చెన్నై, మే 30: ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించిన శశికళ.. ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి పాలవ్వడంతో మనసు మార్చుకున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు తన ఇద్దరు అనుచరులతో ఆమె ఫోన్లో సంభాషించినట్టుగా పేర్కొంటున్న కొన్ని ఆడియోలు లీక్ అయ్యాయి. మొదటి ఆడియో క్లిప్లో శశికళ మాట్లాడుతూ.. ‘ఎలాంటి ఆందోళన అవసరంలేదు. పార్టీ విషయాలను తప్పకుండా చక్కబెడతాను. తప్పకుండా నేను మళ్లీ వస్తా’ అని పేర్కొన్నారు. రెండో ఆడియో క్లిప్లో.. పళనిస్వామి, పన్నీర్సెల్వమ్ వర్గాల కారణంగా అన్నాడీఎంకేలో నెలకొన్న అంతర్గత సంక్షోభంపై ఆమె మాట్లాడారు. ‘పార్టీని నాతో పాటు ఎంతోమంది కష్టపడి నిర్మించారు. అయితే, వారి మధ్య పోరుతో పార్టీ నాశనమవ్వడాన్ని ఓ మౌన ప్రేక్షకురాలిగా చూస్తూ ఉరుకోలేను’ అని చెప్పారు. కరోనా సెకండ్వేవ్ ఉద్ధృతి తగ్గగానే త్వరలోనే మళ్లీ వస్తానని, పార్టీని చక్కబెడుతానని శశికళ చెప్పినట్టు తెలుస్తున్నది.