కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై నందిగ్రామ్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి. ఆయన ఈ నెల 12న నామినేషన్ దాఖలు చేయనున్నారు. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఈ స్థానంపై అందరి కళ్లూ ఉన్నాయి. తాను ప్రతిసారీ పోటీ చేసే భవానీపూర్ను కాదని మరీ నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగనున్నట్లు మమత ప్రకటించారు. బీజేపీ కూడా ఆమెపై సువేందునే నిలబెడుతున్నట్లు ప్రకటించింది. ఒకప్పుడు మమతకు చాలా సన్నిహితుడిగా పేరున్న సువేందు ఎన్నికల ముందు టీఎంసీకి గుడ్బై చెప్పి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ స్థానంపై ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. మరోవైపు సువేందు నామినేషన్ దాఖలు చేయనున్న మార్చి 12 నుంచే తాను కూడా ప్రచారం మొదలుపెట్టబోతున్నట్లు బీజేపీలో చేరిన నటుడు మిథున్ చక్రవర్తి చెప్పిన విషయం తెలిసిందే.