ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికిల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు సెంచరీ దాటాయి. పర్యావరణ పరిరక్షణ గురించి మనం ఆలోచించాల్సి వస్తోంది. అందుకే.. పెట్రోల్, డీజిల్ వాహనాలను పక్కన పెట్టి.. వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.
దానికి అనుగుణంగా భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు కూడా పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ.. ఓలా ఎస్1, ఎస్1 ప్రో మోడల్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. దానికి పోటీగా.. సింపుల్ ఎనర్జీ అనే కంపెనీ.. సింపుల్ వన్ అనే ఈ-బైక్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ రెండు కంపెనీలకు పోటీగా.. తాజాగా హోండా కంపెనీ యూ-గో అనే ఎలక్ట్రిక్ స్కూటర్ను త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి తీసుకురానున్నట్టు సమాచారం.
ఇప్పటికే ఈ స్కూటర్ను చైనాలో హోండా రిలీజ్ చేసింది. అక్కడి కరెన్సీలో ఈ స్కూటర్ ధర సీఎన్వై 7499. అంటే మన కరెన్సీలో రూ.86,000. రెండు వర్షన్లలో ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుంది. టాప్ స్పెసిఫికేషన్ వర్షన్ 1.2 కేడబ్ల్యూ మోటర్, 1.8 కేడబ్ల్యూ ఔట్పుట్తో 53 కేఎంపీహెచ్ టాప్స్పీడ్ను కలిగి ఉంటుంది. స్టాండర్డ్ యూగో వర్షన్ మాత్రం 0.9 కేడబ్ల్యూ మోటార్తో 45 కేఎంపీహెచ్ టాప్స్పీడ్ను కలిగి ఉంటుంది.
హోండా యూగో రెండు వర్షన్లు.. 1.44 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంటాయి. ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ప్లే, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్, యాంటీ థెఫ్ట్ అలారమ్ లాంటి ఫీచర్స్ ఈ స్కూటర్ ప్రత్యేకత.
అయితే.. ఈ స్కూటర్ను ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారో? అసలు చేస్తారో చేయరో.. అనే దానిపై క్లారిటీ లేకున్నప్పటికీ.. ప్రస్తుతం భారత్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా హోండా కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇండియాలో ఈ స్కూటర్ను లాంచ్ చేసినా.. ధర కూడా రూ.86,000 లోపే ఉంటుందని తెలుస్తోంది. ఓలా, సింపుల్ వన్.. ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే ఈ స్కూటర్ చౌకగా లభించనుంది.