తాండూరు : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2020 తుది పరీక్ష ఫలితాల్లో వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మర్పల్లి గ్రామానికి చెందిన కావాలి రాములు, సుజాత పెద్దకూతురు కావలి మేఘన ఆలిండియా స్థాయిలో 83వ ర్యాంకు సాధించింది. చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో నివసిస్తూ మదీనగూడలోని విజ్ఞాన్ విద్యాలయ స్కూల్లో 10వ తరగతి వరకు చదివి కూకట్పల్లి శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్, 2012-16లో వరంగల్ నీట్లో ఎలక్ర్టికల్ ఇంజినీరింగ్ (బీటెక్), 2016-18 ఐఐఎం లక్నోలో పీజీ పూర్తి చేసుకున్నారు. 2018-19లో ఐటీసీ లిమిటెడ్ బెంగుళూర్లో అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్గా ఉద్యోగం చేసి 2019లో జాబ్కు రిజైన్చేసి 2020లో ఢిలీల్లోని వాజీరాం అండ్ రవి ఇన్స్టిట్యూట్లో సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు. 2020-21 కరోనా నేపథ్యంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చి ఇంట్లో ఉండే మెయిన్స్కు ప్రిపరేషన్ అవుతూ పరీక్షలు రాసింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మొదటి ప్రయత్నంలోనే 83వ ర్యాంకు సాధించింది.
నమస్తే తెలంగాణ : సివిల్స్ వైపు రావడానికి ఎవరు ప్రోత్సహించారు?
మేఘన : మా నాన్న రాములు, అమ్మ సుజాత
నమస్తే తెలంగాణ : సివిల్స్నే ఎందుకు ఎంచుకున్నారు? కారణం?
మేఘన : సివిల్స్ ద్వారా సంపూర్ణమైన సేవ చేసే అవకాశం ఉంటుంది. నాలో ఉన్న సామర్థ్యంతో సమాజంలో మంచి మార్పు తీసుకువస్తా అనే నమ్మకంతో సివిల్స్ను ఎంచుకున్నాను.
నమస్తే తెలంగాణ : ఎన్నో ప్రయత్నంలో సివిల్స్ సాధించారు?
మేఘన : మొదటి ప్రయత్నంలో సివిల్స్లో 83వ ర్యాంకు సాధించాను.
నమస్తే తెలంగాణ : కోచింగ్ తీసుకున్నారా? సొంతంగా ప్రిపరేషన్ అయ్యారా?
మేఘన : ఢిల్లీలో 9నెలలు కోచింగ్ తీసుకున్నాను. కొవిడ్ కారణంగా హైదరాబాద్కు వచ్చి ఇంట్లోనే సొంతంగా ప్రిపేర్ అయ్యాను.
నమస్తే తెలంగాణ : ఆప్షనల్ సబెక్టు, ప్రిలిమ్స్, మెయిన్స్ ప్రిపరేషన్..?
మేఘన: ఆప్షనల్ సబెక్టు సోషలజి. ప్రభుత్వ పథకాలు, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎన్సీఈఆర్టీ, జీకే సామాజిక శాస్త్రం చదువుతూ పరీక్షలు రాశాను.
నమస్తే తెలంగాణ : మీ విజయానికి దోహదపడిన అంశాలు?
మేఘన : చిన్నప్పటి నుంచి నేను చదువుకున్న చదువుతో పాటు ప్రధానంగా తెలంగాణ చరిత్ర, మా అధ్యాపకులు, కుటుంబ సభ్యుల సహకారం.
నమస్తే తెలంగాణ : ఇంటర్వ్యూ బోర్డు ఏది? ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు ఏమిటి?
మేఘన : సత్యవతి మేడం బోర్డు. తెలంగాణపై ప్రశ్నలు, తాగునీళ్లు సమస్యలు, గ్రూప్స్ తదితర ప్రశ్నలు అడిగారు.
నమస్తే తెలంగాణ : భవిష్యత్ లక్ష్యాలు ఏమిటి?
మేఘన : సమాజ సేవే నా జీవిత లక్ష్యం. ఐఏఎస్ సాధించి విద్యపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి వ్యక్తి ఉన్నత చదువు చదివేందుకు కృషి చేస్తాను. భారతదేశంలో ప్రాథమిక విద్య బాగుంది. ఉన్నత విద్యకు వచ్చేవరకు సరైన సౌకర్యాలు, వసతులు లేకపోవడంతో సరైన విధంగా విద్యార్థులకు విద్యను అందించలేకపోతున్నాం. అందుకు ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టి సారించి సమసమాజ నిర్మాణానికి చదువు అనే చక్కటి పునాది బాటలు వేస్తాను.
నమస్తే తెలంగాణ : మీరిచ్చే సలహాలు..?
మేఘన : పేద, ధనిక భేదాలు లేకుండా ప్రతి వ్యక్తికి సంపూర్ణమైన విద్యను అందించాలి. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే విద్యను అందిస్తే ప్రపంచంలో ఎక్కడైనా సంతోషంగా జీవించగలరు. అందుకు ప్రతి ఒక్కరూ చిన్నవయస్సు నుంచే చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతాం. జీవితంలో నిర్లక్ష్యం చేయకుండా పట్టుదలతో ముందుకు వెలితే ఎంతటి విజయానైనా సాధించగలుగుతాం. నా విజయానికి కారణమైన మా కుటుంబ సభ్యులతో పాటు నాకు విద్యాభ్యాసం చేసిన గురువులకు కృతజ్ఞతలు.