కాన్పూర్: ఉత్తరప్రదేశ్కు చెందిన 80 ఏళ్ల ఓ వృద్ధురాలు అయోధ్య రామ మందిరం కోసం రూ.51 వేల విరాళాన్ని అందించింది. ఇందులో పెద్ద విశేషమేమీ లేకపోవచ్చు. కానీ ఆ డబ్బును ఆమె జమ చేసిన విధానం మాత్రం కచ్చితంగా విశేషమే. ఈ డబ్బును ఆమె 28 ఏళ్లుగా జమ చేస్తూ వచ్చింది. అది కూడా రోజుకు రూ.5 జమ చేశానని ఆమె చెబుతోంది. కృష్ణా దీక్షిత్ అనే ఆ వృద్ధురాలు రామ మందిరానికి తన వంతు సాయం చేశానని తెగ మురిసిపోతోంది.
రామ మందిరం కోసం ఆమె 28 ఏళ్లుగా ఎదురు చూస్తోంది. 1992 నుంచీ ఇలా రోజు రూ.5 పక్కన పెడుతూ వస్తోంది. కాన్పూర్లోని యశోదా నగర్కు చెందిన ఈమె.. ఈ మధ్యే ఆరెస్సెస్కు చెందిన ఓ ప్రాంతీయ ప్రచారక్కు తాను దాచుకున్న సొమ్మును అందజేసింది. అయితే నగదు రూపంలో రూ.20 వేల కంటే ఎక్కువ తీసుకోమని ట్రస్ట్ సభ్యులు చెబుతుండటంతో ఆమె ముందు తన డబ్బును తన కొడుకు గౌరంగ్ బ్యాంక్ ఖాతాలో వేసి చెక్కు రూపంలో ఆ మొత్తాన్ని అందజేసింది. ఆమెతోపాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా రామ మందిరం కోసం విరాళాలు ఇచ్చారు. ఇలా ఆ ఒక్క కుటుంబం నుంచే రూ.1,30,900 విరాళాలు రావడం విశేషం. అందులో కృష్ణా దీక్షిత మనవడైన నమిత్ దీక్షిత్ తన తొలి నెల జీతాన్ని విరాళంగా ఇచ్చాడు. దీనిని ఏడాది కిందటే తీసి పక్కన పెట్టాడు. మొదటి నుంచీ తన కుటుంబం రామ మందిర నిర్మాణ ఉద్యమంలో భాగంగా ఉన్నదని, కోట్లాది భారతీయులలాగే తాను కూడా మందిర నిర్మాణం కోసం కలలు కన్నానని కృష్ణా దీక్షిత్ చెప్పడం విశేషం.