జైపూర్: ఇండియా, ముంబై టీమ్ ఓపెనర్ పృథ్వీ షా చెలరేగిపోయాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్లో ఏకంగా డబుల్ సెంచరీ బాదాడు. లిస్ట్ ఎ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన 8వ ఇండియన్ బ్యాట్స్మన్గా అతడు నిలవడం విశేషం. ఈ మ్యాచ్లో కేవలం 142 బంతుల్లోనే షా డబుల్ సెంచరీ కొట్టడం విశేషం. ముంబై ఇన్నింగ్స్ ముగిసే సమయానికి అతడు 152 బంతుల్లో 227 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నాడు. అతని ఇన్నింగ్స్లో మొత్తం 31 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ 45వ ఓవర్లో పృథ్వీ ఈ అరుదైన మైల్స్టోన్ను అందుకున్నాడు. దీని కంటే ముందు లిస్ట్ ఎ క్రికెట్లో అతని అత్యధిక స్కోరు 150గా ఉండేది. సచిన్, సెహ్వాగ్, రోహిత్ శర్మ, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, శిఖర్ ధావన్, కర్ణ్ కౌషల్ తర్వాత ఈ ఘనత సాధించిన 8వ ఇండియన్ బ్యాట్స్మన్ పృథ్వి షా.
మరోవైపు ఈ మధ్యే తొలిసారి ఇండియన్ టీమ్కు ఎంపికైన సూర్యకుమార్ యాదవ్ కూడా రెచ్చిపోయి ఆడాడు. అతడు కేవలం 58 బంతుల్లోనే 133 పరుగులు చేయడం విశేషం. అతని ఇన్నింగ్స్లో 22 ఫోర్లు, 4 సిక్స్లు ఉన్నాయి. పృథ్వితో కలిసి మూడో వికెట్కు 201 పరుగులు జోడించాడు సూర్యకుమార్. ఈ ఇద్దరి జోరుతో ఈ మ్యాచ్లో ముంబై 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఏకంగా 457 పరుగులు చేయడం విశేషం.