ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా నీరజ్ చోప్రా గురించే చర్చ. జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించి భారతదేశ ఖ్యాతిని దశదిశలా వ్యాపించేలా చేసిన నీరజ్ చోప్రాకు దేశమంతా నీరాజనాలు పలుకుతోంది. మువ్వెన్నల జెండాను టోక్యో ఒలింపిక్స్లో ఎగురవేసి.. భారత్ సత్తా చాటాడు నీరజ్ చోప్రా. 23 ఏళ్ల వయసులోనే ఒలింపిక్స్లో తన సత్తాచాటి తిరుగులేని అథ్లెట్గా చరిత్రకెక్కాడు. ఈసందర్భంగా సోషల్ మీడియాలో నీరజ్ చోప్రా గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా నీరజ్ చోప్రా.. గోల్డ్ మెడల్ గెలవడం.. ఈ దేశానికే గర్వకారణమని ట్వీట్ చేశారు.
సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండే.. వ్యాపారవేత్త, మహీంద్ర కంపెనీ ఓనర్ ఆనంద్ మహీంద్రా తాజాగా నీరజ్ చోప్రా విజయంపై స్పందించారు. మేమంతా నీ సైనికులం బాహుబలి అంటూ బాహుబలి సినిమా హీరో ప్రభాస్ ఫోటోను, నీరజ్ చోప్రా ఫోటోను పక్కపక్కన పెట్టి ట్వీట్ చేశారు ఆయన. ఆ తర్వాత ఒలింపిక్స్ గేమ్స్లో నిర్వహించే జావెలిన్ త్రో గేమ్ స్మారకార్థం విడుదల చేసే కాయిన్స్లో తాజాగా నీరజ్ చోప్రా చిత్రంతో కొత్తగా రిలీజ్ చేయాలని ఆయన మరో ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీంతో ఓ నెటిజన్.. నీరజ్ చోప్రాకు ఒక XUV700 కారును గిఫ్ట్గా ఇవ్వాలంటూ కోరాడు. దీంతో ఆ నెటిజన్ ట్వీట్కు రిప్లయి ఇచ్చిన ఆనంద్ మహీంద్రా.. అయ్యో.. తప్పకుండా.. మన గోల్డెన్ అథ్లెట్కు XUV700 గిఫ్ట్గా ఇవ్వడం నా అదృష్టం. అది నేను ఆయనకిచ్చే గౌరవంగా భావిస్తాను.. అంటూ మహీంద్ర కంపెనీ ఎగ్జిక్యూటివ్లను ఆ పోస్ట్లో ట్యాగ్ చేస్తూ వెంటనే ఒక XUV700ని నీరజ్ చోప్రా కోసం సిద్ధంగా ఉంచండి.. అని ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా.. మన అథ్లెట్.. నీరజ్ చోప్రాకు ఇచ్చే గౌరవాన్ని చూసిన నెటిజన్లు.. ఆనంద్కు సలాం కొడుతున్నారు. గ్రేట్ సర్.. మీరే అసలైన ఇన్సిపిరేషన్ సర్.. అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.