లండన్: బ్రిటన్ రాచ కుటుంబంలో రచ్చ ఇప్పుడు బజారుకెక్కింది. బకింగ్హామ్ ప్యాలెస్లో తాను పడిన మానసిక క్షోభను ఓప్రా విన్ఫ్రే షోలో బయటపెట్టింది ఈ మధ్యే రాచరికాన్ని వదులుకున్న మేఘన్ మార్కెల్. భర్త హ్యారీతో కలిసి ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కొన్ని సంచలన విషయాలను వెల్లడించింది. బకింగ్హామ్ ప్యాలెస్లో రాచరికం అనుభవించే సమయంలో తనకు వచ్చిన ఆత్మహత్య ఆలోచనల గురించి ఆమె చెప్పడం గమనార్హం. రాజవంశంలోనూ వర్ణ వివక్షను ఉన్నదని చెప్పి ఆమె సంచలనం రేపింది.
బతకాలని అనిపించేది కాదు
రాచకుటుంబంలో ఉన్న సమయంలో తనపై వచ్చిన నెగటివ్ మీడియా కవరేజ్పై ఆమె స్పందించింది. బ్రిటిష్ మీడియా ఎంత వరకూ వెళ్లిందంటే ఇక ఈ జీవితం వ్యర్థమని అనిపించేలా చేసిందని మేఘన్ వాపోయింది. రాజకుటుంబంలో ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనిపించేది. అది చాలా భయంకరమైన ఆలోచన అని మేఘన్ చెప్పింది. తాను తొలిసారి గర్భం దాల్చినప్పుడు ఆత్మహత్య ఆలోచనలు వచ్చినట్లు తెలిపింది. ఆ సమయంలో సపోర్ట్ కోసం ప్యాలెస్ను, ప్రిన్సెస్ డయానా బెస్ట్ ఫ్రెండ్స్ను కూడా కలిసినట్లు చెప్పింది.
నీ కొడుకు ఏ రంగులో ఉంటాడో?
నేను తొలిసారి గర్భంతో ఉన్న సమయంలో రాచ కుటుంబంలో ఒక రకమైన ఆందోళన ఉంది. నా కొడుకు ఎంత నల్లగా పుడతాడో అని రాచ కుటుంబం ఆందోళన చెందుతున్నట్లు హ్యారీయే నాతో చెప్పాడు అని మేఘన్ తెలిపింది. మేఘన్ తండ్రి ఓ వైట్ కాగా.. తల్లి ఓ బ్లాక్. తన కొడుకుకు సెక్యూరిటీ ఇవ్వరని, అతనికి ఓ టైటిల్ కూడా ఇవ్వరన్న చర్చతోపాటు అతని శరీర రంగుపై కూడా చర్చ నడిచిందని మేఘన్ చెప్పింది. ఇది రాచ కుటుంబంలోని వర్ణ వివక్షను బయటపెట్టింది.