ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ. కేవలం కోటి రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా రూ.12 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు హిందీలోనూ తడప్ పేరుతో రీమేక్ అవుతుంది. ఇందులో సునీల్ శెట్టి తనయుడు హీరోగా నటిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 కంటే ముందు ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమా చేశాడు కార్తికేయ. కానీ ఈ సినిమా వచ్చినట్టు కూడా ప్రేక్షకులకు తెలియదు. ఇక రెండో సినిమా ఆర్ఎక్స్100 సంచలన విజయం సాధించడమే కాకుండా కార్తికేయకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
ఆ తర్వాత హీరోగా గుణ 369, 90 ML లాంటి సినిమాలు చేశాడు. కానీ కోరుకున్న విజయం మాత్రం ఇప్పటివరకు రాలేదు. హీరోగానే కాకుండా కథ నచ్చితే విలన్గా నటించడానికి కూడా తనకేం అభ్యంతరం లేదని ముందుగానే చెప్పాడు కార్తికేయ. అన్నట్లుగానే నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్గా కూడా చేశాడు ఈ నటుడు. కెరీర్లో ఏదో ఒక మ్యాజిక్ జరగాలి అనుకుంటున్న సమయంలో ఇప్పుడు గీతా ఆర్ట్స్లో చావు కబురు చల్లగా సినిమాలో నటించాడు కార్తికేయ. కొత్త దర్శకుడు కౌశిక్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. తన కెరీర్ టర్నింగ్ పాయింట్గా నిలిచిపోయే ఈ సినిమా కోసం ప్రాణం పెడుతున్నాడు కార్తికేయ.
స్వయంగా ప్రమోషన్స్లోకి వచ్చేస్తున్నాడు. బయట కూరగాయల మార్కెట్కు వెళ్లి బస్తీ బలరాజుగా తనను తాను ప్రేక్షకులకు పరిచయం చేసుకుంటున్నాడు.. తన సినిమాను చేరువ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేశాడు ఈయన. తాజాగా తన సినిమా విడుదలవుతున్న మెయిన్ థియేటర్ దగ్గరికి వెళ్లి అక్కడ పోజిచ్చాడు. తన భారీ కటౌట్ ముందు తాను కూడా సేమ్ టూ సేమ్ అలాగే నిలబడ్డాడు ఈ బస్తీ బాలరాజు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.