నల్లగొండ ప్రతినిధి(నమస్తే తెలంగాణ): మిషన్కాకతీయ పథకానికి శ్రీకారం చుడుతూ సీఎం కేసీఆర్ స్వయంగా పూడిక తీత పనుల్లో పాల్గొన్న నల్లగొండ జిల్లా నకిరేకల్ మండల చందుపట్ల రాసముద్రం చెరువు జలకళ సంతరించుకుంది. 201 5 ఏప్రిల్ 26న కేసీఆర్ చందుపట్లకు వచ్చి ఎండ్ల బండిపై చెరువులోకి చేరుకున్నారు. తానే స్వయంగా పలుగు పార పట్టి పూడికతీత పనులకు కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. ఆయన తన చేతుల మీదుగా ప్రారంభించిన చందుపట్ల రాస ముద్రం చెరువు ప్రస్తుతం రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిండుకుండలా మారింది.
సోమవారం అర్ధరాత్రి నుంచి అలుగు పారుతుంది. సుమారు 250 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ చెరువును కాకతీయుల కాలంలో నిర్మించగా దానిని సమైఖ్యపాలనలో పట్టించుకోలేదు. దీంతో రాసముద్రంగా పిలిచే ఈ చెరువు నుంచే కేసీఆర్ మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టారు. దీంతో అప్పటి నుంచి ప్రతీ ఏటా చెరువుకు వరద వచ్చి చేరుతుంది. ఈ ఏడాది కూడా చెరువు మత్తడి దూకుతుండడంతో రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నది.