సెలూన్లు, లాండ్రీలు, ధోబీఘాట్ల కు 250 యూనిట్ల వరకు విద్యుత్ రాయితీ
ప్రభుత్వ నిర్ణయంపై రజకులు, నాయీ బ్రాహ్మణుల సంబురం
ఆర్మూర్, ఏప్రిల్ 6 : రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తోంది. వృత్తినే నమ్ముకొని జీవిస్తున్నవారికి అండగా ఉంటున్నది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తుండగా.. తాజాగా రజక, నాయీ బ్రాహ్మణుల దుకాణాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. దీంతో కులవృత్తిపై ఆధారపడి బతుకుతున్నవారికి విద్యుత్ భారం తగ్గనున్నది. నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 894 సెలూన్లు, 189 లాండ్రీ దుకాణాలు, 6 దోబీఘాట్లు ఉన్నాయి. వీటి నిర్వాహకులకు ప్రయోజనం చేకూరనున్నది. తమ వృత్తిని కొనసాగించుకొని ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తూ 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించడంపై రజక, నాయీబ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వృత్తిదారులకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ రజకులు, నాయీ బ్రాహ్మణులు ఉమ్మడి జిల్లాలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు.
సీఎం ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం..
రజకులకు ఆర్థిక భరోసా ఇచ్చేలా సీఎం కేసీఆర్ నిర్ణ యం తీసుకోవడం చాలా సంతోషం. ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. లాండ్రీ షాపులకు, దోబీ ఘాట్లకు 250 యూనిట్ల వరకు విద్యుత్ రాయితీ కల్పించడం అభినందనీయం.
-మానస గణేశ్, రజక సంఘాల ఐక్య సమితి రాష్ట్ర కన్వీనర్, ఆర్మూర్