ప్రస్తుతం మధ్యప్రదేశ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా.. వాగులు, చెరువులు.. పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వరదలతో వందల గ్రామాలు మునిగిపోయాయి. ఇంట్లో నుంచి బయట కాలు పెట్టే పరిస్థితి లేకుండా.. వరదలు గ్రామాలను చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఒక వీడియో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వరదల పరిస్థితికి అద్దం పడుతోంది. ఆ వీడియోను చూసి.. నెటిజన్లు అయితే ఆ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.
గుణ జిల్లాలోని భాదువారా అనే గ్రామాన్ని కూడా వరదలు ముంచెత్తాయి. దీంతో గ్రామం మొత్తం నీటిలో మునిగిపోయింది. ఒక్క రోజు కాదు.. రెండు రోజులు కాదు.. దాదాపుగా వారం రోజుల నుంచి ఆ గ్రామ ప్రజలు వరద నీటిలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. అదే గ్రామానికి చెందిన కమర్లాల్ అనే వ్యక్తి చనిపోయాడు. చుట్టూ ఎటు చూసినా వరద నీరే ఉండటంతో.. వరద నీరు తగ్గాక.. అతడి అంత్యక్రియలు నిర్వహించాలని బంధువులు భావించినా.. వరద నీరు ఎంతకీ తగ్గలేదు. దీంతో చేసేది లేక.. ఈత తెలిసిన వాళ్లు మాత్రం ఓ నలుగురు వ్యక్తులు.. నడుములోతు ఉన్న వరద నీటిలో దిగి.. ఆయన పాడెను మోస్తూ తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. వాళ్లు వరద నీటిలో నడుస్తూ.. పాడెను మోసుకెళ్తున్న వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రం అని చెబుతారు కదా.. కనీసం వరద నీటిని మళ్లించే సిస్టమ్ కూడా లేదా? ప్రభుత్వం ఏం చేస్తోంది? నిద్రపోతోందా? అంటూ నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు 1250 గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. గ్వాలియర్, శివ్పురి, గుణ, శియోపూర్, డాటియా, అశోక్ నగర్, భిండ్, మొరెనా జిల్లాల్లోని పలు గ్రామాలు వరద నీటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి.