గువాహటి: మన భారతీయ సమాజంలో వివాహ బంధానికి ఎంతో పవిత్రమైన స్థానం ఉన్నది. ఒక్కసారి వివాహ బంధంతో ఒక్కటయ్యారంటే కష్టమైనా, సుఖమైనా కలిసే అనుభవిస్తారు. కానీ క్రమంగా పరిస్థితులు మారిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. ఇలాంటి అడ్డగోలు సంబంధాల కారణంగా నూరేళ్లు సాగాల్సిన కాపురాలు కాస్త మూణ్ణాళ్ల ముచ్చటగా మారిపోతున్నాయి. కానీ అసోం రాష్ట్రం నాగోన్ జిల్లా ధింగ్ లాహ్కర్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఒకరి తర్వాత ఒకరితో మొత్తం 25 మందితో వివాహేతర సంబంధాలు పెట్టుకుని, 25 సార్లు లేచిపోయి వచ్చింది.
అయినా ఆమె కాపురంలో ఎలాంటి చిచ్చు రేగలేదు. భర్త కొట్టలేదు తిట్టలేదు. ఆమె ప్రియులతో పిక్నిక్లకు వెళ్లినట్లు వెళ్లి రావడం, రాగానే భర్త అక్కున చేర్చుకోవడం జరుగుతున్నది. వివరాల్లోకి వెళ్తే.. ధింగ్ లాహ్కర్ గ్రామానికి చెందిన ఓ 40 ఏండ్ల మహిళకు పదేండ్ల క్రితం వృత్తిరీత్యా డ్రైవర్ అయిన మఫీజుద్దీన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే, ఈ పదేండ్ల కాలంలో ఆ మహిళ ఏనాడు భర్తతో సరిగా కాపురం చేయలేదు. పదేండ్లలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 25 మందితో 25 సార్లు లేచిపోయి తిరిగొచ్చింది.
అయినా భర్త మఫీజుద్దీన్ గానీ, అతని కుటుంబసభ్యులుగానీ ఏనాడూ ఆమెను పల్లెత్తి మాట అనలేదు. భార్య అన్నిసార్లు లేచిపోయి వచ్చినా ఎందుకు కలిసి కాపురం చేస్తున్నావని అడిగితే.. తన పిల్లల కోసం అని చెబుతున్నాడు మఫీజుద్దీన్. ఆ దంపతులకు ఆరేండ్ల వయసున్న కుమార్తె, మూడేండ్లు, మూడు నెలల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యను కాపురానికి రానీయకపోతే పిల్లలను ఎవరు చూసుకుంటారని మఫీజుద్దీన్ ప్రశ్నిస్తున్నాడు. పసి పిల్లలను వదిలేసి రేయిపగలు తేడా లేకుండా చేసే డ్రైవర్ విధులు ఎలా నిర్వర్తించగలనని అడుగుతున్నాడు.
ఇప్పుడు కూడా తన భార్య తనతో లేదని, కొద్ది రోజుల క్రితం మేకలకు మేత తీసుకొస్తానని చెప్పి మూడు నెలల బాబును పక్కింటి వాళ్లకు ఇచ్చి వెళ్లిందని, ఇక ఆమె ఎప్పుడు వస్తుందో తెలియదని మఫీజుద్దీన్ చెప్పాడు. కొన్ని కొన్నిసార్లు రోజుల వ్యవధిలో తిరిగొచ్చిందని, కొన్ని సార్లు మాత్రం నెలల కొద్ది పోయిందని తెలిపాడు. ఈసారి పోతూపోతూ ఇంట్లో ఉన్న రూ.22 వేలు ఎత్తికెళ్లిందని వాపోయాడు.