న్యూఢిల్లీ: రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్లను పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) వచ్చే సెప్టెంబర్ నెల నుంచి ఉత్పత్తి చేయనుందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) వెల్లడించింది. ఇండియాలో ఏడాదికి 30 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్డీఐఎఫ్ తెలిపింది. ఇప్పటికే అవసరమైన టెక్నాలజీ బదిలీ ప్రారంభమైనట్లు చెప్పింది. ఆర్డీఐఎఫ్తో కలిసి స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారు చేయడం సంతోషంగా ఉన్నదని, రానున్న నెలల్లో కోట్ల కొద్దీ డోసులు తయారు చేయనున్నట్లు సీరం చీఫ్ అదర్ పూనావాలా అన్నారు. ఇందులో తొలి బ్యాచ్ సెప్టెంబర్ నుంచే రానుందని చెప్పారు.
దీని సామర్థ్యం, రక్షణ ఎక్కువగా ఉన్నదని.. ఈ వ్యాక్సిన్ ఇండియాతోపాటు ప్రపంచంలోని మెజార్టీ ప్రజలకు అందాల్సిన అవసరం ఉన్నదని పూనావాలా అభిప్రాయపడ్డారు. అన్ని రకాల కరోనా వేరియంట్లపై స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సమర్థంగా పని చేస్తోందన్న అధ్యయనం నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం దీనిని ఉత్పత్తి చేయనుండటం ఇండియాకు సానుకూలాంశమే.