అంతర్జాతీయ మార్కెట్లో నం.1
యాసంగికి వేరుశనగ సాగుచేయాలి
నువ్వులు, ఆవాలను ప్రోత్సహించాలి
వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి
పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో నీటిపారుదల, సాగుపై సమీక్ష
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తేతెలంగాణ): తెలంగాణలో పండే పల్లీకి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్నదని.. యాసంగి పంటగా వేరుశనగ సాగుపై రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధికారులకు సూచించారు. రంగారెడ్డి, పాలమూరు జిల్లాల్లో వేరుశనగ సాగుకు అనుకూలమైన భూములున్నాయని, యాసంగిలో లక్షల ఎకరాల్లో వేరుశనగ విత్తేలా ఎమ్మెల్యేలు కూడా కృషి చేయాలని చెప్పారు. గురువారం రంగారెడ్డి, పాలమూరు జిల్లాల్లోని సాగునీటి పారుదల, వ్యవసాయశాఖలపై మంత్రులు శ్రీనివాస్గౌడ్, సబితా ఇంద్రారెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వేరుశనగ నాణ్యతలో నంబర్వన్గా ఉండటంతో అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నదని తెలిపారు. మార్కెట్లో వేరుశనగకు మద్దతుకు మించి ధర లభిస్తున్నదని, రైతులను దానిసాగువైపు ప్రోత్సహించే బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలని కోరారు.
యాసంగిలో వరిసాగు తగ్గించి ఆవాలు, నువ్వులు వంటి నూనెగింజల పంటలు సాగుచేస్తే రైతులకు మంచి లాభం కలుగుతుందని వెల్లడించారు. ఈ ఏడాది రైతు వేదికల్లో రైతులకు నిరంతరం శిక్షణా తరగతులు నిర్వహించాలని.. వీటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, కలెక్టర్లదేనని చెప్పారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో చెరువులు, కుంటలన్నీ నింపాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూటర్లు, మైనర్, మేజర్ కాలువల పనులు, స్ట్రక్చర్లు, ఓటీల పనులు వారంలోగా పూర్తిచేయాలని ఇరిగేషన్శాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, కాలె యాదయ్య, మెతుకు ఆనం ద్, రవీందర్నాయక్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, జైపాల్యాదవ్, అంజయ్యయాదవ్, రాజేందర్రెడ్డి, పైలెట్ రోహిత్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి , కొప్పుల మహేశ్రెడ్డి , ఈఎన్సీ మురళీధర్రావు, సీఈలు హరిరామ్, అమిత్ఖాన్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.