మెగాస్టార్ చిరంజీవి కొన్ని రోజులుగా నాన్ స్టాప్ షూటింగ్ చేస్తున్నాడు. ఈయన నటిస్తున్న ‘ఆచార్య’ షూటింగ్ ఖమ్మంలో జరుగుతుంది. అక్కడే రామ్ చరణ్ కూడా ఉన్నాడు. మూడు రోజుల కింద ఖమ్మం ఇల్లందు బొగ్గు గనుల్లో ఈ చిత్ర షూటింగ్ మొదలు పెట్టాడు కొరటాల శివ. కానీ ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ఉన్నట్లుండి ఆగిపోయింది. ఎండల కారణంగా ‘ఆచార్య’ షూటింగ్లో చిరంజీవికి అనుకోని అనారోగ్య సమస్యలు వచ్చినట్లు తెలుస్తుంది. వేసవి ఇంకా మొత్తంగా మొదలు కాకముందే వేడి ఎక్కువైపోతుంది. ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో వేడి మరీ దారుణంగా ఉంటుంది. బొగ్గు గనులు ఉన్న ఖమ్మంలో అయితే ఎండలు బాగా ఉన్నాయి. అక్కడ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో అక్కడే షూటింగ్ చేస్తున్న ఆచార్య టీంకు సమ్మర్ సెగలు తగిలాయి.
మార్చి 15 వరకు అక్కడే జరగాల్సిన షూటింగ్ను మూడు రోజుల్లోనే ముగించేశాడు కొరటాల శివ. ఇంకా చిత్రీకరించాల్సిన సన్నివేశాలు ఉన్నా కూడా ముందుగానే ఆపేశాడు దర్శకుడు. ఇల్లందు గనుల్లోనే రామ్ చరణ్, చిరంజీవి కాంబినేషన్ సీన్స్ ప్లాన్ చేశాడు దర్శకుడు. దానికోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేశాడు. అయితే షూటింగ్ లో ఉన్నట్లుండి చిరంజీవికి డీ హైడ్రేషన్ అయిందని.. దాంతో ఉన్నపలంగా షూటింగ్ ఆపేశారని ప్రచారం జరుగుతుంది. షూటింగ్ కోసం తమకు అన్ని అనుమతులు ఇచ్చిన మంత్రి పువ్వాడ అజయ్కు కృతజ్ఞతలు తెలిపాడు చిరంజీవి. అలా జరిగిన ఒక్క రోజులోనే షూటింగ్ ఆపేశాడు దర్శకుడు కొరటాల శివ.
7 రోజుల షెడ్యూల్ 3 రోజుల్లోనే అర్ధాంతరంగా ముగిసిపోవడంతో మరో షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు. ఇల్లందు ఓపెన్ కాస్ట్ గనుల్లో కొన్ని రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆ కారణంగానే ‘ఆచార్య’ షూటింగ్కి ఇబ్బందులు తలెత్తాయి. పరిస్థితులు చక్కబడిన తర్వాత అక్కడ షూటింగ్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. అక్కడున్న అత్యధిక వేడితో చిరంజీవి డీ హైడ్రేషన్కు లోనయ్యారని ప్రచారం జరుగుతుంది. పరిస్థితులు మళ్లీ చక్కబడిన తర్వాత ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.