హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ప్రథమరంగం వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ప్రథమ ప్రాధాన్యమిచ్చింది. గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయారంగానికి రూ.25వేల కోట్ల భారీ నిధులు కేటాయించింది. గతేడాది కంటే సుమారు రూ. వెయ్యికోట్లు అధికంగా నిధులు ఇచ్చింది. ఇందులో నిర్వహణ పద్దు కంటే అభివృద్ధికి దోహదం చేసే ప్రగతిపద్దుకే అధికంగా కేటాయింపులు జరిపింది. ముఖ్యంగా ప్రభుత్వ ప్రాధామ్య పథకాలైన రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా, గొర్రెల పంపిణీ పథకాలకు పెద్దపీట వేసింది. రూ.25వేలపైన ఉన్న రైతుల రుణాలను మాఫీచేసేందుకు రూ.5225 కోట్లు కేటాయించింది. రైతుబంధు పథకం కోసం ఈ ఏడాది రూ.800 కోట్లు అధికంగా రూ.14,800 కేటాయించింది. రైతుబీమా కోసం రూ.1200 కోట్లు కేటాయించింది. రెండువిడత గొర్రెల పంపిణీకి రూ.3 వేల కోట్లు ప్రతిపాదించింది. వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రోత్సాహానికి ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేసింది. ఇందుకోసం రూ.1500 కోట్లు ప్రతిపాదించింది. గత ఐదేండ్లలో 14,644 ట్రాక్టర్లను రైతులకు సబ్సిడీపై అందించింది. వ్యవసాయరంగంలో పరిశోధనలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఇందుకోసం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్ల నిధులు ఇవ్వనున్నది.
రైతులకు పెట్టుబడిసాయం అందించేందుకు ప్రభుత్వం బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసింది. గతేడాది రూ.14వేల కోట్లు కేటాయించగా ఈ ఏడాది అదనంగా మరో రూ.800 కోట్లు కలిపి 14,800 కోట్లు కేటాయించింది. కరోనాతో రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ రైతుబంధు సాయాన్ని ఆపలేదని ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. గత మూడేండ్లలో ఈ పథకం కింద రైతుకు రూ.35,911 కోట్లు అందించినట్టు తెలిపింది.
2021-22 ఆర్థిక సంవత్సరానికి రైతుబీమా కోసం రూ.1200 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. గతంతో పోల్చితే రూ. 60 కోట్లు ఎక్కువగా కేటాయించడం గమనార్హం. గుంట భూమి ఉన్నా రైతుబీమాకు అర్హులుగా పేర్కొనడంతో పాలసీదారుల సంఖ్య పెరుగుతున్నది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుబీమా కేటాయింపులు రూ.1200 కోట్లకు పెంచినట్టు మంత్రి హరీశ్రావు తెలిపారు. 2020-21సంవత్సరంలో 32.73 లక్షల మంది రైతులకు సంబంధించి ప్రభుత్వం రూ. 1141.4 కోట్లను ఎల్ఐసీకి ప్రీమియం కింద చెల్లించింది. గత మూడేండ్లలో వివిధ కారణాలతో మరణించిన సుమారు 46,564 రైతు కుటుంబాలకు ప్రభుత్వం రూ.2328 కోట్లను బీమా సాయంగా అందజేసింది.
పౌరసరఫరాలశాఖకు బడ్జెట్లో భారీగానే బడ్జెట్ను కేటాయించింది. ఈ శాఖకు మొత్తం రూ.2,363 కోట్లను కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ.64.73 కోట్లు, ప్రగతిపద్దు కింద రూ.1,444.14 కోట్లను కేటాయించింది. ప్రగతిపద్దులో అధికశాతం ప్రజా పంపిణీలో రేషన్ బియ్యం పంపిణీకి ఖర్చు చేయనున్నది. పశు సంవర్ధకశాఖకు ప్రభుత్వం రూ.1730 కోట్లను కేటాయించింది.
