అది మహారాష్ట్రలోని నాగ్పూర్. ఆగస్ట్ 8న ఓ ఆటో డ్రైవర్ తన ఆటోను నో పార్కింగ్ జోన్లో పార్క్ చేశాడు. దీంతో అతడికి ట్రాఫిక్ పోలీసులు 200 రూపాయల ఫైన్ వేశారు. కానీ.. అంతకుముందు పే చేయని ఫైన్తో కలిపి 2 వేలు అయింది. ఆ ఫైన్ కట్టి ఆటో తీసుకెళ్లాలని పోలీసులు తెలిపారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు ఆ వ్యక్తి.
ఆ వ్యక్తి పేరు ఖాడ్సే. నాగ్పూర్లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి ఆటోనే జీవనాధారం. తన జీవనాధారం అయిన ఆటోను పోలీసులు సీజ్ చేయడంతో మూడు పూటల తిండి కూడా దొరకక.. నానా అవస్థలు పడింది ఖాడ్సే కుటుంబం. ఏం చేయాలో తెలియక.. చిన్నప్పటి నుంచి తన కొడుకు రూపాయి రూపాయి వేసి దాచుకున్న గల్లపెట్టె కనిపించింది. దీంతో దాన్నిపగులగొట్టి.. చిల్లర అంతా ఏరుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కు వెళ్లాడు ఖాడ్సే. అయితే.. చిల్లర నాణేలు కావడంతో.. వాటిని తీసుకోమని పోలీసులు తేల్చిచెప్పారు.
దీంతో ఏం చేయాలో తెలియక.. ఏడ్చుకుంటూ.. సీనియర్ ఇన్స్పెక్టర్ అజయ్ మాలవియా వద్దకు వెళ్లాడు ఖాడ్సే. దీంతో చేతుల్లో కవర్లో ఉన్న కాయిన్స్ను చూసిన ఆఫీసర్.. అసలేం జరిగింది అని ఆరా తీశారు. దీంతో.. అసలు విషయం చెప్పాడు ఖాడ్సే. అతడి మాటలు విన్న ఇన్స్పెక్టర్ చలించిపోయారు. వెంటనే 2 వేల రూపాయల ఫైన్ను తనే కట్టేసి.. ఆటో తీసుకెళ్లాలని ఖాడ్సేకు ఇన్స్పెక్టర్ తెలిపారు.
ఈ పోలీసు.. ఖాడ్సే ఫైన్ను కట్టేసిన విషయాన్ని నాగ్పూర్ సిటీ పోలీస్కు చెందిన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆటో డ్రైవర్ ఖాడ్సే ఫ్యామిలీకి ఆ చిల్లరను తిరిగి అందిస్తున్న ఫోటోను కూడా నాగ్పూర్ సిటీ పోలీస్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ పోలీసును ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.