హైదరాబాద్: కొవిడ్పై పోరులో భాగంగా పూర్తిగా స్వదేశంలోనే అభివృద్ధి చేసిన కొవాగ్జిన వ్యాక్సిన్ సురక్షితమైనదని, వ్యాధినిరోధకతను పెంచుతోందని, ఎలాంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ లేవని లాన్సెట్ తేల్చింది. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ రెండో దశ ఫలితాలను విడుదల చేశారు. అయితే వీటి ద్వారా వ్యాక్సిన్ సామర్థ్యాన్ని అంచనా వేయలేని, దీని కోసం మూడో దశ ఫలితాలు అవసరమని లాన్సెట్ తెలిపింది. ఇదో గుడ్ న్యూస్ అని అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్లోని ఇన్ఫెక్షస్ డిసీజెస్ చీఫ్ ఫహీమ్ యూనస్ ఓ ట్వీట్లో అన్నారు. ఫేజ్ 1తో పోలిస్తే ఫేజ్ 2 ట్రయల్స్లో వ్యాక్సిన్ మరింత మెరుగైందని లాన్సెట్ స్పష్టం చేసింది.
ఇక సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఫిర్యాదు చేసిన వారి సంఖ్య కూడా ఫేజ్ 1తో పోలిస్తే ఫేజ్ 2లో తగ్గిందని తెలిపింది. ఈ అధ్యయనం 12-18 ఏళ్ల వయసులు, 55-65 ఏళ్ల వయసు వారిపై జరిగిందని, పిల్లల్లో, 65 ఏళ్లు పైబడిన వారిపై ఈ వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవడానికి మరింత అధ్యయనం అవసరమని లాన్సెట్ తెలిపింది. మూడో దశ ట్రయల్స్ ముగియకుండానే గత జనవరిలో కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డీజీసీఏ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన తొలి డోసుగా కొవాగ్జిన్ టీకానే తీసుకున్నారు.