హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇసుక విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఆగస్టు చివరి వరకు విక్రయాల్లో 35 శాతానికిపైగా పెరుగుదల నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇంకా ఏడు నెలల సమయం ఉండగానే దాదాపు సగం లక్ష్యాన్ని చేరుకున్నది. భారీ వర్షాలు, కొవిడ్ ఇబ్బందులు ఉన్నప్పటికీ నిర్మాణరంగం పురోగమిస్తున్నదనడానికి ఇది నిదర్శనమని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.
ఆగస్టులో రూ.54 కోట్లు
రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇసుక విక్రయాల ద్వారా రూ. 851కోట్ల మేర ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఆగస్టు నాటికి రూ.412.93 కోట్ల ఆదాయం సమకూరింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఆగస్టు నెలలో రూ. 21.54 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది ఆగస్టులో ఏకంగా రూ. 54.48 కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు 152.92 శాతం పెరుగుదల నమోదైంది. గతేడాది ఆగస్టు నాటికి రూ.305.28 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది ఆగస్టు చివరి వరకు రూ.412.93 కోట్లు వచ్చింది. ఇది గతేడాదికన్నా 35.26 శాతం అధికం. ఇసుక విక్రయాలు భారీగా పెరుగటంతో నిర్థేశిత లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకొంటామని ఖనిజ వనరులశాఖ ఎండీ మల్సూరు తెలిపారు.