న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతున్నది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్కు సరిపడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వ్యాక్సిన్లను పంపిణీ చేస్తున్నది. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు కేంద్ర సర్కారు.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి మొత్తం 48 కోట్లకు పైగా (48,03,97,080) వ్యాక్సిన్ డోసులను ( Vaccine doses ) పంపిణీ చేసిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వాటిలో వేస్టేజీతో కలిపి రాష్ట్రాలు 45,27,93,441 డోసులను వినియోగించుకున్నాయని పేర్కొన్నది.
రాష్ట్రాల దగ్గర మరో 2.73 కోట్లకు పైగా డోసులు మిగిలి ఉన్నాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారమే జూలై 31 నాటికి మరో మూడు కోట్ల డోసులను పంపిణీ చేస్తామని, దాంతో దేశంలో పంపిణీ చేసిన మొత్తం డోసుల సంఖ్య 51 కోట్లకు చేరుతుందని తెలిపింది. ఇదిలావుంటే దేశంలో తగ్గినట్టే తగ్గిన రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. ఒక దశలో 30 వేల దిగువకు చేరిన రోజువారీ కేసులు ఇప్పుడు మళ్లీ 45 వేల దగ్గరకు చేరాయి. ఇవాళ కూడా దేశంలో 44,230 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.