కోల్కతా, ఏప్రిల్ 13: ఎన్నికల కమిషన్ (ఈసీ) తీరును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్కతా నడిబొడ్డులో మంగళవారం 3.5 గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈసీ తనపై 24 గంటల ప్రచార నిషేధాన్ని విధించడం రాజ్యాంగ విరుద్ధమని, అప్రజాస్వామికమని ట్విట్టర్లో ఆమె ధ్వజమెత్తారు. ఉదయం 11.40 గంటలకు మెయో రోడ్కు చేరుకుని గాంధీజీ విగ్రహం పక్కన తన నిరససను ప్రారంభించారు. ఆ ప్రాంతం చుట్టూ భద్రతా సిబ్బంది మోహరించారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఎవరూ కనిపించలేదు. నిరసనకు సంకేతంగా మమత తన మెడలో నల్ల కండువా వేసుకున్నారు. ఆ సమయాన్ని పెయింటింగ్ వేస్తూ గడిపారు. సోమవారం రాత్రి 8 నుంచి మంగళవారం రాత్రి 8 వరకు ఆమెపై ప్రచార నిషేధం కొనసాగింది.