కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 7న ప్రధాని నరేంద్ర మోదీ కోల్కతాలో ర్యాలీ చేపడుతున్నారు. ఇందులో బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై మంగళవారం బీజేపీ స్పందించింది. ర్యాలీలో పాల్గొనాలో వద్దో తేల్చుకోవాల్సింది ఆయనే అని, అది గంగూలీ ఇష్టమని బీజేపీ స్పష్టం చేసింది. ఒకవేళ గంగూలీ ర్యాలీలో పాల్గొనాలనుకుంటే, వాతావరణం, ఆయన ఆరోగ్య పరిస్థితి అనుకూలిస్తే, ఆయనకు స్వాగతం పలుకుతున్నాం అని బీజేపీ అధికార ప్రతినిధి శామిక్ భట్టాచార్య అన్నారు.
సౌరవ్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలుసు. ఆయన ఆరోగ్యం బాగుంటే సభకు హాజరవుతానంటే ఆయనకు స్వాగతం పలుకుతాం. ర్యాలీని కచ్చితంగా ఆయన ఇష్టపడతారు. అటు ప్రజలు కూడా ఇష్టపడతారు. కానీ ఆయన వస్తారో రారో మాకు తెలియదు. అది ఆయన ఇష్టం అని భట్టాచార్య అన్నారు. గత జనవరిలో గుండెపోటుకు గురైన గంగూలీకి ఇప్పటికే రెండుసార్లు యాంజియోప్లాస్టీ నిర్వహించి మూడు స్టెంట్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన రాజకీయాల్లోకి వస్తారన్న వార్తలు వెలువడుతున్నా.. దీనిపై గంగూలీ ఇప్పటి వరకూ ఏమీ స్పందించలేదు.