డెహ్రాడూన్: వరుడు తన స్నేహితులను వదిలేసి బరాత్కు వెళ్లిపోయాడు. ఆగ్రహించిన స్నేహితులు వరుడిపై రూ.50 లక్షలకు పరువునష్టం దావా వేశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ సంఘటన ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జిల్లాలో జరిగింది. బహదూరాబాద్ గ్రామానికి చెందిన రవికి ఇటీవల పెళ్లి జరిగింది. అయితే పెళ్లి ఇన్విటేషన్లు పంపేందుకు స్నేహితుడు చంద్రశేఖర్ సహాయం కోరాడు. దీంతో పెళ్లి రోజున సాయంత్రం ఐదు గంటలకు ఊరేగింపుగా వివాహానికి బయలుదేరనున్నట్లు స్నేహితులందరికీ అతడు ఇన్విటేషన్లు పంపాడు. అలాగే ఆ సమయానికి అందరం కలుసుకుందామని స్నేహితులకు చంద్రశేఖర్ చెప్పాడు.
కాగా, పెళ్లి రోజున స్నేహితులందరితో కలిసి చంద్రశేఖర్ అనుకున్న సమయానికి వరుడు రవి ఇంటికి చేరుకున్నాడు. అయితే ఆ సమయానికి ముందుగానే పెళ్లి కుమారుడు రవి తన కుటుంబం, బంధువులతో కలిసి పెళ్లి ఊరేగింపుగా వివాహ వేదిక వద్దకు వెళ్లిపోయాడు. ఇది తెలిసిన స్నేహితుడు చంద్రశేఖర్ పట్టరాని ఆగ్రహంతో వరుడికి ఫోన్ చేశాడు. అయితే వారు రావడం ఆలస్యమైందని పెళ్లి కుమారుడు ఆరోపించాడు. తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాలని స్నేహితులతో అన్నాడు.
దీంతో స్నేహితుడు రవి తీరుపై చంద్రశేఖర్ మండిపడ్డాడు. వెంటనే న్యాయవాదిని సంప్రదించాడు. స్నేహితులను వదిలేసి పెళ్లి చేసుకోవడంతోపాటు తమ గౌరవాన్ని దెబ్బతీసినందుకు రవిపై రూ.50 లక్షలకు పరువునష్టం దావా వేశాడు. పెళ్లికి ఆహ్వానించిన స్నేహితులు, అతిథులతోపాటు దానికి పురమాయించిన తనను మానసికంగా హింసించినట్లు అందులో ఆరోపించాడు.