వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్లను సీఈవో కం చైర్మన్గా నియమిస్తూ సంస్థ బోర్డ్ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నది. మైక్రోసాఫ్ట్ సీఈవో కం చైర్మన్గా ఒకే వ్యక్తి నియమితులు కావడం రెండు దశాబ్దాల్లో తొలిసారి. 2000లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా బిల్ గేట్స్ వైదొలిగారు.
మైక్రోసాఫ్ట్కు సత్య నాదెళ్ల మూడవ సీఈవో.. మూడవ చైర్మన్ కూడా. గేట్స్ నుంచి 2014లో థంప్సన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. థంప్సన్ నుంచి సత్య నాదెళ్ల చైర్మన్ బాధ్యతలు స్వీకరిస్తారు.
అలాగే బిల్ గేట్స్ స్థానంలో సీఈవోగా స్టీవ్ బాల్మర్ పని చేశారు. 2014లో స్టీవ్ బాల్మర్ నుంచి సీఈవోగా సత్య నాదెళ్ల బాధ్యతలు స్వీకరించారు.
1975లో ప్రారంభించిన మైక్రోసాఫ్ట్లో నాదెళ్ల సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మైక్రోసాఫ్ట్లో కీలక మార్పులు జరిగాయి. క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ అప్లికేషన్స్, కృత్రిమ మేధస్సు వంటి అంశాలపైనే మైక్రోసాఫ్ట్ కేంద్రీకరించింది.
చాలా కాలం కంపెనీ పర్సనల్ కంప్యూటర్ల సాఫ్ట్వేర్ ప్యాకేజీలను తయారీపైనే దృష్టిపెట్టింది. కానీ, సత్య నాదెళ్ల మొబైల్ రంగం వైపు కూడా సంస్థను నడిపించారు.
కొత్తతరం టెక్నాలజీ వైపు సంస్థను ముందుకు తీసుకెళ్లారు. దీంతో మొబైల్ రంగంపై ఎక్కువ దృష్టిపెట్టింది. అప్పటికే ఈ విభాగంలో ఆపిల్, గూగుల్ పనిచేస్తున్నాయి.
సీఈవోగా సత్య నాదెళ్ల హయాంలో మైక్రోసాఫ్ట్ షేర్లు ఏడు రెట్లకు పైగా వ్రుద్ధి చెందాయి. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు లక్షల కోట్ల డాలర్లకు చేరువలో ఉంది.
గతేడాది కరోనా మహమ్మారి ప్రభావం మొదలైనా మైక్రోసాఫ్ట్ మంచి ఫలితాలు సాధించింది. షేర్ల రీ పర్చేజ్, డివిడెండ్ల రూపంలో వాటాదారులకు 35 బిలియన్ల డాలర్ల రిటర్న్స్తోపాటు సత్ఫలితాలను అందించింది.
అసాధారణ రీతిలో కోవిడ్-19 ప్రభావం చూపినా సంస్థలో సమూల మార్పు తీసుకు రావడంలో సత్యనాదెళ్ల అద్భుతమైన పురోగతి సాధించారని మైక్రోసాఫ్ట్ అభిప్రాయ పడింది. ఇప్పటివరకు చైర్మన్గా ఉన్న థంప్సన్ ఇక ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉంటారు.