వినాయక చవితికి, దసరాకు నవరాత్రులు నిర్వహిస్తుంటాం. తొమ్మిది రాత్రుల పాటు పూజలు నిర్వహించి, ఆ తర్వాత మట్టి విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటాం. విగ్రహాన్ని ప్రతిష్ఠించేప్పుడు శాస్త్రోక్తంగా పూజచేసి ఉత్సవాలు ప్రారంభిస్తాం. మరి నిమజ్జనం అప్పుడు ఏం చేయాలి? ఏ మంత్రాన్ని జపించాలి? ఏ శ్లోకాన్ని పఠిస్తూ గణపతి విగ్రహాన్ని నీళ్లలోకి వదలాలి? అంటే.. విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో ఎంత భక్తితో పూజ చేస్తామో, నిమజ్జనం అప్పుడు కూడా అంతే భక్తితో స్వామివారిని పూజించాలి.
వినాయకుడిని బేసి సంఖ్య రోజున నిమజ్జనం చేయాలి. వినాయక చవితి నాడు లేక, 3, 5, 7, 9, 11 వ రోజు నిమజ్జనం చేయాలి. నిమజ్జనం చేసేముందు గణపతికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. తీర్థ ప్రసాదాలు తీసుకొని, నిమజ్జన ఊరేగింపు నిర్వహించాలి. విఘ్నేశ్వరుడిని నీటిలోకి జారవిడిచేముందు కచ్చితంగా.. ‘శ్రీ గణేశం ఉద్వాసయామి.. శోభనార్థం పునరాగమనాయచ’ అని చెప్పుకోవాలి.