హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి ఇటీవల ఉప ఎన్నికల్లో గెలుపొందిన నోముల భగత్ ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకరించారు. గురువారం శాసనసభలోని సభాపతి చాంబర్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అసెంబ్లీ రూల్స్బుక్, ఐడెంటిటీ కార్డు అందజేశారు. మంత్రులు జగదీశ్రెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్అలీ, మండలి మాజీచైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, ఎన్ భాస్కర్రావు, అసెంబ్లీ సెక్రటరీ వీ నర్సింహాచార్యులు భగత్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నోముల మాట్లాడుతూ.. అసెంబ్లీని బయటినుంచి, టీవీల్లో చూడటమేనని, కానీ ఒక సభ్యుడిగా అందులోకి అడుగుపెట్టగానే గర్భగుడిలోకి వెళ్లినంత అనుభూతి కలిగిందన్నారు. ఈ పవిత్రమైన రోజును జీవితంలో మరచిపోలేనని చెప్పారు. తన తండ్రి ఆశయాల సాధన కోసం సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో పనిచేస్తానని చెప్పారు. ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు పాదాభివందనాలు తెలుపుతున్నానన్నారు.
నోముల భగత్కు కేటీఆర్ అభినందన
శాసనసభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్కు మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ‘అంతర్జాతీయ యువజన దినోత్సవం రోజు శాసనసభలో ప్రవేశించడం అదృష్టం. మంచిస్థాయికి ఎదిగేందుకు ప్రయత్నించండి. రాష్ర్టానికి సేవచేస్తూ యువతలో స్ఫూర్తి నింపండి’ అని గురువారం ట్వీట్ చేశారు.