న్యూఢిల్లీ : సరిహద్దుల వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు చైనా దుందుడుకు చర్యలతో ఘర్షణ, పరస్పర అపనమ్మకంతో కూడిన వాతావరణం నెలకొంటోందని ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే డ్రాగన్పై విరుచుకుపడ్డారు. చైనా, అమెరికాల మధ్య శత్రుత్వ వైఖరి ప్రాంతీయ అసమానతలు, అస్థిరతకు దారితీశాయని ఓ సెమినార్లో మాట్లాడుతూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బలహీన దేశాలపై చైనా శత్రు భావం ప్రదర్శించడంతో పాటు బెల్ట్, రహదారుల నిర్మాణం వంటి కార్యక్రమాల ద్వారా ప్రాంతీయ పరాధీనతలను డ్రాగన్ సృష్టిస్తోందని అన్నారు.
సరిహద్దు ప్రతిష్టంభనను తొలగించే క్రమంలో తూర్పు లడఖ్లోని ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి సేనల ఉపసంహరణకు భారత్, చైనా అంగీకారానికి వచ్చాయని ప్రభుత్వం నిర్దారించిన అనంతరం ఆర్మీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గత ఏడాది మే నుంచి తూర్పు లడఖ్ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగిన సంగతి తెలిసిందే. సరిహద్దు ఉద్రిక్తతలు పతాకస్ధాయికి చేరడంతో ఓ దశలో ఇరు దేశాలూ పెద్దసంఖ్యలో సైనిక బలగాలు, యుద్ధ విమానాలను ఆ ప్రాంతంలో మోహరించాయి. పలుమార్లు జరిగిన సైనిక కమాండర్ల స్దాయి చర్చల అనంతరం సేనల ఉపసంహరణకు ఇరు పక్షాలు అంగీకరించాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల పార్లమెంట్లో ప్రకటించారు.