న్యూఢిల్లీ: పసిబిడ్డతో కలిసి మెట్రో రైలులో ప్రయాణించిన ఒక మహిళ సీటుపైన గాక నేలపై కూర్చొన్నది. మరోవైపు చాలా మంది మంది మహిళలు సీట్లలో కూర్చొని మొబైల్ ఫోన్లు చూడటంలో బిజీ అయ్యారు. ఒక ఐఏఎస్ అధికారి ట్వీట్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ఈ నెల 18న తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఒక మహిళ తన పసిబిడ్డతో కలిసి మెట్రో రైలులో ప్రయాణిస్తుంది. అయితే ఆమె సీటుపై కాకుండా పసిబిడ్డతో రైలులోని నేలపై కూర్చొని ఉంది. మరోవైపు చాలా మంది మహిళలు దర్జాగా సీట్లలో కూర్చొన్నారు. ఏ ఒక్కరు కూడా పసిబిడ్డతో ఉన్న ఆ మహిళలకు సీటు ఇవ్వలేదు. అందులోని మహిళా ప్రయాణికులు పసిబిడ్డతో ఉన్న ఆ మహిళను ఏ మాత్రం పట్టించుకోలేదు. అయితే ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగింతో అన్నది తెలియలేదు.
కాగా, ఈ వీడియోను పోస్ట్ చేసిన ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ దానికి ఒక శీర్షిక కూడా ఇచ్చారు. ‘చదువు మీ ప్రవర్తనలో ప్రతిబింబించకపోతే మీ డిగ్రీ కేవలం కాగితం ముక్క మాత్రమే’ అని పేర్కొన్నారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పసిబిడ్డతో కింద కూర్చొన్న మహిళకు సీటు ఇవ్వని మిగతా మహిళా ప్రయాణికుల తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. ‘ఇతరుల గురించి, వారి బాధలు, సమస్యలు పట్టని సున్నిత సమాజంగా మనం క్రమంగా మారుతున్నాం’ అని ఒకరు వ్యాఖ్యానించారు.
అయితే ఈ వీడియో పాతదని ఒక ట్విట్టర్ యూజర్ తెలిపారు. పసిబిడ్డతో నేలపై కూర్చొన్న ఆ మహిళకు పలువురు సీటు ఇచ్చినా ఆమె నిరాకరించిందని, బిడ్డతో కూర్చొనేందుకు సౌకర్యంగా ఉంటుందని కిందనే కూర్చొందని పేర్కొన్నారు. మన కంటికి కనిపించే అన్నింటిని తప్పుగా అర్థం చేసుకోకూడదని సూచించారు.
आपकी डिग्री सिर्फ़ एक काग़ज़ का टुकड़ा है, अगर वो आपके व्यवहार में ना दिखे. pic.twitter.com/ZbVFn4EeAX
— Awanish Sharan (@AwanishSharan) June 18, 2022