కుంభకర్ణుడు అనగానే అందరికీ గుర్తొచ్చేది నిద్ర. సాధారణ సమయం కంటే ఒకట్రెండు గంటలు ఎక్కువగా నిద్రిస్తే కుంభకర్ణుడిలా పడుకున్నావేంటి అని విమర్శిస్తారు. ఆరు నెలలపాటు ఏకధాటిగా నిద్రపోయేలా రావణుడి సోదరుడయిన కుంభకర్ణుడికి బ్రహ్మ వరమిచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. మరి ఏ దేవుడి వరమో, ఎవరు ఇచ్చిన శాపమో కానీ ఈ వ్యక్తి మాత్రం నిద్రలో కుంభకర్ణుడిని మించిపోయాడు. ఆ కుంభకర్ణుడు ఆరు నెలల పాటు ఏకధాటిగా నిద్రిస్తే.. ఈ కుంభకర్ణుడు మాత్రం ఏకంగా ఏడాదిలో 300 రోజులు నిద్ర పోతున్నాడు.
రాజస్థాన్కు చెందిన పుర్ఖారామ్ (42) అరుదైన అతినిద్ర వ్యాధి (హెచ్పీఏ యాక్సిస్ హైపర్సోమ్నియా)తో బాధపడుతున్నాడు. ఆయనకు 19 ఏండ్ల వయసు ఉన్నప్పటి నుంచే ఈ వ్యాధిలో బాధపడుతున్నాడు. అయితే గతంలో నెలకు 5 నుంచి 7 రోజుల పాటు ఏకధాటిగా నిద్రించేవాడు. కానీ ఇప్పుడు మాత్రం నెలలో 20 నుంచి 25 రోజుల నిద్రలో కూరుకుపోతున్నాడు. అయితే పుర్ఖారామ్ ఓ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆ దుకాణం కూడా నెలలో ఐదు రోజులు మాత్రమే తెరుస్తాడు.
ఒకసారి పడుకుంటే ఏకధాటిగా 25 రోజులపాటు మంచానికే అతుక్కుపోతున్నాడని, మధ్యలో మెలకువ రావడం చాలా అరుదని అతని భార్య లిచ్మి దేవి చెప్పింది. అతనికి స్నానం చేయించడం, ఇతర కార్యకలాపాలన్నీ తానే చూసుకుంటానని లిచ్మి దేవి తెలిపింది. నిద్రలోంచి లేచిన తర్వాత తలనొప్పి బాధిస్తోందని బాధపడుతుంటాడని వాపోయింది. అతి నిద్ర కారణంగా పుర్ఖారామ్ను స్థానికులు కుంభకర్ణుడు అని పిలవడం మొదలుపెట్టారు. మెదడులోని టీఎన్ఎఫ్-ఆల్ఫా ప్రొటీన్ స్థాయుల్లో హెచ్చుతగ్గుల కారణంగానే ఈ సమస్య తలెత్తుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.