హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): దేశంలో కరోనా విలయం నేపథ్యంలో భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ ధరలను తగ్గించింది. రాష్ర్టాలకు ఒక్కో డోస్ను రూ.400కు సరఫరా చేయనున్నట్టు గురువారం ప్రకటించింది. గతంలో ఈ ధర రూ.600గా ఉండేది. ఇప్పుడు 33 శాతం తగ్గించింది. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ధర తగ్గించాలని నిర్ణయించినట్టు భారత్ బయోటెక్ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా కట్టడికి కొవాగ్జిన్ అభివృద్ధి, దేశంలోనే మొట్టమొదటిసారిగా బీఎస్ఎల్-3 ప్రమాణాలతో ఉత్పత్తి, క్లినికల్ ట్రయల్స్.. ఇలా అన్ని దశలను సొంత నిధులతోనే పూర్తి చేశామని పేర్కొన్నది. స్వదేశీ టీకాను అభివృద్ధి చేయాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో దాదాపు ఏడాదిపాటు సంస్థకు చెందిన అన్నిరకాల వనరులను వ్యాక్సిన్ అభివృద్ధి కోసమే వినియోగించామని తెలిపింది. నిరంతర శ్రమతోపాటు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని చివరికి విజయం సాధించామని వెల్లడించింది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పారదర్శకంగా ధరను నిర్ణయించామని చెప్పింది. ‘ప్రజారోగ్య విభాగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు రాష్ర్టాలకు ఒక్కో డోస్ను రూ.400కే సరఫరా చేయనున్నాం’ అని పేర్కొన్నది. కరోనా విపత్తు నుంచి దేశం త్వరగా కోలుకొనేందుకు తమ నిర్ణయం కొంత తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తంచేసింది.