హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హవాలా లావాదేవీలపై ఆరా తీస్తున్న ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అధికారులు గురువారం హీరో రవితేజ, అతడి డ్రైవర్ శ్రీనివాస్లను ప్రశ్నించారు. నాంపల్లిలోని ఈడీ కార్యాలయానికి గురువారం ఉద యం చేరుకున్న వారిద్దరినుంచి పలు కీలక వివరాలు రాబట్టినట్టు సమాచారం. 2015 నుంచి 2017 మధ్య రవితేజ బ్యాంక్ లావాదేవీలను తమ వద్ద ఉన్న వివరాలతో పోల్చి చూసుకున్నట్టు తెలిసింది. ‘నవదీప్కు చెందిన ఎఫ్ క్లబ్లో పార్టీలకు హాజరయ్యారా? మీ డ్రైవర్ ద్వారా డ్రగ్స్ తెప్పించారని ఎక్సైజ్ విచారణలో తేలింది.
ఇందుకు డబ్బులు ఎలా చెల్లించారు? డ్రగ్ సరఫరాదారుడు కెల్విన్కు డబ్బులు పంపారా?’ అంటూ ఈడీ అధికారులు దాదాపు ఆరు గంటలపాటు రవితేజ, శ్రీనివాస్ను ప్రశ్నించినట్టు తెలిసింది. డ్రగ్స్ సరఫరాదారు కెల్విన్ మిత్రుడు, ఈవెంట్ మేనేజర్ జీషన్అలీని సైతం ఈడీ అధికారులు గురువారం విచారణకు పిలిపించినట్టు తెలిసింది. జీషన్అలీతో 2017 జూన్లో రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ పలుసార్లు వాట్సాప్ చాటింగ్ చేసినట్టు ఎక్సైజ్శాఖ అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో నవదీప్, ఎఫ్ క్లబ్ మేనేజర్ ఈనెల 13న ఈడీ ఎదుటకు రానున్నారు.