రైతు రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ.5,225 కోట్లు కేటాయించింది. ఇప్పటికే రూ.25 వేల లోపు రుణాలను మాఫీచేసిన ప్రభుత్వం తాజాగా.. ఆపై రుణాలను కూడా మాఫీచేయనున్నది. రూ.25 వేలకుపైగా రుణాలు తీసుకున్న రైతులు ఎంతమంది ఉంటారు? ఆ రుణాల మొత్తం ఎంత ఉంటుందనేదానిపై వ్యవసాయశాఖ కసరత్తు చేస్తున్నది. రూ.లక్ష లోపు రైతుల రుణాలను నాలుగు విడతల్లో మాఫీచేస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యవసాయరంగంలో పరిశోధనలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు కేటాయించింది.
రాష్ట్రంలో ఇప్పటికే 4 లక్షల మంది గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఈ ఏడాది 3.30లక్షల మందికి పంపిణీ చేయాలని నిర్ణయించింది. రెండోవిడత గొర్రెల పంపిణీకి రూ. 3వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 7.31 లక్షల మందిని గొర్రెల పంపిణీ పథకానికి అర్హులుగా ప్రభుత్వం గతంలోనే తేల్చింది.
దేశం మొత్తం వంట నూనెకు విదేశాలపై ఆధారపడుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం పామాయిల్ సాగును ప్రోత్సహించేలా ప్రత్యేక విధానం ప్రకటించడం మంచి నిర్ణయం. తెలంగాణ వంటి యువ రాష్ర్టాలు వేగంగా వృద్ధి చెందడం దేశానికి చాలా ముఖ్యం. అప్పుడే ఆర్థిక, సామాజిక, మౌలిక సదుపాయాలు పెరుగుతాయి. రాష్ట్రంలో కొన్నేండ్లుగా వ్యవసాయరంగం పనితీరు బాగున్నది.
– అనిల్ కే సూద్, ఐఏఎస్సీసీ సహ వ్యవస్థాపకుడు
వ్యవసాయరంగంలో నూతన పరిశోధనల కోసం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు కేటాయించడం సంతోషదాయకం. ఈ నిర్ణయం వ్యవసాయరంగానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ నిధులతో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతుంది. నేరుగా వరి నాట్లు వేయడంపై, సింగిల్ పిక్ క్రాప్ పత్తి రకాన్ని అభివృద్ధి చేయడం, ఫుడ్ టెక్నాలజీలో, పంట మార్పిడిలు తదితర నూతన ఆవిష్కరణలకు ఈ నిధులు దోహదం చేయనున్నాయి.
– ప్రవీణ్రావు, వీసీ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ
ముమ్మాటికీ రైతు ప్రభుత్వమేనని మరోమారు రుజువు చేసుకున్నారు. ఈ బడ్జెట్లో వ్యవసాయానికి రూ.25 వేల కోట్లు, రైతుబంధు పథకానికి రూ.14,800 కోట్లు, రుణమాఫీకి రూ.5225 కోట్లు, ఇతర రైతు కార్యక్రమాలకు భారీగా నిధులు కేటాయించడం మాములు విషయంకాదు. ప్రస్తుతం ఏ రైతులను చూసినా పంటలను సాగు చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు.
– సాయిలు, రైతు, గోర్గల్, నిజాంసాగర్, కామారెడ్డి జిల్లా
ఉద్యమ దశ, రాష్ట్ర ఆవిర్భావం, స్వరాష్ట్రంలో సాధించిన ఎనలేని ప్రగతి.. ఇదంతా మన కండ్లముందే ఆవిష్కృతమైన అద్భుత చరిత్ర. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు, సవాళ్లు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనాయి. వాటన్నింటినీ చాకచాక్యంగా అధిగమిస్తూ ప్రభుత్వం ముందుకు నడిచింది. అభివృద్ధిలో కొత్తపుంతలు తొక్కింది. సంక్షేమంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పింది. ఈ విషయంలో మాకు ప్రజల నుంచి గొప్ప సహకారం, అండదండలు లభించాయి.
– బడ్జెట్ ప్రసంగంలో హరీశ్రావు