హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): కరోనా సంక్షోభ సమయంలో మృత్యువును సైతం ఎదిరించి ప్రజల ప్రాణాలను కాపాడిన వైద్యులకు వందనాలు తెలియజేస్తున్నానని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్రాజన్ అన్నారు. జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య వృత్తిలో ఉన్న వారికి గవర్నర్ అభినందనలు తెలిపారు. భారతీయ సమాజం వైద్యులను దైవంతో సమానంగా చూస్తున్నదన్నారు. మానవాళి మనుగడకు సవాల్ విసురుతున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యులు అందరికంటే ముందున్నారని, కొవిడ్ రోగులను రక్షించేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టారని గుర్తుచేశారు. వారి కరుణ, మానవత్వం ఎనలేనిదని గవర్నర్ పేర్కొన్నారు. దివంగత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, వైద్యులు డాక్టర్ బిదన్ చంద్రరాయ్ వర్ధంతి సందర్భంగా ఏటా జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.