ముంబయిలోని హయత్ రీజెన్సీ హోటల్. ఫెమినా మిస్ ఇండియా-2020 గ్రాండ్ ఫినాలే! హోటల్ హాల్ విద్యుద్దీప కాంతులతో మిరుమిట్లు గొలుపుతున్నది. ఆ వెలుగులను తోసిరాజని ముగ్గురు అతిలోక సుందరీమణులుస్టేజ్పై తళుకులీనుతున్నారు. ఒకరిని మించిన సౌందర్యం మరొకరిది. ఎవరి ఆత్మవిశ్వాసం వారిది. అందాల కిరీటం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ. హాలంతా నిశ్శబ్దం…కాసేపటికి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ‘ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 ఈజ్.. మానస వారణాసి’ అని ప్రకటించారు న్యాయనిర్ణేతలు హర్షధ్వానాల మధ్య. ఆనందడోలికల్లో తేలిపోయింది మానస. ఆశ్చర్యంలో నుంచి తేరుకోకముందే అందాల కిరీటం ఆమె శిరస్సును ముద్దాడింది. 2020 ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ సాష్ ఈ 23 ఏండ్ల హైదరాబాదీని అలంకరించింది.
అందాల పోటీలో అందలం ఎక్కాలన్నది మానస చిరకాల వాంఛ. అందచందాలతో, అబ్బురపరిచే ఆత్మవిశ్వాసంతో ఆ కోరికను నెరవేర్చుకుంది మానస. రాజస్థాన్కు చెందిన మిస్ ఇండియా -2019 విన్నర్ సుమన్ రతన్సింగ్ రావు చేతుల మీదుగా అందాల కిరీటాన్ని అలంకరించుకుంది. ఈ ఏడాది డిసెంబర్లో జరుగనున్న 70వ మిస్ వరల్డ్ పీజెంట్ పోటీలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది మానస. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనలిస్ట్గా పని చేస్తున్న మానసకు పుస్తకాలు చదువడం అంటే ఇష్టం. పాటలు బాగా పాడుతుంది. రెగ్యులర్గా యోగా చేస్తుంది. చిన్నప్పుడు అందరూ తనను ‘షై చైల్డ్’ అనేవారట. తన మనసులోని మాటను నాట్యం, సంగీతం ద్వారా వ్యక్తపరిచేది మానస. అమ్మ, అమ్మమ్మ, చెల్లెలు తన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించారని చెబుతున్నది.