భూపాలపల్లి: ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావారి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో జిల్లాలోని కాళేశ్వరం వద్ద 12 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. దీంతో రెవెన్యూ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భక్తులు నదిలోకి స్నానాల కోసం దిగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పుష్కరఘాట్ వద్దే ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా, తెలంగాణ, మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్నారం బరాజ్కు 8 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో ప్రాజెక్టు 56 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటిమట్టం 4.28 టీఎంసీలుగా కొనసాగుతోంది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరద ఉధృతి అధికంగా ఉంది. దీంతో అధికారులు 65 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీలోకి 9,26,849 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 8,71,395 క్యూసెక్కుల నీరు బయటకి వెళ్తున్నది. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటిమట్టం 7.259 టీఎంసీలుగా ఉన్నది.
కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
చండ్రుపల్లి, నాగపెల్లి, మద్దులపల్లి, పలుగుల, కుంట్లం గ్రామాల్లో బ్యాక్ వాటర్ వస్తుండటంతో రోడ్లు మునిగిపోయాయి.