5 లక్షల చదరపు అడుగుల్లో 4 వేల సీట్లు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 2 లక్షల చదరపు అడుగుల్లో 2 వేల సీట్లు ఏర్పాటు చేసింది. 17 డిసెంబర్, 2019న ఐటీ, పరిశ్రమలశాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, వివర్క్ కోచీఫ్ ఈవో ర్యాన్ బెన్నెట్ కో వర్కింగ్ స్పేస్ లను ప్రారంభించారు. ఇందులో ఒక్కో సీటుకు రూ.6 వేల దాకా అద్దె వసూలు చేస్తారు.
ద్వితీయశ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మరో అంతర్జాతీయ ఐటీ కంపెనీ వరంగల్లో అడుగుపెట్టనున్నది. ఎల్అండ్టీ అనుబంధ మైండ్ట్రీ ఐటీ కంపెనీ వరంగల్లో తన సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. తెలంగాణలో హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరమైన వరంగల్లో ఇప్పటికే రెండు ప్రముఖ ఐటీ కంపెనీలు తమ సంస్థలను స్థాపించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాతో.. వరంగల్లో మైండ్ట్రీ సెంటర్ను ఏర్పాటుచేయడానికి ఎల్అండ్టీ సీఈవో, ఎండీ ఎన్ సుబ్రమణ్యన్ సుముఖత వ్యక్తంచేశారు. మైండ్ట్రీ సంస్థ.. గ్లోబల్ టెక్నాలజీ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ కంపెనీగా ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్నది. ఈ సంస్థ వరంగల్కు రావడం ద్వారా మరిన్ని కంపెనీలు ఇక్కడకు తరలివచ్చే అవకాశాలున్నాయి.
తెలంగాణ ఐటీకి అమెరికా వర్సిటీ ప్రశంసలు
తెలంగాణ ఐటీ విభాగం, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ కృత్రిమ మేధస్సుపై అందిస్తున్న శిక్షణకు అమెరికాలోని వర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్ ప్రశంసలు లభించాయి. ఈ మేరకు ఆ వర్సిటీ డైరెక్టర్ జై వీరస్వామి ఐటీ శాఖకు లేఖ రాశారు.
అమెజాన్ సంస్థకు భూ కేటాయింపులు
రాష్ట్ర చరిత్రలోనే భారీ పెట్టుబడి పెట్టిన అమెజాన్ సంస్థకు భూ కేటాయింపులు పూర్తయ్యాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ మూడు ప్రాంతాల్లో అవైలబిలిటీ జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు రంగారెడ్డి జల్లాలోని రావిర్యాల ఫ్యాబ్ సిటీ లో 52.56ఎకరాలు, మీర్ఖాన్పేటలో 48 ఎకరాలు, చందన్వెళ్లిలో 34.21 ఎకరాలను టీఎస్ఐఐసీ కేటాయించింది.
హైదరాబాద్ లో అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ ప్రారంభం.. (పూర్తిగా రాయాలి)
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రపంచంలోనే తన అతిపెద్ద క్యాంపస్ను హైదరాబాద్లో 2020 జనవరి 10న ప్రారంభించింది. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ ఈ భవనాన్ని ప్రారంభించారు.
హైదరాబాద్ కు గోల్డ్ మ్యాన్ శాక్స్ సంస్థ.. (1 అక్టోబర్ 2020)
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్ మన్ శాక్స్ గ్రూపు భారతదేశంలోని తమ రెండో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో 500 మంది నిపుణులను 2020 జులై నుంచే నియమించి ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తామని ప్రకటించింది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థ 1869 లో న్యూయార్క్ లో ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్, పెట్టుబడుల నిర్వహణ, సెక్యూరిటీలు, ఉమ్మడి భాగస్వామ్యాలు వంటి ఆర్థిక కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఈ సంస్థ వార్షికాదాయం 2.74 లక్షల కోట్లు. 16 దేశాల్లో విస్తరించి ఉన్న ఈ సంస్థలో 6 వేల మందికిపైగా ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. 2004లో దేశంలోని బెంగళూరులో తమ కార్యాలయాన్ని ప్రారంభించగా, రెండో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ లో ప్రారంభించనుంది.
హైదరాబాద్ లో ఇంటెల్ ఏఐ సెంటర్ (12 నవంబర్ 2020)
టెక్నాలజీ దిగ్గజం ఇంటెల్ హైదరాబాద్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం, ఐఐటీ హైదరాబాద్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో దీన్ని నెలకొల్పనున్నది.
రాష్ట్రమంతటా ఐటీ విస్తరణ
ఐటీ పరిశ్రమను హైదరాబాద్లోని ఇతర ప్రాంతాలతోపాటు రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణినగరాలకు విస్తరించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకొంటున్నది. వరంగల్లో ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి, రెండో దశలో మరిన్ని ఐటీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఖమ్మంలో ఐటీ టవర్ ప్రారంభం (7 డిసెంబర్ 2020)
ఖమ్మంలో ఐటీ టవర్ను 7 డిసెంబర్ 2020న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇన్నాళ్లు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐటీ పరిశ్రమ క్రమంగా జిల్లాలకు విస్తరిస్తున్నది. ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలనే లక్ష్యంతో ఐటీ హబ్లో భాగంగా అత్యాధునిక హంగులతో ఖమ్మంలో ఐటీ సౌధాన్ని నిర్మించారు. 42 వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఐదు అంతస్తుల్లో ఉన్న ఈ టవర్ను రూ.27 కోట్ల వ్యయంతో రెండేండ్లలోనే నిర్మించారు.ఇప్పటికే ఆస్ర్టేలియా, అమెరికాకు చెందిన 16 కంపెనీలు ఈ ఐటీ టవర్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. ఈ కంపెనీల్లో ప్రస్తుతం 430 మందిని నియమించుకున్నారు. త్వరలో మరో 430 మందిని నియమించుకోనున్నారు. దీంతో రెండు షిప్టుల్లో కలిసి 860 మంది ఐటీ ఉద్యోగులు పనిచేయనున్నారు. ఖమ్మం ఐటీ టర్నోవర్ 50 లక్షల నుంచి 5 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఐటీ రంగం విస్తరణతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి.
కొంపల్లిలో ఐటీ పార్కు, దివిటిపల్లిలో పలు కంపెనీలు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రోత్ ఇన్డిస్పర్షన్ పాలసీకి మంచి స్పందన లభిస్తోంది. హైదరాబాద్ లోని నాచారం, ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఐటీ పార్కుల నిర్మాణంపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. కొంపల్లిలో కూడా ఐటీ పార్క్ నిర్మాణానికి భూసేకరణ చేయాలని టీఎస్ఐఐసీ ఎండీకి ఆదేశాలు జారీచేశారు. కాగా, మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి ప్రాంతంలో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి.