తెలంగాణ చరిత్రలో మరుగున పడిన అవశేషాలెన్నో. వాటిలో ఒకటి.. అమ్రాబాద్ మహాకుడ్యం. నల్లమల అటవీ ప్రాంతంలో నిర్మితమైన ఈ భారీ గోడ కాకతీయుల వైభవానికి నిలువెత్తు నిదర్శనం. ‘ గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణ ’గా గుర్తింపు పొందిన ఈ అద్భుత నిర్మాణం తెలంగాణ ప్రభుత్వ హయాంలో పునర్వైభవాన్ని సంతరించుకోనున్నది.
గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణ.. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఇటీవల వెలుగు చూసిన మహాకుడ్యం. ఎనిమిదో శతాబ్దంలో మొదలైన ఈ నిర్మాణం 13వ శతాబ్దంలో పూర్తయింది. చరిత్రలో కలిసిపోయిన అమ్రాబాద్ కోటకు శత్రుదుర్భేద్యమైన రక్షణగా, 120 కిలోమీటర్ల పొడవునా సాగింది. ప్రస్తుత అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మన్ననూర్ నుంచి ప్రారంభమై ఫరహాబాద్ మీదుగా కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల వరకూ విస్తరించింది. కాకతీయ సామ్రాజ్య పతనానంతరం శత్రురాజ్యాల దాడులనూ తట్టుకొని నిలబడింది. ప్రకృతి ప్రకోపాలతో ఈ మహాకుడ్యం అంతర్ధానమైనా, తన ఉనికిని చాటుతూ అక్కడక్కడా ఘనమైన ఆనవాళ్లనే వదిలింది.
ఎనిమిదో శతాబ్దంలో తెలంగాణ ప్రాంతాన్ని ఇక్ష్వాకులు పాలించారు. వారి హయాంలో అమ్రాబాద్ ప్రాంతాన్ని పట్టభద్రుడు అనే సామంత రాజుకు అప్పగించారు. ఆయన ఈ కోట నిర్మాణానికి పునాది వేశాడు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఉత్తరాన కోట ఉండగా, దాని రక్షణ కోసం నిర్మితమైన గోడలు నల్లమలలోని కృష్ణానది తీరం మీదుగా విస్తరించాయి. ఎన్నో చేతులు మారి, 13వ శతాబ్దంలో కాకతీయుల ఆధీనంలోకి వచ్చిందీ కోట. రాణి రుద్రమదేవి హయాంలోనూ కొంతవరకు కోట నిర్మాణం జరిగింది. తదనంతరం ప్రతాపరుద్రుడి పాలనాకాలంలో కోట నిర్మాణం పూర్తయింది. దుర్గాన్ని రక్షించేందుకు, ఇక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా 120 కిలోమీటర్ల మేరా రక్షణనిచ్చేలా కోట గోడలను నిర్మించాడు ప్రతాపరుద్రుడు. అప్పటి నుంచీ దీన్ని ‘ప్రతాపరుద్రుడి కోట’గా పిలుస్తున్నారు.
ఈ కోటను చివరగా ఏలినవారు చింతకుంట ప్రభువులు. తర్వాత ఆలనా పాలనా లేక కోట శిథిలమైంది. ప్రకృతి బీభత్సాలు, దొంగల దాడులు, గుప్తనిధుల కోసం తవ్వకాలవల్ల గోడ మొత్తం దెబ్బతిన్నది. అక్కడక్కడా ఆనవాళ్లు, పునాదులు మాత్రమే మిగిలాయి. ప్రస్తుతం ఐదారు కిలోమీటర్ల మేర కూలిపోయిన స్థితిలో ఈ మహా కుడ్యం దర్శనమిస్తున్నది. అమ్రాబాద్ మండలం మన్ననూరుకు సమీపంలో సుమారు కిలోమీటరు వరకూ కొండపైకి ఎక్కిన తర్వాత, చుట్టూరా సుమారు రెండు కిలోమీటర్ల మేర కోటగోడ కనిపిస్తున్నది. మరోవైపు ఫరహాబాద్ అటవీ ప్రాంతంలోని వ్యూ పాయింట్కు ఇరువైపులా కోటగోడలు చెక్కుచెదరకుండా ఉన్నాయి.
శ్రీశైలం, అక్కమహాదేవి గుహలు, మద్దిమడుగు, మల్లెలతీర్థం లాంటి పలు దర్శనీయ స్థలాలకు వెళ్లే యాత్రికులు, మన్ననూరు నుంచే రాకపోకలు సాగిస్తారు. వీరిని ఆకర్షించేందుకు ప్రతాపరుద్రుడి కోట, పరిసర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. భారీ జాతీయ జెండాతోపాటు వ్యూ పాయింట్లను నిర్మించనున్నారు. స్థానిక అడవిలో లభించే ఉత్పత్తులు, గిరిజనులు తయారు చేసే వస్తువులను విక్రయించేందుకు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు.
‘ప్రతాపరుద్రుడి కోటవరకూ మట్టి రోడ్డు నిర్మాణం పూర్తి చేశాం. కొండపైన పురాతన కోట శిథిలావస్థకు చేరుకున్నది. చిన్న కొలను ఇప్పటికీ నీటితో కళకళలాడుతున్నది. కొండపైన వ్యూ పాయింట్ ఏర్పాటు చేస్తున్నాం. శ్రీశైలం రహదారి నుంచి అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే సఫారీ వాహనాల్లో 3 కి.మీ. మేర ప్రయాణించి కొండపైకి చేరుకోవచ్చు. కొండపైన చుట్టూ తిరిగేలా రింగ్ రోడ్డు నిర్మిస్తున్నాం. ఔత్సాహికులు ప్రధాన రహదారి నుంచి ఏటవాలుగా ట్రెక్కింగ్ చేస్తూ కూడా కొండపైకి చేరుకోవచ్చు’ అంటారు నాగర్ కర్నూల్ జిల్లా అటవీశాఖ అధికారి కిష్టాగౌడ్.
తెలంగాణ చరిత్రకు సజీవసాక్ష్యం ప్రతాపరుద్రుడి కోటగోడ. సుమారు 120 కి.మీ. మేర ఉన్న ఈ గోడ కాలక్రమేణ శిథిలావస్థకు చేరుకున్నది. హైదరాబాద్ – శ్రీశైలం ప్రధాన రహదారి నుంచి ఇక్కడికి చేరుకునేందుకు గతంలో గుర్రాలబాట మాత్రమే ఉండేది. పర్యాటకులు వెళ్లాలంటే చాలా కష్టమయ్యేది. గత ఏడాది ట్రెక్కింగ్ చేస్తూ అక్కడికి వెళ్లాం. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో ఇక్కడి ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఎకో టూరిజంలో భాగంగా పర్యాటకులు ట్రెక్కింగ్ చేసేందుకు, కోటగోడ సందర్శనకు అవకాశం కల్పించనున్నాం.
పెద్ది విజయ భాస్కర్మహబూబ్నగర్, నమస్తే తెలంగాణ ప్రతినిధి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వాచ్మన్ నుంచి IIM ప్రొఫెసర్ దాకా.. కేరళ యువకుడి సక్సెస్ స్టోరీ
Whistle village : ఆ ఊళ్లో పేర్లు ఉండవ్.. విజిల్తోనే పిలుచుకుంటరు
Bhuvanagiri Fort | తెలంగాణలో ట్రెక్కింగ్కు కేరాఫ్ భువనగిరి కోట.. దాని ప్రత్యేకతలు తెలుసా?
ఆ ఊరిపెద్ద భారత్లో భోజనం చేస్తాడు.. మయన్మార్లో నిద్రపోతాడు!
ఒంటరిగా ప్రయాణిస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ప్రపంచంలోనే అత్యంత చల్లని నగరాలు ఇవే..
వేసవిలో ప్రయాణమా..ఈ చిట్కాలు పాటించండి