హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు శుక్రవారం సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేసింది. రూ.లక్ష పూచీకత్తుతోపాటు విచారణకు సహకరించాలని, బెయిల్ విషయంలో మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది. కేసులో బెయిల్ ఇవొద్దన్న ఏపీ సీఐడీ పోలీసుల వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. అంతకుముందు ఆర్మీ దవాఖాన నివేదికను న్యాయమూర్తి వినయ్చరణ్ చదివి వినిపించారు. రఘురామ పాదాలకు గాయాలున్నట్టు నిర్ధారణ అయిందన్నారు. కస్టడీలో చిత్రహింసలు నిజమేనని ఈ రిపోర్ట్లో తేలిందని పిటిషనర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు వివరించారు. మెడికల్ బోర్డు రిపోర్టుకు, ఆర్మీ దవాఖాన చెకప్కు మధ్య ఏదో జరిగిందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది దవే అనుమానం వ్యక్తంచేశారు. దాంతో రఘురామ తనకు తాను గాయాలు చేసుకున్నారని భావిస్తున్నారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మిలటరీ దవాఖాన నివేదికను ప్రభుత్వానికి మెయిల్ ద్వారా పంపిస్తామని తెలిపింది. రఘురామ కృష్ణరాజుకు గాయాలయ్యాయని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఫిర్యాదుపై నివేదిక ఇవ్వండి: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా
ఎంపీ రఘురామ కృష్ణరాజు కుటుంబీకుల ఫిర్యాదుపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. ఈ ఫిర్యాదును సభాహక్కుల కమిటీకి పంపారు. వెంటనే నివేదిక ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం.. హోంశాఖను కోరింది.